Global warming
-
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అంటే..!
రిసైలియన్స్(Resilience) అనే పదానికి ఖచ్చితమైన అనువాదం స్థితిస్థాపకత. మామూలు మాటల్లో చెప్పాలంటే.. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే సామర్థ్యం. శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అనేది వాతావరణ ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడానికి, వాటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. భూతాపోన్నతి(Global Warming) వల్ల కలిగే తుపాన్లు, తీవ్ర వడగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక జనసమూహం లేదా పర్యావరణ వ్యవస్థ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి, మార్పు చెందడానికి గల సామర్ధ్యం ఎంత అనేది ముఖ్యం. వాతావరణ మార్పుల వల్ల అనివార్యంగా ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొని పర్యావరణాన్ని(Environment), ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజలు, సమూహాలు, ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి. కొత్త నైపుణ్యాలను పొందడానికి, కొత్త రకాల ఆదాయ వనరులను అందిపుచ్చుకోవటానికి ప్రజలకు శిక్షణ ఇవ్వడం.. విపత్తులకు మరింత బలంగా ప్రతిస్పందించే, పునరుద్ధరణ సామర్థ్యాలను పెంపొందించటం.. వాతావరణ సమాచారం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయడం ద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కునే సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. నిజానికి సమాజం వాతావరణపరంగా స్థిరత్వాన్ని పొందాలంటే శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించటం ముఖ్యమైనది. కర్బన ఉద్గారాలను విడుదల చేసే పనులను భారీగా తగ్గించటమే భవిష్యత్తులో వాతావరణ ప్రభావాలను(climate changes) తగ్గించే ఉత్తమ మార్గం. ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యే దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాలకు ఎక్కువగా గురయ్యే సమాజాలకు, వ్యక్తులకు మద్దతుగా నిలవటంలోనే వాటిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. (చదవండి: ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!) -
గ్లోబల్ వార్మింగ్కు చెక్
సీతంపేట: విద్యార్థ్ధుల్లో నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు ఆవిష్కరిస్తారని మరొక సారి రుజువైంది. విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల లైఫ్ సైన్స్ విద్యార్ధుల పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డిగ్రీ స్థాయిలోనే అంతర్జాతీయ ప్రతిభ చాటారు బుల్లయ్య కళాశాల విద్యార్ధులు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న గ్లోబల్వార్మింగ్కు విద్యార్ధులు తమ పరిశోధన ద్వారా చక్కటి పరిష్కారం చూపారు.వాతావరణం వేడెక్కడానికి కారణం అవుతున్న కార్చన్ డయాక్సైడ్ శాతాన్ని వాతావరణంలో తగ్గించేలా తమ పరిశోధనతో పరిష్కారం చూపారు. కళాశాలలో బీఎస్సీ లైఫ్ సైన్స్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు హర్షిత, తేజాంబిక్, కార్తికేయ, అశ్విని తమ పరిశోధనల్లో విజయం సాధించారు. విశాఖ సముద్ర తీరంలో సముద్రపు గడ్డి పచ్చిక భూములను పునరుద్ధించే ‘బ్లూ కార్బన్ ఎకో సిస్టం పయనీరింగ్’అను అంశంపై పరిశోధన చేసారు. స్టూడెంట్ సొసైటీ ఫర్ క్లైమేట్ ఛేంజ్ అవేర్నెస్ ( ఎస్ఎస్సీసీఏ) , సీడ్స్ ఆఫ్ పీస్ ( యూఎస్ఏ) సంస్థలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో 33 టీమ్లు పాల్గొనగా, బుల్లయ్య కళాశాల విద్యార్థ్ధులు చేసిన పరిశోధనలకు క్లైమేట్ ట్యాంక్ యాక్సిలరేటర్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి వెయ్యి డాలర్లు బహుమతిగా గెలుపొందారు. ప్రాజెక్టు తదుపరి అధ్యయనాల కోసం విద్యార్థులను 2025 ఫిభ్రవరిలో10 రోజుల ఫెలోషిప్ ప్రోగ్రామ్కు యూఎస్ఏ వెళ్లనున్నారు. పరిశోధన ఎలా సాగిందంటే.. హైదరాబాదుకు చెందిన ఎన్జీవో సంస్థ ఎస్ఎస్సీసీఏ, నూయార్క్ కు చెందిన సీడ్స్ పీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఎన్విరాన్మెంట్కు సంబంధించి ఆరు ఆంశాలపై పరిశోధనలకు విద్యార్థ్ధులకు అవకాశం కల్పించారు. బుల్లయ్య విద్యార్ధులు గ్లోబల్వార్మింగ్ తగ్గించడానికి క్లైమేట్కి సంబంధించిన టాపిక్ ఎంపిక చేసుకున్నారు. ఈ విధంగా దేశంలో వివిధ కళాశాలల నుంచి 33 టీమ్స్ ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈపోటీలో బుల్లయ్య కళాశాల నుంచి 3 టీమ్స్ పాల్గొనగా, ఒక టీమ్లో డిగ్రీ (బయోటెక్నాలజి) ఫైనలియర్ చదువుతున్న నలుగురు విద్యార్ధులు , వారికి గైడెన్స్గా ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మొదటి అంచెలో ఎంపిక చేసుకున్న టాపిక్పై పరిశోధన ఎలా చేలాయన్న విషయంపై ఓరియెంటేషన్ జరిగింది. రెండవ ఫేజ్లో ఎంపిక చేసిన టాపిక్పై డిస్క్రిప్టివ్ ఐడియాను సిద్ధం చేసారు. పరిశోధన నిమిత్తం సీడ్స్ సంస్థ 200 డాలర్లు అందజేసింది. మొదటి రెండు ఫేజ్లు పూర్తి అయిన తర్వాత పరిశోధనకు వాస్తవ రూపం కల్పించారు. తాము ఎంపిక చేసుకున్న గ్లోబల్వార్మింగ్ తగ్గించడానికి విద్యార్ధులు ఎన్నో పరిశోధన పత్రాలు చదవి ఒక ఐడియాకు వచ్చారు. విశాఖ సముద్రతీరంలో అంతరించిపోయిన 2 గడ్డి జాతిమొక్కలను మరల ఇక్కడ పునరుద్ధించి తద్వారా కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని తగ్గించేలా నమూనాలు తయారు చేసారు. ఒరిస్సాలోని చిలికా సరస్సు నుంచి ‘హలోఫిలా ఓవాలిస్, హలోడ్యూల్ ఫీనిఫోలియా’అను రెండు గడ్డి జాతి మొక్కలను తెచ్చారు. సాధారణ మొక్కల కంటే 33 శాతం అధికంగా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ పీల్చుకోవడం వీటి ప్రత్యేకత. తెచి్చన గడ్డి మొక్కలను కళాశాల ల్యాబ్లలో అవి పెరిగేలా సముద్ర వాతావరణం కల్పించారు. దీని కోసం చెక్కతో తయారు చేసిన ట్రేలలో కొబ్బరిపీచు, సముద్రపు నీరు,ఇసుక, గడ్డి ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. స్కూబా డ్రైవర్స్ సాయంతో తీరంలో మంగమారిపేట బీచ్లో 8 మీటర్ల లోతులో నాటారు. వెయ్యి డాలర్లు బహుమతి డిసెంబరు 12న హైదరాదులో జరిగిన సమావేశంలో విద్యార్ధులు రూపొందించిన వర్కింగ్ మోడల్ను యూఎస్ కాన్సులేట్ నుంచి వచి్చన జడ్జిలు పరిశీలించారు.ప్రాజెక్టు పని చేసే తీరును విద్యార్ధులు వారికి ప్రెజెంట్ చేసారు. ఈపోటీలో పాల్గొన్న 33 టీమ్లలో తుది దశకు 8 టీమ్లు చేరుకోగా అందులో బుల్లయ్య కళాశాల టీమ్ మొదటి స్థానంలో నిలిచి వెయ్యి డాలర్లు బహుమతి గెలుచుకున్నారు. -
గ్లోబల్ ‘వార్నింగ్’ ఇటు వరద... అటు కరువు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రానున్న కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ప్రాంతాల వారీగా తీవ్రతను బట్టి వరదలు, కరువు వంటి పరిస్థితులు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తీవ్ర కరువును, మరికొన్ని తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నాయి. ఈమేరకు ఐఐటీ గువహటి, ఐఐటీ మండీ, బెంగళూరుకు చెందిన సీఎస్టీఈపీ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ) సంస్థలు తాజాగా చేసిన సంయుక్త అధ్యయనంలో పేర్కొన్నాయి.దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వాతావరణంలో మార్పులు, వరదలొచ్చే అవకాశాలు, కరువులు వంటివాటిపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం ఏపీలోని మూడు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు వెల్లడించారు. కరువు కోరల్లో విశాఖ, కర్నూలు రాష్ట్రంలోనే ప్రధాన నగరంగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో కరువు సమస్య పొంచివున్నట్టు అధ్యయనంలో తేలింది. దీంతోపాటు కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్ర కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఐటీ నిపుణులు తేల్చారు. గతంతో పోలిస్తే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ (భూ ఉపరితల ఉష్ణోగ్రత) 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. ఎక్కువ ఉష్ణోగ్రతల ఒత్తిడి కారణంగా కొండచరియలు విరిగి పడటం వంటి ప్రమాదాలూ ఉండవచ్చునని పేర్కొన్నారు. వరదల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. ఇదిలా ఉండగా.. వరద ముప్పుతో పాటు గుంటూరుకు కరువు ప్రమాదం కూడా ఉందని తేల్చారు.శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు వరద ముప్పు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరద ప్రమాదాన్ని, 118 జిల్లాలు అధిక వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు తేలింది. మరో 91 జిల్లాలు అత్యధిక కరువు ప్రమాదం, 188 జిల్లాలు అధిక కరువు ప్రమాదం ఉన్న కేటగిరీలో చేర్చారు. వరద ముప్పులో ‘ఆ మూడు’ రాష్ట్రంలో రానున్న సంవత్సరాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్లు అధ్యయనంలో తేల్చారు. వాతావరణంలో మార్పులు, తుపానులు, ఉష్ణోగ్రతల కారణంగా ఈ మూడు జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ నీట మునిగిన విషయం తెలిసిందే. -
తీవ్రమైన కరువు కోరల్లో కెన్యా
కెన్యా నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువుతో కొట్టుమిట్టాడుతోంది. లక్షలాది మంది ప్రజలు తగినంత ఆహారం, నీరు లేకుండా అల్లాడిపోతున్నారు. వాతావరణ మార్పులతో తీవ్రమైన కరువు దేశ వ్యవసాయం, పశుసంపదపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో కెన్యా ప్రజల జీవనోపాధి కష్టమవుతోంది. తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు కూడా లేక లక్షలాది మంది ప్రజలు అంటు వ్యాధులబారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. ఎండిపోతున్న జలాశయాలు కెన్యాలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన కరువు తాండవిస్తోంది. నదులు, సరస్సులు, జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. చిన్నపాటి చెరువులు ఎండిపోతున్నాయి. ఐక్యరాజ్యసమితి నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం భూగర్భ జల మట్టాలు సైతం పడిపోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు దేశాన్ని తీవ్రమైన కరువులోకి నెట్టేశాయి. 15 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ దీర్ఘకాలిక కరువు ధాటికి దాణా దొరక్క ఏకంగా 70 శాతం పశువులు ప్రాణాలు కోల్పోయాయి. పాడి ఆవులపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనం ఇప్పుడు ఆదాయం లేక దుర్భరమైంది. ఆహార వనరులు కూడా తగ్గిపోయాయి. కరువు దెబ్బకు ఉన్న కాస్తంత ప్రధాన ఆహారాల ధరలు అమాంతం పైకిఎగశాయి. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు ఐదేళ్ల సగటు కంటే 10 నుంచి 90 శాతం అధికంగా ఉన్నాయి. ఎంత లోతు తవ్వినా.. 2023లో కొన్ని ప్రాంతాల్లో దశాబ్దం కిందటి కంటే రెట్టింపు లోతులో బావులు తవ్వాల్సి వచ్చింది. తీవ్రమైన కరువు కారణంగా, చాలా మంది భూగర్భం నుంచి తీసుకువచ్చిన నీటిని తాగవలసి వస్తోంది. ఇది కూడా పరిశుభ్రంగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో నీటి విక్రయాలు పెరిగాయి. ఆ నీరు సైతం పరిశుభ్రంగా ఉండకపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు, కెన్యా కరువు ప్రతిస్పందన పథకం కింద సుమారు 30 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన కరువు సహాయాన్ని పొందారు.ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి తక్కువ పారిశ్రామికీకరణతో ఇక్కడ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తక్కువే. అయినా తక్కువ వర్షపాతం, గ్లోబల్ వార్మింగ్ కరువుకు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, భవిష్యత్తులో కరువు ప్రభావాలను తగ్గించడానికి దేశానికి ఆర్థిక మద్దతును పెంచాలని కెన్యా ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని ఈ ఏడాది అజర్ బైజాన్లోని బాకు నగరంలో జరిగిన 2024 ఐక్యరాజ్యసమితి కాన్ఫెరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్29) సదస్సు పునరుద్ఘాటించింది. ఇలాంటి క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి దేశానికి సహాయపడటానికి అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింత ఆర్థిక మద్దతు అవసరమని నొక్కి చెప్పింది. – సాక్షి నేషనల్ డెస్క్ -
అతి పెద్ద ఐస్బర్గ్... మళ్లీ కదిలింది!
ఏ23ఏ. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్బర్గ్. తాజా కొలతల ప్రకారం దాని విస్తీర్ణం 3,672 చదరపు కిలోమీటర్లు! చూపు తిప్పుకోనివ్వని ఆర్చిలు, అందమైన గుహలతో పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది 1986లో ఫిల్క్నర్ రోన్ మంచుఫలకం నుంచి విడివడింది. కొన్నాళ్లపాటు కాస్త దూరం కదిలాక అంటార్కిటికాలోని వెడ్డెల్ సముద్ర ఉపరితలంపై సెటిలైపోయింది. 30 ఏళ్లపాటు అక్కడే స్తబ్ధుగా ఉండిపోయింది. అందులోని అందమైన గుహలను, దాని పొడవునా ఏర్పడే రకరకాల ఆకృతుల మంచు ఆర్చిలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పర్యాటకులు పోటెత్తుతుంటారు. అలాంటి ఏ23ఏ 2020లో స్వల్పంగా కరిగిపోవడంతో మళ్లీ కదలడం మొదలు పెట్టింది. అంటార్కిటికాలోని టైలర్ కాలమ్లో ఉపరితలానికి తాకడంతో కొద్ది నెలలుగా అక్కడే నిలిచిపోయింది. మంచు కరుగుతుండటంతో కొద్ది రోజులుగా అది మళ్లీ కదలడం మొదలుపెట్టినట్టు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) బృందం వెల్లడించింది. ‘‘ఏ23ఏ ఐస్బర్గ్ సముద్ర ప్రవాహాల తాకిడికి క్రమంగా వెచ్చని జలాలవైపు సాగుతోంది. సౌత్ జార్జియాలోని మారుమూల దీవుల గుండా వెళ్తూ క్రమక్రమంగా కరిగి కొన్నాళ్లలో పూర్తిగా కనుమరుగవుతుంది’’అని ప్రకటించింది. దాంతో సైంటిస్టులందరి దృష్టీ దానిమీదే కేంద్రీకృతమైందిప్పుడు. ఏ23ఏను సైంటిస్టులు 1986లో తొలిసారిగా గమనించారు. అప్పట్లో అది 3,900 చ.కి.మీ. పై చిలుకు విస్తీర్ణంతో ఉండేది. నాటినుంచీ చాలాకాలం పాటు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐస్బర్గ్గా నిలుస్తూ వచ్చింది. మధ్యలో దానికంటే పెద్ద పరిమాణంలో ఏ68 (2017లో), ఏ76 (2021లో) వంటివి పుట్టుకొచ్చినా అవన్నీ చూస్తుండగానే కరిగి చిన్నవైపోయాయి. ఏ23ఏ దర్జా మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. తాజా కదలికల పుణ్యమా అని అది ఇక మూణ్నాళ్ల ముచ్చటేనంటున్నారు సైంటిస్టులు. అయితే అది కరగడం వల్ల సముద్రమట్టం పెరగడం వంటి ముప్పు ఉండకపోవచ్చని వాళ్లు చెబుతున్నారు. ఏ23ఏ కరుగుదలకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణమని వాపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల!
వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న చర్యలు ఏమాత్రం సరిపోవని ఐక్యరాజ్యసమితి తేలి్చచెప్పింది. భూగోళంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అరికట్టడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఎండగట్టింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సగటు ఉష్ణోగ్రత మరో 3.1 డిగ్రీల సెల్సియస్(5.4 డిగ్రీల ఫారెన్హీట్) పెరుగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు వార్షిక ఉద్గారాల నివేదికను ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసింది. వాస్తవానికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకే(2.7 ఫారెన్హీట్) పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు ప్రపంచదేశాలు మద్దతు పలికాయి. 2015లో పారిస్లో జరిగిన కాప్–21 సదస్సులో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూగోళంపై జీవుల మనుగడ కొనసాగాలంటే ఉష్ణోగ్రతల పెరుగుదలను కట్టడి చేయాల్సిందేనని నిపుణులు స్పష్టంచేశారు. పారిస్ ఒప్పందంపై సంతకాలు చేసి దాదాపు పదేళ్లవుతున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడం శోచనీయమని ఐక్యరాజ్యసమితి ఆక్షేపించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. అంటే లక్ష్యం కంటే రెండింతలు కావడం గమనార్హం. ప్రభుత్వాల చర్యలు ఎంత నాసిరకంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. → కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. లేకపోతే మనమంతా మహావిపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. → 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు 1.3 శాతం పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానం. → ఒకవేళ ఇప్పటినుంచి ఉద్గారాల నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసినప్పటికీ ఉష్ణోగ్రతలు 2100 కల్లా 2.6 డిగ్రీల నుంచి 2.8 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. → కర్బన ఉద్గారాల్లో అధిక వాటా జీ20 దేశాలదే. వాతావరణ మార్పులను అరికట్టడంతో ఆయా దేశాలు దారుణగా విఫలమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ లక్ష్యాల సాధనలో చాలా వెనుకంజలో ఉన్నాయని వెల్లడించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42 శాతం, 2035 నాటికి 57 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు. → ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్–29) సదస్సు వచ్చే నెలలో అజర్బైజాన్లో జరుగనుంది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదిస్తారని పర్యావరణ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం!
పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దాని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్ కమిషన్ ఆన్ ద ఎకనామిక్స్ ఆఫ్ వాటర్ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. ‘‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు చేరడం ఖాయం’’ అని బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది! ‘‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పింది. ఏమిటీ జలచక్రం...!? జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్లిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు, ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేజేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారితీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది. గతి తప్పితే అంతే...! జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది...→ కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8 శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.→ దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేలచూపులు చూస్తున్నాయి. ళీ భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి. → నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.హరిత జలం.. అతి కీలకం చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటికి బ్లూ వాటర్ అంటారు మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక అభివరి్ణంచింది. ‘‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన ఉద్గారాలను చాలావరకు శోషించుకునేది ఈ హరితజలమే’’ అని తేలి్చంది. కానీ, ‘‘ఏ దేశంలో చూసినా చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్ వారి్మంగ్ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది’’ అని నివేదిక హెచ్చరించింది.అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాల వల్ల భూమిపై జలచక్రంతో సహా అన్నిరకాల సంతులనాలూ ఘోరంగా దెబ్బ తింటున్నాయి. దాంతో వర్షపాత ధోరణులు విపరీతంగా మారుతున్నాయి. దేశాలన్నీ తమ నీటి నిర్వహణ తీరుతెన్నులను యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరుచుకోవాలి. కాలుష్యానికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానవాళి మనుగడకు ముప్పు మరెంతో దూరంలో లేదు’– రిచర్డ్ అలన్, క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్, రీడింగ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్ప్రపంచ నీటి సంక్షోభం పెను సమస్య మాత్రమే కాదు. జల ఆర్థిక వ్యవస్థల్లో అత్యవసరమైన మార్పుచేర్పులకు అవకాశం కూడా. ఇందుకోసం ముందుగా నీటి విలువను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అదే లోపిస్తోంది– గోజీ ఒకొంజో ఇవాలా,డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోవిడ్ను మించే భూతం... భూతాపం
రెండేళ్ల పాటు కరోనా వైరస్ ప్రపంచ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. కోవిడ్ కల్లోలం సృష్టించిన నష్టం ఈ శతాబ్దంలోనే కాక, మానవ చరిత్ర లోనే ఓ పెనువిషాదం. ఆ పీడకల నుంచి తేరుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్న ప్రపంచానికి మరో పెద్ద సవాలు... ‘గ్లోబల్ వార్మింగ్’. ఫలితంగా తీవ్రమైన ఎండలు, అంతలోనే వరదలు... మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. వాతా వరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతి యేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి.భూతాపం వల్ల సప్త సముద్రాలు వేడెక్కి పోతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. 1950 నాటికి హిమాలయాలపై ఘనీభవించిన మంచు నేటికి చాలావరకు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని మంచు పరిణామం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారత్తో సహా అనేక దేశాలలో శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోంది. మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్రాలు ముందుకు చొచ్చుకొచ్చి అనేక ద్వీపాలను కబళించి వేస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మన దేశంలో అధికంగా నష్టపోతున్న రంగాలలో వ్యవసాయం, ఆరోగ్యం ముఖ్యమైనవి. ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రంగాలు అభివృద్ధిలో అనూహ్యంగా ముందంజ వేస్తుండగా... మరో వైపు నిలకడైన వాతావరణ పరిస్థితులు లేక వ్యవసాయం, తదితర ఉత్పత్తి రంగాలలో భారీ క్షీణత కనిపిస్తోంది. ఈ వైరుధ్యం ప్రజల మధ్య అనేక అసమానతలకు దారితీస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పేదల ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదల జీవితాలు గాల్లో దీపంలా మారాయి. నివాసం ఉన్న చోట బతికే పరిస్థితి లేకపోవడం వల్ల మనుషులు వలసలు పోవాల్సిన దుఃస్థితి అనేక దేశాలలో నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రత పెరుగుదల, భారీ వర్షాల వల్ల అపసవ్య దిశలో సముద్రపు నీరు పొంగి పంట పొలాల్లోకి, నదీసంగమాల వద్ద నదుల్లోకి ప్రవహి స్తోంది. వాతావణ మార్పుల వల్ల జీవ వైవిధ్యం పూర్తిగా గాడి తప్పింది. మారిన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేక మనుషు లతోపాటు మొక్కలు, జంతుజాలానికి తీవ్రమైన హాని కలుగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం తాజా నివేదిక ప్రకారం, సుమారు 10 లక్షల వృక్ష, జంతుజాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 400 ఏళ్లల్లో 680 వెన్నెముక గలిగిన జాతులు నశించగా, కేవలం గత 2 దశాబ్దాలలోనే అంతకు రెట్టింపు జాతులు నశించాయి. కాలుష్యం, భూవినియోగంలో మార్పులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య తేడాలు ఇందుకు కారణంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భూతాపం, కాలుష్యం కారణంగా మనుషులలో వయస్సుతో సంబంధం లేకుండా అనేక రుగ్మతలు కనపడుతున్నాయి. కేవలం శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 87 లక్షల ప్రజలు చనిపోతున్నారు. కాలుష్యం వల్ల అప్పుడే పుట్టిన పసికందులకు కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఒకప్పుడు అగ్ని పర్వతాలు బద్దలు కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చాక... బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజల ఇంధనాలను మండించడం ఎక్కువయ్యాక వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇంకా గ్రీన్ హౌజ్ వాయువుల కారణంగా కేవలం 150 సంవత్సరాలలో 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర భూతాపం పెరిగింది. సహజ వాయువు వెలికితీత, దాని వాడకం వల్ల బయటపడే మీథేన్ కారణంగా మరో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిమి పెరిగే అవకాశం ఏర్పడింది.పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. అధిక వర్షాలు, వరదల వల్ల చేతికొచ్చిన పంటల్లో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అన్ని చోట్లా ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా, వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం, అనుబంధ రంగాల కార్మికులకు ఆదాయాలు పడిపోయాయి. ఇప్పటికీ 60% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని రక్షించు కోవాలంటే, అత్యవసర పర్యావరణ కార్యచరణతో ముందుకు సాగ వలసిందే! రుతుపవనాల గమనం, వాతావరణ వైవిధ్యం ఆధారంగా దేశాన్ని 7 జోన్లుగా వర్గీకరించుకొని అందుకు అనుగుణంగా పంటల సాగును నిర్వహిస్తూ వస్తున్న మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పంటలు పుష్పించే కాలంలో విపరీతమైన ఎండలు కాయడం వల్ల విత్తనాలు బలహీనపడుతున్నాయి. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపు తున్నది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతియేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం, గోధుమ, పప్పుధాన్యాల్లో ఉండే ప్రొటీన్లు నశిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి పశువులకు అవసరమైన గ్రాసం అందడం లేదు. దాంతో, పశువుల ఎదుగుదల తగ్గి మాంసం ఉత్పత్తి పడిపోతోంది. పశువుల పునరుత్పత్తిపై ప్రతి కూల ప్రభావం చూపడమేకాక పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. అధిక వర్షాలు, వరదల వల్ల కోళ్లు, గొర్రెలు, ఇతర పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు పర్యాయాలు కురిసిన భారీ వర్షాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టాలు జరుగు తున్నప్పుడు రైతాంగానికి ప్రభుత్వపరంగా అందుతున్న సాయం అరకొరగానే ఉంటోంది. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయలేని నేపథ్యంలో... పంటవేసి నష్టపోయే కంటే, పంట వేయకపోతేనే తక్కువ నష్టం అనే భావన చాలా ప్రాంతాల్లోని రైతాంగంలో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలీడే పాటిస్తున్నారు. ఇందువల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. భూతాపం తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించాయి, డిక్లరేషన్లపై సంతకాలు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రియో ఒప్పందం, కోపెన్హెగన్ సదస్సు, క్యోటో ఒప్పందం, కాప్ 21 పారిస్ ఒప్పందం... ఇలా అనేక విస్తృత వేదికలపై ప్రపంచ దేశాలు భూతాపం తగ్గించడానికి చేసిన ఉమ్మడి ప్రమాణాలు కాగితాలకే పరిమితం కావడం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడింది.అయితే, కొన్ని దేశాలు మాత్రం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛమైన ఇంధనం) వాడకం దిశగా ముందుకు సాగడం కొంతలో కొంత ఊరట. శిలాజ ఇంధనాల వాడకాన్ని పక్కనపెట్టి, సున్నా కాలుష్యం వెదజల్లే (నెట్ జీరో ఎమిషన్) టెక్నాలజీల వైపు పరుగులుపెడుతున్నాయి. ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచడం; మొక్కజొన్న, మరికొన్ని రకాల ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారీ చేయడం; గాలి మరలు, సోలార్ ప్యానళ్ల నుంచి విద్యుత్ తయారు చేయడం మొదలైన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నాయి. కొన్ని దేశాలు బయోఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తు న్నాయి. భారత్లో కూడా ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వాడకం మొద లైనప్పటికీ వాటి సంఖ్య స్వల్పం. అలాగే, సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే విధంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. పౌర సమాజంలో చైతన్యాన్ని పెంచాలి. ముఖ్యంగా, ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలలో ఏకాభిప్రాయం, మద్దతు అవసరం. అంతిమంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లయితేనే ఫలితాలు అందుతాయి. లేకుంటే... కరోనాను మించిన భూతం అయిన భూతాపం వల్ల మరిన్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు
ఐరాస: మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. సోమవారం న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు.ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’’ అని మోదీ సూచించారు. ‘‘నమస్కారం. ప్రపంచ మానవాళిలో ఆరో వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి గళాన్ని విని్పస్తున్నా’’ అంటూ సాగిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం పెనుముప్పు ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవు. నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. గాడిన పెట్టేందుకే: గుటెరస్ ప్రారం¿ోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివరి్ణంచారు! సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కని్పంచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’’ అన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.పాలస్తీనా అధ్యక్షునితో భేటీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్ రాకుమారుడు షేక్ సబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో కూడా మోదీ సమావేశమయ్యారు. -
గ్లేసియర్ టూరిజం... ప్రాణాంతకం!
తెల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే మనసుకు హాయిగొలిపే హిమానీ నదాలు (గ్లేసియర్స్) మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికి సమీపంలోకి వెళ్లాలని, మంచును బంతులుగా చేసి ఆడుకోవాలని, మంచు ముద్దలతో గుహలాగా చేసుకొని అందులో సేదదీరాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. అందుకే గ్లేసియర్ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. గ్లేసియర్స్ ఉన్న దేశాలకు ఈ పర్యాటకంతో భారీ ఆదాయం లభిస్తోంది. హిమానీనదాలను ప్రత్యక్షంగా చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. అయితే ఆనందం మాటున విషాదం అన్నట్లుగా గ్లేసియర్ టూరిజం ప్రాణాంతకంగా మారుతోంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు కొన్నేళ్లుగా గ్లేసియర్స్ శరవేగంగా కరిగిపోతుండటం పర్యాటకుల పాలిట శాపమవుతోంది. హిమానీ నదాలను సందర్శించే క్రమంలో కొన్నేళ్లలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మంచులో చిక్కి విగత జీవులయ్యారు. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉన్నా గ్లేసియర్లలో పరిస్థితులు అనూహ్యం. అవి ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని గ్లేసియర్ గైడ్లు అంటున్నారు. ‘‘అప్పటిదాకా రాయిలా స్థిరంగా కనిపించే మంచు క్షణాల్లో కరిగిపోతుంది. ఆ సమయంలో అక్కడు వాళ్లంతా మంచులో కూరుకుపోయి మరణించాల్సిందే’’ అని చెబుతున్నారు...! వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. భూమిపై ఉన్న మొత్తం గ్లేసియర్లలో 2100 నాటికి సగం అంతరించిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అవి చాలావరకు కరిగిపోయాయి కూడా. అందుకే సాహసికులు త్వరపడుతున్నారు. గ్లేసియర్లను సందర్శించడం చాలామందికి ఒక కల. దాన్ని నిజం చేసుకోవడానికి ధ్రువపు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గ్లేసియర్ పర్యాటకాన్ని ‘లాస్ట్–చాన్స్ టూరిజం’గా భావిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అసోసియేట్ ప్రొఫెసర్ జాకీ డాసన్ చెప్పారు. కరిగే మంచు.. పెను ముప్పు సాధారణంగా ఎండాకాలంలోనే గ్లేసియర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. గ్లేసియర్ల ఉపరితలంపై మంచు కరుగుతుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ముక్కలుగా విచి్ఛన్నమవుతున్నాయి. స్థిరంగా ఉన్న గ్లేసియర్ కంటే కరుగుతున్నవి మరింత ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఐస్లాండ్ మౌంటెయిన్ గైడ్స్ ప్రతినిధి గరార్ సిగుర్జాన్సన్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు గ్లేసియర్లపై సమ్మర్ స్కీయింగ్కు జనం అమితాసక్తి చూపేవారు. ప్రమాదాల నేపథ్యంలో వేసవి కాలంలో స్కీయింగ్ను చాలా దేశాలు రద్దు చేశాయి. ప్రమాదాలు, మరణాల పెరుగుతున్నా పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు! ఎన్నెన్ని విషాదాలో...! → 2019లో అలాస్కాలోని వాల్డెజ్ గ్లేసియర్లో చిక్కుకొని ముగ్గురు పర్యాటకులు మరణించారు. వీరిలో ఇద్దరు జర్మన్లు, ఒకరు ఆ్రస్టేలియన్. → 2018లో అలాస్కా గ్లేసియర్లలో రెండు ప్రమాదాల్లో 32 ఏళ్ల మహిళ, ఐదేళ్ల బాలుడు చనిపోయారు. → 2022 జూలైలో ఉత్తర ఇటలీలో మార్మోలడా గ్లేసియర్ నుంచి 64 వేల మెట్రిక్ టన్నుల మంచు, నీరు, రాళ్లు విరిగిపడ్డాయి. మంచు మొత్తం నదిలా పారుతూ దిగువన పర్యాటకులను ముంచెత్తింది. దాంతో 11 మంది మరణించారు. → 2023లో ఐస్లాండ్లోని ఓ గ్లేసియర్లో మంచు గుహ హఠాత్తుగా కుప్పకూలడంతో అమెరికన్ టూరిస్టు మృతి చెందాడు. ఇది ఐస్లాండ్లో సంచలనం సృష్టించింది. గ్లేసియర్ టూరిజం సంస్థలు వేసవిలో ఐస్ కేవ్ టూర్లను నిలిపేశాయి. పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ITGC Thwaites Glacier: ‘ప్రళయ’ గ్లేసియర్తో... విలయమే!
మనిషి అత్యాశ భూమి మనుగడకే ఎసరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని మరోసారి రుజువైంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు అంటార్కిటికాలోని ‘డూమ్స్డే’ గ్లేసియర్ ఊహించిన దానికంటే శరవేగంగా కరిగిపోతోందట. అది మరో 200 ఏళ్లలోపే పూర్తిగా కరగడం ఖాయమని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ‘‘అప్పుడు సముద్రమట్టాలు కనీసం పదడుగుల దాకా పెరిగిపోతాయి. అమెరికా నుంచి ఇంగ్లాండ్ దాకా, బంగ్లాదేశ్ నుంచి పసిఫిక్ దీవుల దాకా ప్రపంచమంతటా తీర ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. తీరప్రాంత మహానగరాలన్నీ కనుమరుగైపోతాయి. పైగా మనం అంచనా కూడా వేయలేనన్ని మరిన్ని దారుణ ఉత్పాతాలకు కూడా ఈ పరిణామం దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. 2018 నుంచి ఆ గ్లేసియర్ కరుగుదల తీరుతెన్నులను ఆరేళ్లపాటు లోతుగా పరిశీలించిన మీదట ఈ నిర్ధారణకు వచి్చంది. ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వారి్మంగ్కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇక దాదాపుగా అసాధ్యమే’’ అని గురువారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది! అంటార్కిటికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్డే (ప్రళయకాల) గ్లేసియర్గా పిలుస్తుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్’ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచీ దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐస్ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తోందని తేల్చారు. నివేదికలోని ముఖ్యాంశాలు... → డూమ్స్డే గ్లేసియర్ కరగడం 1940 నుంచీ క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది. → మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచుపొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమ ట్టం కనీసం రెండడుగులు పెరుగుతుంది. → అంటార్కిటికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా పదడుగులకు పైగా పెరిగిపోతుంది. → డూమ్స్డే గ్లేసియర్ వాలుగా ఉంటుంది. దాంతో అది కరుగుతున్న కొద్దీ అందులోని మంచు వెచ్చని సముద్ర జలాల ప్రభావానికి మరింతగా లోనవుతూ వస్తుంది. వెచ్చని జలాలు గ్లేసియర్ అడుగుకు చొచ్చుకుపోతున్నాయి. దాంతో అది కరిగే వేగం మరింతగా పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమైన గ్రీన్హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
వాతావ'రణం'
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులు మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. కట్టుబట్టలతో ఆవాసాలను వదులుకుని వలసలు పట్టాల్సిన దుస్థితిలోకి నెట్టేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గ్లోబల్ వార్మింగ్ దుష్ప్రభావాల బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు,, అనావృష్టి, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు, ఇతర కాలుష్యాల విపత్తుల కారణంగా ఉన్న ప్రాంతాలను వదులుకుని వలస దారులు వెతుక్కుంటున్నారు. 2019లో దాదాపు 50 లక్షల మంది దేశంలో వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్నట్టు గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ నివేదిక పేర్కొంది. 2050 నాటికి 4.50 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ – దక్షిణాసియా నివేదిక తాజాగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. 2021 – 22 నుంచి దేశంలో గ్లోబల్ వార్మింగ్ 11 శాతం పెరిగిందని అమెరికాలోని కొలరాడోకు చెందిన యేల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సంస్థ ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే నష్టాలు ఇవి.. » విపరీతమైన వేడి, కరువు, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు వంటి వాతావరణ మార్పుల కారణంగా వలసలు పెరుగుతాయి. » వ్యవసాయం దెబ్బతినడంతో దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వేరే ప్రాంతాలకు వలస పోతారు. » మొక్కలు, జంతు జాతులకు ముప్పు వాటిల్లుతుంది. » తీవ్రమైన వేడి తరంగాలు వంటి పర్యావరణ ప్రమాదాలు తలెత్తుతాయి.» ముఖ్యంగా ప్రజల జీవనానికి కరువు, నీటి కొరత, తీవ్రమైన వాయు కాలుష్యం, తీవ్రమైన తుపానులు, వరదలు ఆటంకం కలిగిస్తాయి.» వాతావరణ విపత్తులతో వలసల ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతోంది. కుటుంబంలోని పురుషుడు వలస వెళ్ళినప్పుడు స్త్రీలు వ్యవసాయం, కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. » కుటుంబాలతో సహా వలస వెళ్లిన వారు సొంత భూమితో సంబంధాన్ని కోల్పోతున్నారు. భారత్ సహా దక్షిణాసియాకు ప్రమాద ఘంటికలువాతావరణ ప్రేరిత వలసలు దక్షిణాసియాను కుదిపేస్తున్నాయి. ప్రజల కష్టాలను పెంచి వలసలకు దారితీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్లో నదులు కోతకు గురవుతున్నాయి. పాకిస్తాన్, భారతదేశంలో వరదలు పోటెత్తుతున్నాయి. నేపాల్లో హిమానీ నదాలు కరుగుతున్నాయి. ఫలితంగా భారత్, బంగ్లాదేశ్లలో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ప్రజలు ఆవాసాలు కోల్పోవాల్సి వస్తోంది. శ్రీలంకలోని వరి, టీ ఎస్టేట్లపై సాధారణంకంటే భారీ వర్షాలు, తుఫానులు విరుచుకుపడటంతో ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత భారత్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ను దాటుతోంది. మానవుల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ దశాబ్దానికి 0.26 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. గత దశాబ్దంలో ఉష్ణోగ్రత 1.14 డిగ్రీల నుంచి 1.19 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత ఏడేళ్లలో భారత తలసరి బొగ్గు ఉద్గారాలు 29% పెరిగాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు. -
IPE Global: డేంజర్ మార్కు దాటేస్తున్న... భుగభుగలు
ఈ వేసవిలో ఉత్తర భారతమంతా కనీవిని ఎండలతో తల్లడిల్లిపోయింది. ఢిల్లీలో ఏకంగా 40 రోజుల పాటు 40 డిగ్రీల సెంటీగ్రేడ్కు పై చిలుకు ఉష్ణోగ్రతలు నమోదై జనాలను బెంబేలెత్తించాయి. అలస్కాలో హిమానీ నదాలు ఇటీవలి కాలంలో వేసిన అంచనాలను కూడా మించి శరవేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి. భూగోళానికి ఊపిరితిత్తులుగా చెప్పే అమెజాన్ సతత హరిత అరణ్యాలే క్రమంగా ఎండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా కార్చిచ్చుల బారిన పడుతున్నాయి.సౌదీ అరేబియాలో ఏకంగా 50 డిగ్రీలు దాటేసిన ఎండలకు తాళలేక 1,300 మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతాలన్నీ సూచిస్తున్నది ఒక్కటే. భూగోళం శరవేగంగా విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం శాస్త్రవేత్తల అంచనాలకు కూడా అందనంత దారుణ ప్రభావం చూపుతోంది. భూతాపం ఈ శతాబ్దంలోనే ఏకంగా 2.5 డిగ్రీలకు పైగా పెరిగి మొత్తం మానవాళినే వినాశనం వైపు నెట్టడం ఖాయమని వందలాది మంది ప్రపంచ ప్రఖ్యాత వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు! పారిశ్రామికీకరణ ముందు స్థాయితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగింది. అది 1.5 డిగ్రీలను దాటితే ఊహించని ఉత్పాతాలు తప్పవని సైంటిస్టులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అలాంటిది, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ శతాబ్దాంతానికే భూతాపంలో పెరుగుదల 2.5 డిగ్రీల డేంజర్ మార్కును దాటేయడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వే తేలి్చంది. ఎండాకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కనీవినీ ఎరగని విపరిణామాలు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ అంచనాకు వచి్చంది. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ప్రతి నెలా రికార్డులు బద్దలు కొట్టాయి. ఈ ఏడాది సంభవించిన ఎల్నినో ఇప్పటిదాకా నమోదైన ఐదు అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచింది. శిలాజ ఇంధనాల వాడకం తదితరాల వల్ల జరుగుతున్న భారీ కాలుష్యం వంటివి వీటికి తోడవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్లో మూడొంతులు కేవలం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారం వల్లనే జరుగుతోంది. వాతావరణంలో సీఓటూ స్థాయి పెరుగుతున్న కొద్దీ వేడి గాలులు, హరికేన్లు, కార్చిచ్చులు, వరదలు వచి్చపడుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో చైనా, అమెరికా, భారత్ టాప్ 3లో ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్కు ప్రధానంగా సంపన్న దేశాలే కారణమని ఐపీఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ హెడ్ అబినాశ్ మహంతీ చెప్పుకొచ్చారు. ఆ దేశాల్లో గత రెండు శతాబ్దాలుగా జరిగిన మితిమీరిన పారిశ్రామికీరణ పర్యావరణానికి చెప్పలేనంత చేటు చేసిందని వివరించారు. ‘‘ఇప్పుడు కూడా సంప్రదాయేతర ఇంధనాల వాడక తదితరాల ద్వారా గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేస్తామన్న పెద్ద దేశాల ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా భరించలేని ఎండలు, ఆ వెంటే వరదలు, హరికేన్ల వంటి ఉత్పాతాలు కొన్నేళ్లుగా సాధారణ పరిణామంగా మారిపోతున్నాయి. ఇవన్నీ ప్రమాద సూచికలే’’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిన పాతాళానికి భూగర్భ జలాలు20 ఏళ్లలో 450 క్యుబిక్ కి.మీ. మేరకు మాయంఉత్తర భారతదేశంలో భూగర్భ జల వనరులు శరవేగంగా అడుగంటుతున్నాయి! ఎంతగా అంటే, 2002 నుంచి 2021 మధ్య కేవలం 20 ఏళ్లలోనే కంగా 450 క్యుబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు లుప్తమైపోయినట్టు ఐఐటీ గాం«దీనగర్ తాజా సర్వే తేల్చింది. దేశంలోకెల్లా అతి పెద్ద జలాశయమైన ఇందిరా సాగర్ మొత్తం నీటి పరిమాణానికి ఇది ఏకంగా 37 రెట్లు ఎక్కువని సర్వేకు సారథ్యం వహించిన ఐఐటీ గాం«దీనగర్ సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగంలో విక్రం సారాబాయి చైర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా వివరించారు! అందుబాటులో ఉన్న సంబంధిత గణాంకాలతో పాటు శాటిలైట్ డేటా తదితరాలను విశ్లేíÙంచి ఈ మేరకు తేలి్చనట్టు తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ధోరణి మరింతగా ఊపందుకుంటుందని హెచ్చరించారు. ‘‘ఉత్తరాదిన గత 75 ఏళ్లలో వర్షపాతం ఇప్పటికే 8.5 శాతం తగ్గిపోయింది. వాతావరణం 0.5 డిగ్రీల మేరకు వేడెక్కింది. దాంతో సాగునీటికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయి విచ్చలవిడిగా బోర్లు పుట్టుకొచ్చాయి. దాంతో కనీసం భూగర్భ జల వనరులు 12 శాతం తగ్గిపోయాయి’’ అని మిశ్రా వెల్లడించారు. ఒక్క 2009లోనే వర్షాకాలంలో అల్ప వర్షపాతం, చలికాలంలో హెచ్చు ఉష్ణోగ్రతల దెబ్బకు ఉత్తరాదిన భూగర్భ జలాలు 10 శాతం మేర తగ్గిపోయాయని అంచనా! ‘‘గ్లోబల్ వారి్మంగ్ మరింత పెరిగే సూచనలే ఉన్నందున భూగర్భ జలాలు ఇంకా వేగంగా ఎండిపోయేలా ఉన్నాయి. ఎలా చూసినా ఇవన్నీ ప్రమాద సంకేతాలే. ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు గనుక 1 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగితే భూగర్భ జలాలు మరో 10 శాతం దాకా తగ్గిపోతాయి’’ అంటూ సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ ఎన్జీఆర్ఐ పరిశోధకులు కూడా ఆందోళన వెలిబుచ్చారు. సర్వే ఫలితాలను జర్నల్ ఎర్త్ తదుపరి సంచికలో ప్రచురించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మండుతున్న భూగోళం, 29 ఏళ్ల రికార్డు బద్ధలు!
ఉష్ణోగ్రతలు రికార్డులు బద్ధలుకొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే.. ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు.పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డు క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్ధలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాగ్జిమమ్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమై మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్నినోతో పాటు.. మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీసెస్ వెల్లడించింది.ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు.. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్యనాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. అంటే.. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ.రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది.. 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80 శాతం మేర అవకాశముందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి 86 శాతం అవకాశముందని వివరించింది. 2024-28 మధ్యకాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47 శాతం అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం ఉందని గత ఏడాది డబ్ల్యూఎంవో ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం.. 1850 నుంచి 1900 మధ్యనాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్యకాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది. -
గ్లోబల్ వార్మింగ్పై ఫైటర్.. ది మమ్మోత్
ఏటేటా పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమలు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతోంది. వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్డయాక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమ వుతోంది. దీనికి పరిష్కారంగానే.. ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి.ఈ క్రమంలోనే ఐస్ ల్యాండ్కు చెందిన ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బదులు.. నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సరికొత్త సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..ఏటా 36 వేల టన్నుల మేర..గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి.. దానిని నీటితో కలిపి, భూమిలోపలి పొరల్లోకి పంపేలా క్లైమ్ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఏటా 36 వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ను గాలిలోంచి తొలగించి.. భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది. ఇది సుమారు 8 వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే వెలువడేంత కార్బన్డయాక్సైడ్తో సమానం కావడం గమనార్హం. చూడటానికి ఇది తక్కువే అనిపించినా.. ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే.. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారంగా పనికొస్తుందని ‘క్లైమ్ వర్క్స్’ సంస్థ చెప్తోంది.దీనిలో నిలువునా గోడల్లా ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి.ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడు.. అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి.. ముందు వైపునకు వదులుతాయి. ఈ క్రమంలో చాంబర్లోని ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తాయి.ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్తో నిండిపోతే.. ఆటోమేటిగ్గా చాంబర్ సీల్ అయిపోతుంది. అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో 100 సెంటిగ్రేడ్ల మేరకు వేడెక్కుతుంది. దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డయాక్సైడ్ ఆవిరి అవుతుంది.ఎలా పనిచేస్తుంది?ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు. ఆ పైపుల్లోకి నీటిని పంపే ఏర్పాట్లు చేస్తారు. దీనితో కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్గా మారిపోతుంది. భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది.ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం, పైపుల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీరు పంపింగ్ చేయడం కోసం వాడే విద్యుత్ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు.ఇది వేడినీటి బుగ్గల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కాబట్టి.. దాని వినియోగంతో పర్యావరణానికి సమస్యేమీ లేదని ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.అమెరికాలోని లూసియానాలో 2030 నాటికి ఏటా 10 లక్షల టన్నుల కార్బన్డయాక్సైడ్ను సంగ్రహించగలిగే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Copernicus Climate Change Service: ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది. -
వేల ఏళ్ల పురాతనమైన వినాశకర వైరస్ల విజృంభణ!
వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు. నెదర్లాండ్స్లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్లు సోకాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్మెన్స్ విశ్లేíÙంచారు. -
భూగోళం భగ్గుమంటోంది!
మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది. గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం ఐరోపా యూనియన్కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ (సీసీసీఎస్) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది. భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్ అంటున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్లో జరిగిన ‘కాప్–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ అనే హద్దు అలిఖిత శాసనమైంది. అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట. ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్ నినో... ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి. డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్లే కాదు... వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా... వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి. పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘట నల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావ రణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది. ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! -
సముద్ర గర్భంలో ఏకంగా 8 అగ్నిపర్వతాలు
అవున్నిజమే. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 8 అగ్ని పర్వతాలు! అంటార్కిటికా మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున చాలాకాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటీ సగటున కిలోమీటరు పై చిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది! టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది. 3డి ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని సీఎస్ఐఆర్ఓ జియో ఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యూల్ చెప్పారు. సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని ఆయనన్నారు. వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడది ధ్రువపడటంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్నిపర్వతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఇవి మకారీ ద్వీపానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా 20 లక్షల ఏళ్ల కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. సీఎస్ఐఆర్ఓ వోయేజ్ ప్రాజెక్టును అమెరికా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి. సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘‘అంటార్కిటికా మహాసముద్రపు ధ్రువ ప్రవాహ గతి సముద్ర అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడిమితో పాటు కర్బనాన్ని సముద్రంలో అన్నివైపులకూ చెదరగొడతాయి. అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తాయి’’ అని వోయేజ్ మిషన్ చీఫ్ కో సైంటిస్టు డాక్టర్ హెలెన్ ఫిలిప్స్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రానున్నది ఉష్ణ ప్రకోపమే!
వాతావరణం, శీతోష్ణస్థితి గురించి లెక్కలు తీసి రికార్డుగా దాచి ఉంచడం మొదలుపెట్టి 170 సంవత్సరాలకు పైనే అయింది. ఈ మొత్తం కాలంలోనూ 2023వ సంవత్సరం అన్నిటికన్నా వేడి అయినదిగా నమోదవుతుంది అని పరి శోధకులు అప్పుడే చెప్పేస్తున్నారు. ఇటీ వలి కాలం ఇంత వేడిగా ఉండడా నికి మనుషుల కారణంగా మారుతున్న శీతోష్ణస్థితి మాత్రమే అని ఎటువంటి అనుమానం లేకుండా తేల్చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రావ్ు వారి ‘కోపర్ని కస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ వారి లెక్కల ప్రకారం, ఇంతకు ముందు ఎప్పుడూ వేసంగి ఇంత వేడిగా ఉన్నది లేదు. గతంలో కంటే ఈసారి ఉష్ణోగ్రత 0.32 డిగ్రీ సెల్సియస్ సగటున ఎక్కువగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రపంచం మొత్తం మీద మునుపెన్నడూ లేని మూడు వేడి దినాలు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది వేసవికాలం మునుపెన్నడూ లేనంత వేడిగా ఉందని లెక్కతేల్చి పెట్టారు. 2023వ సంవత్సరంలో నెలల ప్రకారం లెక్కలు చూచినా... ప్రపంచమంతటా ఆరు మాసాలు అంతకు ముందు ఎన్నడూ లేని వేడి కనబరిచినట్టు ఇప్పటికే లెక్కలు వచ్చాయి. అంటార్కిటికాలో మంచు కూడా అంతకు ముందు ఎన్నడూ లేనంతగా కరిగిపోయినట్టు కూడా గమనించారు. ప్రపంచంలో పారిశ్రామికీకరణ కన్నా ముందు కూడా వాతా వరణంలోని వేడి గురించిన రికార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సగటున ప్రపంచం మొత్తం మీద 1.46 డిగ్రీల సెల్సియస్ వేడి పారిశ్రామికీకరణకు ముందున్న వేడి కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమల వల్ల వాతావరణం వేడెక్కుతున్న దన్న భావన చాలాకాలంగా ప్రపంచంలో ఉండటం తెలిసిందే. 2016లో వేడిమి ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వేడి 2016లో కన్నా ఎక్కువగా ఉన్నట్టు నమోదయింది. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు రికార్డులో ఉన్న సంవత్సరాల అన్నింటిలోకీ 2023 అత్యంత వేడిగా ఉన్నట్టు లెక్క తేలింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ‘సీ త్రీ ఎస్’ సంస్థ పరిశోధకురాలు సమంతా బుర్జెస్ ఒక ప్రకటనలో బయటపెట్టారు. శరత్ కాలం కూడా వేడిగా ఉండడానికి ‘ఎల్ నినో’ కారణం అని ఇప్పటికే మనకంతా తెలుసు. ఎల్ నినో వల్ల భూమధ్య రేఖ వద్ద సముద్రాలలో ఉపరితలం నీరు వేడెక్కుతుంది. దాని వల్ల ప్రపంచంలోని గాలులు వేడవుతాయి. 2023 జూన్లోనే ఈ ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది కూడా ఈ వేడి కొనసాగుతుందని అంటున్నారు. గడచిన మూడు సంవత్సరాల పాటుఎల్ నినోకు వ్యతిరేకంగా ఉండే ‘లా నినా’ అనే పరిస్థితి కారణంగా వేడిమి కొంతవరకు అదుపులో ఉంది. ఈ ‘లా నినా’ప్రస్తుతం లేదు. కనుక వేడిమి హద్దు లేకుండా పెరుగుతున్నది. మరికొంతమంది నిపుణులు టోంగాలో సముద్రం లోపల 2022లో పేలిన అగ్నిపర్వతం కారణంగా వేడి నీటి ఆవిరులు వాతావరణంలో పెరిగాయనీ, ఈ సంవత్సరం వేడి పెరుగుదలకు అది కూడా కొంతవరకు కారణం కావచ్చుననీ అంటున్నారు. అయితే పరి శోధకులు మాత్రం ఈ విషయం గురించి అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతటా వాతావరణం వేడిగా మారడానికి ‘గ్లోబల్ వార్మింగ్’ అన్న ప్రక్రియ కారణం అని అందరికీ తెలుసు. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని కూడా తెలుసు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచ వాతావరణంలో 25 బిలి యన్ల అణుబాంబుల శక్తికి సమానంగా ఉష్ణశక్తి చేరిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా గడిచిన 50 సంవ త్సరాల పాటు జరిగిన మార్పు. ఈ మార్పు ఒక పక్కన గాలిని వేడెక్కిస్తుండగా, మరొక పక్కన ఊహకు అందకుండా ఎల్ నినో వచ్చే పరిస్థితులకు దారితీస్తున్నది. రానురానూ పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. డిసెంబర్ 4న ‘కాప్’ 28 అనే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరిగింది. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్నుపంపించడం ఈ సంవత్సరం అంతకు ముందు ఎన్నడూ లేని స్థాయికి చేరిందని అక్కడ ప్రకటించారు. పరిస్థితి ఇలాగుంటే, వాతావరణం నియంత్రణలో ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు అన్నారు అక్కడ.గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు ప్రస్ఫుటంగా బయట పడు తున్నాయి. ప్రపంచమంతటా తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద సరస్సులు, జలాశయాలు సగం కుదించుకుపోయాయి. సముద్ర అంతర్భాగంలో ఉండే గల్ఫ్ ప్రవాహం కూడా ప్రభావం కనపరు స్తున్నది. సముద్ర మట్టాలు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి. అయితే పరిశోధకులు, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి అవ కాశాలు ఇంకా ఉన్నాయి అని ఆశాభావం కనబరుస్తున్నారు. వాతావరణంలో మార్పులను మనకు అనుకూలంగా మార్చే మార్గాలు లేకపోలేదు అంటున్నారు పెన్సిల్వేనియా విశ్వ విద్యా లయం పరిశోధకులు. కానీ ఆ అవకాశం కూడా రానురానూ తగ్గి పోతున్నది అన్నది వారి అభిప్రాయం. కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
Global Warming: భూమిని వేడెక్కిస్తున్న పాపం... పెద్ద దేశాలదే!
గ్లోబల్ వార్మింగ్. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. దీని దెబ్బకు భూగోళపు సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అవి ఇంకో అర డిగ్రీ మేరకు పెరిగినా సర్వ వినాశనం జరిగే పరిస్థితి! ప్రాణికోటి మనుగడకే పెను ముప్పు! ఈ ప్రమాదం ఎంతో దూరం కూడా లేదని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. ముఖ్యంగా గ్లోబల్ వార్మంగ్కు ప్రధాన కారణమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో దీనిపై ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఉద్గారాలకు ముకుతాడు వేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానాలు నీటిమూటలే అవుతున్నాయి. తరచి చూస్తే, గ్రీన్హౌస్వాయు ఉద్గారాల్లో సింహ భాగం పెద్ద దేశాలదే. మాటలే తప్ప చేతల్లేవు 2022లో ప్రపంచ దేశాలన్నీ కలిపి విడుదల చేసిన గ్రీన్హౌస్ వాయువుల పరిమాణమెంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల మెట్రిక్ టన్నులు! పర్యావరణ కాలుష్య కారకాల్లో అతి ముఖ్యమైనవి గ్రీన్హౌస్ ఉద్గారాలే. భూగోళాన్ని వేడెక్కించడంలో కూడా వీటిదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రమాదకరమైన సమస్య విషయంలో మన నిర్లిప్త వైఖరికి ఏత ఏడాది గ్రీన్హౌజ్ వాయు ఉద్గారాల పరిమాణం మరో తాజా ఉదాహరణ మాత్రమే. ఈ పాపంలో సంపన్న దేశాల పాత్రే ఎక్కువ. చైనా విషయమే తీసుకుంటే, గతేడాది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఆ ఒక్క దేశం వాటాయే ఏకంగా 30 శాతం! 2022లో అది 1,440 కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పారిశ్రామిక వ్యవస్థ ప్రధానంగా బొగ్గుపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక 639 కోట్ల టన్నులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 343 కోట్ల టన్నులతో యూరోపియన్ యూనియన్(ఈయూ) నాలుగో స్థానంలో ఉంది. గణాంకాలపరంగా 352 కోట్ల టన్నులతో ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించినా జనాభాను బట్టి చూస్తే కర్బన ఉద్గారాల పాపంలో మన వాటా నిజానికి చాలా తక్కువ. మన తలసరి వార్షిక కర్బన ఉద్గారాలు కేవలం 2.5 టన్నులు! ప్రపంచ వేదికలపై పెద్ద మాటలు చెప్పే అమెరికాదే ఈ పాపంలో అగ్ర స్థానం! ఒక్కో అమెరికన్ ఏటా సగటున 19 టన్నుల సీఓటూ ఉద్గారాలకు కారకుడవుతున్నాడు. కేవలం 2.5 కోట్ల జనాభా ఉన్న ఆ్రస్టేలియాలో తలసరి కర్బన ఉద్గారాలు 20 టన్నులు, 3.8 కోట్ల జనాభా ఉన్న కెనడాలో 18 టన్నులు, 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 14 టన్నులు! 20.7 టన్నుల తలసరి ఉద్గారాలతో సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండటం విశేషం. మొత్తమ్మీద ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా, ఈయూ వాటాయే దాదాపు సగం! వీటిలోనూ చారిత్రకంగా చూసుకుంటే అమెరికా, ఈయూ రెండే ప్రపంచ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటూ వస్తున్నాయి. వేడెక్కుతున్న భూమి భూగోళపు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు నాటితో గత 150 ఏళ్లలో 1.5 డిగ్రీలకు మించి పెరిగిపోయింది! ఇటీవల ఒకానొక దశలో అది 2 డిగ్రీలకు మించి కలవరపరిచింది కూడా. దాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ పేరుకు అంగీకరించాయే తప్ప ఆచరణలో చేస్తున్నది పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైనా పేలనున్న మందుపాతర మీద ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా ఆందోళన వెలిబుచి్చంది. కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఎలాగోలా ప్రస్తుత పర్యావరణ లక్ష్యాలను చేరుకున్నా భూమి 2 డిగ్రీలను మించి వేడెక్కడం ఖాయమని హెచ్చరించింది. అప్పుడు కనీవినీ ఎరగని ఉత్పాతాలను, ఘోరాలను నిత్యం కళ్లజూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్–28 జరుగుతోంది. అందులోనైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసి భూగోళాన్ని కాపాడుకునే దిశగా ఏమైనా నిర్ణయాత్మకమైన అడుగులు పడతాయేమో చూడాలి. ఏమిటీ కర్బన ఉద్గారాలు? బొగ్గు, చమురు, గ్యాస్ను మండించినప్పుడు అవి వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అది కొన్ని వందల ఏళ్లపాటు వాతావరణంలోనే ఉండిపోయి భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది. ‘‘ఆ లెక్కన భూమికి ముప్పు కేవలం 2022 తాలూకు కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక గత 150 ఏళ్లలో విడుదలైన కర్బన ఉద్గారాలన్నీ ఇప్పటికీ భూమిని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కన ఈ 150 ఏళ్లలో అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికాదే గ్లోబల్ వార్మింగ్లో ప్రధాన పాత్ర అని చెప్పాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్లోని ఎక్స్టర్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త పియరీ ఫ్రెడ్లింగ్స్టెయిన్ కుండబద్దలు కొట్టారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు‘మాయం’
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతోంది. మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి. హిమానీనదాలు క్రమంగా మాయమైపోతున్నాయి. ఆసియాలోని హిందూ కుష్తో పాటు పెరూ మంచు పర్వతాల్లోని హిమానీనదాల తగ్గుదల పర్యావరణవేత్తలను, శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోని హిమానీనదాల్లో దశాబ్ద కాలంలో 332 గిగాటన్నుల మంచు అదృశ్యమైందని అంచనా. ఇక ఆసియాలోని హిందూ కుష్ హిమాలయాలు అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారత్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్ మీదుగా 3,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి వాటి పరిమాణంలో 75 శాతం వరకు కోల్పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ఈ హిమానీనదాల దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని, తీవ్ర నీటి ఎద్దడి తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 200 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. హిమాలయ పర్వతాల దిగువున ఉన్న 12 హిమానీనదాల్లోని నీటి లభ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెస్ట్ శ్రేణుల్లో గత 30 ఏళ్లలోనే 2 వేల సంవత్సరాలకు సంబంధించిన మంచు కరిగిపోయిందని పరిశోధకులు తేల్చారు. భూతాపంతో భారీ నష్టం.. భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలన్నీ విఫలమయ్యాయి. ఫలితంగా సెప్టెంబర్ 17న భూతాపం 2 డిగ్రీల మార్కును చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే హిందూకుష్ హిమానీ నదాలు 2100వ సంవత్సరం నాటికి 30 నుంచి 50 శాతం మేర కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భూతాపం 3 డిగ్రీల మార్కుకు చేరితే నేపాల్, భూటాన్లలో 75 శాతం మేర మంచు కరిగిపోయే ప్రమాదముంది. అదే 4 డిగ్రీలకు పెరిగితే నష్టం 80 శాతానికి చేరుకుంటుంది. పెరూలో దారుణ పరిస్థితి.. ప్రపంచంలోని ఉష్ణమండల హిమానీనదాల్లో 68 శాతం పెరూలో ఉన్నాయి. గత ఆరు దశాబ్దాల్లో తలెత్తిన వాతావరణ మార్పుల వల్ల పెరూలోని హిమానీనదాల వైశాల్యం సగానికి పైగా తగ్గిపోయింది. 2016– 2020 మధ్య తలెత్తిన వాతావరణ మార్పులతో 175 హిమానీనదాలు అంతరించిపోయినట్టు పెరూవియన్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పెరూలోని కొన్ని పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం 1,050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే మంచు ఉంది. 1962వ సంవత్సరంలో 2,399 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం ఇలాగే కొనసాగితే పెను వినాశనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేంజర్ జోన్లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా..
భూతాపం కారణంగా తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సిన దేశాలలో భారత్ కూడా ఉంది.రాబోయే 30 ఏళ్ళల్లో ఈ తీష్ణత మరింతగా పెరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారతదేశంలోని 50 శాతం మందిపై కరువు బరువు పడే సూచనలు కనిపిస్తున్నాయి.భూతాపం 3డిగ్రీల సెల్సియస్ పెరిగితే చాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయి.ముఖ్యంగా వ్యవసాయభూమి దాదాపు సగానికి పైగా కరువుక్షేత్రంగా మారిపోతుందని పరిశోధకులు చెబుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ప్యారిస్ ఒప్పందంలో చెప్పినట్లుగా ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం నాటికి తీసుకురాగలిగితే చాలా వరకూ ముప్పును తప్పించుకో గలుగుతాం. ఆచరణలో అది జరిగేపనేనా? అన్నది పెద్దప్రశ్న. భూమి వేడిక్కిపోతోందిరా! బాబూ అంటూ శాస్త్రవేత్తలు నెత్తినోరు మొత్తుకుంటూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలు కలుసుకున్నప్పుడల్లా చర్చించే అంశాల్లో ఇదొకటి.ఉపన్యాసాలు, ఒప్పందాలు, నినాదాలు తప్ప అంతటా ఆచరణ శూన్యం. భూమి వేడిక్కిపోతున్న ప్రభావంతో శీతోష్ణస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలను కొలవడం ద్వారా దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలను సంబంధిత విభాగాలు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాయి.వాతావరణంలో మార్పులు చేర్పులు అన్నది అనాదిగా జరిగే పరిణామం. శీతోష్ణస్థితుల ప్రభావం ప్రపంచంపై, మానవుల మనుగడపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా, 20వ శతాబ్దం మధ్యకాలం నుంచీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అసాధారణ స్థితికి చేరిపోయింది.ఈ ప్రభావంతో రుతువుల ప్రయాణం కూడా గతితప్పింది. అకాల వర్షాలు, ప్రకృతి భీభత్సాలు, కరువుకాటకాలు, వింత వింత జబ్బులు అన్నింటికీ భూమి వేడెక్కిపోవడమే ప్రధాన కారణం. పారిశ్రామికం వెర్రితలలు వేసి,ఆర్ధిక స్వార్థం ప్రబలి, హరిత చైతన్యం అడుగంటడం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి.ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవరోధాలు పెరుగుతున్నాయి.కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే కొంప ముంచుతోంది. భూమి వేడెక్కిపోవడం వల్ల ఏర్పడుతున్న పరిణామాలు విస్తృతంగా ఉంటాయి.సముద్ర మట్టాలు పెరిగిపోవడం, మహా సముద్రాల ఆమ్లీకరణం,అడవులు మండిపోవడం, అనేక జాతులు అంతరించిపోవడం, పంటల దిగుబడి తగ్గిపోవడం, ఆహారకొరత చుట్టుముట్టడం మొదలైన ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు కూడా తరలిపోవాల్సి వస్తుంది.భూతాపాన్ని అడ్డుకోవడం అందరి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు అందరూ కలిసి రంగంలోకి దిగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దుస్థితికి కారణం మనిషి. మనిషిలోని స్వార్ధ చింతన, బాధ్యతా రాహిత్యం, రేపటి పట్ల ఏ మాత్రం స్పృహ లేకపోవడం ఈ దుస్థితికి చేర్చాయి. ఐక్య రాజ్య సమితి ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశం బలంగా చర్చకు వచ్చింది. ఉద్గారాలను పెద్దఎత్తున తగ్గించాలి.భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలని 2016లో పారిస్ లో ఒప్పందం జరిగింది. ఈ ఆరేడేళ్లలో అది తగ్గకపోగా మరింత పెరిగింది.భూమిని, వనరులను వాడుకొనే విధానంలో పెను అనారోగ్యకరమైన విధానాలు వచ్చాయి. నివాసయోగ్య భూమి -అటవీ భూమి మధ్య ఉన్న నిష్పత్తులు మారిపోయాయి. వ్యవసాయభూమిని వాడుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. వ్యవసాయం కంటే మిగిలిన వాటికి ఆ భూమిని వాడే సంస్కృతి పెరిగిపోయింది. పర్యవసానంగా అటవీ భూమి, వ్యవసాయ భూమి తగ్గిపోయింది. కొన్ని రసాయనాల సమ్మేళనం మేఘాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.భూమికి చేరే సూర్యకాంతి పరిమాణంలో కూడా తగ్గుదల మొదలైంది. దీనిని 'గ్లోబల్ డిమ్మింగ్ ' అంటారు. భూమికి సూర్యుడే ప్రధానమైన శక్తి.ఆ వనరులు తగ్గిపోవడం అత్యంత ప్రమాదకరం.ఇప్పటికైనా మేలుకోవాలి. గ్రీన్ వాయివులను తగ్గించుకోవాలి. సౌరశక్తి, పవన శక్తిని ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. కార్బన్ వాడకాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో,అడవులను పెంచడం అంతకంటే ముఖ్యం. పబ్లిక్ రవాణా విధానంలో చాలా మార్పులు రావాలి.కార్లు మొదలైన వాహనాల వాడకం తగ్గించి, నడక, సైకిళ్ల వాడకం పెంచమని నిపుణులు సూచిస్తున్నారు.భూతాపం వల్ల 2030 నాటికి మరో 12 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్ళనున్నారని నివేదికలు చెబుతున్నాయి.వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆరోగ్యకరమైన విధానాలను పాటిస్తే ఉధృతి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ప్రకృతిని గౌరవిస్తే, అది మనల్ని కాపాడుతుంది. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
కరోనాకు మించిన విపత్తు: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి?
రాబోయే కాలం మానవులకు అత్యంత కష్టకాలంగా మారనుంది. కరోనా తరువాత వాతావరణ మార్పులు పెను వినాశనాన్ని తీసుకురాబోతున్నాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో వంద కోట్ల మంది బలికానున్నారు. ఈ వంద కోట్ల మంది ఏదో ఒక ప్రాంతానికే చెందినవారేమీ కాదు.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మరణ మృదంగంలో సమిధలు కానున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం గురించి శాస్త్రవేత్తలు ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. భయపెడుతున్న గణాంకాలు యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో ఇటీవల వాతావరణ మార్పులపై పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధన ద్వారా భవిష్యత్తులో పెరగబోయే ఉష్ణోగ్రతలు మానవుల మరణాలకు ఎలా కారణమవుతాయో తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలు రాబోయే తరానికి పెను ముప్పుగా పరిణమించనున్నాయని ఈ పరిశోధన నిర్వాహకులు జాషువా పియర్స్ హెచ్చరించారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే మానవుల మరణాల సంఖ్యను ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఇది 100 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. మనిషి బతకాలంటే ఏం చేయాలి? ఈ విపత్తును నివారించడానికి మనుషులంతా ముందుగా వాతావరణ మార్పులపై దృష్టి సారించాలి. దీనితో పాటు కర్బన ఉద్గారాలను తీవ్రంగా పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కర్బన ఉద్గారాల కట్టడికి చర్యలు చేపట్టాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏటా భూతాపం పెరుగుతున్న తీరు చూస్తుంటే రానున్న కాలంలో ప్రపంచం నిప్పుల కొలిమిలా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరగా నిలిపివేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పులకు గల కారణాలలో ప్రధానమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వాలు కార్బన్ వేస్ట్ మేనేజ్మెంట్, కార్బన్ డయాక్సైడ్ను సహజంగా నిల్వ చేయడానికి దోహదపడేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తే, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఐబీఎంలో కూర్చుని రెజ్యూమ్ రూపొందించిన రతన్ టాటా -
కార్చిచ్చు కనిపించని ఉచ్చు..!
కార్చిచ్చులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఏడాదికేడాది కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి దగ్ధం చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. మొదలైతే.. అంతే ► పశ్చిమ అమెరికా, దక్షిణ ఆ్రస్టేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా బ్రిటన్ అత్యధికంగా కార్చిచ్చుల బారినపడుతోంది. 2019లో బ్రిటన్లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది. ► బ్రిటన్లో మాంచెస్టర్లో 2019లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా మూడు వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలు ష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే పారిపోవడం జరిగింది. ► అమెరికాలో కాలిఫోరి్నయాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవుల్ని మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి. ► 2021లో ప్రపంచ దేశాల్లో కార్చిచ్చుల వల్ల 176 వందల కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసింది కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34 వేల మందికి ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. ► 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతి పెద్దది. ఈ కార్చిచ్చు వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకుంది. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14% 2050 నాటికి30%, ఈ శతాబ్దం అంతానికి 50%కార్చిచ్చులు పెరుగుతాయని యూఎన్ హెచ్చరించింది. ఎందుకీ మంటలు ? ► కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి, కరువు పరిస్థితులు ఏర్పడి, చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసినా కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి. ► మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లి క్యాంప్ఫైర్ వేసుకొని దానిని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకి కారణమవుతున్నాయి. ► ఇందనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోరి్నయాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. ► ప్రస్తుతం అమెరికా హవాయి ద్వీపంలో కార్చిచ్చు మెరుపు వేగంతో వ్యాపించడానికి డొరైన్ టోర్నడో వల్ల ఏర్పడిన బలమైన గాలులే కారణం. కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపించడానికి గాలులే ప్రధా న పాత్ర పోషించాయి. అగ్గి మరింత రాజేస్తున్న వాతావరణ మార్పులు సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మానవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. 1760లో పారిశ్రామిక విప్లవం వచి్చన తర్వాత భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయాయి. దీని ప్రభావం ప్రకృతిపై తీవ్రంగా పడింది. అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోరి్నయాలో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భవిష్యత్లో వీటి తీవ్రత మరింత పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఏ సమస్య అయినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా గ్లోబల్ వారి్మంగ్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో పని చేస్తే కార్చిచ్చులతో పాటు ఇతర సమస్యల్ని కూడా అధిగమించవచ్చు. చరిత్రలో భారీ కార్చిచ్చులు దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూనిస్ న్యూటన్ ఫుట్: గూగుల్ డూడుల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే..
ఈ రోజు గూగుల్ 11 స్లయిడ్లతో ఓ ఇంటారాక్టివ్ డూడుల్ని రూపొందించింది. అందులో ఓ మహిళ ఫోటో ఉంది ఎవరు ఆమె?. ఎందుకు గూగుల్ సోమవారం ఆ మహిళతో ఉన్న డూడిల్ రూపొందించిన నివాళులర్పించింది. తొలిసారిగా గ్రీన్హౌస్ ప్రభావాన్ని కనుగొన్న తొలి వ్యక్తే ఆమె. ఆమె పేరు యూనిస్ న్యూటన్ ఫుట్, అమెరికన్ శాస్త్రవేత్త. స్త్రీలు అంతగా చదువుకోని ఆరోజుల్లో ఆమె చదువుకోవడమేగాక ఇలాంటి పరిశోధనల వైపుకి వెళ్లే అవకాశమేలేని స్థితిలో అటువైపుకే అడుగులు వేయడం విశేషం. ఇక ఫుట్ 1856లో ఓ ప్రయోగాన్ని నిర్వహించింది. గాజు సిలండర్లలో పాదరసంతో కూడిన థర్మామీటర్లను ఉంచింది. సిలిండర్లో కార్బన్ డయాక్సైడ్ ఉండటం వల్లే సూర్యరశ్మీ ప్రభావానికి బాగా గురైందని కనుగొంది. దీని ఫలితంగా గాల్లో ఉండే కార్బన్ డయాక్స్డ్ స్థాయిల వల్ల వాతావరణం చాలా సులభంగా వేడుక్కుతుందనే విషయాన్ని నిర్థారించింది. ఆ పరిశోధనలే నేటి వాతావరణ మార్పుల అవగాహన సదస్సులకు మూలం అయ్యింది. ఇలా ఫుట్ తన పరిశోధనలను ప్రచురించిన తర్వాత వాతావరణ స్థిర విద్యుత్పై రెండొవ అధ్యయనాన్ని రూపొందించింది. మొత్తంగా ఆమె రెండు భౌతిక శాస్త్ర అధ్యయనాలను ప్రచురించిన మొదటి మహిళ. వాటిపై జరిగిన చర్చలే తదుపరి ప్రయోగాలకు దారితీశాయి. ఆ తర్వాత దాన్నే ఇప్పుడు మనం 'గ్రీన్ హౌస్ ఎఫెక్ట్గా' పిలుస్తున్నాం. ఆమె వేసిన పునాది వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు వాతావరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేసేందుకు కారణమైంది. అంతేగాదు గ్రీన్హౌస్ ప్రభావాన్ని, గ్లోబల్ వార్మింగ్ దాని ప్రభావం గురించి అధ్యయనం చేసిన తొలి మహిళగా అమెరికన్ శాస్త్రవేత్త ఫుట్ నిలిచింది. నిజానికి ఫుట్ 1819లో కనెక్టికట్లో జన్మించింది. ఆమె ట్రాయ ఫిమేల్ సెమినరీ అనే పాఠశాలలో చదువుకున్నారు. ఇది విద్యార్థులను సైన్స్ తరగతులకు హాజరయ్యేలా చేయడమే గాక కెమిస్ట్రీ ల్యాబ్లోని ప్రయోగాల్లో పాల్గొనేలా ప్రోత్సహించేది. ఇక్కడ నుంచి ఫుట్కి సైన్స్పై మక్కువ ఏర్పడింది. అంతేగాదు ఫుట్ ఇలా పరిశోధనలు చేస్తూనే మహిళా హక్కుల ప్రచారానికి కూడా సమయం కేటాయించింది. ఫుట్ 19848లో సెనెకా ఫాల్స్లో జరిగిన మొదటి మహిళా హక్కుల సమావేశానికి హాజరయ్యి డిక్లరేషన్ ఆఫ్ సెంటిమెంట్స్పై సంతకం చేసింది. ఇది సామాజికంగా చట్టపరమైన హోదాలో మహిళలకు సమానత్వాన్ని కోరే పత్రం. ఐతే గొప్ప శాస్త్రవేత్త అయిన ఫుట్ 1888లో మరణించడంతో ఒక శతాబ్దానికి పైగా ఫుట్ విజయాలను గుర్తింపు లభించలేదు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఆమెకి నివాళులర్పిస్తూ సోమవారం ఈ డూడుల్ని రూపొందించింది. అది ఆమె సాధించిన విజయాలను తెలిపేలా గ్రీన్హౌస్ ప్రభావాన్ని కూడా వివరిస్తోంది. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్) -
1950 నుంచే పెనుముప్పు శకం ఆరంభం
భూగోళంపై గతంలో ఎన్నడూ కనిపించని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం, భూతాపం, వాతావరణ మార్పులు పెరిగిపోతున్నాయి. రుతువులు గతి తప్పుతున్నాయి. ఒకవైపు భీకర వర్షాలు, వరదలు, మరోవైపు నిప్పులు కక్కే ఎండలు సర్వసాధారణంగా మారాయి. మొత్తం పుడమి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే, మానవుల నిర్వాకం వల్ల భూమిపై అవాంఛనీయ ఈ పరిణామం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1950 నుంచి 1954 మధ్య మొదలైందని ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు గుర్తించారు. భూమాతను ప్రమాదంలోకి నెట్టివేసే కొత్త శకానికి అదొక ఆరంభమని అంటున్నారు. ఈ పరిణామానికి ఆంథ్రోపొసీన్ అని నామకరణం చేశారు. మనిషి, నూతన అనే అర్థాలున్న గ్రీక్ పదాలతో ఈ కొత్త పదం ఏర్పడింది. మొదట దీనిని 2000 సంవత్సరంలో పాల్ క్రట్జెన్, యూగీన్ స్టార్మర్ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. దీనిని ప్రస్తుత ‘జియోలాజికల్ టైమ్ ఇంటర్వెల్’గా పరిగణిస్తున్నారు. ‘ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్’ సైంటిస్టులు ఇంకా ఏం చెప్పారంటే.. ► ఆంథ్రోపొసీన్లో భాగమైన పరిణామాలు, మార్పులు 1,000 లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► ఇవి మొత్తం భూమి ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ప్రభావం భూమిపై శాశ్వతంగా ఉంటుంది. ► శిలాజ ఇంధనాల వాడకం, అణ్వాయుధాలను ఉపయోగించడం, పొలాల్లో రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగం, భూమితోపాటు నదులు, చెరువుల్లో ప్లాస్లిక్ వ్యర్థాలు పెరగడం వంటివి ఆంథ్రోపొసీన్కు కారణమవుతున్నాయి. ► మానవుల చర్యల భూమికి జరుగుతున్న నష్టం అనూహ్యంగానే ఉందని, ఈ నష్టం రానురాను మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్కు చెందిన జియాలజిస్ట్ కోలిన్ వాటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ► సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం బలమైన గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఇప్పుడు మానవ చర్యలు సైతం అదే కేటగిరీకి సమానంగా ఉన్నాయి. 1950వ దశకం తర్వాత భూగోళంపై ఎన్నో రకాల జీవులు అంతరించిపోయాయి. ► గ్రహ శకలాలు ఢీకొట్టడం అనేది ఒక కొత్త శకానికి దారితీసింది. మనుషుల కార్యకలాపాలు కూడా భూమిపై కొత్త శకానికి నాంది పలికాయి. ► ఇప్పటికైనా మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గంగా తరంగం.. కాదిక నిరంతరం
పావన గంగా తరంగం.. బ్రహ్మపుత్ర గాంభీర్యం.. సింధునదీ సోయగం ఇక గతమే అంటోంది ఓ అధ్యయనం. మరో ఎనభై ఏళ్ల తరువాత ఈ జీవనదుల్లో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుందని చెబుతోంది. భారత ఉపఖండానికి హిమాలయాలే జీవగర్ర. ఇక్కడ పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఉపఖండంలోని మెజారిటీ భాగాన్ని సస్యశ్యామలం చేస్తూ భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మారుస్తున్నాయి. హిమాలయాల్లో జరిగే ప్రతి మార్పూ భారత ఉపఖండంపై పెను ప్రభావం చూపుతుంది. అటువంటి హిమాలయాలు భూతాపం కారణంగా ప్రస్తుతం సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి. ధ్రువప్రాంతాలు మినహాయిస్తే భూగోళంలో అత్యధిక హిమపాతం కనిపించే హిమాలయాల్లో మరికొన్నేళ్లలో మంచు మటుమాయమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. సాక్షి, అమరావతి: ఉత్తరార్ధగోళంలో 1950 నుంచి 2019 వరకు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం, హిమపాతం తదితర వాతావరణ సంబంధిత గణాంకాలపై బర్క్లీ–మిచిగాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. యూరోపి యన్ సెంటర్ నుంచి సేకరించిన సమాచా రాన్ని ఈ రెండు యూనివర్సిటీల ప్రొఫెసర్లు లోతుగా విశ్లేషించారు. ఆ గణాంకాలను 2024 నుంచి 2100 వరకూ వర్తింపజేసి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా రు. ఈ అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦పర్యావరణ కాలుçష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగితే.. ఉత్తరార్ధగోళంలో హిమాల యపర్వతాల నుంచి యూరప్లో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాల వరకూ వర్షపాతం 15 శాతం పెరుగుతోంది. ఆ మేరకు హిమపాతం తగ్గుతోంది. ♦ ఉత్తరార్ధగోళంలో మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయాల నుంచి యూరప్లోని ఆల్ప్స్ అమెరికాలోని రాఖీ పర్వతాల వరకూ చూస్తే.. హిమాల యాల్లోనే అధిక వర్షపాతం నమోదవు తోంది. ఆ మేరకు హిమపాతం గణనీయంగా తగ్గుతోంది. ♦ హిమాలయాల్లో పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదుల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం.. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వర్షపాతం పెరగడమే. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు సారవంతమైన నేల కోతకు గురవుతోంది. ఈ ప్రభావం వల్ల హిమాలయాలకు దిగువన నివసించే కోట్లాది ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ♦హిమాలయపర్వతాల్లో ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమనీనదాలు (గ్లేసియర్స్) కరుగుదల ఇటీవలి కాలంలో 65 శాతం పెరిగినట్లు ఐసీఐఎంవోడీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్) సంస్థ తేల్చింది. 2100 నాటికి హిందూకుష్ పర్వతాల్లోని హిమనీనదాలు ప్రస్తుతం ఉన్న పరిమాణంలో 80 శాతం మాయం కావడం ఖాయమని ఆ సంస్థ పేర్కొంది. ♦ హిమపాతం తగ్గడం, హిమనీనదాలు వేగంగా కరుగుతుండటాన్ని బట్టి చూస్తే జీవనదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు, వాటి ఉప నదుల్లో 2100 తరువాత వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా సమయాల్లో ఆ జీవనదులు ఎండిపోవడం ఖాయం. దీనివల్ల భారతదేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలకమైన గంగా సింధు మైదానానికి నీటి లభ్యత కష్టమే. -
భూమికి డేంజర్ బెల్స్.. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే
భూమి ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు, వాటికి కారణాలు తదితరాలపై 40 మంది ప్రముఖ అంతర్జాతీయ ప్రకృతి, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఎర్త్ కమిషన్ బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో తేలిన ఆందోళనకర అంశాలతో కూడిన నివేదిక జర్నల్ నేచర్లో పబ్లిషైంది. మానవ ఆధిపత్య యుగం (ఆంత్రోపొసీన్) క్రమంగా భూమి తాలూకు కీలక వ్యవస్థల స్థిరత్వాన్ని సమూలంగా కదిలించి వేస్తోందని హెచ్చరించింది. నివేదికలో వెల్లడించిన అంశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి... మితిమీరిన వనరుల దోపిడీ. లెక్కలేని నిర్లక్ష్యం. ఇంకా అనేకానేక స్వయంకృతాపరాధాలతో భూమిని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. పుట్టింది మొదలు గిట్టి మట్టిలో కలిసేదాకా నిత్యం సకలం సమకూర్చే ఆధారాన్నే మొదలంటా నరికేసుకుంటున్నాం. భావి తరాలనే గాక భూమిపై ఉన్న సకల జీవరాశులనూ పెను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాం. గ్లోబల్ వార్మింగ్, కరువు, పెను వరదల వంటి ఉత్పాతాల రూపంలో భూమి చేస్తున్న ఆక్రందనను ఇకనైనా చెవిన పెట్టకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేందుకు ఇంకెంతో కాలం పట్టదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. ఫలితంగా భూమికి డేంజర్ బెల్స్ చెవులు బద్దలయ్యే స్థాయిలో మోగుతున్నాయని సైంటిస్టులు తాజాగా తేల్చారు. భూమి తాలూకు ఎనిమిది రకాల భద్రతా పరిమితుల్లో ఏకంగా ఏడింటిని ఎప్పుడో దాటేశామని వారు వెల్లడించారు... ప్రతి ఖండంలోనూ.. సమతుల్యత పూర్తిగా దెబ్బ తిని అతి సమస్యాత్మకంగా మారిన పలు ప్రాంతాలను అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ ఎక్కడపడితే అక్కడ ఇలాంటి హాట్స్పాట్లు ఉండటం కలవరపరిచే అంశమేనని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో చాలా ప్రాంతాల్లో వాతావరణ మార్పులే సమస్యకు ప్రధాన కారణమని తేలింది. ‘‘ముఖ్యంగా ఆసియాలో పర్వత ప్రాంతాలతో సమాహారమైన హై మౌంటేన్ క్రయోస్పియర్ శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతోంది. హిమానీ నదాల కరుగుదల మొదలుకుని జరగకూడని ప్రతికూల పరిణామాలన్నీ భయపెట్టే వేగంతో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అతి త్వరగా ఆ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా పెను కుదుపులకు లోనవడం ఖాయం’’ అని సహ అధ్యయనకర్త ప్రొఫెసర్ క్రిస్టీ ఎబి హెచ్చరించారు. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే... భూమి భద్రతకు సంబంధించి స్థూలంగా 8 రకాల సూచీలను కీలకంగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. వీటిలో మూడు కంటే ఎక్కువ సూచీలు ఆమోదిత పరిమితి దాటితే భూమికి ముప్పు తప్పదని భావిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా 7 సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేసి ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్టు ఎర్త్ కమిషన్ అధ్యయనం తేల్చడం అందరినీ భయపెడుతోంది... ఏం చేయాలి ► పర్యావరణపరంగా సురక్షిత స్థాయిని భూమి ఎప్పుడో దాటేసింది. రోజురోజుకూ మరింత ప్రమాదం దిశగా వెళ్తోంది. ► భూమిపై వాసయోగ్యతను నిర్ధారించే జీవ భౌతిక వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దే పని తక్షణం మొదలు పెట్టాలి. ► అప్పుడు బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి కీలక వనరుల లోటును భూమి తనంత తానుగా భర్తీ చేసుకోగలదు. ‘‘భూమికి గనక మనిషికి చేసినట్టే ఇప్పటికిప్పుడు వార్షిక హెల్త్ చెకప్ చేయిస్తే ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందంటూ రిపోర్టు వస్తుంది. కీలక అవయవాలన్నీ దాదాపుగా మూలకు పడుతున్నాయని తేలుతుంది’’ – క్రిస్టీ ఎబి, సహ అధ్యయనకర్త, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ‘‘భూ స్థిరత్వాన్ని ఆమోదనీయ స్థాయికి తీసుకొచ్చేందుకు దేశాలన్నీ కలసికట్టుగా తక్షణం ఓ భారీ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భూమి ఏమాత్రమూ ఆవాసయోగ్యం కాకుండా పోయేందుకు ఇంకెంతో కాలం పట్టదు!’’ – ప్రొఫెసర్ జొయీతా గుప్తా, అధ్యయనంలో కీలక భాగస్వామి డేంజర్ హాట్ స్పాట్స్కు నిలయాలు ► తూర్పు యూరప్ ► దక్షిణాసియా మధ్యప్రాచ్యం ► ఆగ్నేయాసియా ► ఆఫ్రికాలో పలు ప్రాంతాలు ► బ్రెజిల్లో చాలా ప్రాంతాలు ► అమెరికాలో పలు ప్రాంతాలు ► మెక్సికో చైనా కొసమెరుపు: సూచనల మాటెలా ఉన్నా కీలకమైన అన్ని మౌలిక సూచికలూ పూర్తిగా నేల చూపులు చూస్తున్నాయి. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వనరుల భర్తీ దేవుడెరుగు, భూమి తాలూకు వాసయోగ్యతకే, మరోలా చెప్పాలంటే జీవరాశుల ఉనికికే ఎసరొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నది సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్న మాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొమ్మలు, ఆకులు లేని చెట్టు.. లిక్విడ్ ట్రీ
చెట్లు అంటే.. పెద్ద కాండం, కొమ్మలు, ఆకులు ఉంటాయి. గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని, మనకు ఆక్సిజన్ను అందిస్తాయి. కానీ ఈ చెట్లకు కాండం, కొమ్మలు, ఆకులు వంటివేవీ ఉండవు. అయినా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి, ఆక్సిజన్ ఇస్తాయి. వీటిని ఎక్కడ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు. మరి ఏమిటా చెట్లు? వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా.. కాలుష్యానికి పరిష్కారంగా.. బొగ్గును కలపను మండించడం నుంచి వాహనాల పొగ దాకా వాతావరణం కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా చెట్లను పెంచడం దీనికి పరిష్కారమైతే.. అందుకు విరుద్ధంగా అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో యూరప్లో అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచిన సెర్బియా శాస్త్రవేత్తలు.. వాతావరణ కాలుష్యానికి పరిష్కారం చూపేలా ‘లిక్విడ్ ట్రీస్’ను రూపొందించారు. ఏమిటీ ‘లిక్విడ్ ట్రీస్’? నీళ్లు, ఒక రకం నాచు (మైక్రో ఆల్గే) నింపి, ప్రత్యేకమైన కాంతి వెలువర్చే విద్యుత్ దీపాలను అమర్చిన ట్యాంకులే ‘నీటి చెట్లు (లిక్విడ్ ట్రీస్)’. సాంకేతికంగా వీటిని బయో రియాక్టర్లు అని పిలుస్తారు.నీటిలోని నాచు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని.. విద్యుత్ బల్బు నుంచి వెలువడే కాంతి సాయంతో ఫొటో సింథసిస్ (కిరణజన్య సంయోగ క్రియ) జరుపుతుంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఈ నీటి చెట్ల ట్యాంకులకు ‘లిక్విడ్3’ అని పేరు పెట్టారు. పదేళ్ల వయసున్న రెండు పెద్ద చెట్లతో, లేదా 200 చదరపు మీటర్ల స్థలంలోని గడ్డి, మొక్కలతో సమానమైన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ను ‘లిక్విడ్ 3’ పీల్చుకుంటుందని దీనిని అభివృద్ధి చేసిన బెల్గ్రేడ్ యూనివర్సిటీ మల్టీడిసిప్లీనరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త ఇవాన్ స్పాసోజెవిక్ చెప్తున్నారు. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎలా తగ్గుతుంది? సాధారణంగా నీటిలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వివిధ శాతాల్లో కరిగి ఉంటాయి. ఏదైనా కారణంతో నీటిలో వాటి శాతం తగ్గిన ప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి నీటిలోకి చేరుతాయి. ‘లిక్విడ్ 3’లోని కార్బన్ డయాక్సైడ్ను నాచు పీల్చుకున్నప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలోకి చేరుతుంది. అంటే చుట్టూ ఉన్న గాలిలో కాలుష్యం తగ్గుతుంది. ఉదాహరణకు అక్వేరియంలలోని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను చేప పిల్లలు పీల్చుకుంటాయి. ఇలా నీటిలో తగ్గిపోయే ఆక్సిజన్ శాతాన్ని తిరిగి పెంచేందుకే గాలి బుడగలను వెలువర్చే పంపులను అమర్చుతుంటారు. అయితే ‘లిక్విడ్ 3’లో ఇలా కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంటుంది. బెంచ్గా.. చార్జర్గా.. సెర్బియాలోని బెల్గ్రేడ్లో మున్సిపాలిటీ ఆఫీసు ముందు మొట్టమొదటి ‘లిక్విడ్ 3’ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. దీనిని భూమి నుంచి కాస్త లోతుగా ఏర్పాటు చేయడం వల్ల కూర్చునే బెంచ్లా ఉపయోగపడుతుంది. పైన సోలార్ ప్యానల్తో నీడ అమర్చారు. ఆ ప్యానెల్ నుంచి వచ్చే విద్యుత్తోనే ట్యాంకులో బల్బు వెలుగుతుంది. మొబైల్ ఫోన్లు వంటివి చార్జింగ్ చేసుకునే సాకెట్ కూడా ఉంటుంది. ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రోగ్రాం (యూఎన్డీపీ)’ కింద ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 11 ఉత్తమ వినూత్న ఆవిష్కరణల్లో ‘లిక్విడ్ 3’ కూడా చోటు సాధించడం గమనార్హం. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
భూతాపం.. పర్యావరణంపై ప్రతాపం
భూ గ్రహం వేగంగా వేడెక్కుతోంది. మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. పర్యావరణ క్రియాశీలతలో పెనుమార్పులు తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అడవులు ధ్వంసం కావటం గ్లోబల్ వార్మింగ్ సంకేతాలను బలంగా వినిపిస్తోంది. భూమిపై కర్బన ఉద్గారాల్లో దాదాపు 15 శాతం అటవీ నిర్మూలన కారణంగానే వెలువడుతుండగా.. ఏటా 10 మిలియన్ హెక్టార్లలో ఉష్ణమండల అడవులు తరిగిపోతున్నాయి. దీనిని 2030 నాటికి అరికట్టకుంటే గ్లోబల్ వార్మింగ్ను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా పరిమితం చేయడం అసాధ్యమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, అమరావతి ఉష్ణ మండలంలో 2002 నుంచి 60 మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ అడవుల్ని కోల్పోయామని.. ఇది ఫ్రాన్స్ దేశ పరిమాణానికి సమానమని డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ఉష్ణ మండల అడవుల నరికివేతలో 80 శాతం కంటే ఎక్కువ వ్యవసాయం కోసం చేస్తున్నట్టు గుర్తించింది. 2021లోనే 11.0 మిలియన్ హెక్టార్లలో చెట్లు అంతరించిపోగా.. ఇందులో 3.75 మిలియన్ హెక్టార్లు ఉష్ణ మండల ప్రాథమిక వర్షారణ్యాల ధ్వంసం ఫలితంగా 2.5 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. ఇవి భారతదేశంలో వెలువడే వార్షిక శిలాజ ఇంధన ఉద్గారాలతో సమానంగా ఉండటం గమనార్హం. గ్రీన్హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. భూతాపం కట్టడి చేయకపోతే.. పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచంలో సగటున 1.15 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంటే.. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే పెరగకుండా కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఫలితంగా తీరప్రాంత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్హాగెన్, లండన్, లాస్ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది. మునుపటి శతాబ్దాల కంటే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. ఇది భూ తాపంపై 1.50 డిగ్రీల సెల్సియస్ కంటే పెరగకుండా ఉంచేందుకు అడవులను కాపాడాలని డబ్ల్యూఈఎఫ్ సూచిస్తోంది. ఇందుకు 100 బిలియన్ల డాలర్ల నుంచి 390 బిలియన్ల డాలర్ల వరకు ఖర్చవుతుందని భావిస్తోంది. ప్రపంచ జీడీపీలో సగాని కంటే ఎక్కువ.. అంటే దాదాపు 44 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక విలువ ప్రకృతిపై ఆధారపడి ఉంటుందని.. దాదాపు 1.60 బిలియన్ల మంది ప్రజలు ఆహారం, నీరు, కలప, ఉపాధి కోసం అడవులపై ఆధారపడుతున్నారని వెల్లడించింది. మన దేశంలో ఏటా గ్రీస్ దేశమంత అడవికి నష్టం 2021లో భారతదేశంలో వెలువడిన ఇంధన ఉద్గారాల కంటే వర్షారణ్యాల ధ్వంసం ద్వారా వచ్చిన కార్బన్డైఆౖMð్సడ్ ఎక్కువ ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఇక్కడ ఏటా జరిగే అటవీ నిర్మూలన శాతం గ్రీస్ దేశ పరిమాణానికి దగ్గరగా ఉందని వివరించింది. అటవీ నిర్మూలన, మానవ నివాసాల విస్తరణ, వ్యవసాయం, అడవుల్లో అధికంగా పశువులను మేపడం వంటి కారణాలతో మానవ, జంతువుల మధ్య దాడులకు దారి తీస్తున్నాయి. అడవులు తగ్గిపోతుండటంతో వన్యప్రాణులు తమ భూ భాగాలను కోల్పోతున్నాయి. ఆహారం, ఆశ్రయం లేకపోవడంతో పెద్దఎత్తున బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోని మూడు ప్రధాన పులుల అభయారణ్యాలలో చుట్టుపక్కల మానవ–జంతు సంఘర్షణ పెరిగినట్టు నివేదిక పేర్కొంది. -
వాన దంచికొడితే ఆగమాగమే! మరి 20 లక్షల ఏళ్లపాటు కురిస్తే.. ఏంటి పరిస్థితి?
వాన అంటే అందరికీ ఇష్టమే. అదీ రెండు, మూడు రోజులు పడితే ఓకే.. మరి వారం పాటు దంచికొడితే!? అమ్మో.. అంతా ఆగమాగమే అంటారు కదా! అదే కొన్నేళ్లపాటు వానలు పడితే.. అలా వేలు, లక్షల ఏళ్లపాటు కురుస్తూనే ఉంటే.. వామ్మో అనిపిస్తోందా? కానీ ఇది నిజమేనని, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అంత వాన ఎక్కడ పడింది? ఎందుకు పడింది? దాని వల్ల ఏం జరిగిందనే సంగతులు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమి పొరలను పరిశీలిస్తుండగా.. 1970వ దశకంలో కొందరు శాస్త్రవేత్తలు భూఉపరితలానికి సంబంధించి పరిశోధనలు చేస్తుండగా.. పురాతన రాళ్లలో అసాధారణమైన బూడిద రంగు పొరలను గమనించారు. అవి సిలికా (ఇసుక), మట్టితో ఏర్పడ్డాయని.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఇలా ఉన్నాయని గుర్తించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి.. సుమారు 23 కోట్ల ఏళ్ల కింద ఆ పొరలు ఏర్పడినట్టు తేల్చారు. అవి ఇసుక, మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురై ఏర్పడినట్టు నిర్ధారించారు. ఈ పొరల మందం, అవి మొదలై, ముగిసిన సమయాన్ని అంచనా వేసి.. సుమారు 20 లక్షల ఏళ్ల పాటు నిరంతరం వాన కురవడంతో అలా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా ఒకే ఖండంగా ఉన్నప్పుడు.. 23 కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే అతిపెద్ద ఖండం ‘పాంజియా’గా ఉండేది. అప్పటిదాకా వానలు తక్కువగా ఉండి.. వేడి వాతావరణం కొనసాగింది. ఆ సమయంలో గ్రహ శకలాలు ఢీకొనడం, భూమి పైపొరలోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలు తీవ్రమై అతిభారీ స్థాయిలో అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరిగాయి. వాతావరణంలోకి చేరిన పొగ, దుమ్ము, ధూళి వల్ల ఒక్కసారిగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. సముద్రాల్లో నీరు వేడెక్కి ఆవిరై.. గాలిలో ఆవిరి శాతం (హ్యూమిడిటీ) బాగా పెరిగింది. ఆ గాలులు ‘పాంజియా’ వైపు వీయడం, చల్లబడి వానలు కురవడం మొదలైంది. ఇదిలా 20 లక్షల ఏళ్లపాటు కొనసాగింది. ఈ పరిస్థితులు, తర్వాతి పరిణామాలకు ‘కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్’గా పేరుపెట్టారు. తొలుత నాశనం.. ఆ తర్వాత సృష్టి.. కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ మొదట్లో జీవరాశుల నాశనానికి దారి తీసింది. ఉష్ణోగ్రతలు, విషవాయువులు పెరగడంతో మొక్కలు, చెట్లు, జంతువులకు సమస్యగా మారింది. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన విషవాయువులు, దుమ్ము మేఘాల్లో కలిసి ఆమ్ల వర్షాలు (యాసిడ్ రెయిన్స్) కురిశాయి. అటు సముద్రాల్లో నీరు వేడెక్కడం, ఆమ్లత్వం పెరగడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో జలచరాలూ తగ్గిపోయాయి. మొత్తంగా దాదాపు 80శాతానికిపైగా జీవరాశి అంతరించినట్టు అంచనా. అయితే కార్నియన్ ఈవెంట్ చివరిదశకు వచ్చేప్పటికి ఖండాలు విడివడటం మొదలై.. అగ్ని పర్వతాల విస్ఫోటనాలు తగ్గిపోయాయి. భూమ్మీద వేడి తగ్గిపోయింది. వానలు ఒక క్రమానికి పరిమితమై.. జీవానికి అనుకూలమైన, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఇది మొక్కలు, జంతువులు సహా ఎన్నో కొత్త జీవరాశుల పునరుత్థానానికి దారితీసింది. డైనోసార్ల ఆధిపత్యానికి తోడ్పడి.. కార్నియన్ ఈవెంట్ మొదలయ్యే నాటికే డైనోసార్లు, పలు ఇతర జీవరాశుల ఎదుగుదల మొదలైంది. ఈవెంట్ నాటి పరిస్థితులను బాగా తట్టుకోగలిగిన డైనోసార్లు.. ఈవెంట్ తర్వాత బాగా ప్రయోజనం పొందాయి. వాటిలో ఎన్నో ఉప జాతులు ఉద్భవించి జీవరాశిపై ఆధిపత్యం చలాయించాయి. ఇదే సమయంలో జీవ పరిణామం బాగా వేగం పుంజుకుంది. తాబేళ్లు, మొసళ్లు, బల్లులు వంటివాటితోపాటు పాలిచ్చి పెంచే వివిధ రకాల జీవులు (మమ్మాల్స్) అభివృద్ధి చెందాయి. భూమ్మీద ఇప్పుడున్న జీవంలో చాలా వరకు ‘కార్నియన్ ఫ్లూవియల్ ఈవెంట్’ నాటి పరిస్థితులే తోడ్పడ్డాయని భూతత్త్వ, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త అలస్టేర్ రఫెల్, పురాతత్త్వ శాస్త్రవేత్తలు (పేలియోన్విరాన్మెంటిస్ట్స్) జకొపో డాల్ కోర్సో, పాల్ విగ్నల్ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలు ఇటీవల న్యూసైంటిస్ట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అక్కడ 20 లక్షల ఏళ్లుగా వానలే లేవు.. ఒకప్పుడు 20 లక్షల ఏళ్లు వాన పడితే.. అసలు గత20 లక్షల ఏళ్లుగా చుక్క వాన పడని ప్రాంత మూ ఒకటుంది తెలుసా.అంటార్కిటికాలో మెక్మర్డో డ్రైవ్యాలీగా పిలిచేచోట దాదాపు 20 లక్షల ఏళ్లుగా వాన, మంచు వంటివేవీ కురవలేదని శాస్త్రవేత్తలు గత ఏడాదే నిర్ధారించారు. అతి తక్కువ హ్యూమిడిటీ, డ్రైవ్యాలీకి చుట్టూ ఉన్న పెద్ద కొండలు, గాలులు వీచే దిశ వంటివి దీనికి కారణమని తేల్చారు. -
Global warming: సముద్ర జీవజాలానికి భూతాపం ముప్పు
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న శిలాజ ఇంధనాల వినియోగం.. తద్వారా నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం. వీటివల్ల భూగోళంపై మానవాళి మనుగడకు ముప్పు ముంచుకొస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం భూమిపై ఉన్న జీవజాలమే కాదు, సముద్రాల్లోని జీవులు సైతం అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా సైంటిస్టులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను ‘నేచర్’ పత్రికలో ప్రచురించారు. ► ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేది యథాతథంగా కొనసాగితే అంటార్కిటికాలో మంచు మరింత కరిగి, ఆ మంచినీరంతా సముద్రాల్లోకి చేరుతుంది. ► కొత్త నీటి రాకతో సముద్రాల ఉపరితల జలంలో లవణీయత, సాంద్రత తగ్గిపోతుంది. ఈ పరిణామం సముద్ర ఉపరితలం నుంచి అంతర్భాగంలోకి జల ప్రవాహాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా సముద్రాల్లో పైభాగం నుంచి లోపలి భాగంలోకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్భాగంలో కూడా ఒకచోటు నుంచి మరోచోటుకి జల ప్రవాహాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ► మంచు కరిగి, కొత్త నీరు వస్తే సముద్రాల పైభాగం నుంచి 4,000 మీటర్ల(4 కిలోమీటర్ల) దిగువన నీటి ప్రవాహాలు తొలుత నెమ్మదిస్తాయి. ఆ తర్వాత పూర్తిగా స్తంభించిపోతాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. ► నీటి ప్రవాహం స్తంభిస్తే సముద్రాల్లో లోతున ఉండే ప్రాణవాయువు(ఆక్సిజన్), ఇతర పోషకాలు సైతం అంతమైపోతాయని సైంటిస్టు ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లాండ్ చెప్పారు. దీంతో సముద్రాల్లోని జీవుల మనగడకు అవసరమైన వనరుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. వాటి మనుగడ ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఇదంతా మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని వారు వెల్లడించారు. ► సముద్రాల్లో జలమట్టం పెరిగితే ఉపరితలంపై కొత్త నీటి పొరలు ఏర్పడుతాయి. దానివల్ల సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను శోషించుకోలేవు. అంతేకాకుండా తమలోని కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సముద్రాల నుంచి కర్బన ఉద్గారాలు ఉధృతమవుతాయి. ఫలితంగా భూగోళం మరింత వేడెక్కుతుంది. ► అంటార్కిటికాలో ప్రతిఏటా 250 ట్రిలియన్ టన్నుల చల్లని, ఉప్పు, ఆక్సిజన్తో కూడిన నీరు చేరుతుంది. ఇది ఉత్తర దిశగా విస్తరిస్తుంది. హిందూ, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోకి ఆక్సిజన్ను చేరుస్తుంది. రానున్న రోజుల్లో అంటార్కిటికా నుంచి విస్తరించే ఆక్సిజన్ పరిమాణం తగ్గనుందని అంచనా వేస్తున్నారు. ► ప్రపంచ కర్బన ఉద్గారాలను సమర్థంగా నియంత్రించకపోతే రాబోయే 40 సంవత్సరాల్లో అంటార్కిటికాలోని సముద్రాల కింది భాగంలో జల ప్రవాహం ఆగిపోతుందని, సముద్ర జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే..
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల భూఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు. ఏమిటీ భూతాపం? శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్నన్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది. అధ్యయనంలో ఏం తేలిందంటే... ► మెరైన్ హీట్వేవ్స్గా పిలిచే సముద్రాల అంతర్భాగాల్లోని వేడి అలల తీవ్రత, వ్యవధి అధికంగా ఉంది. సముద్రాల లోపలి ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాల్లో 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగాయి. ► సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు భూతాపం కారణమని సైంటిస్టులు నిర్ధారించారు. ► హీట్వేవ్స్ ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ► సముద్రాల ఉపరితలంలో హీట్వేవ్స్పై గత పదేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని, అంతర్భాగంలోని వేడి అలలు, అక్కడి పరిణామాలు, జీవజాలం ప్రభావితం అవుతున్న తీరు గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్ఓఏఏ రీసెర్చ్ సైంటిస్టు దిల్లాన్ అమామా చెప్పారు. ► సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల నుంచి భారీ పరిమాణంలోని వేల్స్ దాకా అన్ని రకాల జీవులు హీట్వేవ్స్ వల్ల ప్రభావితమవుతున్నాయి. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సముద్ర జీవుల వలసలు ఆగిపోతున్నాయి. వాటిలో పునరుత్పాదక శక్తి దెబ్బతింటోంది. వివిధ జీవుల మధ్య అనుసంధానం తెగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క. ► భూతాపం వల్ల నీరు ఇలాగే వేడెక్కడం కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సముద్రాల్లోని పగడపు దీవులన్నీ అంతరించిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది. ► సముద్రాల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే 70–90 శాతం, 2 డిగ్రీలు పెరిగితే పూర్తిగా పగడపు దీవులు మాయమవుతాయని యునెస్కో పేర్కొంది. సముద్రాలే రక్షణ ఛత్రం భూతాపం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత లో 90% మిగులు వేడిని సముద్రాలే శోషించుకుంటాయి. భూమిని చల్లబరుస్తాయి. సముద్రాలే లేకుంటే భూమి అగ్నిగుండం అయ్యేది. సాగరాల ఉష్ణోగ్రత గత శతాబ్ద కాలంలో సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మెరైన్ హీట్వేవ్స్ గత పదేళ్లలో 50% పెరిగాయి. భూతాపం పెరుగుదలను అడ్డుకోకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయం. ఫలితంగా భూమి అగ్నిగోళంగా మారుతుంది మానవులతో సహా జీవుల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంటార్కిటికా కరిగిపోతోంది!
పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటి దెబ్బకు హిమ ఖండమైన అంటార్కిటికాలోనే మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది! ఈ పరిణామంపై పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెను విపత్తులను చేజేతులా ఆహ్వనించినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు! అంటార్కిటికాలో సముద్రపు మంచు పరిమాణం ఫిబ్రవరి 25న ఏకంగా 17.9 లక్షల చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అక్కడి తేలియాడే మంచు పరిమాణాన్ని ఉపగ్రహ పరిశీలనల సాయంతో ఎప్పటికప్పుడు కచ్చితంగా లెక్కించడం మొదలు పెట్టిన గత 40 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇదే! ఇలా అంటార్కిటికాలో మంచు పరిమాణం అత్యల్ప స్థాయిలకు పడిపోవడం గత ఆరేళ్లలోనే ఏకంగా ఇది మూడోసారి కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో అది 19.2 లక్షల చదరపు కి.మీ.గా తేలింది. 1979లో ఉపగ్రహ ఆధారిత గణన మొదలైన నాటినుంచీ అదే అత్యల్పం! ఈ రికార్డు గత ఫిబ్రవరిలో బద్దలై మంచు పరిమాణం 17.9 లక్షల చదరపు కి.మీ.గా నమోదైంది. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 1.36 లక్షల చదరపు కి.మీ. మేరకు తగ్గిందన్నమాట! ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఇదిప్పుడు ఎంతగానో కలవరపరుస్తోంది. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా మంచు పరిమాణం బాగా తగ్గిపోతోందంటూ ఆ్రస్టేలియాలోని టాస్మేనియా యూనివర్సిటీలో అంటార్కిటికా ఖండపు మంచుపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్ విల్ హాబ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖండపు పశ్చిమ భాగంలో గతేడాది మంచు ఊహాతీతంగా కరిగిపోయిందని, ఆ నష్టం నుంచి ఆ ప్రాంతాలింకా తేరుకోనే లేదని చెప్పారాయన. ‘‘నిజానికి సముద్రపు మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువ. కనుక సూర్యరశ్మి కి పెద్దగా కరగదు. కానీ దాని వెనకాల నీరు చేరితే మాత్రం కిందనుంచి కరుగుతూ వస్తుంది. ఇప్పుడదే జరుగుతోంది’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ తీరాలన్నీ మునకే! ♦ అంటార్కిటికా మహాసముద్రంలో ఉండే అపార హిమ రాశి తీరానికి కాస్త సమీపంలో ఉండే మంచుపై తుఫాను గాలుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. ఆ హిమ రాశి ప్రస్తుత వేగంతో కరిగిపోతూ ఉంటే అలల తాకిడి వేగం బాగా పెరుగుతుంది. దాంతో సముద్రంలో తీరానికి సమీపంలో ఉన్న మంచూ క్రమంగా బలహీనపడి కరుగుతుంది. తర్వాత ఆ ఖండంలో నేలపై ఉన్న అపారమైన మంచుకు, హిమానీ నదులకు స్థిరత్వమిచ్చే ఈ ఆసరా శాశ్వతంగా కనుమరుగవుతుంది. ♦ పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్, బెలింగ్హసన్ సముద్రాల్లో మంచు ఊహాతీత వేగంతో కరగడం శాస్త్రవేత్తలను మరీ కలవరపెడుతోంది. అంటార్కిటికాలో సగటు మంచు పరిమాణం 2014 దాకా ఎంతో కొంత పెరిగిన సమయంలో కూడా ఈ సముద్రాల్లో మంచు కరుగుతూనే వచ్చింది! ♦ పశ్చిమ అంటార్కిటికాలోనే ఉన్న త్వాయిట్స్ హిమానీ నదం కూడా క్రమంగా కరుగుతోంది. కేవలం ఇదొక్కటి గనక పూర్తిగా కరిగిందంటే సముద్ర మట్టాలు ఏకంగా అర మీటరు పెరుగుతాయి! అందుకే దీన్ని ‘డూమ్స్డే గ్లేసియర్’గా పిలుస్తారు! ♦ గత ఫిబ్రవరిలో తొలిసారిగా అంటార్కిటికా ఖండపు తీర రేఖలో ఏకంగా మూడింట రెండు వంతులు ఏ మాత్రం మంచు లేకుండా సముద్రపు జలాలతో బోసిపోయి కనిపించిందట! ♦అంటార్కిటికా సముద్రంలోని అపారమైన మంచు ఇలా కరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు మీటర్ల మేరకు పెరుగుతాయి! ♦ దాంతో తీర ప్రాంతాలన్నీ ముంపు బారిన పడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా నగరాలెన్నో ఈ జాబితాలోకి వస్తాయి! అది కోట్లాది మందిని నిర్వాసితులను చేసి ఊహించని పెను విషాదానికి దారి తీస్తుంది. మున్ముందు మరింత ముప్పే! సమీప భవిష్యత్తులో అంటార్కిటికాలో మంచు కరిగే వేగం తగ్గే సూచనలేవీ పెద్దగా లేవని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అంటార్కిటికాపై కొన్నేళ్లుగా చాలా పడుతోంది. కనుక సముద్రపు మంచు కరిగే వేగానికి ఇప్పుడప్పట్లో అడ్డుకట్ట పడుతుందని భావించడం అత్యాశే’’ అని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్వేల్స్కు చెందిన ఓషనోగ్రాఫర్, వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మాథ్యూ ఇంగ్లండ్ కుండబద్దలు కొట్టారు. అక్కడి మంచు ఈ స్థాయిలో కరగడం కచ్చితంగా పెను ప్రమాద సూచికేనని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు అంటార్కిటికా సముద్రంలోని మంచు ఈ స్థాయిలో కరిగిపోతుండటం వెనక గ్లోబల్ వారి్మంగ్తో పాటు ఇంకేమేం కారణాలున్నాయో వెదికి వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు. కోల్కతా, చెన్నైలకు ముంపు ముప్పు.. సముద్ర మట్టాల పెంపు వల్ల ముప్పు ముంపున్న మహా నగరాల జాబితాలో కోల్కతా, చెన్నై ముందున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరుగుతూ ఉంటే 2100 నాటికి ఆ రెండు నగరాల్లో సముద్ర మట్టాలు 20 నుంచి 30 శాతం దాకా పెరిగే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆసియాలో యాంగూన్, బ్యాంకాక్, హోచిమిన్ సిటీ, మనీలా కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ♦ సముద్ర ప్రవాహాల్లో మార్పుల వల్ల సముద్ర మట్టాల్లో పెరుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. వీటితో పాటు ఎల్ నినో తదితరాల ప్రభావాలను కూడా అధ్యయనం చేసి న మీదట ఈ నివేదికను రూపొందించారు. విశేషాలు... ♦ సముద్ర మట్టాల్లో పెరుగుదల కేవలం వాతావరణ మార్పులతో పోలిస్తే అంతర్గత వాతావరణ మార్పులూ తోడైనప్పుడు మరో 20, 30 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఎక్కువగా ఉంటుంది! ♦ అమెరికా పశ్చిమ తీరంతో పాటు ఆ్రస్టేలియాకు కూడా ఈ ముంపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ♦ దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కోల్కతా, ముంబై తీర ప్రాంతాల్లో వరదలు 2006తో పోలిస్తే 2100 నాటికి కనీసం 18 రెట్ల నుంచి ఏకంగా 96 రెట్ల దాకా పెరిగే ఆస్కారముంది. -
Indian Republic Day 2023: చర్చలకు చక్కని వేదిక
న్యూఢిల్లీ: పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పు వంటి కీలక అంశాలపై చర్చకు, వాటి పరిష్కారానికి జీ20 సదస్సు సరైన వేదిక అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే... ► దశాబ్దాలుగా పలు పథకాల ద్వారా భారత దేశం సాధించిన సర్వతోముఖాభివృద్ధి, పౌరుల సృజనాత్మక ఆవిష్కరణల ఫలితంగా నేడు ప్రపంచం భారత్కు సమున్నత గౌరవం ఇస్తోంది. ► పలు దేశాల కూటములు, ప్రపంచ వేదికలపై మన జోక్యం తర్వాత దేశం పట్ల సానుకూలత పెరిగింది. ఫలితంగా దేశానికి అపార అవకాశాలు, నూతన బాధ్యతలు దక్కాయి. ► ఈ ఏడాదికి జీ20 కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా మెరుగైన ప్రపంచం, భవ్య భవిష్యత్తుకు బాటలు పరిచేందుకు భారత్కు సువర్ణావకాశం దొరికింది. భారత నాయకత్వంలో ప్రపంచం మరింత సుస్థిరాభివృద్ధి సాధించగలదని గట్టిగా నమ్ముతున్నా. ► ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ20 దేశాల్లోనే ఉంది. ప్రపంచ జీడీపీకి 85 శాతం ఈ దేశాలే సమకూరుస్తున్నాయి. భూతాపం, పర్యావరణ పెను మార్పులుసహా పుడమి ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలకు, పరిష్కారానికి జీ20 చక్కని వేదిక. ► దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడాల్సిన తరుణమొచ్చింది. సౌర, ఎలక్ట్రిక్ విద్యుత్ సంబంధ విధాన నిర్ణయాలు అమలుచేస్తూ ఈ దిశగా వివిధ దేశాలకు భారత్ నాయకత్వ లక్షణాలను కనబరుస్తోంది. ఈ క్రమంలో సాంకేతికత బదిలీ, ఆర్థిక దన్నుతో సంపన్న దేశాలు ఆపన్న హస్తం అందించాలి. ► వివక్షాపూరిత పారిశ్రామికీకరణ విపత్తులను తెస్తుందని గాంధీజీ ఏనాడో చెప్పారు. సాంప్రదాయక జీవన విధానాల్లోని శాస్త్రీయతను అర్థంచేసుకుని పర్యావరణ అనుకూల అభివృద్దిని సాధించాలి. ► రాజ్యాంగ నిర్మాతలు చూపిన మార్గనిర్దేశక పథంలోని మనం బాధ్యతాయుతంగా నడవాలి. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన డాక్టర్ అంబేడ్కర్కు మనం సదా రుణపడి ఉండాలి. ఆ కమిటీలో 15 మంది మహిళలుసహా అన్ని మతాలు, వర్గాల వారికీ ప్రాధాన్యత దక్కడం విశేషం. ► దేశంలో నవతరం విడివిడిగా, ఐక్యంగానూ తమ పూర్తి శక్తిసామర్థ్యాలను సంతరించుకునే వాతావరణం ఉండాలి. దీనికి విద్యే అసలైన పునాది. 21వ శతాబ్ది సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) రూపొందించారు. విద్యా బోధనలో సాంకేతికతను లోతుగా, విస్తృతంగా వినియోగించాలని ఎన్ఈపీ స్పష్టంచేస్తోంది. -
పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు?
దేవభూమి ఉత్తరాఖండ్లోని జోషి మఠ్లో కాళ్లకింది నేల ఉన్నపళంగా కుంగిపోతున్న తీరు పర్యావరణపరంగా మానవాళి ముందున్న పెను ముప్పును కళ్లకు కట్టింది. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. జోషి మఠ్ సమస్యకు కారణమైన అడవుల విచ్చలవిడి నరికివేత, పెచ్చరిల్లిన వాతావరణ కాలుష్యం వంటివి ప్రపంచమంతటినీ వేధిస్తున్న సమస్యలే. వాటి పర్యవసానాలను గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వరదలు, తీవ్ర కరువుల రూపంలో అన్ని దేశాలూ చవిచూస్తూనే ఉన్నాయి. ఈ ప్రాకృతిక విపత్తుల తీవ్రత కొన్నేళ్లుగా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ మనిషి అత్యాశకు ప్రకృతి ప్రతిస్పందన తాలూకు సంకేతాలే. వాటిని ఇప్పటికైనా అర్థం చేసుకుని తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘లేదంటే అతి త్వరలో పరిస్థితి పూర్తిగా చేయి దాటడం ఖాయం. ఇప్పుడు జోషి మఠ్లో జరుగుతున్నది రేపు అన్నిచోట్లా జరుగుతుంది. ప్రకృతితో ఇష్టారాజ్యపు చెలగాటం అంతిమంగా వినాశనానికే దారి తీస్తుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ తదితరాల వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొన్నేళ్లుగా వేగవంతమవుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు క్రమంగా నీట మునుగుతాయి. మానవాళిపై పెను ప్రభావం చూపగల పరిణామమిది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో పదో వంతుకు పైగా సముద్ర తీర ప్రాంతాల్లోనే వ్యాపించి ఉంది. మహా నగరాల్లో కూడా అధిక శాతం అక్కడే ఉన్నాయి. అవన్నీ మునగడమో, పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోవడమో జరుగుతుంది. ఫలితంగా కోట్లాది మంది పొట్ట చేత పట్టుకుని వలస బాట పడతారు. వారందరికీ పునరావాసం, ఉపాధి తదితరాలన్నీ అతి పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి. మానవాళి చరిత్రలో ఇది పెను విపత్తుగా మారినా ఆశ్చర్యం లేదు. అంతేగాక మితిమీరిన కాలుష్యం ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తోంది. సురక్షితమైన తాగునీటికి చాలా దేశాల్లో ఇప్పటికే తీవ్ర కొరత ఏర్పడింది. మున్ముందు ఇది మరింత తీవ్రతరం కానుంది. ప్రజలు సరైన తిండికి, తాగునీటికే కాదు, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలికి కూడా నోచుకోని పరిస్థితి తలెత్తనుంది! మాటలకే పరిమితం పర్యావరణ నష్టాలకు అడ్డుకట్టే వేసేందుకు చారిత్రక పారిస్ ఒప్పందం మొదలుకుని పలు కాప్ శిఖరాగ్రాల దాకా పేరుకు ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. కానీ చిత్తశుద్ధితో కూడిన చర్యలు మాత్రం కన్పించడం లేదు. కర్బన ఉద్గారాల తగ్గింపు తదితరాలకు సంబంధించి గొప్ప లక్ష్యాలు నిర్ణయించుకోవడం, తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా సాగుతోంది. ఎవరికి వారు పొరుగు దేశమే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎటు చూసినా విపత్తులే... ► మంచు ఖండమైన అంటార్కిటికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా కరుగుతున్నాయి. దీని దుష్ప్రభావం పర్యావరణంపై చాలా రకాలుగా ఉండబోతోంది. ► ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా ముందుగా ఇంగ్లండ్ తదితర యూరప్ దేశాలు అతి శీతల వాతావరణంతో అల్లాడాయి. తర్వాత అమెరికా దాని దెబ్బకు 10 రోజులకు పైగా దాదాపుగా స్తంభించిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, మంచు తుఫాన్లతో అల్లాడింది. వేల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం చవిచూసింది. ► అమెరికాలో ఇటీవలి దాకా కార్చిచ్చులతో అల్లాడిన కాలిఫోర్నియా ఇప్పుడేమో కనీవినీ ఎరగని వరద బీభత్సంతో తల్లడిల్లుతోంది. ► ఉత్తర భారతం కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి చలితో వణుకుతోంది. ► పొరుగు దేశం పాకిస్తాన్ గతేడాది దేశ చరిత్రలో ఎన్నడూ చూడనంతటి వరదలతో అతలాకుతలమైంది. మూడొంతుల ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ ప్రభావం నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏటా 10 సెం.మీ. కుంగిన జోషీ మఠ్! జోషి మఠ్లో నేల 2018 నుంచి ఏటా 10 సెంటీమీటర్ల చొప్పున కుంగుతూ వస్తోందట! అధునాతన శాటిలైట్ ఇమేజ్ విశ్లేషణ ఆధారంగా జరిగిన ఒక తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
80 శాతం గ్లేసియర్లు... 80 ఏళ్లలో మాయం!
వాషింగ్టన్: భూ గోళానికి పెను ముప్పు అనుకున్న దానికంటే ముందుగానే ముంచుకొస్తుందా? హిమానీ నదాలపై తాజా అధ్యయనం ఫలితాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ శతాబ్దాంతానికి భూమిపై ఉన్న ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు, అంటే ఏకంగా 80 శాతం నామరూపాల్లేకుండా పోతాయని సదరు అధ్యయనం తేల్చింది! గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు బాగా ఫలించినా 2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం హిమానీ సంపద హరించుకుపోతుందని అంచనా వేసింది. ‘‘సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే పక్షంలో మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాల్లోని చిన్నపాటి హిమానీ నదాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. 3 డిగ్రీలు పెరిగితే మొత్తానికే మటుమాయమవుతాయి’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రౌన్స్ చెప్పారు. ‘‘కర్బన ఉద్గారాలకు ఇప్పటికిప్పుడు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగినా పెద్దగా లాభముండదు. ఇప్పటిదాకా వెలువడ్డ ఉద్గారాలు తదితరాలు హిమానీ నదాలపై చూపే దుష్ప్రభావాన్ని అడ్డుకోలేం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అన్నారు. -
ప్రమాదకరంగా పైపైకి.. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
వాతావరణ మార్పులు, తద్వారా నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని నానాటికీ ప్రమాదపుటంచులకు నెడుతున్నాయి. వీటి దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకుని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవినీ ఎరగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడి గాలుల వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్ బ్లాస్ట్ దెబ్బకు ఇంగ్లండ్తో పాటు పలు యూరప్ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగనంతటి చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ ‘శతాబ్ది మంచు తుపాను’గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది. 2023లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటినుంచే హెచ్చరిస్తుండటం మరింత కలవరపెడుతోంది. వీటికి తోడు మరో పెను సమస్య చడీచప్పుడూ లేకుండా ప్రపంచంపైకి వచ్చిపడుతోంది. అదే... సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల! ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదిప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది! 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు! సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యదరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్లోని కోస్టా డెల్సోల్తో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘మధ్యదరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఎజియన్, లెవంటైన్ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంటుండటం మరింత ప్రమాదకర పరిణామం’’ అని వారు వెల్లడించారు! తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తదితరాలను లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచీ మధ్యదరా సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతోందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్ అర్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్ తాజాగా ప్రచురితమయ్యాయి. అతి సున్నిత ప్రాంతం నిజానికి మధ్యదరా ప్రాంతం వాతావరణ మార్పులపరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వరదలు, క్రమక్షయం వంటివాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఏకంగా 86 శాతం దాకా లుప్తమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకరణ పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యదరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్రమట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్లాండ్ బేసిన్లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దానివల్ల అపారమైన పరిమాణంలో నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని వివరించింది. అంతేకాదు, గ్రీన్లాండ్ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది. పెను ప్రమాదమే...! సముద్ర మట్టాలు పెరిగితే సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు... ► తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి ► చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతాయి ► షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతి పెద్ద నగరాలు నీట మునుగుతాయి ► వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు. ► ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది ► సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి ► వాటిలో నివసించే పలు జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదముంది ► నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణమూ తగ్గుతుంది ► భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్ల వంటివి పరిపాటిగా మారతాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా?
మాస్కో: ప్రమాదకరమైన జాంబీ వైరస్. రష్యాలో అతి శీతల ప్రాంతమైన సైబీరియాలోని ఓ సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల నడుమ గడ్డకట్టిన స్థితిలో నిద్రాణంగా పడి ఉంది. దాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే లక్షణమున్న ఈ వైరస్ కరోనాను మించిన పెను ఆరోగ్య విపత్తుకు దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇలాంటి దాదాపు రెండు డజన్ల పురాతన వైరస్లను శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నిత్యం సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో కూడా మంచు పలకలు వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. దాంతో ఇంతకాలంగా వాటి కింద నిద్రాణంగా ఉన్న ఇలాంటి ప్రమాదకర వైరస్లెన్నో ఒళ్లు విరుచుకుని మానవాళిపైకి వచ్చి పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందమే 2013లో ఇలాగే 30 వేల ఏళ్ల నాటి వైరస్లను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ పండోరా వైరస్ ఎడొమాగా పేర్కొనే జాంబీ వైరస్ను కనిపెట్టిందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. -
Tuvalu: ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశం.. ఉనికి మాటేమిటి?!
తాజాగా ఈజిప్టులో ముగిసిన కాప్ 27 సదస్సు మరోసారి ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాలపై చర్చకు వేదిక అయ్యింది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో జరిగిన ఈ సమావేశం చివరకు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోగలిగినందుకు సంతోషించాల్సిందే. పర్యావరణ మార్పుల వల్ల నష్టపోతున్న బడుగు దేశాలను ఆదుకోవడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఈ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. వాస్తవంగా ప్రపంచం పర్యావరణ ప్రమాదం బారిన పడటానికి ప్రధాన కారణం కాలుష్య కారకాలుగా మారిన ఈ అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలే. గ్రీస్హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవాల్సిన బాధ్యత ఈ దేశాల పైనే ఉంటుంది. అది ఒక చర్చనీయాంశం. ఈ సమావేశం సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం ‘టువాలు’. ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలో జరిగిన కాప్ 27 సమావేశంలో టువాలు ప్రపంచం ముందు ఒక సవాలుగా నిలబడింది. ప్రపంచ బాధ్యతను గుర్తు చేసింది. వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన అంశమే. ఈ పెరుగుదల ఇలానే కొనసాగితే మరో 60, 70 ఏళ్ళల్లో ఈ ద్వీప దేశం జల సమాధి కాకుండా ఎవరూ ఆపలేరు. టువాలు మొత్తం 9 ద్వీపాల సమూహం. హవాయి, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒకదాని వెంట ఒకటిగా చిన్న చిన్న దీవులు బారులు తీరి ఉంటాయి. దేశం మొత్తం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే సుమారు 6400 ఎకరాలు. 2022 జనాభా అంచనా ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 11 వేల 200. బ్రిటన్ నుండి 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి హైదరాబాద్ నగరం 542 మీటర్ల ఎత్తున ఉంటే... సముద్రం ఒడ్డునే ఉన్న విశాఖపట్నం 45 మీటర్ల ఎత్తున ఉంది. దీన్ని బట్టి టువాలు పరిస్థితిని అంచనా వేయవచ్చు. సముద్ర మట్టానికి ఇంకా తక్కువలో ఉన్న మరో ద్వీప దేశం మాల్దీవులు. సముద్ర మట్టాలు పెరుగుతున్న కొద్దీ ఈ దేశాల ఉనికి ప్రమాదం దిశగా పయనిస్తున్నట్లే. టువాలు కంటే ఆర్థికంగా కాస్త బలమైన మాల్దీవులు తమ దేశాన్ని కాపాడు కోవటానికి తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. 20 వేల మంది జనాభాకు కృత్రిమంగా నిర్మిస్తున్న ఫ్లోటింగ్ సిటీ ఆవాసంగా మారనుంది. ఇటువంటి ఏర్పాట్లు చేసుకునే స్థోమత టువాలుకి లేదు. అందుకే అది తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, భౌగోళిక స్వరూపం, రోడ్లు, నిర్మాణాలు.. మొత్తంగా తన అస్తిత్వాన్ని భద్ర పరుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. తమ దేశాన్ని వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికత ఉపయోగించి ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశంగా అయినా మార్చాలనే సంకల్పంతో ఉంది. ఇక్కడే కొన్ని కీలకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ దేశంలోని జనాభాకు భౌతికంగా భూ మండలంపై ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది అనేది పెద్ద ప్రశ్న. పోనీ ఏదో ఒక దేశం స్వాగతించినా వీరు ఆ దేశానికి వలసదారులు, లేదంటే ఆ దేశ పౌరులు అనే హోదాను మాత్రమే పొందగలుగుతారు. మరి టువాలు సార్వభౌమత్వం సంగతి ఏంటి? స్వయం పాలనకు అవకాశం కోల్పోవటమేనా? దేశం సముద్రంలో మునిగిపోతే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇప్పుడు ఉన్న హక్కులు, మెరైన్ సరిహద్దు పరిధిలో ఉండే సహజ వనరులను కోల్పోక తప్పదా? భౌతికంగా కనిపించని టువాలును ఐక్యరాజ్యసమితి ఒక దేశంగా గుర్తించే అవకాశం ఉంటుందా? టువాలు ఇవాళ ప్రపంచం ముందు ఒక ప్రశ్నగా నిలబడి ఉంది. (క్లిక్ చేయండి: ముందు నుయ్యి... వెనుక గొయ్యి) - రెహాన సీనియర్ జర్నలిస్ట్ -
ఆక్సిజన్ అంతమైన వేళ...
టొరంటో: దాదాపు 50 కోట్ల ఏళ్ల క్రితం. భూమిపై ఆక్సిజన్ ఉన్నట్టుండి ఎవరో పీల్చేసినట్టుగా సంపూర్ణంగా ఆవిరైపోయింది. దాంతో చాలా జీవరాశులూ ఉన్నపళంగా కళ్లు తేలేశాయి. ఉనికినే కోల్పోయాయి. భూగోళంపై తొలి జీవ వినాశనం జరిగిన తీరు ఇదేనని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. భూమిపై తొలి జీవ వినాశనం జరిగిన తీరును అర్థం చేసుకునేందుకు, ఫలితంగా పూర్తిగా నశించిపోయిన జీవరాశులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు పరిశోధకులు శిలాజ ముద్రలను అధ్యయనం చేశారు. ఆ వినాశనమే చాలా జంతు జాతులు ఇప్పుడున్న రూపాల్లో వికసించేందుకు పురిగొల్పి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఆక్సిజన్ ఏమైపోయింది? ఇందుకు ఫలానా సంఘటనే కారణమని కచ్చితంగా చెప్పలేకపోయినా, అది అప్పట్లో జరిగిన అనేకానేక పరిణామాల ఫలస్వరూపం అయ్యుండొచ్చన్నది పరిశోధక బృందం అభిప్రాయం. ‘‘అగ్నిపర్వతాల పేలుడు, భూ ఫలకాల్లో భారీ కదలికలు, గ్రహశకలాలు ఢీకొనడం వంటివాటి వల్ల భూమిపై ఆక్సిజన్ బాగా తగ్గిపోవడమో, లుప్తం కావడమో జరిగి ఉంటుంది’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ సైన్స్కు చెందిన పరిశోధకుడు స్కాట్ ఇవాన్స్ అభిప్రాయపడ్డారు. ‘‘గ్లోబల్ వార్మంగ్ వంటివి ఆక్సిజన్ స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే మరో సామూహిక జీవ హననం దగ్గర్లోనే ఉంది’’ అని హెచ్చరించారు. -
COP27: 2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి
న్యూఢిల్లీ: పారిశ్రామిక విప్లవం (1850–1900) కంటే ముందునాటి సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండనుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఫలితంగా 2015 నుంచి 2022 దాకా.. ఎనిమిదేళ్లు ‘అత్యంత వేడి’ సంవత్సరాలుగా రికార్డుకెక్కుతాయని తెలియజేసింది. ఈజిప్ట్లో జరుగుతున్న కాప్–27 సదస్సు సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 1993 నుంచి ఇప్పటిదాకా సముద్ర నీటి మట్టం రేటు రెండింతలు పెరిగిందని వెల్లడించింది. 2022 సంవత్సరం ఐదు లేదా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులో చేరుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది. -
IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చిపడుతున్న అకాల వరదలు, కరువులతో దేశాలకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అపార ఆస్తి, ప్రాణ నష్టాలతో అల్లాడుతున్నాయి.æ అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతాయని, వాటి తీవ్రత కూడా గతం కంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పుల ప్యానల్ (ఐపీసీసీ) వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► వారాంతపు వరదలతో ఆస్ట్రేలియా అల్లాడింది. దేశంలో చాలాచోట్ల ఇంకా కుండపోత కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల పాటు అతి తీవ్ర వర్షాలు తప్పవంటూ వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ► మధ్య ఆఫ్రికా దేశమైన చాద్ రిపబ్లిక్ది విచిత్ర పరిస్థితి. నిన్నామొన్నటిదాకా దుర్భరమైన కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ఇప్పుడేమో గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ► థాయ్లాండ్ను కూడా నెల రోజులుగా భారీ వరదలు ఊపిరి సలపనివ్వడం లేదు. 77 రాష్ట్రాలకు గాను ఏకంగా 59 రాష్ట్రాలు వరద బారిన పడ్డాయి. 4.5 లక్షల ఇళ్లు దెబ్బ తినడమో కూలిపోవడమో జరిగింది. 40 శాతం ప్రాంతాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. తాజాగా సోమవారం 8 దక్షిణాది రాష్ట్రాలకు భారీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి! ► ఫిలిప్పీన్స్దీ ఇదే పరిస్థితి. తుఫాను కారణంగా వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ► భారీ వరదలతో మెక్సికో తీరం అల్లాడుతోంది. ► భారత్లోనూ తుఫాన్ల దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు అల్లాడిపోయాయి. హైదరాబాద్నైతే కొన్ని వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కారణాలెన్నో...! గ్లోబల్ వార్మింగ్ మొదలుకుని మితిమీరిపోయిన శిలాజ ఇంధన వాడకం దాకా తాజా వాతావరణ మార్పులకు కారణాలెన్నో! ప్రధాన కాలుష్య కారణమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు 90 శాతం దాకా శిలాజ ఇంధనమే కారణమవుతోంది. అడవుల విచ్చలవిడి నరికివేత, అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న పెట్రో ఉత్పత్తుల వెలికితీత వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు మరో పదేళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగితే ఆశ్చర్యం లేదని ఐపీసీసీ సర్వే హెచ్చరించింది! ‘‘ఇప్పటికైతే వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, భారీ వరదలకు కారణంగా మారుతున్నాయి. వర్షపాతపు తీరుతెన్నులను కూడా అవి చాలావరకు మార్చేస్తున్నాయి’’ అని వివరించింది. నైజీరియాలో వరదలు.. 600కు చేరిన మరణాలు అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఈ సీజన్లో ఆగస్ట్ నుంచి సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 603 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవనదులు విలవిల
అమెరికాతో సహా యూరప్, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. పారిశ్రామిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది. 230 కోట్ల మందికి నీటి కొరత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, అమెరికా, ఇరాక్ వంటి దేశాల్లో నిత్యం నిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా దేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరత కాస్తా ఈ కరువు దెబ్బకు రెట్టింపైంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటి కొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదికచెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్లో 47 శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకున్నాయని గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది. బయట పడుతున్న చారిత్రక అవశేషాలు మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొలరాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్లో బార్సెలోనా సమీపంలోని రిజర్వాయర్లో నీరు ఆవిరవడంతో 9వ శతాబ్దానికి చెందిన చర్చి బయట పడింది. మాడ్రిడ్లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్లోనే కాసెరస్ ప్రావిన్స్లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్లో టైగ్రిస్ నది ఎండిన చోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్, నాటి నగరం బయట పడ్డాయి. నదులన్నింటా కన్నీళ్లే... ► జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది. ► 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్లసముద్రంలోకలిసే ఈ నది ఎన్నోచోట్ల ఎండిపోయింది. ► రెయిన్, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా 8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల) విలువైన సరుకు రవాణా జరుగుతుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంతకాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు. ► ఆల్ఫ్స్ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది. ► ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడింది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు. ► ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ వైన్ తయారీకి ఆధారమైన లోయెర్ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు. ► యూరప్లో 10 దేశాల గుండా పారే అతి పొడవైన నది డాన్యూబ్ కూడా చిక్కిపోతోంది. ► అమెరికాలో డెన్వర్ నుంచి లాస్ఏంజెలెస్ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి! ► 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది. ► నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సి చువాన్ ప్రావిన్స్కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడ చూసినా నీరు అడుగంటి నదీగర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే!
వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. పాకిస్తాన్లో వరద బీభత్సం, చైనాలో కరువు కాటకాలు, భారత్లో కనీవినీ ఎరుగని వాతావరణ మార్పులు... వీటన్నింటికీ అదే కారణమని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హిమాచల్ ప్రదేశ్లోని చోటా షిగ్రి హిమానీ నదాన్ని వారు కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు వెల్లడైంది. గత జూన్లో ఏర్పాటు చేసిన డిశ్చార్జ్ మెజరింగ్ వ్యవస్థ ఆగస్టుకల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇండోర్ ఐఐటీ గ్లేసియాలజిస్ట్ మహమ్మద్ ఫరూక్ ఆజం చెప్పారు. ‘‘గత మార్చి, ఏప్రిల్లో మన దేశంలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. హిమానీ నదాలు కరిగిపోవడమే అందుకు కారణం. గత వారం మా బృందమంతా షిగ్రి దగ్గరే ఉండి పరీక్షించాం. మంచు భారీగా కరిగిపోతోంది’’ అంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అరేబియా సముద్రంలో అత్యధిక వేడిమి కారణంగా నీరంతా ఆవిరి మేఘాలుగా మారి ఎడతెరిపి లేకుండా వానలు కురిసి లానినో ప్రభావం ఏర్పడింది. దాంతో వాతావరణమే విపత్తుగా మారి పాక్ను అతలాకుతలం చేస్తోంది’’ అన్నది శాస్త్రవేత్తల వివరణ. హిమాలయాలు కరిగిపోతే...? గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు హిమాలయాల్లో మంచు గత నాలుగు దశాబ్దాల్లో కరిగిన దాని కంటే 2000–2016 మధ్య ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కరిగిపోయింది! దక్షిణాసియా దేశాలకు ఇది పెను ప్రమాద హెచ్చరికేనంటున్నారు. కారకోరం, హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 55 వేల హిమానీ నదాలున్నాయి. హిమాలయ నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర 8 దేశాల్లో 130 కోట్ల మంది మంచినీటి అవసరాలు తీరుస్తున్నాయి. 5,77,000 చదరపు కిలోమీటర్లలో వ్యవసాయ భూములకు నీరందిస్తున్నాయి. 26,432 మెగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్ స్టేషన్లున్నాయి. హిమాలయాల్లో మంచు కరిగిపోతే వీటన్నింటిపైనా ప్రభావం పడటమే గాక 2050 నాటికి దక్షిణాసియా దేశాల్లో 170 కోట్ల మందికి నీటికి కటకట తప్పదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలూ జరగవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో పాకిస్తాన్ వాటా కేవలం 1 శాతమే. కానీ వాతావరణ మార్పులు ఇప్పుడు ఆ దేశాన్ని బలి తీసుకుంటున్నాయి. చైనాలో కరువు సంక్షోభం ► 17 ప్రావిన్స్లలో వరసగా 70 రోజుల పాటు ఎండలు దంచిగొట్టాయి. వడగాడ్పులకి 90 కోట్ల మంది అవస్థలు పడ్డారు ► చైనాలో ఏకంగా సగ భాగంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి ► చైనాలో అతి పెద్ద నది యాంగ్జె ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. 1865 తర్వాత ఈ నది నీటిమట్టం బాగా తగ్గిపోవడం మళ్లీ ఇప్పుడే. ► చైనాలోని దక్షిణ ప్రావిన్స్లైన హుబై, జియాంగ్జీ, అన్హుయాయ్, సిచుయాన్లలో నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడుతున్నాయి ► చైనాలో జల విద్యుత్లో 30శాతం సిచుయాన్ ప్రావిన్స్ నుంచే వస్తుంది. ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది ► చైనాలో కరువు పరిస్థితులు 25 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తే, 22 లక్షలకు పైగా హెక్టార్లలో వ్యవసాయ భూమి ఎండిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మేలుకోకపోతే ఆహార సంక్షోభమే!
ఈ ఏడాది భూతాపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయనీ, అందువల్ల రానున్న రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తవచ్చుననీ ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదిక సమీప భవిష్యత్తులో మానవాళి భవిష్యత్తు మనుగడ పట్ల ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భూ ఉష్ణాన్ని రాబోయే 10 ఏళ్లల్లో కనీసం 2 డిగ్రీలు తగ్గించాలని దాదాపు 8 ఏళ్ల క్రితం పారిస్లో రూపొందించిన ‘వాతావరణ విధాన పత్రం’ ఓ చిత్తు కాగితంగా మారిన ఫలితంగానే ఈ సమస్య ముంచుకొచ్చింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే శిఖరాగ్ర సదస్సులలో చేసే తీర్మానాలకు సభ్యదేశాలు కట్టుబడకుండా వాటిని ఉల్లంఘించడం ఓ రివాజుగా మారింది. ఉమ్మడి ప్రయోజనాలను తాకట్టుపెట్టి సొంత ప్రయోజనాలకే అగ్ర దేశాలు మొగ్గుచూపడం వల్ల ప్రపంచంలో జీవ వైవిధ్యం, వాతావరణ సమతుల్యత అదుపుతప్పాయి. వ్యవసాయ రంగానికి చేటు చేసే గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలో మితి మీరిన మోతాదులో పెరిగిపోయాయి. భూమి మీద పర్యావరణ సమతుల్యత కాపాడడానికి అనేక రకాలైన మొక్కలు, జీవులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు నిర్దిష్ట సంఖ్యలో ఉండాలి. చిన్న, పెద్ద వృక్ష సంతతి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రాణవాయు వును సృష్టిస్తాయి. బ్యాక్టీరియా నీటిలోని లవణ సాంద్రతను కాపాడు తుంది. నదీ ప్రాంతాల అడవులు వరదల్ని నిరోధించి నీటి ప్రవాహ వేగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాతావరణంలో ఉండవలసిన ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ పరిమాణాలను సమపాళ్లలో నియంత్రించే శక్తి జీవ వాతావరణానికి ఉంటుంది. అయితే నత్రజని, మీథేన్, క్లోరోఫోరో కార్బన్లు తదితర గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలోకి ప్రవేశించి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు అనూ హ్యంగా పెరిగిపోయి, అకాల వర్షాలు పడుతున్నాయి. కాలం కాని కాలంలో తుఫానులు సంభవిస్తున్నాయి. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో కోతకు సంబంధించి లక్ష్యాల సాధనలో అగ్రదేశాలు దారుణంగా విఫలం అయ్యాయి. 1997లో వాయు ఉద్గారాలను అంతకుముందుకంటే దాదాపు 5 శాతం తగ్గించు కోవాలని లక్ష్యంగా ఏర్పరచుకొన్నారు. దానినే ‘క్యోటో ప్రోటోకాల్’గా పిలుచుకోవడం జరిగింది. అగ్రదేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా తదితర దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలకు విఘాతం కలుగుతుందనే సాకుతో తమ పారిశ్రామిక ఉత్పత్తుల నియంత్రణపై జాగ్రత్తలు పాటించలేదు. ఆ తర్వాత పర్యావరణంపై జరిగిన ‘కోపెన్ హాగన్’ సదస్సు, పారిస్లో జరిగిన ‘కాప్’ సదస్సులలో సైతం పాత కథే పునరావృతం అయింది. ప్రస్తుత పర్యావరణ సంక్షోభానికి ఏదో ఒక్క దేశమే కారణమని చెప్పలేనప్పటికీ ఆ దుష్ఫలితాలు భారత్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మన దేశానికి సంబంధించినంత వరకూ అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశంలో రసాయనిక ఎరు వులు, క్రిమిసంహా రకాలు, డీడీటీల వాడకం; గనుల తవ్వకం... రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం వంటి అవసరాల కోసం భారత్లో జీవ వైవిధ్యాన్ని సమూలంగా నాశనం చేయడం జరుగుతోంది. ఫలితంగా ఏటా సగటున 10 నుంచి 15 మీటర్ల వరకు హిమనీ నదాలు కరిగిపోతున్నట్లు వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘అంటార్కిటికా’పై శాస్త్రీయ పరిశోధన జరిపిన కమిటీ వెలువరించిన నివేదిక... 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు 1.4 మీటర్లు పెరిగే ప్రమాదం ఉందనీ... దానివల్ల తీరప్రాంత నగరాలైన చెన్నె, ముంబయి, కోల్కతా వంటి నగరాలతోపాటు ఇతర సముద్ర తీర ప్రాంతాలూ మునగడం ఖాయమనీ స్పష్టం చేసింది. ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే వరి, గోధుమ, చెరకు వంటి పంటల దిగుబడి 15 శాతం మేర తగ్గిపోతుందని పలు శాస్త్రీయ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇంట ర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) విశ్లేషణ ప్రకారం... వరి వెన్ను పుష్పించే సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినట్లయితే, ఆ వెన్ను పనికి రాకుండా పోతుంది. ‘యూనివర్సల్ ఎకొలాజికల్ ఫండ్’ నివేదిక ప్రకారం ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే రాబోయే దశాబ్దాల కాలంలో వ్యవసాయ దిగుబడుల్లో రమారమి 20 శాతం క్షీణత నమోదవుతుంది. ఉత్పత్తులు ఆ మేరకు తగ్గుతూ ఉంటే వ్యవసాయం గిట్టుబాటుగాక రైతాంగం ఇతర వృత్తులకు తరలిపోయే ప్రమాదం త్వరలోనే ఏర్పడవచ్చు. ఒకవైపు జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఆహార ధాన్యాలలో వృద్ధిని కాపాడుకోలేనట్లయితే, అది ఆహార సంక్షో భానికి దారి తీస్తుంది. ఒక అంచనా ప్రకారం... కరోనా వంటి ఉత్పాతం, అదేవిధంగా మలేరియా, టీబీ, ఎయిడ్స్ వంటి ప్రాణాం తక వ్యాధుల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కంటే ఆకలి చావులతో చనిపోతున్న వారి సంఖ్యే అధికంగా ఉండవచ్చు. ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపంతో చనిపోతున్న 5 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య 50 లక్షలుగా ఉన్నదని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 మందిలో ఒకరికి ఆహార భద్రత ఇప్పటికే లేదు. ఇంత నాగరిక సమాజంలో కూడా ఆకలి చావులు సంభవించడానికి కారణం అందరికీ ఆహార భద్రత కల్పించే ప్రణాళికలు లోపించడమే. వాస్తవానికి, ఆహారం పొందడం మానవుని హక్కుగా ప్రపంచం లోని దాదాపు అన్ని దేశాలూ గుర్తించాయి. ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం తమ బాధ్యతగా ప్రభుత్వాలు స్వీకరించాలనీ, ఆకలి రహిత సమాజాన్ని ఆవిష్కరించాలనీ ఐక్యరాజ్యసమితి చాలా కాలం క్రితమే పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలలో ఒకటైన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ఏర్పరుచుకొన్న లక్ష్యాలలో ప్రధానమైనది 2050 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు 50 శాతం మేర పెంచాలన్నది! అప్పుడే పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత చేకూరుతుంది. కానీ, ఈ లక్ష్యాల సాధనకు శరవేగంగా విస్తరిస్తున్న వాతావరణ మార్పులు ప్రతిబంధకాలుగా మారాయి. (క్లిక్: అధికారులు ‘ఛాన్స్’ తీసుకోవడం లేదు!) ఈ నేపథ్యంలో భారత్ వీలయినంత మేర అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూనే... ఇంకోవైపు వాతావరణ, ఆహార సంక్షోభ సమస్యను తనకు తానుగానే పరిష్కరించుకోవడానికి తగిన వ్యూహాలతో కార్యాచరణ రూపొందించుకొనడమేగాక, చిత్తశుద్ధితో అమలు చేయగలగాలి. పర్యావరణంపై రైతాంగానికి అవగాహన కల్పించడం ద్వారా దేశంలో పంట నష్టాలను గణనీయంగా తగ్గించ వచ్చు. దేశంలో ఉన్న 7 వాతావరణ జోన్లకు అనుగుణంగానూ, అదే విధంగా రుతుపవనాల గమనం ఆధారంగానూ పంటల సాగు జరగాలి. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతాం గానికి కచ్చితమైన సమాచారాన్ని అందించాలి. పర్యావరణానికి సంబంధించి దేశీయ వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్లపై విస్తృతమైన చర్చలు, గోష్ఠులు నిర్వహించి నిపుణల సలహాలు, సూచనలు స్వీకరించి వాటిని ఆచరణలోకి తేవాలి. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం సహజ అటవీ సంపదను కాపాడుకోవాలి. రసాయనిక, క్రిమి సంహారక మందుల వాడకాన్ని నియంత్రించాలి. వాతావరణంలో ప్రవేశించే కర్బన ఊద్గారాలను తగ్గించడానికి బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ‘సౌరశక్తి’ని విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగాన్ని మరింత తగ్గించాలి. తరుముకొస్తున్న వాతావరణ ఆహార సంక్షోభాన్ని నివారించడానికి బహుముఖమైన కార్యాచరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమన్వయంతో కృషి చేయాలి. (క్లిక్: పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!) - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
ప్రపంచ పర్యావరణ దినం: ఒక్కటే భూమి..ఒక్కటై కాపాడుకుందాం
భూగోళం వేడెక్కిపోతోంది. వాతావరణంలో కనీవినీ ఎరుగని విపరిణామాలు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న ఆదర్శం కాగితాలకే పరిమితమైంది. పారిస్ ఒప్పందాన్ని అమలు చెయ్యాలన్న పర్యావరణ శాస్త్రవేత్తల పిలుపులు కంఠశోషగానే మిగులుతున్నాయి. ఏడాదికోసారి పర్యావరణ పరిరక్షణ సదస్సులతో సరిపెడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూడటం ఖాయమని, ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు... జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాదితో దీనికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1972లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు స్వీడన్ ఆతిథ్యం ఇచ్చింది. వాతావరణ మార్పులను గమనించి, అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అప్పుడు తొలిసారిగా గుర్తించారు. 1973 నుంచి జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్ ఎర్త్’ థీమ్తో ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. గ్రీన్ లైఫ్ స్టైల్ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వాలేం చేయాలి? ► పర్యావరణ పరిరక్షణకు అతి ముఖ్యమైన అడవులు, నదులు, సముద్రాలు , తేమ ప్రాంతాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. 1990వ దశకంలో ఏడాదికి 1.6 కోట్ల హెక్టార్ల చొప్పున అడవులను కోల్పోయాం! 2015–2020 మధ్య కూడా ఏటా కోటి హెక్టార్ల చొప్పున తగ్గింది. అడవుల్ని కాపాడుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. ► ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం మాంసాహారం తయారీ, రవాణా వల్ల 18% దాకా కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పశు పెంపకానికి నీటి వాడకమూ పెరుగుతోంది. దీన్ని తగ్గించాలంటే వ్యవసాయ రంగంలో చిన్న కమతాల్ని ప్రోత్సహించాలి. ► ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య 2015–2019 మధ్య 21 నుంచి ఏకంగా 58 శాతానికి పెరిగింది. దీన్నింకా పెంచడానికి దేశాలన్నీ కృషి చేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి వల్ల 35 శాతం ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అందు కే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. సోలార్, విండ్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలివ్వాలి. ► గ్లోబల్ వార్మింగ్కు 30 నుంచి 35 శాతం దాకా కారణమవుతున్న బ్లాక్ కార్బన్, మీథేన్, ఓజోన్, హైడ్రో ఫ్లోరో కార్బన్స్ నియంత్రణకు గట్టి విధానాలు రూపొందించాలి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడకుంటే.. ► ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 నుంచి 2 డిగ్రీల దాకా పెరుగుతాయి. అప్పుడు జనాభాలో 14% అత్యంత తీవ్రమైన ఎండ వేడిమికి గురవుతారు. అది క్రమంగా 37 శాతానికి చేరే ప్రమాదముంది. ► 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మెగా నగరాల్లోని 35 కోట్ల మందిని ఎండ వేడి బాధిస్తుంది. నీటి కరువుతో, కాటకాలతో నగర ప్రాంతాలు అల్లాడిపోతాయి. దక్షిణాసియా దేశాలకే ఈ ముప్పు ఎక్కువ. ► ముంబై, ఢిల్లీ, కోల్కతా, ఢాకా, కరాచీ నగర వాసులు ఎండతీవ్రతకి గురవుతారు. ► సముద్ర మట్టాలు 24 నుంచి 38 సెంటీమీటర్లు పెరిగి బ్యాంకాక్, జకార్తా, మనీలా నగరాలు మునిగిపోవచ్చు. ► 2050 నాటికి సగం జనాభాకు మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ ముప్పుంటుంది. అస్తమా వంటి వ్యాధులు పెరిగిపోతాయి. ► కీటకాలు, మొక్కలు, జంతువుల ఆవాస ప్రాం తాలు సగానికి తగ్గి జీవ వైవిధ్యం నశిస్తుంది. మనం చేయాల్సిందేమిటి? ► ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల బదులు రీ యూజబుల్ బ్యాగులు వాడాలి. ► కాగితం వాడకాన్ని తగ్గించాలి. అత్యవసరమైతే తప్ప ప్రింట్లు తీయొద్దు. ► వారానికి ఒక్క రోజన్నా శాకాహారమే తినాలి. వీగన్ డైట్ ద్వారా కర్బన్ ఉద్గారాలను 73 శాతం తగ్గించవచ్చు. ► కారు బదులు బైక్ వాడితే కిలోమీటర్కు 250 గ్రాముల కర్బన్ ఉద్గారాలను కట్టడి చయగలం. ► ఇంట్లో నీళ్ల పైపుల లీకేజీని ఎప్పటికప్పుడు సరి చేస్తే కోట్లాది గాలన్ల నీరు ఆదా అవుతుంది. ► ఇళ్లల్లో ఫ్లోరోసెంట్ బల్బులు వాడితే 75% కరెంటు ఆదా అవుతుంది. ► రీ యూజబుల్ కరోనా మాస్కులు వాడాలి. యూజ్ అండ్ త్రో మాస్కులతో జంతుజాలానికి ఎనలేని హాని జరుగుతోంది. ► డిటర్జెంట్స్, వాషింగ్, లిక్విడ్ సోపుల్లో కనిపించని ప్లాస్టిక్ కణాలుంటాయి. నేచరల్ ప్రొడక్టులు వాడటం మేలు. ► ఇంటా బయటా అందరూ పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మెకానికల్ చెట్లు’ ఊపిరిపోసుకుంటున్నాయి!
భూమిపై రోజురోజుకూ కార్బన్డయాక్సైడ్ పెరిగిపోతోంది. దాన్ని తగ్గించాలంటే చెట్లు కావాలి. అసలే అడవులు వేగంగా తరిగిపోతున్నాయి. మరెలా? ఈ ఆలోచన నుంచే ‘మెకానికల్ చెట్లు’ఊపిరిపోసుకుంటున్నాయి. నిరంతరం కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటూ.. గాలిని శుభ్రం చేసే ఈ చెట్లను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ఈ కృత్రిమ చెట్ల వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు.. ఇలా అన్ని ఇన్ని కాదు.. మనుషులకు కావాల్సిన కీలక అవసరాలన్నీ కాలుష్యాన్ని వదిలేవే. అందు లోనూ కార్బన్డయాక్సైడ్తో పెద్ద తలనొప్పి. రోజురోజుకు భూమి వేడెక్కి వాతావరణం తీవ్రమార్పులకు లోనవడానికి కారణాల్లో ఇదీ ఒకటి. భూమిపై కార్బన్డయాక్సైడ్ పరిమితి దాటిపోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాహనాలు, పరిశ్రమలు వంటివి ఆపేసినా సరిపోదని.. వాతావరణం నుంచి కార్బన్డయాక్సైడ్ను తగ్గించే చర్యలు అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్త క్లౌస్ లాక్నర్ కృత్రిమ ‘యంత్రపు చెట్ల (మెకానికల్ ట్రీస్)’కు రూపకల్పన చేశారు. ఎలా పనిచేస్తాయి? వీలైనంత తక్కువ స్థలంలో, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొనేలా ‘మెకానికల్’ చెట్లను రూపొందించారు. ఒక్కోటీ ఐదు అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తుతో గుండ్రంగా, ఎత్తైన టవర్లలా ఉండే ఈ చెట్లలో.. వందలకొద్దీ గుండ్రని డిస్కులు ఒకదానిపై మరొకటి పేర్చి ఉంటాయి. వాటిపై ప్రత్యేకమైన రసాయన పదార్థపు పూత ఉంటుంది. ఈ డిస్కుల మీదుగా గాలి వీచినప్పుడు అందులోని కార్బన్డయాక్సైడ్ను.. ఈ రసాయనం పీల్చుకుంటుంది. డిస్కులు కార్బన్డయాక్సైడ్తో నిండాక.. దిగువన ఉన్న బ్యారెల్లోకి జారిపోతాయి. అక్కడ వేడి నీటి ఆవిరిని పంపడం ద్వారా.. డిస్కులపై ఉన్న కార్బన్డయాక్సైడ్ను వేరుచేస్తారు. తర్వాత డిస్కులను మళ్లీ పైకి జరుపుతారు. అవి య«థావిధిగా కార్బన్డయాక్సైడ్ను పీల్చుకుంటూ ఉంటాయి. ప్రతి 20–30 నిమిషాలకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఒక్కోటీ వేల చెట్లతో సమానం కొన్నివేల మామూలు చెట్లన్నీ కలిసి పీల్చుకునేంత ఆక్సిజన్ను ఒక్క మెకానికల్ చెట్టు సంగ్రహిస్తుందని శాస్త్రవేత్త క్లౌస్ లాక్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెకానికల్ చెట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. ఇలా గాల్లోంచి తొలగించిన కార్బన్డయాక్సైడ్ను భూమి పొరల్లో నిక్షిప్తం చేయడంగానీ.. పెట్రోల్, డీజిల్ వంటివాటిని కృత్రిమంగా తయారు చేయడానికి గానీ వీలుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అరిజోనాలో రోజుకు వెయ్యి టన్నుల కార్బన్డయాక్సైడ్ను పీల్చుకునే స్థాయిలో.. ‘మెకానికల్ చెట్ల తోట’ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిపారు. -
కొత్తొక వింత.. పాతొక రోత!
Goodbye 2021 Welcome 2022: ఎంతకాదన్నా 2021 సంవత్సరం మన జీవితాల్లో చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కరోనా మహమ్మారి, తుఫానుల వంటి విపత్తులతో విసిగివేశారిపోయాం. నాటి స్మృతులు ప్రతి ఒక్కరి మనోఫలకంపై ఎన్నటికీ చెరగని ముద్ర వేశాయనడంలో అతిశయోక్తి లేదు. చెడుతోపాటు కూసింత మేలు కూడా చేసిందిలే. ఆ మంచి ఏమిటోనని అనుకుంటున్నారా? గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమితోపాటు, ఓజోన్ను కూడా లాక్డౌన్ల రూపంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఐతే గుడ్డిలోమెల్లలా పర్యావరణ పరిరక్షణపై మంచి గుణపాఠమే నేర్పింది గడచిన ఏడాది (ఎడాపెడా ప్రకృతికి తీరని నష్టం చేశాం కదా). అంతేకాకుండా సైన్స్ ఆధునిక ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఎంతో పురోగతి సాధించాం. కొత్త ఉపాధి అవకాశాలను అందించింది. ఐదే ప్రతి వంద సంవత్సరాలకు అంటువ్యాధులు ప్రభలుతాయనే నానుడి కూడా మరోవైపు లేకపోలేదు. ఏదిఏమైనప్పటికీ గతాన్ని మరచిపోయి వర్తమానాన్ని ఆస్వాధించడమే మన చేతుల్లో ఉంది. ఇక వాటన్నింటికీ వీడ్కోలు చేప్పే సమయం ఆసన్నమైంది. కొత్త సంతోషాలతో, నూతనోత్సాహంతో న్యూ ఇయర్కి వెల్కమ్ చేప్పే ఆ శుభ గడియలు దగ్గరపడ్డాయ్! 2022 నూతన సంవత్సరాన్ని ఏదైనా మంచి పనితో ప్రారంభించాలని వ్యక్తులతోపాటు సంస్థలు కూడా ప్రణాళికలకు పూనుకుంటున్నాయి. మళ్లీ మళ్లీ కొత్త సంత్సరాలను వేడుకగా జరుపుకోవాడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ దుఃఖాలు, ఎత్తుపల్లాలు అనేక సార్లు దాటిన అనుభవం ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, గడచిన ఏడాదిని మాత్రం అంత త్వరగా జీర్ణించుకోలేకపోవడమనేది నగ్న సత్యం. వీటన్నింటికీ అతీతంగా సుఖదుఃఖాలను పంచుకునే ఆత్మీయులను పెంపొందించుకోవాలి. అలాగే అడ్డంకులను అధిగమించడానికి ఒక దేశం మరొక దేశానికి సహాయసహకారాలు అందించాలి. మనం మనుషులం కాబట్టి కలిసి జీవించాలి, కలిసి సమస్యలను పారదోలాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు! గతం గతః.. 2021 మిగిల్చిన చేదు గుర్తులను మరిచిపోదాం 2022లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుందాం.. కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం.. మనోబలంతో ముందుకు సాగుదాం.. కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2022 సంవత్సరం మీ జీవితంలో ఎక్ట్రార్డినరీగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కలలకు రెక్కలు తొడగండి వాటిని నిజం చేసుకోడానికి 2022లో శ్రమించి విజయం సాధించడండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022 గతాన్ని మరిచిపోండి.. మీ ముందు 2022 సంవత్సరం నూతన అవకాశాలను ఇస్తుంది.. వినియోగించుకొని విజయం సాధించండి. జీవితమే అందమైన జర్నీలో ఓ సాహసం.. ఈ 2022 సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జీవితం చాలా చిన్నది.. పెద్ద కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు ఈ 2022 సంవత్సరాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం.. మనోబలంతో ముందుకు సాగుదాం.. కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చదవండి: డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో.. -
ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్ యూనివర్సిటీ హెచ్చరిక
లండన్: పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్లు) ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది. భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని, దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్ధకం కానుందని తెలిపింది. లండన్కు చెందిన ఈయూనివర్సిటీ నివేదిక జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించారు. 400–700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయం (లిటిల్ ఐస్ ఏజ్)తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచించుకుపోతున్నట్లు హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్ ఐస్ ఏజ్ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక మదింపు చేసింది. అప్పట్లో ఇవి 28 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా, ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని, అంటే దాదాపు 40 శాతం మేర కుచించుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92– 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని, ప్రస్తుత మంచు కరుగుదల అంతకు పదింతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జొనాధన్ కార్విక్ చెప్పారు. మానవ ప్రేరిత శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు. మూడో అతిపెద్ద గ్లేసియర్ సముదాయం అంటార్కిటికా, ఆర్కిటికా తర్వాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం. అందుకే హిమాలయాలను థర్డ్ పోల్ (మూడో ధృవం)గా పిలువడం కద్దు. ఆసియాలోని అనేక దేశాల జనాభాకు అవసరమైన పలు నదులకు ఈ హిమానీ నదాలు జన్మస్థానం. వీటి క్షీణత కోట్లాది మందిపై పెను ప్రభావం చూపుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం. గతకాలంలో మంచు కరుగుదల, గ్లేసియర్ల విస్తీర్ణం మదింపునకు పరిశోధక బృందం శాటిలైట్ చిత్రాలను, డిజిటల్ సాంకేతికతను ఉపయోగించింది. గతంలో గ్లేసియర్లు ఏర్పరిచిన హద్దులను శాటిలైట్ చిత్రాల ద్వారా కనుగొని, ప్రస్తుత హద్దులతో పోల్చడం ద్వారా వీటి క్షీణతను లెక్కించారు. హిమాలయాల తూర్పు ప్రాంతంలో గ్లేసియర్ల క్షీణత వేగంగా ఉంది. హిమానీ నదాలు సరస్సుల్లో కలిసే ప్రాం తాల్లో వీటి క్షీణత అధికంగా ఉంది. ఇలాంటి సరస్సుల సంఖ్య, విస్తీర్ణం పెరగడమనేది గ్లేసియర్లు కుంచించుకుపోతున్నాయనేందుకు నిదర్శనమని తెలిపింది. మానవ ప్రేరిత ఉష్ణోగ్రతా మార్పులను అడ్డుకునేందుకు తక్షణ యత్నాలు ఆరంభించాలని నివేదిక పిలుపునిచ్చింది. -
Global Warming: నరక కూపం.. బతుకులు ‘పిట్ట’ల్లా రాలిపోవడమే!
ప్రకృతి ఎంత అందమైనదో.. తేడాలొస్తే అంతే వికృతమైంది కూడా. ముప్పు ఏ రూపంలో ముంచుకొచ్చినా.. కనుచూపు మేర జీవరాశిని వదలకుండా మింగేస్తుంటుంది. అలా గ్లోబల్ వార్మింగ్ అనే ముప్పు.. చాప కింద నీరులా విస్తరించేసింది ఇప్పటికే. అందుకు ప్రత్యక్ష సాక్క్ష్యం.. సముద్రపక్షుల జనాభా ఊహించని రేంజ్లో తగ్గిపోవడం. సముద్ర తీరాన్ని ఆవాసంగా చేసుకున్న పక్షులకు.. ఆ తీరమే ఇప్పుడు నరక కూపంగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, ఆహార కొరత, భయానక వాతావరణ మార్పులు.. సముద్ర పక్షుల జనాభాను గణనీయంగా పడగొట్టేస్తోంది. వీటికి తోడు పక్షుల్లో సంతానోత్పిత్తి సామర్థ్యం తగ్గిపోతుండడం కలవరపెడుతోంది. ఫసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవులు, బ్రిటిష్ ఐలెస్, మైన్ కోస్ట్ వెంట పక్షులు రాలిపోతున్నాయి. గుడ్లు పొదిగిన పక్షులు.. పిల్లల ఆకలి తీర్చలేక, మరోవైపు ఆకలికి తట్టుకోలేక అక్కడి నుంచి తరలిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో పిల్ల పక్షుల ప్రాణాలు పోతున్నాయి. గూడు కట్టడంలో ఇబ్బంది కామన్ ముర్రే, కాస్సిన్స్ అవుక్లెట్ జాతి పక్షుల జనాభా దారుణంగా పడిపోయింది. ఆహారం దొరక్కపోవడం, సముద్ర మట్టం పెరగడం, వానలు, తరచూ వచ్చే తుపాన్లు.. ఇలాంటి కారణాలు వాటి జనాభాను తగ్గించేస్తున్నాయని ప్రకటించింది వైల్డ్లైఫ్ సర్వీస్ సంస్థ. ►20 శతాబ్దం మధ్య నుంచి 70 శాతం సీబర్డ్ పాపులేషన్ తగ్గిపోయిందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. ►అయితే ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ మాగెల్లనిక్ పెంగ్విన్ మనుగడ కొనసాగిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పరిశోధకులు చెప్తున్నారు. ►1991 నుంచి సౌతాఫ్రికా తీరం వెంట మూడొంతుల సముద్రపక్షులు తగ్గిపోతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ►చేపల సంఖ్య తగ్గిపోతుండడం కూడా పక్షుల సామూహిక మరణాలకు ఓ కారణం. ►2010లో పశ్చిమ తీరం వెంట కామన్ ముర్రేస్ గుట్టలు కొట్టుకురావడం చూసిందే. ►మైన్ తీరం వెంబడి ఉండే ఐకానిక్ సీబర్డ్, అట్లాంటిక్ ఫఫ్ఫిన్లు.. సంతానొత్పత్తి తగ్గడం, ఆహార కొరతతో నరకం అనుభవిస్తున్నాయి. ►అలస్కా, చుగాచ్ నేషనల్ ఫారెస్ట్ దగ్గర్లోని బీచ్ దగ్గరికి 8 వేల పక్షులు విగత జీవులుగా కొట్టుకు వచ్చాయి. ►ఉత్తర సముద్రం వెంట వేల మైళ్ల దూరంలో ప్రతికూల వాతావరణం పక్షుల జనాభా తగ్గిపోవడానికి కారణం అవుతోంది. ►సముద్రం, ఆ వాతావరణ స్వచ్ఛతను తెలియజేసే సముద్ర పక్షులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. -
గ్లోబల్ ‘వార్నింగ్’.. మాయమైపోయిన మంచు!
ఈ చిత్రాలు చూడండి. పై చిత్రంలో కొండలు కనబడట్లేదు కానీ కింది చిత్రంలో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఆహ్లాదంగా, చూడముచ్చటగా ఉందనిపిస్తోంది కదా. చూడముచ్చట పక్కనబెడితే మున్ముందు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి ఇవి. పై చిత్రాన్ని దాదాపు 100 ఏళ్ల కిందట ఆర్కిటిక్లో తీశారు. అప్పుడు కొండలు కనబడనంతగా మంచు పేరుకుపోయి ఉంది. కానీ ఇప్పుడు ఆ మంచు ఆనవాళ్లు కూడా లేవు. కొన్నేళ్లుగా పెరుగుతున్న భూతాపం వల్లే ఈ మంచంతా మాయమైపోయింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోందని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. (చదవండి: స్పెషల్ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్..) -
బొగ్గు వినియోగం నిలిపివేతపై ఇంకా అస్పష్టత
గ్లాస్గో: భూతాపం(గ్లోబల్ వార్మింగ్)పై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ సదస్సు తుది నిర్ణయానికి రాలేదు. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు ముగిసిపోయినప్పటికీ తాజా ప్రతిపాదనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలకాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునివ్వాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ముసాయిదా ప్రకటన స్పష్టం చేసింది. కాప్–26 నిర్ణయాలను 197 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే అవి అమల్లోకి వస్తాయి. అందుకే సదస్సు ముగిసిన తర్వాత కూడా అతి పెద్ద దేశాలు చర్చల ప్రక్రియని ముందుకు తీసుకువెళతాయి. కాప్–26 శిఖరాగ్ర సదస్సుకి నేతృత్వం వహించిన బ్రిటన్ మంత్రి, భారత సంతతికి చెందిన అలోక్ శర్మ ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులపై అత్యుత్తమ పరిష్కారాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలేవీ భూతాపం పెరుగుదలను నిరోధించలేవని, మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాప్–26లో పాల్గొన్న పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. -
మాటలు సరే! చేతల మాటేమిటి?
ప్రపంచంలోని 20 భారీ ఆర్థిక వ్యవస్థలు... అంతా కలిపితే అంతర్జాతీయ వాణిజ్యంలో 75 నుంచి 80 శాతం ఉన్న దేశాలు... ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల జనాభాకూ, ప్రపంచ భూభాగంలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాల అధినేతలు ఒక్కచోట కలిస్తే? ప్రపంచ పరిణామాలు, పర్యావరణ, వాణిజ్య సమస్యలపై రెండు రోజులు చర్చిస్తే? ఐరోపా సమాజం, మరో 19 దేశాల అంతర్ ప్రభుత్వవేదికగా ఏర్పాటైన ‘జి–20’ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ప్రాధాన్యం అందుకే! ఇటలీ రాజధాని రోమ్లో అక్టోబర్ చివర 2 రోజులు జరిగిన ఈ సదస్సులో గత రెండేళ్ళలో తొలిసారిగా దేశాధినేతలు వ్యక్తిగతంగా కలిశారు. మరి, ఈ సదస్సు ఆశించిన ఫలితాలు అందించిందా అంటే అవుననలేం. భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీల లోగానే నియంత్రిస్తామంటూ నేతలు లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. కానీ, కర్బన తటస్థతను సాధించేందుకు కచ్చితమైన తుది గడువు పెట్టనే లేదు. కేవలం ఉద్గారాల్ని తగ్గిస్తే చాలదని తెలిసినా, కార్యాచరణ శూన్యం. అందుకే, ‘ప్రజలు, ప్రపంచం, సౌభాగ్యం’ ఇతివృత్తంగా సాగిన ఈ సదస్సుతో కొంత ఆశ, ఎంతో నిరాశ మిగిలాయి. 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి తగ్గట్టు దీర్ఘకాలిక పర్యావరణ లక్ష్యాలను పెట్టుకోవాలనీ, శుద్ధమైన విద్యుత్ జనకాలకు త్వరితగతిన మారాలనీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని పేర్కొన్నారు. కానీ, ప్రపంచంలో మూడింట రెండు వంతులకు పైగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు కారణమైన ఈ 20 దేశాల గ్రూపు స్పష్టమైన తుది గడువుతో ముందుకు రాలేదు. కోవిడ్పై పోరు, ఆరోగ్య వసతుల మెరుగుదల, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం లాంటి వివిధ అంశాలపై ప్రపంచ నేతలు చర్చించారు. కానీ, రష్యా, చైనాలు తమ ప్రతినిధుల్ని ఈ సదస్సుకు పంపనే లేదు. వివిధ కారణాలతో మెక్సికో, జపాన్, దక్షిణాఫ్రికా నేతలు హాజరు కానే లేదు. వర్ధమాన దేశాలు పర్యావరణహిత ఇంధన లక్ష్యాన్ని చేరుకొనేలా ఏటా 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.49 లక్షల కోట్లు) సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్టు ‘జి–20’ ప్రకటించింది. కానీ, బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలకు అంతర్జాతీయ ఆర్థిక సాయం ఆపేస్తామన్న నేతలు తమ దేశంలో అలాంటి విద్యుదుత్పత్తికి ఎప్పుడు స్వస్తి పలుకుతారో మాట ఇవ్వనే లేదు. ప్రపంచ నేతలు ఎంతసేపటికీ బరువైన మాటలతో గారడీ చేస్తున్నారన్నది గ్రేటా థన్బెర్గ్ లాంటి పలువురు పర్యావరణ ఉద్యమకారుల వాదన. ‘జి–20’ సదస్సులో అధినేతల తుది ప్రకటన సైతం వారి వాదనకు తగ్గట్టే ఉంది. అదే విచారకరం. సదస్సు ముగింపు వేళ... పర్యావరణ సంక్షోభంలో తరచూ విస్మరణకు గురయ్యే మూడు మౌలిక అంశాలను గుర్తు చేస్తూ ఉద్యమకారులు థన్బెర్గ్, వానెస్సా నకాటే బహిరంగ లేఖ రాశారు. పర్యావరణ సంక్షోభంపై జాగు చేయడానికి లేదన్నారు. ఏ పరిష్కారమైనా సరే పర్యావరణ మార్పు వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేసేదిగా ఉండాలన్నారు. అత్యంత భారీగా కాలుష్యం చేస్తున్నవారు తమ ఉద్గారాలపై అసంపూర్ణమైన గణాంకాలు చెప్పి, తప్పించుకుంటున్నారని ఆరోపించడం గమనార్హం. ఈ 16వ ‘జి–20’ సదస్సుకు హాజరైన భారత ప్రధాని మోదీ విడిగా పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధాని సహా పలువురితో సమావేశమయ్యారు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని హరిత ప్రాజెక్టులకు అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక శాతం ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మోదీ పేర్కొన్నారు. చైనా వ్యతిరేకించడంతో ఆగిన న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూప్ సభ్యత్వాన్ని భారత్కు ఇవ్వాలనీ, అలాగే అవసరమైన సాంకేతికతను అందించాలనీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను భారత్ చేరుకోవడం వాటితో ముడిపడి ఉందనీ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తేల్చేశారు. భారత్ అలా తన వాదన వినిపించడం బాగానే ఉంది. సదస్సు ఫలవంతమైందన్న మోదీ మాటలను ఆ మేరకే అర్థం చేసుకోవాలేమో! ఎందుకంటే, పర్యావరణ అంశాలపై పెట్టుకున్న అనేక ఆశలను ‘జి–20’ సదస్సు నెరవేర్చనేలేదని సాక్షాత్తూ ఐరాస ప్రధాన కార్యదర్శే అనేశారు. వెనువెంటనే గ్లాస్గోలో జరుగుతున్న ‘కాప్–26’ సదస్సులోనైనా మెరుగైన ఫలితాలు వస్తాయన్నదే ఇక మిగిలిన ఆశ. ఈ ఏడాది చివరికే జనాభాలో 40 శాతానికి కోవిడ్ టీకాల లాంటి మాటలైతే ‘జి–20’ దేశాధినేతలు అన్నారు. ధనిక, బీద దేశాల మధ్య టీకాల అందుబాటులో తేడాలను తగ్గించే వ్యూహం లేదు. ప్రస్తుతం ప్రపంచం ముంగిట ఉన్న పర్యావరణ అత్యవసర పరిస్థితి పరిష్కారంలోనూ అదే ధోరణి. రోమ్ నుంచి నేరుగా గ్లాస్గోలో ‘కాప్–26’కు వారు హాజరవుతున్నారు. అక్కడ 100కు పైగా దేశాల నేతలతో రెండు రోజులు చర్చలు... గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించే బృహత్ ప్రణాళికపై రెండు వారాల పాటు అధికారుల మల్లగుల్లాలు. కానీ, పర్యావరణ సంక్షోభంపై విజయం సాధించాలంటే ప్రగాఢమైన వాంఛ, మరింత పకడ్బందీ కార్యాచరణ అవసరం. వివిధ దేశాధినేతల సమష్టి రాజకీయ సంకల్పంతోనే అది సాధ్యం. అందుకు ప్రధాన భాగస్వామ్యదేశాల మధ్య నమ్మకం కీలకం. కానీ, ప్రపంచంలో అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలకు కారణమైన చైనా పక్షాన అధ్యక్షుడు షీ జిన్పింగ్ ‘కాప్–26’కు హాజరవడం లేదు. లిఖితపూర్వక ప్రకటనతోనే సరిపెడుతున్నారు. ఇలాంటివి ఎన్నో. అందుకే, నిన్నటి ‘జి–20’ లానే, నేటి ‘కాప్–26’లోనూ అద్భుతమైన ఫలితాలు ఆశించడం కష్టమే. సదస్సులన్నీ అరుదైన ఫోటో సందర్భాలుగానే మిగిలితే, అసలు సమస్యలు తీరేదెలా? -
గ్లాస్గో వేదికగా ప్రారంభమైన కాప్ సదస్సు
-
భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలి
గ్లాస్గో: గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడమే మార్గమని కాప్– 26 అధ్యక్షుడు, బ్రిటన్ కేబినెట్ మంత్రి అలోక్ శర్మ చెప్పారు. భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడమే మన ముందున్న లక్ష్యమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భారత సంతతికి చెందిన అలోక్శర్మ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాప్ –26 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు)కి నేతృత్వం వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపైనా స్కాట్లాండ్లోని గ్లాస్గోలో కాప్– 26 సదస్సు ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొనే ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన అలోక్ శర్మ భూతాపోన్నతిని తగ్గించడానికి ఇదే ఆఖరి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఉష్ణోగ్రతల్ని తగ్గించే మార్గాన్ని చూడాలన్నారు. ‘‘ఆరేళ్ల క్రితం పారిస్ సమావేశలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండేలా చూడాలని అనుకున్నాం. 1.5 డిగ్రీలకి పరిమితం చేయడానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలి’’ అని అలోక్ అన్నారు. నవంబర్ 12 వరకు జరిగే ఈ సదస్సులో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. -
Global Warming: ఇలాగయితే ముంబై, కాకినాడ కనుమరుగే!
కడ్తాల్: గ్లోబల్ వార్మింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ముంబై, కాకినాడ వంటి తీర ప్రాంతాలు భవిష్యత్తులో కనిపించవని పూర్తిగా నీట మునిగిపోతాయని ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్ట్, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని ఆన్మాస్పల్లిలో ఉన్న ఎర్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యునైటెడ్ కింగ్డమ్లోని గ్లాస్కో నగరంలో 2021 అక్టోబరు 31 నుంచి నవంబరు 12 పర్యావరణ మార్పులపై జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ)-26వ అంతర్జాతీయ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్యారిస్ హామీ ఏమైంది ? 2005లో జరిగిన ప్యారిస్ సమావేశంలో క్లైమెట్ ఛేంజ్పై విస్త్రృతంగా చర్చించారని ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి గుర్తు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న 194 దేశాలు కాలుష్యాన్ని తగ్గించేందుకు అంగీకరించాయన్నారు. అందులో భాగంగా 2005లో వెలువడుతున్న కర్బణ ఉద్ఘారాల్లో 33 శాతం నుంచి 35 శాతం వరకు తగ్గిస్తామని భారత ప్రధాని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కానీ వాస్తవంలో ప్రభుత్వంలో ఈ పని చేయడం లేదన్నారు. అంతర్జాతీయ వేదికల మీద ఇచ్చిన హామీలకు దేశీయంగా అవి అమలవుతున్న తీరుకు పొంతన లేదన్నారు. దుష్పరిణామాలు ప్యారిస్ సమావేశంలో 2 సెల్సియస్ డిగ్రీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు అది అమలు చేయడంలో విఫలమయ్యాయని ఫలితంగా ఇప్పటికే భూవాతావరణం 1.12 సెల్సియస్ డిగ్రీలు వేడెక్కిందన్నారు. ఇటీవల కాలంలో కెనడా, ఆస్ట్రేలియా, సైబీరియాలో కార్చిర్చులు చెలరేగి లక్షలాది హెక్టార్ల అటవీ నాశనమైందని, ఊర్లకు ఊర్లే తగలబడి పోయాయన్నారు. అంతేకాదు మన దేశంలో అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తిన విషయాన్ని ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డి గుర్తు చేశారు. ఈ దుష్పరిణామాలకు గ్లోబల్ వార్మింగే కారణమన్నారు. ఒత్తిడి తేవాలి క్లైమెట్ ఛేంజ్ విషయంలో మన నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే ఇరవై ఏళ్లలో 2 సెల్సియస్ డిగ్రీల వరకు భూవాతావరణం వేడేక్కే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే తీవ్ర ఉత్పతాలు సంభవిస్తాయని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలైన కాకినాడ, ముంబై, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ వంటివి ఉండబోవన్నారు. ఈ విపత్తు రాకుండా నివారించాలంటే భూతాపాన్ని 1.5 సెల్సియస్ డిగ్రీలకు మించకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ దేశాల మీద పౌర సమాజం ఒత్తిడి తేవాలని సూచించారు. 36 లక్షల మొక్కలు వాతావరణ సమతుల్యత లక్ష్యంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి అన్నారు. గడిచిన పదకొండేళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల పరిధిలో 36 లక్షల మొక్కలను నాటినట్టు తెలిపారు. తూర్పు కనుమల పరిరక్షణకు సీజీఆర్ తరఫున నిర్విరామంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. భావితరాలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మంచి వాతావరణ ఇవ్వాల్సిన అవవసరం ఉందని సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎర్త్ సెంటర్ ప్రాంతీయంగా జరుగుతున్న వాతావరణ మార్పులను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు కడ్తాల్ సమీపంలో ఎర్త్ సెంటర్ని ఏర్పాటు చేశామని బయెడైవర్సిటీ నిపుణులు తులసీరావు తెలిపారు. ప్రజల్లో రాజకీయ చైతన్యంతో పాటు పర్యావరణ చైతన్యం కూడా పెరగాల్సి ఉందన్నారు. గ్లాస్కో సమావేశ వివరాలను ఎప్పటిప్పడు అందించేందుకు ఎర్త్సెంటర్లో ప్రత్యేక న్యూస్రూమ్ ఏర్పాటు చేసినట్టు ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయి భాస్కర్రెడ్డి తెలిపారు. సీజీఆర్ ఒక్కటే పర్యావరణం, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దేశం మొత్తం మీద స్థిరంగా పని చేస్తున్న సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఒక్కటే ఉందని ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల ప్రభావం ప్రజలపై ఇప్పటికే పడిందన్నారు. గ్లోబల్ వార్మింగ్పై ప్రజలు తమంతట తాముగా గొంతెత్తే సమయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా గ్లాస్కోలో జరుగుతున్న సీఓపీ 26 సమావేశ వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు సీజీఆర్ తరఫున అందిస్తామన్నారు. -
వేడి పెంచే లాబీ క్రీ(నీ)డలా?
వాతావరణ మార్పులకు కారణమౌతున్న భూతాపోన్నతి నియంత్రించే లక్ష్యసాధనలో బాధ్యత కలిగిన దేశాలు వెనుకంజలో ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోలియం, బొగ్గు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగం నుంచి సౌర, పవన విద్యుత్తు వంటి పునర్వినియోగ ఇంధనాల (ఆర్ఈ) వైపు మళ్లే మార్పు లక్ష్యించిన స్థాయిలో లేదు. పైగా శిలాజ ఇంధన ఉత్పత్తి–వినియోగం పెరిగి, పరిస్థితి విషమిస్తోంది. మూన్నాలుగు రోజులుగా శిలాజ ఇంధన ఉత్పత్తిపై భారత్లో జరుగుతున్న పరిణామాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఇంధనాల వల్లే కర్భన ఉద్గారాలు పెరిగి, భూమి అసాధారణంగా వేడెక్కుతోంది. శతాబ్ది అంతానికి 2 డిగ్రీల సెల్సియస్ను మించి భూతాపోన్నతి పెరక్కుండా నిలువరించటంలో వీటి నియంత్రణే కీలకం. 2030 నాటికి 1.5 డిగ్రీల మించి పెరుగనీయవద్దన్నది లక్ష్యం. ఇప్పటికే 1.1 డిగ్రీల పెరిగింది. ఈ విషయంలో ‘పారిస్ ఒప్పంద’ లక్ష్యాలే ఫలితమిచ్చేలా లేవని, వాటిని సవరించి మరింత కటువుగా కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవాల్సిన అవసరముందని వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమించిన ‘అంతర్ ప్రభుత్వాల వేదిక’ (ఐపీసీసీ) నివేదించింది. వాస్తవంలో, గడువు లోపల పాత లక్ష్యాలు సాధించడం కూడా ఇపుడు దుస్సాధ్యంగా కనిపిస్తోంది. ‘దేశీయంగా ఖరారైన మా కట్టుబాట్లివి’ (ఎన్డీసీ) అని, ఎవరికి వారిచ్చిన హామీలు సాధించే శ్రద్ద కూడా ఆయా ముఖ్య దేశాల్లో లోపించింది! ఒప్పందం ప్రకారం జరగాల్సిన కార్యప్రణాళిక రచనలో, వేగంగా అమలు పరచడంలో భారత్తో పాటు శిలాజ ఇంధనాల ఉత్పత్తి–వినియోగం అధికంగా ఉన్న దేశాలు విఫలమైనట్టు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమపు(యుఎన్ఈపీ) తాజా నివేదిక చెప్పింది. కీలకాంశాలు బయటకొచ్చిన తర్వాత గురు వారం అధికారికంగానే వెల్లడైన నివేదిక విషయాలు పర్యావరణ హితైషులకు ఆందోళన కలిగి స్తున్నాయి. 75 శాతం ప్రపంచ శిలాజ ఇంధనాల్ని ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, భారత్, ఇండొనేషియా, ఖజకిస్తాన్, మెక్సికో, నార్వే, రష్యా, సౌధీ అరేబియా, యుఏఈ, యుకె, అమెరికాలే ఉత్పత్తి చేస్తాయి. ‘హామీ ఇచ్చినట్టు తగ్గించక పోగా... వారి ఇంధన–ఉత్పత్తి ప్రణాళికల సరళి చూస్తుంటే... 2030 నాటికి 110 శాతం, 2040 నాటికి 190 శాతం అధికంగా శిలాజ ఇంధ నాల్ని ఉత్పత్తి చేసే పరిస్థితిని అంచనా వేస్తున్నాం’ అని నివేదిక చెప్పింది. భాగస్వాముల సదస్సు (కాప్–26) వచ్చే వారమే గ్లాస్గో (స్కాట్లాండ్)లో మొదలుకానున్న తరుణంలో ఇది చికాకు కలిగించేదే! భారత్లో పరిణామాలూ ఏమంత బాగోలేవు! ఇటీవలి బొగ్గు సంక్షోభం, విద్యుత్తు ఇతర పారిశ్రామిక అవసరాలకు బొగ్గు పెంచుకునే చర్యలు–సన్నాహాల్ని చూస్తూనే ఉన్నాం. ‘ఆత్మనిర్బర్ భారత్’లో భాగంగా బొగ్గు తవ్వకాల్ని పెంచే మౌలిక సదుపాయాల కోసం కేంద్రం యాబై వేల కోట్లు వెచ్చించనుంది. 2019–2024 మధ్య బొగ్గు ఉత్పత్తిని సుమారు 60 శాతం (730 నుంచి 1,149 టన్నులకు) పెంచే ప్రణాళికలు అమలవుతున్నాయి. భూసేకరణ అవాంతరాల్ని తొలగించే వ్యూహమూ ఇందులో భాగమే! ఇదే కాలానికి.. చమురు, సహజవాయు ఉత్పత్తి 40 శాతం పెంచా లన్నది లక్ష్యమట. లైసెన్సుల సరళీకరణ, గుర్తించిన వనరు నిక్షేపాలను సంపదగా మార్చడం, సహజవాయు రవాణా సంస్కరణల ద్వారా భారీ లక్ష్యాలు సాధించాలని యోచన! ఉత్పత్తి మౌలిక రంగంలోనో, పన్ను రాయితీల్లోనో పన్నెండు వేల కోట్లు వెచ్చించాలన్నది నిర్ణయం. పెట్రో ఉత్పత్తి పెంచి, ధరల్ని హేతుబద్దం చేయాలని ‘పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)’ను భారత్ కోరింది. మరోవైపు ప్రపంచ చమురు కంపెనీల సీఈవోలతో మన ప్రధాని మోదీ సమావేశమై... దేశీయంగా చమురు, సహజవాయు ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రణాళికలివ్వాలని కోరారు. చమురు దిగుమతుల భారం, విదేశీమారకం తరుగుదల తమకు కష్టంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన చమురు అవసరాల్లో 85 శాతం, సహజవాయు అవసరాల్లో 55 శాతం దిగుమతే! కనుక దేశీయ ఉత్పత్తిపై దృష్టి. ఈ పరిణామాలన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి–వినియోగాన్ని పెంచేవే! కానీ, పారిస్లో మన నిర్దిష్ట హామీ (ఎన్డీసీ) ఏమిటి? 2005 బెంచి మార్కుగా, 2030 నాటికి 33–35 శాతం ఉద్గారాలను, ఆ మేర శిలాజ ఇంధన వాడకాన్నీ తగ్గిస్తామని ఒప్పందంపై సంతకం చేశాం. ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతున్న కాప్–26 వేదిక నుంచి రేపేమని సమాధానమిస్తారు? మొన్న కేరళ, నిన్న ఉత్తరాఖండ్, నేడు సిక్కిం.... ఇలా అసాధారణ వర్షాల వల్ల భారీగా ప్రాణ– సంపద నష్టాల అరిష్టాలు కళ్లజూస్తూ కూడా ప్రభుత్వాలు నిద్రవీడటం లేదు. పెరిగే చమురు ధరలకు తోడు, మోయలేని కేంద్ర–రాష్ట్ర పన్ను భారంతో పౌరులు కుంగిపోతున్నారు. కార్పొరేట్ లాబీలు బలంగా పనిచేస్తున్నందునే పునర్వినియోగ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వాడకంలోకి రావట్లేద నేది విమర్శ. కాప్–26 సదస్సుకు రోజుల ముందు ఐపీసీసీ, యుఎన్ఈపీ వంటి నివేదికల్లోని కీలక సమాచారం బయటకు రావడంపైనా అనుమానాలున్నాయి. ఇంధనాల వినియోగ మార్పు లక్ష్య సాధన వాయిదా కోసం, ఉద్గార నియంత్రణ కాఠిన్యాల్లో సడలింపు కోసం ఒక బలమైన లాబీ యూఎన్పై ఒత్తిడి తెస్తున్నట్టు పర్యావరణవేత్తలు, కార్యకర్తలు అనుమానిస్తున్నారు. ఇంతటి విప త్కర పరిస్థితుల్లోనూ కార్పొరేట్లకు ఎర్ర తివాచీలు పరిస్తే, వారి లాబీయింగ్ ఒత్తిళ్లకు లొంగితే... ఆ పాపానికి నిష్కృతి లేదు, మన ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు, ఈ పృథ్వికిక రక్షణ లేదు! -
కొత్త చట్టం.. ప్రపంచంలోనే తొలి దేశంగా న్యూజిలాండ్
వెల్లింగ్టన్: బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు వచ్చే ఏడాది నుండి తమ పోర్ట్ఫోలియోల గ్లోబల్ వార్మింగ్ రికార్డు వెల్లడించేలా న్యూజిలాండ్ ఒక చట్టాన్ని ఆమోదించింది. అంతేకాదు ఇది ఆర్థిక రంగంలో పర్యావవరణ రికార్డును మరింత పారదర్శకం చేసే ప్రథమ చర్యగా అభివర్ణించింది.ఫలితంగా ఈ చట్టాన్ని రూపొందించిన తొలి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. (చదవండి: శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!) ఈ మేరకు న్యూజిలాండ్ వాతావరణ మార్పుల మంత్రి జేమ్స్ షా మాట్లాడుతూ..."బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు వచ్చే ఏడాది నుండి తమ పోర్ట్ఫోలియోల గ్లోబల్ వార్మింగ్ రికార్డు గురించి తప్పనిసరిగా వెల్లడిస్తాయి." అని చెప్పారు. ఈ నెలాఖరున ఐక్యరాజ్యసమితి గ్లాస్గోలో నిర్వహించినున్న వాతావరణ సదస్సలో షా పాల్గోననున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఈ విధంగా ప్రకటించటం ఒకరకంగా పెట్టుబడి రంగం వాస్తవ ప్రపంచ పరిణామాలను తెలియజేయ గలవు అనే విషయాన్ని ప్రపంచదేశాలకి నొక్కి చెప్పగలం అన్నారు. అంతేకాదు వాతావరణ మార్పులకు సంబంధించి స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రభావాలను వారి వ్యాపార నిర్ణయాలలోకి చేర్చడం ద్వారా సంస్థలు మరింత స్థిరంగా మారడానికి ఇది ప్రోత్సహకరంగా ఉంటుందన్నారు. ప్రపంచ అగ్రగామి ఉన్న న్యూజిల్యాండ్ ఆర్థిక రంగం కోసం తప్పనిసరిగా వాతావరణ సంబంధిత రిపోర్టింగ్ను ప్రవేశపెట్టి ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచిందని చెప్పారు. (చదవండి: మొసలిని తిప్పితిప్పి తుక్కుతుక్కు చేసింది..!) -
తాగి కారు నడిపితే నేరం.. మరీ కారే వైన్ తాగి రోడ్ల మీదకి వస్తే!?
డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం, అంటే మద్యం సేవించి కారు నడిపితే చట్ట ప్రకారం శిక్షార్హులు. కానీ కారే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే అది నేరమా? దానికేమైనా శిక్షలు ఉంటాయా? అసలు అది సాధ్యమా ? అంటే అవుననే అంటున్నారు యువరాజా వారు. అనడమే కాదు నిజం చేసి చూపించారు కూడాను. అసలు కారేంటి, అది వైన్ తాగడమేంటీ అనే సందేహాలు వస్తున్నాయా? అయితే ఈ వివరాలేంటో మీరే చూడండి. అది అలాంటి ఇలాంటి కారు కాదు. రాజుగారు వాడే కారు. ఆయనేమో సామాన్యమైన రాజు కాదు, ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్ రాజవంశపు కాబోయే చక్రవర్తి. అందుకే ఈ కారు నడిచేందుకు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్లు ఉపయోగించడం లేదు. అంతకు మించి మనమెవరం ఊహించలేని ఇంధనాన్ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వివరించారు. కొత్త ఐడియా కార్లను కనిపెట్టినప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు అవి నడిచేందుకు ఫ్యూయల్గా వాడేది డీజిల్ లేదా పెట్రోల్లను ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో ఈ రెండు ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చింది సీఎన్జీ గ్యాస్. అయితే వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్ రాజుగారు మరో అడుగు ముందుకు వేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్రోలు , డీజిల్ బదులు వైన్తో నడిపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారు. వెంటనే తన సిబ్బందిని పిలిపించి ఆదేశాలు జారీ చేశారు. అస్టోన్ మార్టిన్ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్కి 21వ ఏటా ఆస్టోన్మార్టిన్ కారుని బహుమతిగా అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఈ యువరాజు గ్యారేజీలో మరెన్నో కార్లు వచ్చి చేరినా సరే ఆ పాత ఆస్టోన్ మార్టిన్ కారు వన్నె తగ్గలేదు. రాజుగారికి దానిపై మోజు పోలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఆ కారులో చక్కర్లు కొడుతూనే ఉంటారు. తన మనసులో మాట చెప్పేందుకు ఈ కారునే రాజుగారు ఎంచుకున్నారు. వైన్ ఉంటే చాలు యువరాజు ఆజ్ఞలకు తగ్గట్టుగా కారుని రీ డిజైన్ చేశారు ఇంజనీర్లు. వారి కృషి ఫలించి ప్రస్తుతం రాజుగారి కారు వైన్తో నడుస్తోంది. బకింగ్హామ్ ప్యాలేస్లో మిగిలిపోయిన వైన్ని ఈ కారు నడిపేందుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని సార్లు జున్ను తయారు చేస్తుండగా విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఫ్యూయల్గా వాడుతున్నారు. ఈ విషయాలను స్వయంగా ప్రిన్స్ ఛార్లెస్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అక్టోబరు 31న వాతావరణ మార్పులపై సమావేశం జరగనుంది. కర్బణ ఉద్ఘారాలు తగ్గించేందుకు ప్రపంచ నాయకులు చేస్తున్న కృషికి నా వంతు సహాకారం అందించేందుకు పెట్రోలు, డీజిల్ బదులు వైన్ను ఉపయోగిస్తున్నాను’ అంటూ ఆయన తెలిపారు. కాలుష్యమే కారణం ఇటీవల వాతావరణ కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. కర్బణ ఉద్ఘారాలను తగ్గించాలంటూ ప్రపంచ దేశాలన్నీ నిర్ణయిస్తున్నాయి. వాతావరణ కాలుష్యంపై ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతున్నా.. బ్రిటీష్ యువరాజు ఇప్పటి వరకు స్పందించలేదు,. దీంతో ఆయనపై చాలా విమర్శలు లోగడ వచ్చాయి. దీంతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలా ఎలక్ట్రిక్ కార్లంటే రాయల్ రేంజ్ ఏముంటుంది అనుకున్నారో ఏమో? ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రచారానికి ఊతం ఇచ్చేందుకు కర్బన ఉద్ఘారాలను వెదజల్లని వైన్ కారు ఫార్ములాను యువరాజు ఎంచుకున్నారు. అయితే రాజుగారి నిర్ణయంపై గ్లోబల్ లీడర్ల నుంచి పెద్దగా స్పందన లేకున్నా సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. చదవండి :ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి శుభవార్త.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్! -
Climate Change: కలిసి కదిలితేనే భూ రక్ష!
అనుమానాలకు తావు లేదిప్పుడు... చూద్దాం.. చేద్దామన్న పోకడనూ మరచిపోండి!! వాతావరణ మార్పులన్నవి ముమ్మాటికీ నిజం. నిజం. నిజం!! ధోరణి మారకుంటే.. భావితరాలు ఈ భూమ్మీద.. బతకడం కష్టమేనని గుర్తుంచుకోండి!! ప్రకృతిని తద్వారా మనల్ని మనం కాపాడుకునేందుకు... ఈ క్షణం నుంచే సంకల్పం చెప్పుకోండి. కంకణం కట్టుకోండి!! వ్యక్తులుగా మీరు చేసే చిన్న చిన్న పనులు ప్రపంచానికొచ్చిన పెనువిపత్తును తప్పించగలవా అన్న సంశయమూ వద్దు!! కెనడాలో 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు.. జర్మనీలో అకాల వర్షాలు, వరదలు.. చైనాలో వెయ్యేళ్ల రికార్డులు తిరగరాస్తూ కుంభవృష్టి!! ఇవన్నీ ఏవో కాకతాళీయంగా జరిగిన సంఘటనలని కొందరు అనుకోవచ్చు కానీ.. భూతాపోన్నతితో వచ్చిన వాతావరణ మార్పులకు ప్రత్యక్ష నిదర్శనాలీ ఘటనలన్నవి సుస్పష్టం. వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక కూడా.. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణంలో తగ్గుదల, కాలుష్యం తదితర కారణాల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రత.. క్రమేపీ పెరిగిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే... కార్చిచ్చులు, కుంభవృష్టి, అకాల వర్షాల్లాంటి ప్రకృతి విపత్తులు మరింత ఎక్కువ అవడం గ్యారంటీ అని స్పష్టం చేసింది. ఈ విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ ఐపీసీసీ తాజా నివేదిక మరోసారి రూఢీ చేయడమే కాకుండా... తుది ప్రమాద హెచ్చరికల్లాంటివి జారీ చేసింది. భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడం తథ్యమని స్పష్టం చేసింది. ఆ... భూమి మొత్తమ్మీద జరిగే పరిణామాలకు నేనేం చేయగలను? ఆ పాట్లేవో మన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు పడతారులే అనుకోనవసరం లేదు. ఎందుకంటే.. వ్యక్తులు తమ జీవనశైలిలో చేసుకునే కొన్ని మార్పులు కూడా ఉడతా సాయంగానైనా ఉపకరిస్తాయి. అదెలాగో చూడండి... ఆహార వృథాను అరికట్టండి... మీకు తెలుసా? శిలాజ ఇంధనాల తరువాత భూతాపోన్నతికి కారణమవుతున్న వాటిల్లో ఆహార పరిశ్రమ అతిపెద్దదని? ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే పాడి, మాంసం అనే రెండు అంశాలు వాతావరణ మార్పులకు ఉన్న కారణాల్లో ప్రధానమైనవి, పాడిపశువుల పెంపకానికి ఫీడ్ నీరు, విద్యుత్తు, నేల వంటి వనరులను వినియోగించుకుని పెరగడం ఒక కారణం. అలాగే మాంసం కోసం పెంచే కొన్ని జంతువులు ప్రమాదకరమైన మీథేన్ వాయువును ఎక్కువగా వదులుతాయి. పశువులు పెంచేందుకు వీలుగా కొన్నిచోట్ల అటవీ భూములను చదును చేయడమూ కద్దు! ఇవన్నీ ఒకఎత్తు అయితే... మనం తినే ఆహారాన్ని వృథా చేయడం ఇంకో ఎత్తు. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మానవ వినియోగానికి సిద్ధం చేసిన ఆహారంలో కనీసం మూడొంతులు వృథా అవుతోందని? దీని విలువ ఏడాదికి అక్షరాలా లక్షకోట్ల డాలర్లు! ప్రపంచంలో సగం మంది శాఖాహారులుగా మారిపోతే ఏటా తగ్గే కార్బన్డయాక్సైడ్ మోతాదు 660 కోట్ల టన్నులు మనిషి సగటున ఏడాదికి ఐదు టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల చేస్తాడని అంచనా. కానీ ఇది దేశాన్ని బట్టి మారుతూంటుంది. అమెరికా, దక్షిణ కొరియా వంటి పారిశ్రామిక దేశాల్లో ఇది 16.5 టన్నులు కాగా.. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 1.6 టన్నులుగా ఉంది. ప్రత్యామ్నాయాలకు జై కొట్టండి... భూతాపోన్నతిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే సౌర, పవన, జీవ, జల ఇంధనాల వాడకం కచ్చితంగా పెరగాలి. ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు తిరిగేందుకు అవసరమైనంతైనా సరే.. సౌరశక్తిని వాడుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒకప్పుడు దీని ఖరీదు ఎక్కువే కానీ.. 2010 నాటితో పోలిస్తే ఇప్పుడు 73 శాతం చౌక. రకాన్ని బట్టి ఇప్పుడు భారత్లో ఒక్కో వాట్ సోలార్ప్యానెల్కు అయ్యే ఖర్చు రూ.23 నుంచి రూ.140 వరకూ ఉంటోంది. ఇంట్లో 20 వాట్ల ఎల్ఈడీలు ఐదు ఉన్నాయనుకుంటే రూ.2300 ఒక ప్యానెల్ కొనుక్కుని వాడుకుంటే చాలు పైగా మనకు సూర్యరశ్మికి అసలు కొదవే లేదు. ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో గాజుబాటిల్ వాడినా. వస్త్రంతో తయారైన సంచీలతో సరుకులు, కాయగూరలు తెచ్చుకున్నా... అవసరానికి మంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనకపోయినా... ఇలా మన దైనందిన జీవితంలో ప్రతి చిన్న మార్పూ భూమికి శ్రీరామరక్షగా నిలుస్తుంది!! ఇంట్లో పొదుపు మంత్రం... భూతాపోన్నతిని తగ్గించేందుకు మనమేమీ అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఈ చర్యలు పాటించడం వల్ల నాలుగు డబ్బులు మిగులుతాయి కూడా. ఇంట్లోని ఏసీలో ఉష్ణోగ్రతను 24 స్థాయి నుంచి 26 డిగ్రీలకు పెంచారనుకోండి. మీకు కరెంటు ఆదా.. వాతావరణంలో చేరే కాలుష్యమూ తగ్గుతుంది. అలాగే సాధారణ బల్బుల స్థానంలో సమర్థమైన, చౌకైన, ఎక్కువ కాలం మన్నే ఎల్ఈడీ బల్బులు వాడటమూ ఉభయ ప్రయోజనకరం. ప్రపంచమంతా ఎల్ఈడీలు వాడితే ఏటా 7,800 కోట్ల కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చు. సూర్యభగవానుడిచ్చే ఎర్రటి ఎండను కాదని వాషింగ్మెషీన్లో డ్రయింగ్ ఆప్షన్ను వాడితే భూమికి చేటు చేయడమే కాకుండా.. మీ జేబుకు పడే చిల్లూ ఎక్కువ అవుతుందని గుర్తించండి. ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల (టీవీ, మిక్సీ, వాషింగ్మెషీన్, ఓవెన్, గీజర్ లాంటివి)ను అవసరం లేనప్పుడు కేవలం స్విచాఫ్ చేయడం కాకుండా... ప్లగ్ తీసి ఉంచడమూ కరెంటును ఆదా చేస్తుందని తెలుసుకోండి. సమర్థమైన ఎల్ఈడీ బల్బులను అందరూ ఉపయోగించడం మొదలుపెడితే అయ్యే ఆదా ఏడాదికి... తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు. వృక్షో రక్షతి రక్షితః... చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని రక్షిస్తాయన్న ఈ సంస్కృత నానుడి ఈ రోజుకూ అక్షర సత్యం. ఇల్లు, అపార్ట్మెంట్, బడి, ఆఫీసు ఇలా వీలైనప్రతి చోట మొక్కలు నాటామనుకోండి. వాతావరణంలోని కార్బన్డ యాక్సైడ్ను కొంతమేరకైనా తగ్గించవచ్చు. చెట్లు, మహాసముద్రాలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసుకుని ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా చేయగలవు. కానీ నిమిషానికి పది ఎకరాలకు పైగా అడవులను వివిధ కారణాలతో నరికేస్తున్న పరిస్థితుల్లో వాతావరణంలో విషవాయువుల మోతాదు పెరిగిపోతోంది! అందుకే,అడవులను కాపాడుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మొక్కలు నాటడం అత్యవసరం. పెట్రోల్, డీజిల్ వాడకానికి కళ్లెం! భూతాపోన్నతికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సహజసిద్ధ ఇంధన వనరుల విచ్చలవిడి వాడకం ప్రధాన కారణం. వీటిని తగ్గిస్తే తద్వారా వాతావరణంలోకి చేరే విష వాయువుల మోతాదు తగ్గి భూతా పోన్నతిని నియంత్రించవచ్చు. ఇరుగు పొరుగు వీధుల్లో పనులకు బైక్ల బదులు సైకిళ్లు వాడినా, కాళ్లకు పని చెప్పినా ఈ భూమికి మనవంతు మేలు చేసినట్లే. దూరా భారమైతే సొంత వాహనాల్లో కాకుండా.. బస్సులు, ట్రైన్లను వాడాలని నిపుణులంటున్నారు. విమానాల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే.. వీలైనంత వరకూ డైరెక్ట్ ఫ్లైట్లను ఎంచుకోవడం మేలు. ఎందుకంటే... విమానాల నుంచి వెలువడే కార్బన్డయాక్సైడ్ టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే ఎక్కువ. మన ప్రయాణంలో కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటే ల్యాండింగ్, టేకాఫ్ ఒకటి కంటే ఎక్కువసార్లు ఉంటాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
Earth Day: తల్లీ భూదేవి
తన మీద వొత్తిడి కలిగించినందుకే కర్ణుడిని భూమాత శపించిందట. భూమి ఇక పాపం మోయలేదు అనుకున్నప్పుడల్లా దేవదూతో, ప్రవక్తో ఉదయించారు రక్షణకు. ఒక నాగలి మొనకు సీతనే ఇచ్చింది ఈ తల్లి. తన కడుపున పంటలు, పాలుగారే నదులు మోసుకుంటూ తిరుగుతుంది రోజుకు 24 గంటలు. గోడ మీద పిల్లలు పిచ్చిగీతలు గీసినా ఒక అందం ఉంటుంది. కాని భూమి మీద మనిషి గీస్తున్న పిచ్చిగీతలు వినాశకరమైనవి. తల్లి భూదేవిని ప్రతి బిడ్డా కాపాడుకోవాలి. ఇంట్లో ప్రతి తల్లి ఈ విషయమై పాఠం చెప్పాలి. వశం తప్పిన పిల్లాణ్ణి దండించైనా సరే దారికి తేవాలి. అందరి కోసం ధరిత్రి. ధరిత్రి కోసం అందరూ. పురాణాలు ఎప్పుడూ సంకేతాలలోనే మాట్లాడతాయి. ‘భూమ్మీద పాపం పెరిగిపోయినప్పుడల్లా అవతరించమని దేవుణ్ణి రుషులు మొరపెట్టుకున్నారని’ చెబుతాయి. భూమికి భారం పెరగకూడదని పురాణాలు ముందునుంచి చెబుతూ వస్తున్నాయి. భూమి క్షోభ పడకూడదని కూడా చెబుతూ వచ్చాయి. భూమ్మీద నేరాలు, ఘోరాలు, పాపాలు పెరిగినప్పుడు భూమి రోదిస్తుంది. ఆ రోదన మంచిది కాదు. కనుక ఆ పాపాల్ని రూపుమాపే అవతారపురుషులు అవసరమవుతారు. ఇక్కడ పాపాలు అంటే మనిషికి అపకారం చేసే పాపాలు మాత్రమే కాదు. ప్రకృతికి అపకారం చేసే పాపాలు కూడా. ఇవాళ భూమ్మీద ప్రకృతి పరంగా పెరిగిన పాపాల కంటే మించి పాపాలు లేవు. ప్రకృతి వెంటనే తిరిగి మాట్లాడదని, వెంటనే తిరిగి ప్రతీకారం తీర్చుకోదనే ధైర్యంతో మనిషి ఇది చేస్తాడు. చెట్టును నరికితే చెట్టు వెంటనే గొడ్డలి పట్టుకుని వెంట పడదు. నదికి అడ్డంగా ఆనకట్ట కడితే నది బయటకు వినపడేలా శాపాలు పెట్టదు. పర్వతాలను పిండి పిండి చేసి చదును చేస్తే అవి కన్నెర్ర చేస్తున్నట్టు కనిపించవు. కాని ఒకరోజు వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు శిలల కింద నక్కి ఉండాల్సిన విష క్రిములు బయటపడి మనుషుల మీద దాడి చేస్తాయి. సముద్రాల కింద భూకంపాలు వచ్చి అంతులేని జలరాశి భూమిని ముంచెత్తుతుంది. నదులు ఉగ్రరూపం ధరించి ఊళ్లలోకి వస్తాయి. పర్వతాలు తమ కొండ చరియలు కూల్చి దారులు మూసేస్తాయి. అడవులు తమకు తామే ఎండిపోతాయి. నేల తడారిపోయి లోలోపల ముడుచుకుపోతుంది. మన దగ్గర డబ్బుంటుంది.. నీరు ఉండదు. డబ్బుంటుంది.. తిండి ఉండదు. డబ్బుంటుంది.. మంచి గాలి ఉండదు. భూమి తాలూకు సకల సరంజామాను పాడు చేసి భూమ్మీద ఉండాలని మనిషి మాత్రమే అనుకుంటాడు. అది ఏ తార్కిక శాస్త్రం ప్రకారం కూడా సాధ్యం కాదు. భూమికి నువ్వు గౌరవం ఇస్తే భూమి నీకు జీవితం ఇస్తుంది. తల్లి భూదేవి జీవం ఇచ్చేది ఏదైనా తల్లే. భూమి జీవం ఇస్తుంది. విత్తు వేస్తే ఫలం ఇస్తుంది. లోతుకు తవ్వితే జలం ఇస్తుంది. నీ నివాసపు గోడకు గుణాద్రం అవుతుంది. నీ ప్రయాణానికి వీపు అవుతుంది. నీ సమూహానికి ఊరు అవుతుంది. తల్లి మాత్రమే ఇవన్నీ చేయగలుగుతుంది. బిడ్డలకు పచ్చటి చేల తోడు ఇస్తుంది. అందుకే భూమిని మనిషి తల్లిగా చేసుకున్నాడు. తల్లిగా ఆరాధించాడు. కాని క్రమక్రమంగా నేటి కొందరు కొడుకులకు మల్లే ఆ తల్లి గొప్పదనాన్ని మరిచాడు. ఆమె పట్ల చూపించాల్సిన ప్రేమను మరిచాడు. తల్లి ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును కూడా దాటే స్థితికి తెచ్చాడు. తల్లి ఏమంటుంది? భూమి తల్లి చెప్పేది మనిషి విననపుడు ప్రతి స్త్రీ భూమితల్లిగా మారి కుటుంబం నుంచి భూమి పట్ల ఎరుక కలిగించే సంస్కారాన్ని పాదు చేయాలి. పిల్లలకు మొక్కలు నాటడం నేర్పాలి. నీరు వృధా చేయకపోవడం నేర్పాలి. విద్యుత్తును ఆదా చేయడం నేర్పాలి. కాగితాన్ని వృధా చేయకూడదని నేర్పాలి. పరిసరాలు మురికి మయం చేయకూడదని నేర్పాలి. అనవసర ఇంధనం వృథా చేసే పద్ధతులను పరిహరించాలని చెప్పాలి. కారు అవసరమే. సైకిల్ తొక్కడం కూడా చాలా అవసరం అని తల్లి చెప్పాలి. ఏసి అవసరమే. కాని కిటికి తెరిచి ఆ వచ్చే గాలికి సహించేంత వేడిని సహించడం కూడా అవసరమే అని చెప్పాలి. ఆహార దుబారా, దుస్తుల దుబారా, ప్లాస్టిక్ దుబారా ఇవన్నీ తగ్గించి తద్వారా భూమి తల్లికి భారం తగ్గించాలని చెప్పడం అవసరమే అని చెప్పాలి. అమ్మ చెప్తేనే కొన్ని మాటలు చెవికి ఎక్కుతాయి. కొన్నిసార్లు అమ్మ గట్టిగా చెప్తే. ఆ తల్లి ఆదర్శం ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. అందరూ వచ్చి అక్కడి పేపర్ ప్లేట్లను తీసుకుని భోజనం చేస్తున్నారు. ఆ ఫంక్షన్కు ఆహ్వానం అందుకున్న ఒక తల్లి తన భర్త, ఇద్దరు పిల్లలతో వచ్చింది. ఒక సంచిని తోడుగా తెచ్చింది. ఆ సంచిలో నాలుగు స్టీల్ ప్లేట్లు ఉన్నాయి. ఆ స్టీల్ ప్లేట్లలో తను, భర్త, ఇద్దరు పిల్లలు భోం చేశారు. వారు ఎంత తినగలరో అంతే ప్లేట్లలో పెట్టుకున్నారు. భోజనం పూర్తయ్యాక ఎక్కువ నీళ్లు అవసరం లేకుండా ఆ ప్లేట్లు శుభ్రమయ్యాయి. తిరిగి ఆ స్టీల్ ప్లేట్లను వారు సంచిలో పెట్టుకుని వెళ్లిపోయారు. వాళ్లు నాలుగు పేపర్ ప్లేట్ల వృధాను తగ్గించారు. తిన్నంతే తినడం వల్ల ఆహార దుబారా, తక్కువ నీటిని వాడటం వల్ల నీటి దుబారా తగ్గించారు. ఇవి చిన్న ప్రయత్నాలు. కాని ఇవి మొత్తం భూమి మీద భారం తగ్గించేవే. ఆ నాలుగు పేపర్ ప్లేట్లకు ఎంత చెట్టు గుజ్జు అవసరం. అలా అందరూ చేస్తే ఎంత అడవి మిగులుతుంది. ఆలోచించాలి. అంటే ప్రతి చిన్న పనిలోనూ భూమికి సంబంధించిన ఎరుక ఉండాలి. ఈ పని భూమికి భారం అవుతుందా మేలు అవుతుందా అనేది ఆలోచించాలి. తల్లులే జాతికి సంస్కారాలు నేర్పుతూ వచ్చారు. భూమి తల్లిని కాపాడుకోవాలనే సంస్కారాన్ని కూడా వారి ఒడి నుంచి తొలిపాఠంగా అందించాలి. అది నేటి నుంచే మొదలు కావాలి. – సాక్షి ఫ్యామిలీ -
కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా పరిశ్రమ ఏదైనా తనదైన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన అకాల మరణం మొత్తం సినీరంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 500కి పైగా చిత్రాలు, తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్ తీవ్రమైన గుండెపోటుకు గురై అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడటం తీవ్ర విషాదాన్ని నింపింది. చాలా తొందర పడ్డారు సార్ అంటూ ఆయన హితులు, సన్నిహితులు తీరని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు సూర్య, విక్రం, నటి జ్యోతిక, మహానటి ఫేం కీర్తి సురేష్తోపాటు పలువురు ప్రముఖులు వివేక్ మృతదేహానికి నివాళుర్పించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విటర్ ద్వారా వివేక్కు సంతాపం తెలియజేస్తూ శివాజీ సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నటనపైన మక్కువ మాత్రమే కాదు..వివేక్ ప్రకృతి ప్రేమికుడు కూడా. పర్యావరణ పరిరక్షణకోసం నిరంతరం పాటుపడేవారు. తన నటనా కౌశలంతో పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వివేక్ తనకు గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అని ఎపుడూ చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, చెట్ల పెంపకాన్ని తన జీవిత మిషన్గా చేపట్టారు. తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా 2011 లో భారీ చెట్ల పెంపకం కోసం ‘గ్రీన్ కలాం’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే 33.23 లక్షల మొక్కలు నాటారు. ఈ విషయాన్నే ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కోరిక తీరకుండానే వివేక్ ప్రకృతిలో కలిసిపోయారంటూ కంటతడిపెట్టారు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోలను రీపోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆర్ఐపీ వివేక్ సార్ హ్యాష్ట్యాగ్లో ట్రెండింగ్లో నిలిచింది. #RipVivek pic.twitter.com/MSYVv9smsY — Rajinikanth (@rajinikanth) April 17, 2021 Bye Sir. Even in death you were too ahead of your time. We will all miss you terribly. ❤️ There will be laughter and food for thought in the heavens tonight. #VIVEKH pic.twitter.com/zGRcUhEwmt — Siddharth (@Actor_Siddharth) April 17, 2021 Thalaivi Pays Homage to #Vivek sir #RIPVivekSir 💔🙏🏻 pic.twitter.com/enqgAOYmWY — sᴀɴᴅʜʏᴀ 🦄 ᴋᴇᴇʀᴛʜʏ 𝐃𝐞𝐯𝐨𝐭𝐞𝐞 (@Sandy_kitty_) April 17, 2021 We are shocked and saddened.. I missed sharing screen space with you and missed learning so much from a legend like you.. will miss you forever sir. Deepest condolences to the family🙏 #RIPVivekSir pic.twitter.com/DSSxzb7cG6 — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 17, 2021 Gone tooooo soon saar. Life is truly unfair. #RIPVivekSir deepest condolences to friends and family — venkat prabhu (@vp_offl) April 17, 2021 End of an era 💔 pic.twitter.com/QmoCBvMKcI — Hansika (@ihansika) April 17, 2021 -
‘ప్రమాద’ ఇంధనాలు!
