
మల్కన్గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి చిత్రంగ్పల్లి పంచాయతీ పరిధి 6 గ్రామాలకు గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరా లేదు. తుఫాను గాలుల ధాటికి కెసల్గూఢ, గుముకగూఢ, ఏంతాగూఢ, పూజారిగూఢ, తంగగూఢ, ఒరెల్గూఢ గ్రామాల్లోని విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీనిపై పలుమార్లు కలిమెల విద్యుత్శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు అంగీకరించిన కొందరు సిబ్బంది.. లంచంగా కోళ్లు, వాహనం పెట్రోల్ ఖర్చులు ఇస్తేనే బాగు చేస్తామని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై గ్రామాస్తులంతా కలిసి కలిమెల విద్యుత్శాఖ అధికారి పీకే నాయక్ను శుక్రవారం కలిసి, ఫిర్యాదు చేశారు. గత 2 నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్నామని, కరెంట్ లేకపోయినా రసీదు ఇచ్చి బిల్లు చెల్లించమంటున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన అధికారి.. ఘటనపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment