
సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, పన్నుల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరల వ్యత్యాసాన్ని రామకృష్ణ వివరించారు.
రూ.60 పెంచి రూ.5 తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. ఈ నెల 14న తిరుపతి వస్తున్న హోం మంత్రి అమిత్ షాకు పెట్రోల్ ధరలపై నిరసన తెలుపుతామన్నారు. ఏపీలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పని తీరు సరిగా లేదని ఆరోపించారు. రష్యా విప్లవం విజయవంతమైన రోజును పురస్కరించుకుని లెనిన్ చిత్రపటానికి పార్టీ నాయకులు రామకృష్ణ, జల్లి విల్సన్, రావుల వెంకయ్య, వై.చెంచయ్య, నార్లవెంకటేశ్వరరావు పుష్పాంజలి ఘటించారు.