మానవాళిని మింగేయటానికి, భూగోళాన్ని అమాంతం నాశనం చేయటానికి కాలుష్య భూతం కాచుక్కూర్చున్నదని ఎవరికీ తెలియనిది కాదు. కానీ ఏ దేశమూ దాన్ని సరిగా పట్టించుకుని, చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైనం కనబడదు. పర్యవసానంగా ఆ ముప్పు రోజురోజుకూ మనకు దగ్గరవుతోంది. కొన్నేళ్ల క్రితం అమెరికాలోని మియామీ నది గడ్డకట్టిన ఘటన మొదలుకొని నిన్న మొన్న వచ్చిన ఉత్తరాఖండ్ ఉత్పాతం వరకూ ఇందుకెన్నో ఉదాహరణలున్నాయి. హార్వర్డ్ విశ్వ విద్యాలయం వివిధ దేశాల్లో అధ్యయనం చేసి వెల్లడించిన వాస్తవాలు చదివితే గుండె గుభేలు మంటుంది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధన కాలుష్యం బారినపడి దాదాపు 90 లక్షలమంది ఏటా అకాల మృత్యువాత పడుతున్నారని ఆ అధ్యయనం సారాంశం. ఇందులో చైనా, భారత్లు అగ్ర స్థానంలో వున్నాయి. దాని లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రతి అయిదు మరణాల్లో ఒకటి శిలాజ ఇంధన సంబంధమైనదే. ఈ అధ్యయన వివరాలు 2018 నాటివి. ఆ తర్వాతైనా పరిస్థితులు ఏమంత మెరుగుపడిన దాఖలాలు లేవుగనుక ఇప్పటికీ ఈ వరసే కొనసాగుతున్నదని అంచనాకు రావొచ్చు. శిలాజ ఇంధనాలు ప్రతి దేశంలోనూ నిత్యావసర వస్తువుగా మారిపోయాయి. ఫ్యాక్టరీలు నడవాలన్నా, వాహనాలు కదలాలన్నా, విద్యుత్ వెలుగులు రావాలన్నా శిలాజ ఇంధనా లపైనే అత్యధిక దేశాలు ఆధారపడుతున్నాయి. వాటిని క్రమ పద్ధతిలో తగ్గించుకుంటూ వెళ్తామని, భూగోళం వేడెక్కే ప్రక్రియను తగ్గించటంలో తోడ్పడతామని పారిస్ శిఖరాగ్ర సదస్సులో 2015లో దాదాపు 200 దేశాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. కర్బన ఉద్గారాల తగ్గింపుపై చరిత్రాత్మక ఒడం బడిక కుదుర్చుకున్నాయి. 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతం తగ్గిస్తామని ఆ దేశాలన్నీ పూచీ పడ్డాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు అనేక దేశాలకు చెందిన అధినేతల చొరవ కారణంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఆ ముచ్చట ఎంతో కాలం నిలబడ లేదు. అమెరికాలో ఒబామా అనంతరం 2016లో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే పారిస్ ఒడంబడికనుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించారు. తన పదవీకాలం ముగుస్తున్న దశలో అంత పనీ చేసే వెళ్లారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణానికి ఎంతో నష్టం చేసింది. వేరే దేశాల మాట అటుంచి మన నగరాలు మృత్యువునే ప్రతి క్షణం ఆఘ్రాణిస్తున్నాయి. భారత్లోని 30 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని, శిలాజ ఇంధనాలను మండిం చటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని హార్వర్డ్ నివేదిక చెబుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఆ ఏడాది కేవలం శిలాజ ఇంధనాల వల్ల 4,71,456మంది మరణించారని నివేదిక అంటున్నది. ఆ తర్వాత స్థానంలో బిహార్ వుంది. అక్కడ 2,88,821 మరణాలకు మూల కారణం శిలాజ ఇంధనాలే. పశ్చిమ బెంగాల్లో అటువంటి మరణాలు 2,76,312. వేరే రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో వున్నాయి. హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కోచోట లక్షకుపైగా మరణాలు ఈ ఇంధనాల పుణ్యమేనని నివేదిక అంటున్నది. హార్వర్డ్ అధ్యయనానికి ప్రధానంగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఉపరితల వాతావరణ గణాంకాలు ఉపయోగపడుతుంటాయి. వీటి ఆధా రంగా వేసే అంచనాలు సంతృప్తికరంగా వుండేవి కాదు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో అంతక్రితంతో పోలిస్తే సగటున అతి సూక్ష్మ ధూళి కణాలు ఏ స్థాయిలో వున్నాయో నిర్ధారించటానికి ఉపగ్రహ ఛాయా చిత్రాలపై ఆధారపడేవారు. అయితే ఆ సూక్ష్మ ధూళి కణాలు శిలాజ ఇంధనాల కారణంగా ఏర్పడ్డాయో, కార్చిచ్చు వల్ల ఏర్పడ్డాయో, ఇతరేతర కారణాల వల్ల ఏర్పడ్డాయో చెప్పటం సాధ్యమయ్యేది కాదు. కానీ 2018లో మరింత అధునాతనమైన సాంకేతికతను ఉపయోగించారు. వాతావరణంలోని రసాయన మార్పులను కొలిచే జియోస్–కెమ్ అనే 3డీ మోడల్ను వినియోగించారు. దాని ఆధారంగా పరిమిత ప్రాంతంలో కాలుష్యం స్థాయిలు ఏవిధంగా వున్నాయో, వాటి స్వభావమేమిటో అంచనాకు రావటం పరిశోధకులకు మరింత సులభమైంది. ఒక ప్రాంతం మొత్తానికి సంబంధించిన సగటు ఆధారంగా లెక్కలేయటం కంటే, పరిమిత ప్రాంతంలోని పరిస్థితిని అధ్యయనం చేయటం, అక్కడి జనం ఎటువంటి ప్రమాదకర రసాయనాలను ఆఘ్రాణిస్తున్నారో తేల్చటం నిపుణులకు చాలా సులభం. అందుకే 2018నాటి గణాంకాలు పక్కాగా వున్నాయని వారు చెబుతున్నారు. ఈ నివేదిక ప్రపంచ దేశాల కళ్లు తెరిపించాలి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిం చటానికి, వాటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టడానికి ఇది తోడ్పడాలి. మలేరియావంటి వ్యాధుల వల్ల కలిగే మరణాలను మించి శిలాజ ఇంధనాలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిందే. వాస్తవానికి పారిస్ ఒడంబడికలో కాలుష్యాన్ని తగ్గిం చటానికి నిర్దేశించిన లక్ష్యాలు అవసరమైన స్థాయిలో లేవని పర్యావరణవేత్తలు అప్పట్లోనే పెదవి విరిచారు. 2050నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్కు పరిమితం చేయాలని సంకల్పం చెప్పు కుంటూ దాన్ని చేరుకోవటానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఇలా అరకొరగా వుంటే ఎలా అని ప్రశ్నిం చారు. కానీ విషాదం ఏమంటే కనీసం ఆ పరిమిత లక్ష్యాల దిశగానైనా చాలా దేశాలు అడుగు లేయటం లేదు. అదృష్టవశాత్తూ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ వచ్చి, తిరిగి పారిస్ ఒడంబడికలో భాగమవుతామని చెప్పారు. కాలుష్యం నివారణ ప్రాధాన్యతను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవా ల్సిన అవసరాన్ని తాజా నివేదిక మరోసారి అందరికీ గుర్తు చేస్తోంది. -
అంచనాలకన్నా వేడెక్కుతున్న భూగోళం
సాక్షి, న్యూఢిల్లీ : వాతావరణ శాస్త్రవేత్తలు అంచనాల కన్నా భూగోళం 0.3 ఫారిన్హీట్ డిగ్రీలు ఎక్కువగా వేడెక్కుతోంది. ఈ మేరకు ‘హాడ్క్రుట్’ గతంలో వేసిన అంచనాలను ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీకి చెందిన వాతావరణ విభాగం మార్చింది. భూగోళం ఉష్ణోగ్రత డేటాలను ఎప్పటికప్పుడు సేకరించి డేటా బేస్లో భద్రపర్చే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూ వాతావరణ అంచనాల సంస్థ ‘హాడ్క్రుట్’. 1850లో ఉన్న భూగోళం ఉష్ణోగ్రతకన్నా 2010–18 కాలం నాటికి భూగోళం ఉష్ణోగ్రత 1.90 ఫారిన్హీట్ డిగ్రీలు పెరగుతుందని హాడ్క్రుట్ అంచనా వేసింది. అయితే వాస్తవానికి భూతాపం 1.93 ఫారిన్హీట్ పెరిగింది. భూతాపోన్నతి గత 170 సంవత్సరాలుగా పెరగడానికి ప్రధాన కారణం మనుషుల వల్ల వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలేనని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన నాసా, నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) అంచనాలకన్నా భూతాపం పెరగడం తక్కువగా ఉంది. హాడ్క్రుట్ అంచనాలే ఇంతకాలం నిజం అవుతూ వచ్చాయి. ఈసారి కూడా అంచనాల్లో 0.3 ఫారిన్హీట్ డిగ్రీల తేడామాత్రమే వచ్చింది. 1986లో మొదటి సారి తమ విభాగం భూతాపోన్నతిని అంచనా వేసిందని, ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీలోని క్లైమెట్ రిసర్చ్ యునిట్ డైరెక్టర్ టిమ్ ఆస్బోర్న్ తెలిపారు. ఆ తర్వాత తమ విభాగం మరింత కచ్చితత్వంతో భూతాపోన్నతని అంచనా వేస్తూ వస్తోందని ఆయన తెలిపారు. -
భూతాపం.. జల సంక్షోభం
సాక్షి, అమరావతి: భూతాపం (గ్లోబల్ వార్మింగ్) రుతుపవనాల గమనాన్ని నిర్దేశిస్తోందా? దేశంలో నదీ పరీవాహక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోందా? గోదావరి, కృష్ణా, కావేరి వంటి ద్వీపకల్ప నదులే కాదు.. గంగా, యమునా, బ్రహ్మపుత్ర వంటి హిమాలయ నదుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ప్రపంచ జల వనరుల అభివృద్ధి నివేదిక (డబ్ల్యూడబ్ల్యూడీఆర్) గత ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసినా 200 జిల్లాల్లో వరదలు, నీటి ఎద్దడితో ప్రజలు తల్లడిల్లటాన్ని భారతీయ ఉష్ణమండల వాతావరణ సంస్థ (ఐఐటీఎం) ఎత్తిచూపడాన్ని బట్టి.. దేశంలో జల సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. భూతాపం వల్ల ప్రపంచంలో ఏడాదిలో ఒక నెలపాటు 360 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని డబ్ల్యూడబ్ల్యూడీఆర్ వెల్లడించింది. పారిస్ ఒప్పందం మేరకు భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీలకు తగ్గించకపోతే.. 2050 నాటికి ఏడాదిలో ఒక నెలపాటు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే వారి సంఖ్య 517 కోట్లకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. నివేదికలోని ప్రధానాంశాలివీ.. ► కార్బన్డయాక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో కలవడం భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి దారితీస్తుంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతుంది. ► ఇది రుతుపవనాల గమనాన్ని ప్రభావితం చేస్తుంది. గతేడాది దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కానీ.. ఒకేసారి కుండపోత వర్షం కురవడం, వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) అధికంగా ఉండటం వల్ల దేశంలో 200 జిల్లాల ప్రజలు వరదలు, నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ► ఆసియా ఖండంలో భారత్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన 200 కోట్ల మంది తాగునీటి, సాగునీటి అవసరాలను గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి హిమాలయ నదులు తీరుస్తున్నాయి. ► హిమాలయ నదులపై జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 500 గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. భూతాపం ప్రభావం వల్ల హిమాలయాల్లో గ్లేసియర్స్(మంచు.. హిమానీ నదాలు) కరుగుతున్నాయి. ► 2060 నాటికి హిమానీ నదాలు 50 శాతం కరిగిపోతాయి. ఇది హిమాలయ నదుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2060 నాటికి ఆ నదుల్లో నీటి లభ్యత 50 శాతం తగ్గిపోతుంది. ఇది 200 కోట్ల మందిని జల సంక్షోభంలోకి నెడుతుంది. ► రుతు పవనాల గమనం వల్ల అతివృష్టి, అనావృష్టి ఏర్పడి ద్వీపకల్ప నదుల్లో నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► భూతాపం వల్ల భూమిలోకి ఇంకే వర్షపు నీరు కంటే ఆవిరి అయ్యే నీటి శాతమే ఎక్కువ. ఇది భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి దారి తీస్తుంది. అంటే.. ద్వీపకల్ప భారతదేశంలో జల సంక్షోభం మరింత ముదురుతుంది. ► భూతాపం 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే ప్రపంచ జనాభాలో 7 శాతం మందికి నీటి లభ్యత 20 శాతం తగ్గడానికి దారి తీస్తుంది. అదే భూతాపం 1.5 డిగ్రీల నుంచి రెండు డిగ్రీలకు పెరిగితే ప్రపంచ జనాభాలో 50 శాతం మంది తీవమ్రైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ► నవంబర్ 4, 2016 నుంచి అమల్లోకి వచ్చిన పారిస్ ఒప్పందానికి కట్టుబడి అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా సహా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు వాతావరణ కాలుష్యాన్ని నివారించడం ద్వారా భూతాపాన్ని 1.5 డిగ్రీలకు తగ్గించగలిగితే జల సంక్షోభం ముప్పు తప్పుతుంది. -
ఆ దేశాలు తప్ప.. మిగిలినవన్నీ..
గ్రెటా థన్బర్గ్.. ఈ పేరు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. స్పీడన్ దేశానికి చెందిన ఈ బాలిక.. ‘‘మీ అవసరాల కోసం మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీకెంత ధైర్యం’’ అంటూ ప్రపంచ దేశాలను ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రశ్నించింది. అభివృద్ది పేరుతో విచ్చలవిడిగా కార్భన్ ఉద్గారాలను విడుదల చేస్తూ పోతున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటని నిలదీసింది. కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పులు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న వేళ.. ఇందుకు సంబంధించిన తాజా నివేదిక.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ప్రపంచంలోని చాలా సంపన్న దేశాలు భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ తమ తాజా నివేదికలో తెలిపాయి. గ్లోబల్ వార్మింగ్, కర్భన ఉద్గారాలు భావితరాల ఆరోగ్యంపై, అభివృద్దిపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలోని ఏ దేశం కూడా పిల్లల అభివృద్ధి, భవిష్యత్తు, సమానత్వం విషయంలో సత్ఫలితాలను సాధించలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ది లాంసెట్ జర్నల్, యునిసెఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక కమిషన్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం నార్వే, సౌత్ కొరియా, నెదర్లాండ్లో పిల్లలకు ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం లభిస్తున్నాయని వెల్లడించింది. అధిక పరిమాణంలో ఉద్గారాలను వెదజల్లుతున్న అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉన్నాయని పేర్కొంది. కమిషన్ సభ్యులు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలకు ఆరోగ్యం, విద్య, రక్షణ కల్పించడమే కాకుండా వారికి సురక్షిత భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రపంచ దేశాలపై ఉందని పేర్కొన్నారు. గత ఐదు శతాబ్దాలుగా బాలల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని.. అయితే అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరిగాయని తెలిపారు. మరోవైపు భూగోళం వేడెక్కడం, పర్యావరణానికి హాని కలిగించడం భవిష్యత్ తరాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని నివేదికలో తెలిపారు. పర్యావరణ క్షీణత పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుపై అత్యంత ప్రభావం చూపుతుందని కమిషన్ సభ్యులు సునీత నారయణ్ పేర్కొన్నారు. చేయని తప్పునకు వారు బలికాబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగాయని తెలిపారు. ఆఫ్రికాలోని రెండు దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాలు పిల్లల ఆరోగ్యం, విద్య విషయంలో వెనుకబడి ఉన్నాయని రిపోర్టులో తెలిపారు. -
ఈ సమ్మర్..సుర్రు
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఈసారి వేసవిలో హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి సూచకంగా కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరంలో ఫిబ్రవరి ప్రారంభంలోనే అతినీలలోహిత వికిరణ తీవ్రత (యూవీ ఇండెక్స్) ‘7’పాయింట్లకు చేరుకోవడంతో ఉక్కపోత, చర్మం, కళ్ల మంటలతో సిటిజన్లు విలవిల్లాడుతున్నారు. సాధారణం గా ఈ నెలలో యూవీ సూచీ 5 పాయింట్లకు మించరాదు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మే నెలల్లో యూవీ సూచీ 12 పాయింట్లు చేరుకునే ప్రమా దం పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో ఫిబ్రవరిలోనే వికిరణ తీవ్రత పెరిగి ఒళ్లు, కళ్లు మండిపోతున్నాయని హైదరాబాదీలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగే ‘యూవీ’తో ఇక్కట్లు.. యూవీ ఇండెక్స్ పెరగటంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. కిరణాలు మనుషులపై పడుతుండటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. ఎండలో ఎక్కువసేపు తిరిగితే కళ్లు, చర్మం మండటం, రెటీనా దెబ్బతినడం వంటివి తలెత్తుతున్నాయి. యూవీ సూచీ సాధారణంగా 5 పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులుండవు. 10 పాయింట్లు నమోదైతే ప్రమాదం తథ్యం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్ స్కిన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుగు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. హరితహారం పనిచేయలేదు.. మహా నగరాన్ని గ్రీన్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. నగరంలో గ్రీన్బెల్ట్ను గణనీయంగా పెంచేందుకు దోహదం చేయలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీ స్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కల్లో 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో గ్రేటర్లో గ్రీన్బెల్ట్ 8 శాతానికే పరిమితమైందని.. ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో గ్రీన్బెల్ట్ 15 శాతానికి పెరగటం అసాధ్యమని అంటున్నారు. గ్రీన్బెల్ట్ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. హరితం తగ్గుముఖం.. శతాబ్దాలుగా తోటల నగరం (బాగ్) గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండటంతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరంలో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగై పర్యావరణం వేడెక్కుతోం ది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్బెల్ట్ ఉండాల్సి ఉండగా.. నగరంలో కేవలం 8 శాతమే ఉండటంతో నగరంలో ప్రాణవాయువు కనుమరుగై సిటిజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రీన్బెల్ట్ శాతం పలు మెట్రో నగరాల్లో ఇలా.. స్థానం నగరం హరితం శాతం 1 చండీగఢ్ 35 2 ఢిల్లీ 20.20 3 బెంగళూరు 19 4 కోల్కతా 15 5 ముంబై 10 6 చెన్నై 9.5 7 హైదరాబాద్ 8 -
ఆ ఒంటెల కథ
అది 1606 సంవత్సరం. డచ్ అన్వేషకుడు విలియమ్ జాన్స్జూన్ మొదటిసారిగా ఆస్ట్రేలియా దేశాన్ని కనుగొన్న యూరోపియన్గా చరిత్రకెక్కాడు. అప్పట్లో ఆ దేశంలో ఆయనకి ఒక్క ఒంటె కూడా కనిపించలేదు. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం 2020 సంవత్సరం. ఒంటెలతో విసిగి వేసారిపోయిన ఆస్ట్రేలియా వాటిని సామూహికంగా కాల్చి చంపే ఆపరేషన్ చేపట్టింది. అయిదు రోజుల్లోనే 10వేలకు పైగా మూగజీవాలను హెలికాప్టర్ నుంచే కాల్చి చంపేసింది. అసలు ఆ ఒంటెలు ఎలా వచ్చాయి ? ఎందుకు వచ్చాయి ? మెల్బోర్న్: కార్చిచ్చులతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియాలో ఒంటెల హనన కాండ ప్రపంచ దేశాల గుండెల్ని పిండేస్తున్నాయి. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియా తమకు ఈ ఒంటెలు మోయలేని భారంగా మారాయంటూ హెలికాప్టర్ల నుంచి గురి చూసి కాల్చి చంపేస్తోంది. వివిధ దేశాలకు చెందిన జంతు ప్రేమికులు ఆస్ట్రేలియా ప్రభుత్వం చేస్తున్న పనిని తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ ఆ దేశం వినిపించుకునే స్థితిలో లేదు. దానికి కారణం ఒంటె అక్కడి స్థానిక జంతువు కాదు. అదీ వలస జంతువే. భారత్ సహా ఎన్నో దేశాల నుంచి ఆస్ట్రేలియా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలనలోనే ఉండేది. అప్పట్లో బ్రిటీషియన్లు తమ రవాణా సౌకర్యాల కోసం ఈ ఒంటెల్ని వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గం ద్వారా తీసుకువచ్చారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పొడి వాతావరణం కలిగిన ప్రాంతం. ఆ వాతావరణంలో గుర్రాలు సరిగ్గా పరిగెత్తలేకపోయేవి. కానీ ఒంటెలు అలా కాదు. అలాంటి వాతావరణమే ఒంటెలకు అనుకూలం. అంతేకాదు రెండు, మూడు వారాలు నీళ్లు తాగకపోయినా ఒంటెలు ప్రయాణించగలవు. అందుకే బ్రిటిష్ పాలకులు ఒంటెల్ని తీసుకురావాలని అనుకున్నారు. 18వ శతాబ్దంలో మొదటిసారి భారత్, అఫ్గానిస్తాన్, అరబ్ దేశాల నుంచి ఒంటెల్ని తెచ్చారు. స్థానిక రవాణా అవసరాల కోసం ఒంటెల్ని వినియోగించేవారు. అలా అలా ఆ ఒంటెలు ఆస్త్రేలియన్ల జీవనవిధానంలో ఒక భాగమైపోయాయి. అనూహ్యంగా పెరిగిపోయిన సంతతి 19వ శతాబ్దంలో రవాణా అవసరాల కోసం మోటార్ వాహనాలపై ఆధారపడ్డాక ఒంటెల అవసరం ప్రజలకి తీరిపోయింది. దీంతో వాటిని పెంచడం మానేశారు. ఆ ఒంటెలు చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్లిపోయాయి. ఆస్ట్రేలియా వాతావరణం ఒంటెలు పెరగడానికి అనుకూలంగా ఉండడంతో వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. 1969లో కేవలం 20 వేలు మాత్రమే ఉండే ఒంటెలు, 1988 నాటికి 43 వేలకి చేరుకున్నాయి. 2001–08 మధ్య కాలంలో వాటి సంఖ్య ఏకంగా 10 లక్షలకు చేరుకుంది. ఒంటెలు పెరిగిపోతూ ఆహారం కోసం, నీళ్ల కోసం జనావాసాలపై పడడం, పంటపొలాల్ని నాశనం చేస్తూ ఉండడంతో ఆస్త్రేలియా ప్రభుత్వం ఒంటెల్ని చంపే కార్యక్రమం చేపట్టింది. 2012లో ఏకంగా ఏడాదికి 75 వేల ఒంటెల్ని కాల్చేసింది. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో ఆహారానికి, నీటికి కటకటగా ఉంది. అందుకే వాటిని చంపేయడమే పనిగా పెట్టుకుంది ఆస్ట్రేలియా. అలా వాటి సంఖ్యను తగ్గించుకుం టూ వస్తోంది. పాపం ఆ మూగజీవాలు, అప్పుడెప్పుడో వలస పాలకులు తమ అవసరం కోసం చేసిన పని ఇప్పుడు వాటికి పెనుశాపమైంది. ► ప్రస్తుతం ఒంటెల సంఖ్య: దాదాపు 3 లక్షలు ► ఆక్రమించిన ప్రాంతం: ఆస్ట్రేలియా భూభాగంలో 37 % ► కలిగిస్తున్న నష్టం: పంట పొలాల ధ్వంసం, సాంస్కృతిక, చారిత్రక కట్టడాల విధ్వంసం, ఒంటెల సంతతి పెరిగిపోతూ ఉండడంతో దెబ్బ తింటున్న జీవ వైవిధ్యం ► దేశానికి కలిగిస్తున్న నష్టం: ఏడాదికి కోటి డాలర్ల నష్టం -
ఈసారి చలి తక్కువట
ఈ ఏడాది చలి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణలో పలు చోట్ల రాత్రిపూట 10 సెంటీగ్రేడ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈసారి కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు తక్కువ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీలు నమోదయ్యే అవకాశముంది. గతంలోలాగా 4 లేదా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఈ సీజన్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు అవుతున్నాయని పేర్కొంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగానే సీజన్లలో గణనీయమైన తేడా కనిపిస్తుందని, ఏడాదిగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్లో గతేడాది డిసెంబర్ 4న 8.3 డిగ్రీల రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్ 4న అక్కడ 15.6 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. అంటే దాదాపు రెట్టింపు ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గతేడాది డిసెంబర్ 4న మెదక్లో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది అదే రోజున 17.8 డిగ్రీలు నమోదైంది. గతేడాది నవంబర్ 27న ఆదిలాబాద్లో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది అదే నెల అదే తేదీన 15.2 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 27న హైదరాబాద్లో 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది అదే నెల అదే తేదీన 18.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అనేక చోట్ల నాలుగైదు డిగ్రీల నుంచి రెట్టింపు వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ మారుతున్న కాలాలు భూతాపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. వేడి తీవ్రత పెరుగుతోంది. దీంతో కాలాలు మారిపోతున్నాయి. అధిక వేడి, అధిక వర్షాలు నమోదవుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో వేసవిలో అధిక వడగాడ్పులు నమోదయ్యాయి. 2017 వేసవి కాలంలో 10 రోజులు కూడా వడగాడ్పులు నమోదు కాలేదు. కానీ 2018 వేసవిలో ఏకంగా 44 రోజులు వడగాడ్పులు వీచాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వచ్చినా సకాలంలో వర్షాలు కురవలేదు. జూలై వరకు పరిస్థితి అలాగే ఉంది. ఆగస్టు తర్వాతి నుంచి అక్టోబర్ వరకు అధిక వర్షాలు కురిశాయి. ఇంకా రాని చలిగాలులు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కూడా ఈసారి ఆలస్యమైంది. సెప్టెంబర్లో మొదలు కావాల్సిన నైరుతి ఉపసంహరణ, అక్టోబర్లో మొదలైంది. దీంతో ఈసారి ఉత్తర భారతం నుంచి రావాల్సిన చలిగాలులు ఆలస్యమయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ఉత్తర భారతం నుంచి చలిగాలులు గత నెల మొదటి, రెండో వారాల మధ్యే తెలంగాణలోకి ప్రవేశించాలి. కానీ ఇప్పటికీ రాలేదు. ఈ నెల మూడో వారంలో వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. ప్రస్తుతం తూర్పు దిశ నుంచి తేమ గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఈ తేమ గాలుల కారణంగా రాత్రి వేళల్లో మేఘాలు ఏర్పడతాయి. ఫలితంగా సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇలా రుతువులు గతి తప్పిపోయాయి. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అంతుబట్టకుండా ఉందని అధికారులు చెబుతున్నారు.