బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు

Published Tue, Mar 5 2024 2:11 PM

RS Praveen Kumar Meets KCR In Hyderabad - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుగా పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌-బీఎస్పీ నిర్ణయం

మాయవతితో చర్చించనున్న కేసీఆర్‌

నాగర్‌ కర్నూల్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేసే ఛాన్స్‌

మరో రెండు, మూడ్రోజుల్లో రానున్న స్పష్టత!

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల కోసం తెలంగాణలో బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కలిసి పొత్తుపై చర్చించారు.

అయితే.. తెలంగాణను కాపాడేందుకే బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. 

బీఆర్‌ఎస్‌, బీఎస్పీ చాలా అంశాల్లో కలిసి పని చేసింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. కేవలం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌తోనే ఇప్పడు మాట్లాడాం. రేపు బీఎస్పీ అధినేత్రి మాయవతితో మాట్లాడతా. కచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. సీట్ల పంపకాలపై త్వరలోనే  ప్రకటన చేస్తాం అని కేసీఆర్‌ చెప్పారు. 

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌తో రాజ్యాంగానికి ముప్పు ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది. ఆ రెండు పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది అని అన్నారు.

నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ?
ఇక పొత్తు ఖరారు నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మంగళవారం కేసీఆర్‌ అధ్యక్షతన మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. అయితే.. మహబూబ్‌ నగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. కానీ, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటరీ స్థానం సమావేశం మాత్రం జరగలేదు. రెండ్రోజుల తర్వాత సమావేశం ఉంటుందని చివరి నిమిషంలో ప్రకటించడంతో.. అక్కడి కీలక నేతలు తెలంగాణ భవన్‌ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో.. ప్రవీణ్‌కుమార్‌ పేరు పరిశీలన కోసమే ఈ మీటింగ్‌ వాయిదా పడి ఉండొచ్చన్న సంకేతాలు బలపడుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. నాగర్‌ కర్నూల్‌ సిట్టింగ్‌ ఎంపీ రాములు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాములు తనయుడు భరత్‌కు నాగర్‌ కర్నూల్‌ సీటు కేటాయించింది కమలం పార్టీ. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ఈ స్థానానికి గట్టి పోటీనే ఉంది. అయితే.. సీనియర్‌ నేత మల్లు రవిని పార్టీ బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement