What Happened when Rajiv Gandhi Met Mahatma Gandhi - Sakshi
Sakshi News home page

బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్‌

Published Sun, Aug 20 2023 12:21 PM

What Happened when Rajiv Gandhi Met Mahatma Gandhi - Sakshi

నేడు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. లడఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున రాహుల్ తన తండ్రికి నివాళులర్పించారు. 

21వ శతాబ్దపు సృష్టికర్తగా పేరొందిన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగానే ఇండియన్ టెలికాం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. దేశంలోకి మొదటిసారిగా కంప్యూటర్‌లను తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇవన్నీ రాజీవ్‌ విజయాల ఖాతాలో చేరుతాయి. రాజీవ్ గాంధీ జీవితానికి సంబంధించిన పలు అంశాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. వీటిలో ఒకటి ఆయన మహాత్మా గాంధీని కలవడం. 

అప్పుడు రాజీవ్ వయసు 4 సంవత్సరాలు. అది 1948, జనవరి 29... సాయంత్రం మహాత్మా గాంధీని కలవడానికి రాజీవ్‌ను తీసుకుని అతని తల్లి ఇందిరా గాంధీ వెళ్లారు. ఇందిర, రాజీవ్‌లతో పాటు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అతని సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు మహాత్ముడిని కలవడానికి వెళ్లినవారిలో ఉన్నారు. 

ఇందిరా గాంధీ జీవిత చరిత్రను రాసిన కేథరీన్ ఫ్రాంక్.. ఆ రోజు సాయంత్రం ఇందిర ఇంటి నుండి బయలుదేరే ముందు, వారి ఇంటి తోటమాలి మల్లెపూలను తీసుకువచ్చి, ఆమెకు ఇచ్చారని రాశారు. ఆ మల్లెపూలను గాంధీజీకి ఇవ్వాలని ఇందిరాగాంధీ అనుకున్నారు. వారంతా కలిసి బిర్లా హౌస్‌కు బయలుదేరారు. ఎప్పటిలాగే ఆ సమయంలో మహాత్మా గాంధీ బిర్లా హౌస్ లాన్‌లో సన్‌బాత్‌ చేస్తున్నారు. 

ఇందిరా గాంధీ, నెహ్రూ సోదరి కృష్ణ హతీ సింగ్, నయనతార పండిట్, పద్మజా నాయుడు తదితరులు గాంధీ దగ్గర కూర్చున్నారు. ఆ పక్కనే రాజీవ్ గాంధీ సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్.. మహాత్మా గాంధీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ చిన్నారి రాజీవ్ మనసులో ఏమనుకున్నాడోగానీ మహాత్ముని పాదాలపై మల్లెపూలు జల్లడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన జాతిపిత మహాత్మాగాంధీ.. రాజీవ్‌ను పైకి లేపి.. ‘అలా చేయకూడదు. చనిపోయిన వ్యక్తుల పాదాలపై మాత్రమే పూలు జల్లుతారని’ హితవు పలికారు.

ఆ మరుసటి రోజే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. 1948, జనవరి 30 న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. మహాత్ముడు ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా నాథూరామ్ గాడ్సే జనసమూహం మధ్య నుంచి వచ్చి, గాంధీపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. 
ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?

Advertisement
Advertisement