Perni Nani Comments On BJP Leaders And Chandrababu - Sakshi
Sakshi News home page

జేపీ నడ్డా వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్‌

Published Sun, Jun 11 2023 1:02 PM

Perni Nani Comments On Bjp Leaders And Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు పెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని.. ఆ హామీని గత ప్రభుత్వ హయాంలో ఎందుకు నెరవేర్చలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన పాపాలకు కారణం ఎవరు?. సీఎం రమేష్‌, సత్యకుమార్‌, సుజనా మాటలను నడ్డా తన బుర్రలో  ఎక్కించుకుని మాట్లాడితే అది వారి కర్మ అంటూ దుయ్యబట్టారు.

‘‘రాజధానికి డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారని మీరు చెప్పారు. ఇసుక ప్రీ అంటూ టీడీపీ, బీజేపీ పెద్దలు దోచుకున్నారు. మీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?. ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలి. మా ప్రభుత్వ చర్యలతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు రేట్లు పెంచాం. గత టీడీపీ ప్రభుత్వం లిక్కర్‌ షాపులను ఇద్దరికే కట్టబెట్టింది. లిక్కర్‌ సిండికేట్‌ను దందాగా నడిపింది మీరు కాదా?’’ అంటూ మండిపడ్డారు.
చదవండి: వంద‌ల మంది రెడ్ల ప్రాణాలు తీసిన‌ప్పుడు ఎక్క‌డున్నావ్!

‘‘ల్యాండ్‌ స్కామ్‌ అంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణలో ఉంటుంది. మీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తే బాగుంటుంది. పేదలకు నేరుగా రూ.2.16 లక్షల కోట్లను అందించిన ఘనత సీఎం జగన్‌ది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇందులో సగం డబ్బయినా ఇచ్చారా?. బెంగుళూరులో జనం ఊసిన ప్రభుత్వం మీది కాదా?. పచ్చ పువ్వులతో నిండిన బీజేపీ కాస్త టీజేపీగా మారింది’’ అని పేర్ని నాని మండిపడ్డారు.

అమరావతి పాపాలకు కారణం ఎవరు? అప్పుడో మాట.. ఇప్పుడో మాటా?
అమరావతిలో జరిగిన పాపాలకు కారణం ఎవరు? రాజధానికి డబ్బులు ఇస్తే.. చంద్రబాబు దోచేశారని బీజేపీ వారే చెప్పారు. ఇసుక ఫ్రీ అంటూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో దోచుకున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో రూ.4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. మరి, గతంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో రూ.4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డా సమాధానం చెప్పాలి. ఎన్నికలప్పుడు బీజేపీ పువ్వులు ఏమి మాట్లాడాయి. ఈ రోజు ఏమి మాట్లాడుతున్నారు. ఆరోజున మేనిఫెస్టోలో పాపాలు జరిగాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులు చంద్రబాబు తినేశాడని మాట్లాడారు. రాజధాని కట్టుకోమని బోలెడంత డబ్బులు ఇస్తే గేదె మేసేసినట్లు మేసేశాడని ఆనాడు బీజేపీ వారు మాట్లాడారు. ఇవాళ అమరావతిని బలపరుస్తున్నామంటే.. మరి, అమరావతిలో జరిగిన పాపాలకు బాధ్యులెవరు? 

బీజేపీ, టీడీపీ (2014-19) హయాంలో రూ.4,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయ్?
ఆంధ్రప్రదేశ్‌లో స్యాండ్ స్కామ్ అని నడ్డా గారు అంటారు. 2014-19 వరకు టీడీపీ, బీజేపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని ఏలిన మాట వాస్తవం. మీ ప్రభుత్వంలో (బీజేపీ, టీడీపీ) ఇసుక ఫ్రీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ నదుల్లో ఉన్నటువంటి ఇసుకను అంతా బీజేపీ, టీడీపీ పెద్దలు అందరూ దోచుకున్నారు. మిద్దెలు మీద మిద్దెలు కట్టుకున్నారు. ఓడలు లాంటి కార్లలో తిరిగారు. 

సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఐదేళ్లలో (2019-2024) వచ్చే రాబడి రూ.4,000 కోట్లు. మరి, ఈ రూ.4,000 కోట్ల రాబడి టీడీపీ, బీజేపీ హయాంలో ఎవరి జేబుల్లోకి వెళ్లింది. మేం ధైర్యంగా చెబుతున్నాం. మా హయాంలో ఇసుక మీద రాష్ట్ర ప్రజలకు రూ.4,000 కోట్ల రాబడి వచ్చింది. 

చంద్రబాబు హయాంలో లిక్కర్‌ స్కాం 
లిక్కర్ స్కాం అని నడ్డా మాట్లాడుతున్నారు. ఢిల్లీ రికమెండేషన్ పేరుతో మూడు, నాలుగు కంపెనీలకు 80% అమ్మకాలు కట్టబెట్టారు. నేడు రాష్ట్రంలో 20 కంపెనీలకు అమ్మకాలను ఇవ్వటం జరిగింది. ఎవరిది స్కాం ఎవరిది? బీజేపీ, టీడీపీ హయాంలో ఊరూరా వేల బెల్ట్‌షాపులు ఉన్నాయి. బ్రాందీ అంతా ప్రైవేటు దందాగా బీజేపీ, టీడీపీ నడిపింది. బెల్ట్‌ స్కాంలు చేసింది బీజేపీ వారు కాదా? మీ పాత్ర లేదా? మీ వాటా ఉంది కదా. మా ప్రభుత్వంలో అమ్మకాలు తగ్గించాం. రేట్లు పెంచాం. ప్రభుత్వానికి రాబడిని పెంచాం. రెవిన్యూ పెరిగింది మా ప్రభుత్వంలో. సేల్స్‌ తగ్గింది మా ప్రభుత్వంలో. బెల్ట్‌షాపులు లేవు. షాపులు ప్రభుత్వమే నడిపిస్తోంది. రెవిన్యూ వస్తే.. ప్రజల ఆస్తిగా ప్రభుత్వానికి వస్తోంది. బీజేపీ, టీడీపీ హయాంలో బెల్ట్‌ స్కాం ఎవరిది? ప్రైవేటు దందాలు ఎవరిది? మూడు కంపెనీలతో 80% బ్రాందీ అమ్మకాలు చేయటం వల్ల ఏ పార్టీ పొందింది. ఢిల్లీ వాటా ఎంత? ఇక్కడ వాటా ఎంతో కూడా నడ్డా చెప్పాలి. రాబడి అంతా ఖజానాకు వెళ్లిపోతోంది. స్కాం అంటే.. ఏమిటో నడ్డా చెప్పాలి. 

ల్యాండ్ స్కామ్ అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ఉంది
మీ నోటితో అమరావతి ల్యాండ్ స్కాం అన్నారు. ఇప్పుడు మీ నోటితోనే సమర్థిస్తున్నారు. వేల కోట్ల డబ్బు ఇస్తే చంద్రబాబు హల్వా తిన్నట్లు తినేశాడు. అమరావతిలో ఏ నిర్మాణాలు చేయలేదన్నారు. ఇప్పుడు అమరావతిని ఎందుకు సమర్థిస్తున్నారు. వెనకాల చీకట్లో ఏం జరిగింది నడ్డా గారు. ల్యాండ్ స్కాం ఉన్నట్లైతే విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఉక్కు పీక కోసి దాని భూమి కోసం ప్రయత్నిస్తున్నారు. ఉంటే.. దాంట్లో ల్యాండ్ స్కామ్‌ ఉంటుంది. ఇది హిందీలో చెబుతారా? తెలుగులో  చెబుతారా? 

బాధ్యత గల పార్టీ అధ్యక్షుడు అయితే.. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చి ఎవరో తప్పుడు మాటలు.. చెప్పుడు మాటలు చెప్పటం కాదు. ఢిల్లీలో విపక్షాలు అనేక మోతలు మోగిస్తున్నాయి. ఆరోపణలు చేస్తున్నాయి. మీకు చేతనైతే ఢిల్లీలో కూర్చొని వాటికి సమాధానం చెప్పండి. వాటికి సమాధానం చెప్పకుండా ఏపీకి వచ్చి పచ్చ పువ్వుల చెప్పుడు మాటలు చెవులతో విని.. పాఠం అప్పజెప్పొద్దు. బీజేపీలో ఉన్న పచ్చ పువ్వుల చెప్పుడు మాటలు విని.. పాఠం అప్పజెప్పినట్లు చేయవద్దు. ఢిల్లీలో కేంద్రం మీద విపక్షాల ఆరోపణలకు సమాధానం చెబితే బావుంటుంది.  

బీజేపీ కాస్తా టీజేపీగా...
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 2019 నుంచి నేటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అకౌంట్లలో లంచరహితంగా రూ.2.16 లక్షల కోట్లను జమ చేసింది. బీజేపీ ఏలుతున్న ఏ రాష్ట్రంలో అయినా సగం డబ్బులు పంపిన రాష్ట్రం ఏమైనా ఉందా? మాకు ఆర్థిక బాధలు ఉన్నా ఇంత గొప్పగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటైనా బీజేపీకి ఉందా? బెంగళూరులో యమమేత మేశారని ఇరగదీసి వాత పెట్టారు. ఎవరిది తప్పుడు ప్రభుత్వం. ఎవరిది అవినీతి ప్రభుత్వం. బెంగళూరులో మీది కాదా? అవినీతి ప్రభుత్వమని జనం ఊసింది నిజం కాదా? ఏతావాతా పరిస్థితి ఏమిటి అంటే.. పచ్చ పువ్వులతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏ స్థితిలో ఉందంటే.. బీజేపీ కాస్తా టీజేపీగా రూపాంతరం చెందింది. బీజేపీలో కలుపు తీస్తే తప్ప ఏపీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు రాదని హితవు పలుకుతున్నాము. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ
ఒక సీబీఐని డైరెక్టర్‌ను మార్చటం కోసం ఆర్మీని దించినట్లు పరిస్థితులా. గవర్నమెంట్‌ పోగానే.. అ అధికారిని ఢిల్లీలో పెట్టుకున్నారు. 
సీబీఐ ఏ స్థితిలోకి వెళ్లిపోయిందో దేశంలో ఏ రాజకీయ పార్టీని అడిగినా చెబుతారు. 
బీజేపీ ఏలుతున్న రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది. ఈశాన్య భారతదేశంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో తెలీదా?
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్న పరిస్థితిలో నడ్డా ఉన్నారు. 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత హింస ప్రజ్వరిల్లుతోందో కళ్లకు కట్టినట్లు చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో హింస ఎలా జరుగుతోందో అందరూ చూస్తున్నారు. 
అమిత్‌షా వచ్చి బీజేపీ తరుపున మాట్లాడి వెళ్తారు. తేడా ఏమైనా ఉంటే మాట్లాడతాం.

హరీశ్‌రావుకు మేనమామ (కేసీఆర్‌) మీద విపరీతమైన దుగ్ద, బాధ, కోపం. బామ్మర్ది మీద ఈర్ష్య. అమాంతం మామను తోసి పైన కూర్చోవాలని తపన, తాపత్రయం. మామను తిట్టలేడు. చీకట్లో బెదిరిస్తుంటాడు. బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఆ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే హరీశ్ రావును కేసీఆర్ పక్కన పెట్టాడు. 2019లో కేసీఆర్‌ గెలిచాక హరీశ్‌ రావును ఎక్కడ పెట్టారో తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు. 

బొటాబొటిన సీట్లు వస్తే.. ఇక్కడ నుంచి కొంతమందిని కాంగ్రెస్‌లోకి హరీశ్‌ రావు తీసుకెళ్లాలనుకున్నది తెల్సి మామ ఆస్తులు క్యాచ్ చేశాడంట. మొత్తం చిట్టా చెప్పి జాగ్రత్త అని హరీశ్‌రావును కూర్చొబెట్టాడని కథలు కథలుగా చెప్పారు. మా అల్లుడు చేతలు ఎక్కువ అయ్యాయని కేసీఆరే చెప్పారు. హరీశ్‌ రావు చేతలు.. కుట్రలు, కుతంత్రాలు. హరీశ్ రావు చంద్రబాబును ఫాలో అవుదామని అనుకున్నారు. రామారావు అమాయకుడు కాబట్టి బలైపోయాడు. కేసీఆర్ ముదురు కాబట్టి చంద్రబాబును చూసి బయల్దేరిన హరీశ్‌రావును చాచి ఒకటి కొట్టారు. కేసీఆర్ కూడా మా జగన్ గారి గురించి మాట్లాడితే.. నీ కోరిక నెరవేర్చేట్టు మీ మామను బాగా తిడతాం. హరీశ్ కోరిక అదే కదా. 

ఏపీ ప్రభుత్వానికి హరీశ్ రావు సర్టిఫికెట్లు అవసరం లేదు. ఆ సర్టిఫికెట్లకు ఉల్లిపాయలు అయినా వస్తాయా? మామను తిట్టలేడు. కేసీఆర్‌ను తిట్టాలంటే చంద్రబాబుకు భయం. ఫ్యాంటు తడసిపోతుంది. జగన్ మనుషులే దమ్ముగా తిడతారు. సమ్మగా మానసిక ఆనందం పొందాలని హరీశ్ రావు లెక్క. హరీశ్ రావు కుట్ర  మనకు తెలుసు. కేసీఆర్‌ అల్లుడు గిల్లుడు చూస్తూ కూర్చుంటే హరీశ్ రావు కోరిక తీర్చే పని చేస్తాం. 

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పీక కోద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భూ స్కాం ఉందేమో. లేకపోతే దానికి క్యాప్టివ్ మైన్ ఎందుకు ఇవ్వరు. అదానీ, వేదాంతకు ఇస్తారు. మా విశాఖ ఉక్కుకు ఎందుకు ఇవ్వరని ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి అనుమానం.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రైవేటు వ్యక్తికి అయినా భూములు కేటాయించామా? ఆనాడు టీడీపీ-బీజేపీ హయాంలో ఇచ్చారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement