కమలదళం.. కదనరంగం | Sakshi
Sakshi News home page

కమలదళం.. కదనరంగం

Published Mon, Mar 25 2024 5:03 AM

BJP 30 day election plan finalized in Telangana for LS Polls - Sakshi

30 రోజుల ఎన్నికల ప్రణాళిక ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలరోజులకు (మార్చి25 – ఏప్రిల్‌ 25)పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను రాష్ట్ర బీజేపీ సిద్ధం చేసింది. పోలింగ్‌బూత్‌ స్థాయిల్లో మోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినవారు, మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)ను కలిసి వారిద్వారా వివిధవర్గాల మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది.

ఆదివారం పార్టీ కార్యాలయంలో  కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యకుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ కన్వీనర్లు, ప్రభారీలు, మోర్చాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయకార్యదర్శి సునీల్‌ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ పాల్గొన్నారు.

నేతల తీరుపై సునీల్‌బన్సల్‌ అసంతృప్తి ! 
అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించినా, ఆశించినస్థాయిలో జనాల్లోకి వెళ్లలేదని బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌బన్సల్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. డిజిటల్‌ వ్యాన్స్‌ ఇచ్చాం. అయినా ఎక్కడా తిరగట్లేదు..ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించినట్టు సమాచారం. ‘ప్రతి బూత్‌లో అధికంగా ఓట్లు వస్తేనే.. పార్లమెంట్‌ స్థానాలు గెలుస్తాం. మనకు ఇంకా టైం ఉంది. ఇప్పటికైనా స్పీడప్‌ చేయాలి. అలా అయితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పినట్టు తెలిసింది.     

పదాధికారుల భేటీలో తీసుకున్న నిర్ణయాలు 
► పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్‌ 6న పోలింగ్‌సెంటర్‌ వారీగా ’టిఫిన్‌ బైఠక్‌’ల నిర్వహణ
► నమో యాప్‌ ద్వారా చిన్నమొత్తం నిధులు (మైకో డొనేష¯ŒŒ్స) పొందేందుకు కృషి 
► ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం
► ప్రతి పోలింగ్‌ బూత్‌లో 370 ఓట్లు (సుమారుగా పోలైన ఓట్లలో 50 శాతం) సాధించేందుకు కృషి

​​​​​​​► ప్రతి బూత్‌ను పార్టీ బలాన్ని బట్టి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి బలోపేతానికి కృషి చేయాలి
​​​​​​​► లోక్‌సభ అభ్యర్థి నేరుగా పాల్గొనేలా సమావేశాల నిర్వహణ
​​​​​​​► లోక్‌సభ, అసెంబ్లీ స్థాయిల్లో ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ భేటీలు తరచు నిర్వహించి, ప్రచార కార్యక్రమాల ముమ్మరం 
​​​​​​​► గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని స్థా యిల్లో కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించడం
​​​​​​​

► వివిధ మోర్చాలు.. ముఖ్యంగా యువమోర్చా– మొదటిసారి ఓటేస్తున్న యువతను ఆకర్శించే విధంగా, కిసాన్‌మోర్చా– రైతులలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మోర్చాలు– ఆయా వర్గాలతో నిరంతర సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీకి అధిక ఓట్లు వచ్చే విధంగా కృషి చేయడం
​​​​​​​►  నామినేషన్ల దాఖలు పూర్తయ్యే దాకా ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌లో విస్తృతస్థాయి సమావేశాల ఏర్పాటు 

​​​​​​​► బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు తన పోలింగ్‌ బూత్‌లో కోఆర్డినేటర్‌గా పనిచేయాలి
​​​​​​​► నామినేషన్ల దాఖలులోపు బూత్‌ స్థాయిలో ఓటర్ల లిస్ట్‌పై అవగాహన కల్పించుకోవాలి
​​​​​​​► ఎన్నికలలోపు ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు కలిసేవిధంగా కార్యాచరణ  రూపొందించాలి 

Advertisement
 
Advertisement