తాగునీటి సమస్య పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య పరిష్కారం

Published Sat, Mar 29 2025 12:48 AM | Last Updated on Sat, Mar 29 2025 12:44 AM

తాగున

తాగునీటి సమస్య పరిష్కారం

కొరాపుట్‌: జిల్లాలోని బందుగాం సమితి గిరిడి గ్రామంలో సాగునీటి సమస్య పరిష్కారమైందని జిల్లా పరిషత్‌ ప్రెసిడెంట్‌ సస్మితా మెలక తెలిపారు. ఈనెల 22వ తేదీన ఆమె వాహనాన్ని గ్రామస్తులు అడ్డగించడంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. శుక్రవారం ఉదయం గ్రామానికి తాగునీటి పైపుల ద్వారా నీరు వచ్చింది. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

7 నుంచి డిగ్రీ నాలుగో

సెమిస్టర్‌ పరీక్షలు

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభించనున్నట్లు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఇన్‌చార్జి డీన్‌ డాక్టర్‌ పి.పద్మారావు తెలిపారు. పరీక్షల నిర్వహణ కేంద్రంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఏప్రిల్‌ 21 వరకు పరీక్షలు జరుగుతాయని 53 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఫిబ్రవరిలో జరగాల్సిన డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్‌ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు మే చివరి వారంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఫీజులు స్వీకరిస్తున్నామని, ఏప్రిల్‌ 5లోపు అదనపు రుసం లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు.

యువకుడు అరెస్టు

సోంపేట: మండలంలోని బేసిరామచంద్రాపురంలో మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడికి ప్రయత్నించిన యువకుడిని అరెస్టు చేసినట్లు బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు శుక్రవారం తెలిపారు. దివ్యాంగురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శృంగారపు ప్రసాద్‌ ఆచారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

30, 31న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలు యథాతథం

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఈ నెల 30, 31 సెలవు దినాలైనప్పటికీ జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని డీఐజీ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, అమ్మకందారులు రిజిస్ట్రేషన్లు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు.

ఫిషరీస్‌ డీడీకి పదోన్నతి

అరసవల్లి: జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పి.వి.శ్రీనివాసరావుకు పదోన్నతి లభించింది. డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడేళ్లుగా శ్రీకాకుళం జిల్లాలోనే వివిధ హోదాల్లో శ్రీనివాసరావు విధులు నిర్వర్తించారు. తాజా పదోన్నతుల్లో ఈయనకు క్యాడర్‌ పెరగడంతో పాటు బదిలీ చేశారు. పలాసలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణకు జిల్లా ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది.

సమగ్ర విచారణకు డిమాండ్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని క్రిస్టియన్‌ సెక్యూర్‌ సర్వీసెస్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ బిషప్‌ బర్నబాస్‌ బింకం, ప్రధాన కార్యదర్శి బ్రదర్‌ ఒంపూరు రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ను చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 24న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్‌గేట్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో ప్రవీణ్‌ మృతిచెందారని, దీనిపై పలు అనుమానాలు ఉన్నందున విచారణ జరిపి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని, క్రైస్తవుల రక్షణకు భద్రత కల్పించాలని కోరారు. జేసీని కలిసిన వారిలో సీఎస్‌ఎస్‌ నాయకులు, పాస్టర్లు ఎం.షడ్రక్‌బాబు, జి.శామ్యూల్‌ అరుణ్‌కుమార్‌, టి.పేతురు, ఇ.శామ్యూల్‌ జాన్‌, ప్రత్తిపాటి ప్రసాద్‌, ఎ.ఎ.పాల్‌, అల్లు ఇమ్మానుయేల్‌, ఆశిర్‌కుమార్‌, అహరోన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారం 1
1/2

తాగునీటి సమస్య పరిష్కారం

తాగునీటి సమస్య పరిష్కారం 2
2/2

తాగునీటి సమస్య పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement