ట్రాఫిక్ డీసీపీ నాయుడుకి మహోన్నత సేవా పథకం
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా పథకానికి ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎం.కృష్ణమూర్తి నాయుడు ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో సమర్థంగా పనిచేసి ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు గాను 2025వ సంవత్సరానికి మహోన్నత సేవా పథకానికి ఎంపికయ్యారు. 1989లో కృష్ణమూర్తి నాయుడు ఎస్ఐగా సర్వీస్ ప్రారంభించి అంచెలంచెలుగా డీసీపీ స్థాయి హోదాకు ఎదిగారు. సేవా పథకానికి ఎంపికై న కృష్ణమూర్తి నాయుడుని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ప్రత్యేకంగా అభినందించారు.
ఎస్ఆర్ఆర్ కళాశాలలో పీ4 జిల్లా స్థాయి పోటీలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పేదరిక నిర్మూలన అనే అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ మేకింగ్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని తమలోని సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్, డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ అజయ్ బాబు, డాక్టర్ రాధిక, డాక్టర్ పీఎల్ దాస్, డాక్టర్ భాను ప్రసాద్ వ్యవహరించారు.
సుబ్రహ్మణ్యుని సన్నిధిలోసీఐఎస్ఎఫ్ బృందం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని కొల్కత(వెస్ట్ బెంగాల్) సీఐఎస్ఎఫ్ బృందం శుక్రవారం దర్శించుకుంది. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఆలయ సిబ్బందితో కలసి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్ట లో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు విరూప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కొల్కత నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర చేపట్టిన సీఐఎస్ఎఫ్ బృందానికి ఆలయ అధికారి మధుసూదనరావు, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.
నీరు అత్యంత విలువైన వనరు
గుడివాడటౌన్: ప్రపంచంలో అత్యంత విలువైన వనరు నీరు అని 11వ అదనపు జిల్లా జడ్జి జి.సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. నీటి వాడకంలో మార్పులను ప్రేరేపించడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. శనివారం జరగనున్న ప్రపంచ నీటి దినోత్సవంను ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నీటి నిల్వలు పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటిని సంరక్షించాలని, నీటి వినియోగంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నీటిని వృథా చేయకుండా ఉండటం, పరిశుభ్రమైన నీటిని తాగడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు. నీటి కాలుష్యం తగ్గేలా, నీటిలో ప్రమాదకరమైన రసాయనాల విడుదల అరికట్టేలా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పర్వతాలు, అడవులు, చిత్తడి నేలలు, నదులు, జలాశయాలు, సరస్సులు వంటి నీటి సంబంధిత పర్యావరణ వ్యవస్థను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ట్రాఫిక్ డీసీపీ నాయుడుకి మహోన్నత సేవా పథకం
ట్రాఫిక్ డీసీపీ నాయుడుకి మహోన్నత సేవా పథకం
ట్రాఫిక్ డీసీపీ నాయుడుకి మహోన్నత సేవా పథకం
Comments
Please login to add a commentAdd a comment