
రుతుపవనాల రాక కోసం కర్షకుడు ఆకాశంకేసి కళ్లు కాయలు కాచేలా చూస్తాడు. హలధారితో దోబూచులాడే రుతుపవనాలు ఈసారి రైతన్నలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఆగమేఘాల మీద దూసుకొచ్చి వర్షాలను దంచికొడుతున్నాయి. అడవుల నరికివేత, యథేచ్ఛగా సాగుతున్న మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం తదితరాలతో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ సంభవించిన కారణంగానే రుతుపవనాలు ఇలా ముందుగా వచ్చేశాయని ఎన్నో విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఇలా ముందస్తు వర్షాలు గతంలో సర్వసాధారణమని వాదించే వాళ్లూ ఉన్నారు. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ముందస్తు రాకకు కారణాలేంటి అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.
గతంలోనూ ముందొచ్చాయి
కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఊరకే రాష్ట్రాలను చుట్టేయకుండా భారీ వర్షాలతో పలకరించి ఈసారి అధిక వర్షాలు ఖాయమని కబురును రుతుపవనాలు మోసుకొచ్చాయి. అయితే ఇలా ముందస్తు రాక కొత్తేమీ కాదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈసారి పలు రాష్ట్రాల్లోకి రెండు వారాల ముందే రుతుపవనాలు ప్రవేశించడంతోపాటు కేరళ నుంచి మహారాష్ట్రదాకా అవి వేగంగా, విస్తారంగా మే 24న ఒక్కరోజులోనే విస్తరించడం విశేషం. ఇది అసాధారణమేమీ కాదని, కేవలం అరుదైన విషయమని గణాంకాలు చాటుతున్నాయి. 1971 ఏడాదిలోనూ రుతుపవనాలు కర్ణాటకలో అధిక భాగం, మహారాష్ట్రలో కొంత మేర ఒకేసారి విస్తరించి అప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. మళ్లీ దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఇదే తరహాలో రుతుపవనాలు ఒకేసారి విస్తరించాయి.
ఆ తర్వాత కాస్తంత బ్రేక్
జూన్ రెండో తేదీదాకా రుతుపవనాలు ఇదే వేగంతో విస్తరిస్తాయని వాతావరణ శాఖ వర్గాలు అంచనావేస్తున్నాయి. మహారాష్ట్ర, తూర్పు భారతాన్ని త్వరగా చుట్టుముట్టాక వేగం తగ్గే వీలుంది. గతంలో మాది రే వేగం నెమ్మదించి మెల్లిగా రుతుపవనాలు ముందుకు సాగనున్నాయి. మధ్య స్థాయి ఎత్తులో పొడి వాతావరణం ఏర్పడటంతో జూన్ మొదటి వా రం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తరచూ వర్షాలు పడే అవకాశాలు సన్నగిల్లుతాయి. రుతుపవనాల గమన వేగం సైతం తగ్గనుంది.
ముందస్తుపై వాతావరణ మార్పుల ప్రభావం
సహజ వాతావరణ వ్యవస్థతోపాటు మానవ ప్రేరేపిత భూతాపోన్నతి, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు వంటి అంశాలూ రుతుపవనాలపై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే భారత్లో రుతుపవనాల రాకపై వాతావరణ మార్పుల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉందని వారు అభిప్రాయపడ్డారు. భూతాపోన్నతి దెబ్బకు యురేసియా, హిమాలయ ప్రాంతాల్లో మంచు దుప్పటి కరిగిపోతోంది.
1990–2020 కాల సగటుతో పోలిస్తే ప్రస్తుతం యురేసియా, హిమాలయాల పరిధిలో మంచు 15 శాతం అంతరించిపోయింది. తక్కువ మంచు కారణంగా ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో రుతుపవనాలు ప్రేరేపితమై త్వరగా వస్తాయి. ఒక్కోసారి మే నెల మధ్యలోనే ఇవి రావొచ్చు. గ్లోబ ల్ వార్మింగ్లో పెరిగే ప్రతి ఒక్క డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు సముద్రాలపై వాతావరణంలో తేమ 6–8 శాతం పెరుగుతుంది. పారిశ్రామిక విప్లవానికి ముందునాటితో పోలిస్తే 2025లో ఉష్ణోగ్రత 1.2 డిగ్రీ సెల్సియస్ పెరిగిందని ఇప్పటికే గణాంకాలు చాటుతున్నాయి.
ఈ నేపథ్యంలో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం ఉపరితల వాతావరణంలో తేమ పెరిగి మే నెలలోనే మేఘాల అధిక ఆవిర్భావానికి దారితీసింది. కర్ణాటక–గోవా తీరం వెంట ద్రోణి కారణంగా తుపాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి ఈసారి రుతుపవనాలను మరింత ముందుకు లాగాయి. మారిషస్, మడగాస్కర్ల మధ్య తక్కువ ఎత్తులో వీచే పవనాల దృగ్విషియాన్ని సోమాలీ జెట్గా పిలుస్తారు. ఇది ఈనెలలోనే విజృంభించింది. ఈ గాలులు అరేబియా సముద్రం మీదుగా భారత పశి్చమ తీరం వైపు వీస్తాయి. ఇవి కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలనూ తాకుతాయి. ఈసారి సోమాలీ జెట్ గాలుల ప్రభావం తోడవడంతో నైరుతి పవనాలు త్వరగా వచ్చేశాయి.
మరెన్నో కారణాలు..
భౌగోళిక, సముద్ర, వాతావరణ పరిస్థితుల మధ్య సమన్వయంలో తేడా సైతం ఈసారి రుతుపవనాల ఆగమనాన్ని ముందుకు తోసింది. భూమధ్యరేఖ జోన్లో ప్రతి 30 నుంచి 60 రోజులకు ఒకసారి సముద్రజలాల మీదుగా మేఘాలు, వర్షాలు, పవనాలు ఒక క్రమపద్దతిలో ముందుకు సాగుతాయి. దీనినే మేడిన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేఓ)గా పిలుస్తారు. ఎంజేఓ అనేది రుతుపవనాల్లో తేమ, పొడి దశలను నిర్దేశిస్తుంది. ఈనెలలో ఎంజేఓ మూడో దశలోఉంది. ఇది మేఘావృత స్థితిని అధికం చేసి దక్షిణభారతంలో వర్షాలను కురిపిస్తుంది. మే 25వ తేదీన ఇది నాలుగోదశకు మారడంతో హిందూ సముద్రం నుంచి మరింత తేమ పవనాల రూపంలో భారత్పై కురిసింది. ఈసారి ఎల్నినో సైతం తటస్థ వైఖరిని ప్రదర్శించడంతో రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అందుకే ఈసారి వర్షాలు ముందే పడ్డాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్