కాల వైశాఖి పరిహారంపై హామీ
భువనేశ్వర్: రాష్ట్రంలో మయూర్భంజ్ జిల్లాలో కాల వైశాఖి (గాలి వాన) విధ్వంసం సృష్టించింది. వివిధ ప్రాంతాల్లో గూడు చెదిరి పలువురు ప్రజలు తలదాచుకోలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పీడిత ప్రజలకు తక్షణమే పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాంతంలో 400కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మయూర్భంజ్ జిల్లాలో బంగిరిపోషి ప్రాంతం భారీగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో కాల వైశాఖి తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ కుమార్ పూజారి ఆదివారం ప్రత్యక్షంగా అంచనా వేశారు. ఈ సందర్భంగా, బాధిత వర్గాలకు నష్టాలకు పూర్తి ఆర్థిక పరిహారం అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు.
ఆన్లైన్లో పరిహారం చెల్లింపు
క్షేత్ర స్థాయిలో కాల వైశాఖి నష్టం నివేదికను ఖరారు చేసిన ప్రకారం ఆదివారం సాయంత్రం నాటికి బాధితులకు పరిహార నిధులు అందుతాయి. తక్షణ సహాయ చర్యలో భాగంగా ఈ మొత్తం ఆన్లైన్లో బాధితుల ఖాతాలకు ప్రత్యక్షంగా బదిలీ అవుతాయని మంత్రి వివరించారు. ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. లేని వారికి ప్రత్యక్షంగా నగదు రూపంలో పరిహారం చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
19 పంచాయతీల్లో విధ్వంసం
వాస్తవానికి మయూర్భంజ్ జిల్లాలో గత రెండు రోజులుగా కాల వైశాఖి విధ్వంసం సృష్టిస్తోంది. ప్రధానంగా బంగిరిపోషి, బిషోయ్, కులియానా, సొరొసొకొనా మరియు కరంజియా మండలాల్లో విస్తృత విధ్వంసం సృష్టించింది. జిల్లాలో 19 పంచాయతీల్లో 400 కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. అనేక కుటుంబాలు నిరాశ్రయులై ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితుల బాగోగుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు స్థానిక సీనియర్ రెవెన్యూ అధికారులు బాధిత ప్రాంతాల్లో సందర్శించి సత్వర సహాయం అందజేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక అధికారులు, విపత్తు ప్రతిస్పందన బృందాలతో కలిసి, సాధారణ స్థితిని పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. జిల్లా యంత్రాంగం సహాయ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. అవసరమైన వారికి ఆహారం, తాత్కాలిక ఆశ్రయం వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించేలా చూస్తోంది.
కాల వైశాఖి పరిహారంపై హామీ
కాల వైశాఖి పరిహారంపై హామీ
కాల వైశాఖి పరిహారంపై హామీ
కాల వైశాఖి పరిహారంపై హామీ