
ప్రభుత్వ అవసరాల కోసమే ఆ భవనాల నిర్మాణం
మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
కొమ్మాది (విశాఖ): విశాఖపట్నం బీచ్రోడ్డులో రుషికొండపై నిర్మించిన భవనాల విషయంలో టీడీపీ నేతలు గడిచిన మూడేళ్లుగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని, దానిని తక్షణమే మానుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎండాడలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రుషికొండపై ప్రభుత్వ అవసరాల కోసం ఆ భవనాలను నిర్మించామన్నారు. అయితే ఆ భవనాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సొంతానికి నిర్మించుకున్నారంటూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రుషికొండపై నిర్మాణాలు సాగనీయకుండా అనేక సార్లు కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ నిర్మాణాలకు ముందే సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేశామని, ఆ కమిటీ ఇచ్చిన సూచనలు మేరకు ముందుకు సాగామని తెలిపారు. విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ వంటి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేనందువల్లే ఆ భవనాలను నిర్మించామని తెలిపారు.
ఈ భవనాలు వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించే అవకాశం ఉన్నందున భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు వాటిని బహిర్గతం చేయలేదని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వీటిని బహిర్గతం చేశారని అన్నారు. అదే విధంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఇక్కడి నుంచే పాలన సాగించాలని వైఎస్ జగన్ భావించారని వివరించారు. రాష్ట్రంలో అధికార మారి్పడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పర్యాటక శాఖకు సంబంధించిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన చేయాలన్నారు.
అమరావతి పేరుతో రూ.వేల కోట్లు దుర్వినియోగం
గతంలో 2014–19 సమయంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో తాత్కాలిక భవనాల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని అమర్నా«థ్ చెప్పారు. హైదరాబాద్లో చంద్రబాబు అత్యంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులను ఓ హోటల్లో ఉంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశి్నంచారు.
నిజంగా గంటా శ్రీనివాసరావు ప్రజలకు వాస్తవాలు చూపించాలి అనుకుంటే ఇదే నిర్మాణం ఎదురుగా గీతం ఆక్రమణలు బహిర్గతం చేసి ప్రజలకు చూపించాలన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగమైన భోగాపురం ఎయిర్పోర్టు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేటలో పోర్టు, మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ వంటివి నిర్మించామని వాటినీ ప్రజలకు చూపించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment