‘75 ఏళ్లకు రిటైర్‌ కానని మోదీ చెప్పలేదు’.. కేజ్రీవాల్‌ విమర్శలు | Sakshi
Sakshi News home page

‘75 ఏళ్లకు రిటైర్‌ కానని మోదీ చెప్పలేదు’.. కేజ్రీవాల్‌ విమర్శలు

Published Thu, May 16 2024 12:48 PM

cm Kejriwal says Modi never said he wont retire at 75

లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయస్సు, రిటైర్‌మెంట్‌పై విమర్శలు సంధించారు. ఇప్పటి వరకు పీఎం మోదీ.. తాను 75 ఏళ్ల వయస్సు దాటాక రిటైర్‌ కానని, ఎక్కడా స్పష్టం చేయలేని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌తో పాటు కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడారు.

‘ప్రధాని మోదీ తనకు 75 ఏళ్లు దాటాక, తాను పదవీ విరమణ చేయనని.. ఎప్పుడూ స్పష్టం చేయలేదు. 75 ఏళ్ల తర్వాత రిటైర్‌ కావాలనే నిబంధనను మోదీ ఉల్లంఘించరని  దేశం మొత్తం నమ్మకంతో ఎదురుచూస్తోంది’ అని సీఎం కేజ్రీవాల్‌ అన్నారు.

‘బీజేపీ అమిత్‌ షాను ప్రధాని చేయటం కోసం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం.. సీనియర్‌ నేతలైన శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ రమణ్ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి వారిని పక్కకు పెట్టింది. దీనికి అడ్డుగా ఉన్న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను కూడా మరో 2-3 నెలల్లో బీజేపీ పక్కకు పెడుతుంది’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు చేశారు.

ఇక.. ఇటీవల తిహార్‌ జైల్‌ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ ఓర్యాలీలో పాల్గొని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.‘ ఈసారి బీజేపీ గెలిస్తే.. అమిత్‌ షాను ప్రధానిగా చేయాలని బీజేపీ ప్రణాళిక వేస్తుంది. ఎందుకుంటే 2025 వరకు మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. దీంతో బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం మోదీ.. ఏ పదవీ చేపట్టకుండా రిటైర్‌ అయిపోతారు. తర్వాత అమిత్‌ షా పీఎం అవుతారు’అని అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. 

కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. ‘నరేంద్ర మోదీ 2029 వరకు అంటే.. పూర్తి ఐదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత కూడా బీజేపీ పార్టీకి  ఆయన నాయకత్వం వహిస్తారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగా మోదీ వయస్సుపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement