
మరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టో
సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టి
ప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధి
బాబులా అబద్దపు హామీలు ఇవ్వం
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స
విశాఖ సిటీ: ‘మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వం. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతానికి పైగా నెరవేర్చాం. తాజాగా పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని, మరింతగా ప్రజోపయోగమైన అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం జగన్ 2024 మేనిఫెస్టో రూపొందించారు.
రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఆమోదించి, మరోసారి జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించాలి’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు నిక్కచ్చిగా, కచ్ఛితంగా ఏదైతే చేస్తామని చెప్పారో, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి దళారులు, మధ్యవర్తులు లేకుండా రూ.2.7 లక్షల కోట్లు నేరుగా పేద ప్రజలకు అందించారని తెలిపారు.
దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో 99 శాతం అమలు చేయలేదని, ఒక్క సీఎం వైఎస్ జగన్కి మాత్రమే అది సాధ్యమైందని, దేశ రాజకీయాల్లో కొత్త రికార్డులు నెలకొల్పి ఈ రోజు మీ ముందుకు వచ్చారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలని చెప్పారు. విద్య, వైద్యాన్ని ఒక పెట్టుబడిగా చూస్తున్నామన్నారు.
మూడు రాజధానులు మా అజెండా
రాష్ట్ర సమగ్రాభివద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించారని తెలిపారు. ఇదే తమ అజెండా అని చెప్పారు. దీనిని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లగలరా అని కొందరు ప్రశ్నించారని, ఇప్పుడు అదే రెఫరెండంగా మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళుతున్నామని చెప్పారు.

విశాఖను ప్రపంచంలో మేటి నగరంగా తయారు చేయడానికి సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఇక్కడ ఐటీ హబ్, డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పట్టణ ప్రజల కోసం అర్బన్ లేఅవుట్లు డెవలప్ చేసి గృహ నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు కాస్ట్ టు కాస్ట్కు ఇళ్లు ఇవ్వడంపై దృష్టి పెడతామన్నారు.
అవుట్ సోర్సింగ్లకు తీపి కబురు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆదాయ పరిమితి పెట్టడంతో నవరత్నాలు అందడంలేదన్న ఉద్యోగ సంఘాల వినతిని తాము సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని రూ.25 వేలు వరకు జీతాలున్న వారందరూ అర్హులని మేనిఫెస్టోలో చేర్చడం చాలా పెద్ద విషయమన్నారు.
ఇందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. విద్యా శాఖలో ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నో వెకెన్సీ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏ ఏడాది ఖాళీ ఏర్పడితే అదే ఏడాది భర్తీ చేసే విధానాన్ని తేవాలని చూస్తున్నామన్నారు.
బాబు మోసకారి.. టీడీపీ నక్కల పార్టీ
చంద్రబాబు మోసకారి అని, టీడీపీ నక్కల పార్టీ అని బొత్స వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులను, మహిళలను మోసం చేశాడన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీనీ అమలు చేయలేదని, మేనిఫెస్టోనే మాయం చేశారని చెప్పారు.
బాబు రూ.4 వేలు పెన్షన్ ఇస్తానన్నా ఎవరు నమ్మరని అన్నారు. 2019లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన నాటికి మహిళలకు ఎంత రుణం ఉందో అంతటినీ ముఖ్యమంత్రి జగన్ మాఫీ చేశారని గర్వంగా చెబుతున్నామని అన్నారు.
నాడు స్నోలు, పౌడర్లకు మూల ధన వ్యయం
టీడీపీ హయాంలో మూల ధన వ్యయం ఏడాదిలో రూ.15,227 కోట్లు మాత్రమే కేటాయించి, దానిని కూడా స్నోలు, పౌడర్లకు దుబారా ఖర్చు చేశారన్నారు. అందులోనూ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఆస్పత్రులు, నాడు–నేడు, వెల్నెస్ సెంటర్ల కోసం ఏటా రూ.17,757 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారని చెప్పారు. ఇప్పుడు ఇది మైనస్ రూ.366 కోట్లుగా ఉందన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిలోనే అప్పులు తెచ్చామని, ఇదీ జగన్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment