CM KCR Comments On Congress And BJP Over BRS Rule In Maharashtra, Details Inside - Sakshi

మాది రైతుల టీం

Jun 28 2023 1:25 AM | Updated on Jun 28 2023 9:57 AM

CM KCR Comments On Congress And BJP - Sakshi

సర్కోలి సభలో విఠలుడి సంగీత పరికరాలుగా భావించే తంబుర, చిడతలతో సీఎం కేసీఆర్‌. మహారాష్ట్ర నేత భగీరథ బాల్కే వీటిని బహూకరించారు

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ప్రస్థానం ప్రారంభమైన మూడు నెలల్లోనే బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఏ పార్టీ కూడా తమను వదలకుండా విమర్శలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. రెండు జాతీయ పార్టీలు ఒకరికొకరు తమను బీ టీం అంటూ విమర్శలు చేస్తున్నాయని, తాము ఎవరికీ ‘ఏ’ టీం, ‘బీ’ టీం కాదని చెప్పారు. తాము రైతులు, వెనుకబడిన వర్గాలు,  అల్పసంఖ్యాకులు, దళితుల టీమ్‌ అని ప్రకటించారు. రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం సర్కోలిలో ఎన్‌సీపీ మాజీ ఎమ్మెల్యే భరత్‌ బాల్కే కుమారుడు భగీరథ బాల్కే తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ముందుకెళ్తున్న బీఆర్‌ఎస్‌కు దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న రైతులు, కార్మికులు మద్దతు పలుకుతున్నారన్నారు. దీన్ని జీర్ణించుకోలేక అన్ని పార్టీలు వింత ప్రకటనలు చేస్తున్నాయని పేర్కొన్నా­రు. బీఆర్‌ఎస్‌ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదని భారత్‌ పరివర్తన కోసం పనిచేసే మిషన్‌ అని చెప్పారు. 

మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా లక్ష్యం లేకుండా పయనిస్తోందని, దక్షిణకొరియా, జపాన్, సింగపూర్, మలేసియా, చైనా వంటి ఎన్నో దేశాలు గొప్పగా అభివృద్ధి చెందాయని కేసీఆర్‌  అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, బీజేపీ సహా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అతి తక్కువ సమయంలో రైతు సంక్షేమం కోసం పనిచేసిందన్నారు.

తెలంగాణ మాదిరిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ధి సాధ్యం కాలేదని ప్రశ్నించారు. దేశంలో కోట్లాది ఎకరాల వ్యవసాయ భూమి, 75 వేల టీఎంసీల నీరు ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధానాలు అమలు చేస్తే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించవచ్చన్నారు. నూతన జల విద్యుదుత్పత్తి విధానాలను బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలోని బొగ్గు నిల్వలు 150 సంవత్సరాలపాటు అవసరాలను తీరుస్తాయని, రైతులు ఏకమైతేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి తెలంగాణ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలన్నారు. పనిచేయని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌లో చేరిన భగీరథ బాలే్కను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. 
 
రైతు బతికుంటేనే ప్లేటులోకి భోజనం 
‘రైతు బతికుంటే ఎవరు మరణిస్తారు, రైతు మరణిస్తే ఎవరు బతుకుతారని నేను నిత్యం చెబుతుంటాను. రైతు జీవించి ఉంటేనే భోజనం మన ప్లేటులోకి వస్తుంది. రైతు మరణిస్తే అందరి భోజన పాత్రలు ఎండిపోతాయి. రైతులు లేకుంటే ఇక ఎవరు బతకగలరు’ అని కేసీఆర్‌ చెప్పారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడితే రైతులందరికీ పెన్షన్‌ ఇవ్వడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తామన్నారు.

‘తుమ్మచెట్టును నాటితే మామిడి పండ్లు ఎలా కాస్తాయి. మామిడి పండ్లు తినాలనుకుంటే మామిడి చెట్టునే నాటాలి. పాలు కావాలంటే ఆవులకు గడ్డి వేయండి, గాడిదలకు గడ్డి వేసి, ఆవుల నుండి పాలు ఎలా పొందగలం’ అంటూ ఓటు శక్తితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్‌ అన్నారు. 
 
ముగిసిన మహారాష్ట్ర పర్యటన 
రెండురోజుల పర్యటనకు రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో వెళ్లిన కేసీఆర్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు. సోమవారం రాత్రి షోలాపూర్‌ బాలాజీ సరోవర్‌ హోటల్‌లో బస చేసిన కేసీఆర్‌ మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతోపాటు పండరీపూర్‌కు చేరుకున్నారు. 10 గంటలకు పండరీపూర్‌లోని శ్రీ విఠల్‌ రుక్మిణిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు.

అనంతరం సర్కోలిలోని భగీరథ బాల్కే నివాసానికి చేరుకుని ఆయన తండ్రి స్మారకానికి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. తర్వాత పార్టీ నేతలతో కలిసి భాల్కే నివాసంలో భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు సోలాపూర్‌కు చేరుకున్నారు. సోలాపూర్‌లోని స్థానిక కార్పొరేటర్‌ నగేశ్‌ వల్లియర్‌ నివాసానికి చేరుకుని పార్టీ నేతలతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు తుల్జాపూర్‌ భవానీ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.  
 
విఠల్, రుక్మాయిలను దర్శించుకున్న కేసీఆర్‌ 
షోలాపూర్‌: పార్టీ విస్తరణలో భాగంగా షోలాపూర్‌ పర్యటనకు వచ్చిన బీఆర్‌ఎస్‌ చీఫ్, సీఎం కేసీఆర్‌ మంగళవారం ఉదయం పండరీపూర్‌లోని విఠల్, రుక్మాయిలను దర్శించుకున్నారు. ఉత్తరద్వారం నుంచి ఆలయంలోకి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు, నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. విఠలేశ్వరుడి పాద ముద్రికలు, మూల విరాట్‌ విగ్రహం దర్శనానంతరం కేసీఆర్‌ రుక్మిణీ అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు.

అర్చకులు కేసీఆర్‌ మెడలో తులసిమాలను వేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని, వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆషాఢ ఏకాదశి పర్వదినానికి రెండు రోజులే ఉండటంతో ఆలయంలో, బయట భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో కేసీఆర్, కొందరు ప్రజాప్రతినిధులు మినహా ఆయన వెంట వచ్చిన మిగతా వారికి వీఐపీ దర్శనం కల్పించలేదు. దీంతో వారు ఆలయ శిఖర దర్శనం చేసుకుని వెనుదిరిగారు.

అదేవిధంగా ముందుగా ప్రకటించిన ప్రకారం వేయి కేజీల గులాబీ పూలను హెలికాప్టర్‌ ద్వారా కురిపించేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. హైదరాబాద్‌ నుంచి కేసీఆర్‌ వెంట వచ్చిన 600 వాహనాలను భద్రతా కారణాలతో పోలీసులు పండరీపూర్‌లోకి అనుమతించలేదు. కేసీఆర్‌ షోలాపూర్‌ నుంచి పండరీపూర్‌ ఆలయానికి వస్తున్న క్రమంలో స్థానికులు ఆయనను చూసేందుకు పోటీపడ్డారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.  

 కేసీఆర్‌కు భగీరథ్‌ బాల్కే ఆధ్వర్యంలోని నాయకులు విఠలేశ్వరుడి సంగీత పరికరాలుగా భావించే తంబుర, చిడతలతోపాటు విఠలేశ్వర, రుక్మిణీ అమ్మవారి ప్రతిమను బహూకరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement