-
కాంగ్రెస్ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోదరుడు
హైదరాబాద్, సాక్షి: అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్, నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు..మూడ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్ఎస్లో ప్రవీణ్కుమార్ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలక బూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్నకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. -
నాగర్కర్నూల్ నుంచి ప్రవీణ్కుమార్..మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ శుక్రవారం ప్రకటించింది. మెదక్ నుంచి ఎమ్మెల్సీ పరిపాటి వెంకట్రామిరెడ్డికి, నాగర్కర్నూల్ నుంచి ఇటీవలే బీఎస్పీ నుంచి చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీనితో మొత్తంగా బీఆర్ఎస్ 13 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. మరో 4 సీట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వంటేరు పేరు వినిపించినా.. మెదక్ లోక్సభ స్థానం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పేరును బీఆర్ఎస్ దాదాపు నెల రోజుల క్రితమే ఖరారు చేసినా.. వివిధ కారణాలతో ప్రకటన జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే 2 రోజుల క్రితం కేసీఆర్ను కలిసిన వంటేరు ప్రతాప్రెడ్డి తనకు పోటీచేసే ఉద్దేశం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జాయింట్ కలెక్టర్గా, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి పనిచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మెదక్ లోక్సభ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా ఉంది. 2014లో పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీగా గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించడంతో రాజీనామా చేసి సీఎం పదవి చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మెదక్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. ఆర్థిక బలం కలిగిన వెంకట్రామిరెడ్డి వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. పెండింగ్లో మరో నాలుగు సీట్లు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 11 సీట్లలో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ప్రకటించిన ఇద్దరి కలసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన స్థానాల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ సీట్లకుగాను ఇంకా నాలుగు సీట్లు హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. మిగతా స్థానాలకు కసరత్తు కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పెండింగ్ సీట్లకు రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిపాయి. 30వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ముఖ్య నేతలు వంటేరు ప్రతాప్రెడ్డి, ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, వేలేటి రాధకృష్ణశర్మ తదితరులు దీనికి హాజరయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తిరుమలకు వెళ్లడంతో భేటీకి రాలేదు. ఈ సందర్భంగా ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఆలోగా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలను పూర్తి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు సూచించారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని మాజీ మంత్రి హరీశ్రావుకు సూచించారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతా: వంటేరు ప్రతాప్రెడ్డి మెదక్ లోక్సభ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో.. గజ్వేల్ నియోజకవర్గ నేత వంటేరు ప్రతాప్రెడ్డి బీఆర్ఎస్ను వీడతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసిన ప్రతాప్రెడ్డి.. ఆ సమయంలో రేవంత్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులతో సన్నిహితంగా ఉండేవారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున వంటేరు ప్రతాప్రెడ్డి పోటీ చేశారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. నాకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి: వెంకట్రామిరెడ్డి మర్కూక్ (గజ్వేల్): తనను మెదక్ అభ్య ర్థిగా ప్రకటించడం పట్ల కేసీఆర్, హరీశ్రావులకు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా ఏడున్నరేళ్లు ఈ జిల్లాలో పనిచేశానని, తనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ దీనిని గుర్తించి తనకు అవకాశం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. -
అభ్యర్థుల ఖరారు పూర్తితో.. వ్యూహాలకు కసరత్తు!
సాక్షి, మహబూబ్నగర్: నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో స్థానికంగా సమీకరణాలు సైతం శరవేగంగా మారుతున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కొంతమంది నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 100 రోజుల్లో తాము అమ లు చేసిన పతకాలు, అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురించి ఓటర్లకు వివరించాలని భావిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్ల ముందు ఎండగట్టాలని నిర్ణయించింది. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన పూర్తి కాగా ఇతర నేతలను రప్పించి సభలు, రోడ్షోలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొఫైల్.. పేరు: రేపల్లే శివ ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు: ప్రేమలత, సవారన్న పుట్టిన తేది: 23-11-1967 స్వస్థలం: అలంపూర్ విద్యార్హతలు: ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ఏ వృత్తి: ఐపీఎస్ అధికారి(1995 బ్యాచ్, గతేడాది ఉద్యోగానికి రాజీనామా), గురుకుల కార్యద ర్శితో పాటు ప్రభుత్వశాఖలో వివిధ హోదాలో పనిచేశారు. స్వేరోస్ సంస్థ స్థాపించి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ అనుభవం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గత శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇవి చదవండి: ‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్రెడ్డి -
బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం.. మెదక్ లోక్సభ బరిలో ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్సభ ఎన్నికలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవిత అరెస్టు కక్ష సాధింపే.. బీఆర్ఎస్ ఎంపీలు -
మళ్లీ బీఆర్ఎస్లోకి క్యూ కట్టాల్సిందే..
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోగానే పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారి గురించి ఆలోచించబో మని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్పై ప్రజా వ్యతి రేకత పెరిగి, నాలుగేళ్ల తర్వాత తిరుగుబాటుగా మారి, బీఆర్ఎస్ వంద సీట్లతో మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం పార్టీ మారిన నేతలే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను చేర్చుకోవద్దని కొందరు సూచించగా స్పందించిన కేసీఆర్.. మీరంతా నాయకులుగా ఎదిగితే పార్టీ మారిన వ్యక్తులను తిరిగి చేర్చుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన అనుచరులతో కలిసి సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్హౌస్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చంద్రబాబు రైతుల్ని ఇబ్బంది పెట్టారు ‘వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది. నేను అకుంఠిత దీక్షతో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అర్థం కావడం లేదు. కరెంటు సరఫరా పరిస్థితి కూడా అలాగే ఉంది. నాటి ఉమ్మడి పాలనలో తెలంగాణపై కరెంటు సహా అన్ని రంగాల్లో వివక్ష కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రపంచ బ్యాంకు పిచ్చితో ఆర్థిక సంస్కరణల పేరిట రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడ్డారు. చంద్రబాబుకు ఏమీ తెలియదు. అన్నీ తెలిసినట్లు నటించే వారు. విద్యుత్ కష్టాల నేపథ్యంలో చంద్రబాబును సైతం ఎదిరించా. తెలంగాణ ఉద్యమంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలేదు. నాపై దండకాలు రాసి పత్రికల్లో వేశారు. మరోవైపు రూ.5 వేల కోట్లు, కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి ఉద్యమం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయినా ఏనాడూ తెలంగాణ ఉద్యమాన్ని వీడలేదు..’ అని కేసీఆర్ వెల్లడించారు. ఓటమి పార్టీకి మంచిదే.. ‘అగాథంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిన పడిన ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి అధికారాన్ని అప్పగించారు. కానీ కొద్ది రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైంది. బీఆర్ఎస్ ఒక్కసారి ఓడిపోవాలని నేను కూడా భావించా. ఈ ఓటమి పార్టీకి మంచే చేస్తుంది. ఒక్కసారి ఓడితే నష్టమేమీలేదు. గాడిద వెంబడి పోతేనే కదా... గుర్రం విలువ తెలిసేది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి దళితబంధు వల్ల ఓడిపోయామనే భావన ఎన్నికల ఫలితాల సమీక్ష తర్వాత బయటకు వచ్చింది. దళిత వర్గాలకు ఎలాంటి బ్యాంకు ష్యూరిటీలు లేకుండా రూ.10 లక్షల చొప్పున అందజేసి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపడం తప్పా? దళిత సమాజం దీనిని సానుకూలంగా ఎందుకు తీసుకోలేకపోయిందో విశ్లేషించాల్సిన అవసరముంది. దళితశక్తితో పాటు బహుజన శక్తి కలిసి నడవాలి. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరును పెట్టడమేగాకుండా భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..’ అని కేసీఆర్ తెలిపారు. ప్రవీణ్కుమార్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తాం ‘ప్రవీణ్కుమార్ నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయనను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా త్వరలోనే ప్రకటిస్తాం. భవిష్యత్లోనూ ప్రవీణ్కుమార్ ఉన్నత స్థానంలో ఉంటారు. ప్రవీణ్తో కలిసి దళిత శక్తిని ఏకం చేసేందుకు, బలహీన వర్గాలను ఏకతాటి మీదకు తెచేందుకు ఎజెండా తయారు చేయాల్సిన అవసరముంది. ఈ విధానం దేశానికే టార్చ్ బేరర్గా మారాలి..’ అని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. అలాగైతే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతా: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలంగాణ వాదం, బహుజన వాదం వేర్వేరు కాదని ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ చెప్పారు. వివక్షకు, అణిచివేతకు వ్యతిరేకంగా ఈ రెండు ఉద్యమాలు పుట్టుకొచ్చాయని తెలిపారు. తాను ప్యాకేజీ తీసుకుని బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకునే వ్యక్తినే అయితే ప్రతిపక్ష పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. రేవంత్ బెదిరింపులు మానుకోండి ‘సీఎం రేవంత్రెడ్డి నన్ను పొగుడుతూనే సుతిమెత్తగా వార్నింగ్లు ఇస్తున్నారు. నేనూ పాలమూరు బిడ్డనే, నడిగడ్డ తిండి తిన్నవాడినే. మీ దారికి రాని వారికి బెదిరింపులు మానుకోండి. వార్నింగులు ఇచ్చి మీ హోదాను తగ్గించుకోవద్దు..’ అని ప్రవీణ్ కుమార్ సూచించారు. ఫామ్హౌస్కు వెళ్లేముందు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి చేపట్టాల్సిందిగా నన్ను సీఎం రేవంత్ ఆహ్వానిస్తే నేను తిరస్కరించిన మాట నిజమే. ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుని ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించా. అయితే నేను బీఆర్ఎస్లోకి వెళ్తే సమాధానం చెప్పాలని రేవంత్ అంటున్నారు. అయితే ఏ వేదిక మీద పనిచేయాలో చెప్పే స్వేఛ్చ తెలంగాణ ప్రజలకు లేదా. మీరు గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్ధపరులు గొర్రెల మందలా వస్తున్నారు. కానీ నిజాయితీ కలిగిన నేను ఆ గొర్రెల మందలో ఒకడిని కాలేను. నేను ప్యాకేజీ తీసుకునే వాడినే అయితే రేవంత్ గేటు వద్ద ఉండే వాడిని. నేను దొంగ ఆస్తులు రక్షించుకునేందుకు వచ్చే పిరికిపందను కాను. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం వచ్చా’ అని ప్రవీణ్కుమార్ చెప్పారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు ‘తరతరాల అణచివేతకు గురైన తెలంగాణకు విముక్తి కల్పించి వెలుగు వైపు నడిపించింది కేసీఆర్. ఆయన దురదృష్టవశాత్తూ అధికారంలో లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు బహుజన వాదులు కేసీఆర్ వెంట నడవాలని అనుకుంటున్నారు..’ అని ప్రవీణ్కుమార్ తెలిపారు. చిన్నారికి శ్రీయా ఫూలేగా నామకరణం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష–ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రీయా ఫూలేగా కేసీఆర్ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి, హైదరాబాద్: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్హౌస్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు.. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘నిజాయితీకి కట్టుబడి ఉన్నా. ఓ వైపు మంచివాడు అంటూ నన్ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. స్వార్దం కోసం ఎన్ని కోట్లు తీసుకొని వెళ్తున్నావు అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.డబ్బు కోసం ఆశపడిన వాడిని అయితే కాంగ్రెస్లో చేరుతా. బీఆర్ఎస్ కాదు. టీఎస్పీఎస్సీ చైర్మర్ ఆఫర్ ఇస్తే.. తిరస్కరించా. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుంది. నేనెప్పుడూ బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతా. రేవంత్ రెడ్డే కాదు నేను కూడా పాలమూరు బిడ్డనే’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర టీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు అభిమానులు ఉన్నారు. -
నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా..‘నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అంటూ పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏 నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 17, 2024 -
పొత్తుకు బ్రేక్.. బీఆర్ఎస్తో ఎన్నికల పొత్తుపై బీఎస్పీ వెనకడుగు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కుదిరిందని బీఆర్ఎస్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బ్రేక్ పడింది. బీఆర్ఎస్తో పొత్తును విరమించుకుంటున్నట్లు బీఎస్పీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. పొత్తు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పడం తనకు ఇష్టం లేదని చెప్పడంతోపాటు తాను బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నందినగర్లో కేసీఆర్తో ప్రవీణ్కుమార్ శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన భవిష్యత్తు ప్రస్థానం బీఆర్ఎస్, కేసీఆర్తో కొనసాగుతుందని భేటీ అనంతరం ప్రవీణ్కుమార్ ప్రకటించారు. ఇదిలాఉంటే ఒకట్రెండు రోజుల్లో ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరతారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. బీఎస్పీతో పొత్తు విచ్ఛిన్నమైన నేపథ్యంలో నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్కుమార్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే ప్రవీణ్కు బీఆర్ఎస్లో కీలక పదవి కూడా దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పకూడదనే..: ప్రవీణ్ కేసీఆర్తో భేటీ ముగిసిన తర్వాత ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్తో కాకుండా ప్రాంతీయ పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవాలని అందరితో చర్చించి నిర్ణయించుకున్నాం. అందులోభాగంగా బీఆర్ఎస్తో జరిగిన చర్చల ఫలితంగా నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం కూడా అంగీకరించినా బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవడం బీజేపీకి నచ్చలేదు. పొత్తును విరమించుకోవాలని బీఎస్పీ అధిష్టానంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు మీడియా సమావేశం పెట్టాలని బీఎస్పీ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు అందాయి. పొత్తు కోసం కేసీఆర్కు ఇచ్చిన మాట తప్పడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో చర్చించాను. రాబోయే రోజుల్లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. బహుజన వాదాన్ని ఎన్నటికీ వీడను. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఎస్పీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నా. శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ నిర్ణయం తీసుకుంటా’ అని ప్రవీణ్కుమార్ చెప్పారు. ఆది నుంచీ ఊగిసలాటే... లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ, బీఆర్ఎస్ నడుమ పొత్తు చర్చల్లో మొదటి నుంచీ ఊగిసలాట ధోరణి కనిపించింది. ఓ వైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్తో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే తాము దేశంలో ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించారు. అయితే మాయావతి ప్రకటన తెలంగాణకు వర్తించదని ప్రవీణ్ పేర్కొన్నారు. మరోవైపు మాయావతితో కేసీఆర్ మాట్లాడారని కూడా పేర్కొన్నారు. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో బీఎస్పీ మూడు సీట్లు కోరినట్లు ప్రచారం జరగ్గా.. నాగర్కర్నూల్, హైదరాబాద్ స్థానాలను కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అది జరిగి 24 గంటలు కాకమునుపే బీఎస్పీని వీడుతున్నట్లు ప్రవీణ్ ప్రకటించి కేసీఆర్తో భేటీ అయ్యారు.ఐపీఎస్ అధికారి నుంచి... సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రవీణ్కుమార్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించారు. గురుకుల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి తెచ్చేందుకు కృషి చేశారు. ‘స్వేరోస్’ సంస్థ ద్వారా గురుకులాల విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 2021లో తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలో కాన్షీరాం అధ్యక్షుడిగా ఉన్న 1994 నుంచి రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ విఫలమైన బీస్పీలో ప్రవీణ్కుమార్ చేరడమే అప్పట్లో చర్చనీయాంశమైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎత్తిచూపుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, పర్యటనలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను ఏకం చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 107 మంది బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆయన స్వయంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ మనుగడ కోసం తాను పోరాడిన బీఆర్ఎస్తోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. -
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
-
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ)కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్బై చెప్పారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ‘బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల (వాటికి ఎంత మంచి ప్రాముఖ్యత ఉన్నా) వల్ల బీఎస్పీ వంటి గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ కానున్నారు. ఇటీవల బీఆర్ఎస్-బీఎస్పీ పార్టీలు లోక్సభ ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left. With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭. I don’t want the image of… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2024 బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలోని నాగర్ర్నూల్తో పాటు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్గా ప్రవీణకుమార్ ప్రకటించారు. నాగర్కర్నూల్ స్థానం నుంచి స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
బీఎస్పీకి రెండు సీట్లిచ్చిన బీఆర్ఎస్.. ‘ఆర్ఎస్పీ’ పోటీ అక్కడి నుంచే..
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం(మార్చ్15) ఒక ప్రకటన విడుదల చేసింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలోని నాగర్ర్నూల్తో పాటు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్కర్నూల్ స్థానం నుంచి స్వయంగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 17 లోక్సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. తాజాగా నాగర్కర్నూల్, హైదరాబాద్ లోక్సభ స్థానాలను పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించడంతో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను కేసీఆర్ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
TS: బీఆర్ఎస్కు కోనప్ప గుడ్బై..! మంత్రి పొంగులేటితో కీలక భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చాంబర్కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కోనప్ప సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించిన కోనప్ప పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మధ్య ఉంటుందని అందరూ భావించినప్పటికీ సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇదీ చదవండి.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా -
బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారైంది. కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కలిసి పొత్తుపై చర్చించారు. అయితే.. తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. బీఆర్ఎస్, బీఎస్పీ చాలా అంశాల్లో కలిసి పని చేసింది. అందుకే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్తోనే ఇప్పడు మాట్లాడాం. రేపు బీఎస్పీ అధినేత్రి మాయవతితో మాట్లాడతా. కచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. సీట్ల పంపకాలపై త్వరలోనే ప్రకటన చేస్తాం అని కేసీఆర్ చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్తో రాజ్యాంగానికి ముప్పు ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది. ఆ రెండు పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుంది అని అన్నారు. నాగర్కర్నూల్ నుంచి పోటీ? ఇక పొత్తు ఖరారు నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగింది. అయితే.. మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కానీ, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థానం సమావేశం మాత్రం జరగలేదు. రెండ్రోజుల తర్వాత సమావేశం ఉంటుందని చివరి నిమిషంలో ప్రకటించడంతో.. అక్కడి కీలక నేతలు తెలంగాణ భవన్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో.. ప్రవీణ్కుమార్ పేరు పరిశీలన కోసమే ఈ మీటింగ్ వాయిదా పడి ఉండొచ్చన్న సంకేతాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాములు తనయుడు భరత్కు నాగర్ కర్నూల్ సీటు కేటాయించింది కమలం పార్టీ. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఈ స్థానానికి గట్టి పోటీనే ఉంది. అయితే.. సీనియర్ నేత మల్లు రవిని పార్టీ బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారితో నంది నగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం. pic.twitter.com/bynXDHVXMB — BRS Party (@BRSparty) March 5, 2024 -
మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి
సూర్యాపేట రూరల్: సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీల పథకాల కంటే ముందు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన తమ పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో వైష్ణవి మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, ఆర్సీఓలే కారణమని తల్లిదండ్రులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ప్రవీణ్ కుమార్ హాజరై తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం మాట్లాడారు. ‘సీఎం ఆరు గ్యారంటీలు అమ లు చేయకపోయినా మాకు నష్టం లేదు. ఇందు కోసమేనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మ ల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆదాయం వచ్చే శాఖలకు మంత్రులను కేటాయించారే గానీ గిరి జన సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం బాధాకరం. భువనగిరి గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోతే రెండు నిమిషాలు కూడా మౌనం పాటించకపోవడం హేయమైన చర్య’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వైష్ణవి మృతిపై విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. 3 గంటలకు పైగా ఆందోళన కొనసాగ డంతో 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్ పాఠశాల వద్దకు రావాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్తో పాటు మరో ఇద్దరు సీఐలు, ఎస్సైలు గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. వైష్ణవి కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రవీణ్కుమార్కు వెంకట్రెడ్డి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. -
ఐపీఎస్ అధికారి బయోపిక్.. ఆ రోజే రిలీజ్!
నంద కిషోర్ హీరోగా నటించిన చిత్రం ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో). ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఐరా ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై మామిడాల నీల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న రిలీజ్ కానుంది. శనివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల ప్రవీణ్ IPS ట్రైలర్ విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని, ఆదర్శం (ఐడియలిజం) అనేది జన హృదయాలను తాకుతుందన్నారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అనేక విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారని అన్నారు. పూర్ణ మలావతి, ఆనంద్ లతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహింపజేశారని గుర్తు చేశారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నా తొలి చిత్రం డైరెక్టర్ దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ... ఇది నా తొలి చిత్రం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా తీయాలి. కానీ సెలెక్టివ్ అంశాలను తీసుకొని ప్రవీణ్ IPS మూవీ తీశాం. ఆయన నాకు ఇన్స్పిరేషన్. వివేక్ కూచిభోట్ల గారు లేకపోతే నాకు ఈ సినిమా అవకాశం వచ్చేది కాదని చెప్పారు. తనకు అన్ని విషయాల్లో అండగా నిలిచినందుకు వివేక్కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడ్డారు ASKES ఫౌండేషన్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో కష్టాలను భరించి ఐపీఎస్ అధికారిగా ఎన్నో సేవలు చేశారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీ హిట్ కావాలని ఆకాంక్షించారు. చదవండి: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది! -
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్కుమార్కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్కుమార్కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి,హైదరాబాద్ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చుదామనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిపోయిన గడీలు గడిచిన తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్మిర్మాణమయ్యాయన్నారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. రాజ్యాధికారంతోనే బాంచన్ కాల్మొక్త సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళికతో అన్ని వర్గాలను కలుపుకుని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించి, వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. జార్ఖండ్లో మధుకోడా ఒక్కడే ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్కుమార్ గుర్తుచేశారు. దళితులు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి సీఎం అయిన తర్వాత బహుజనులకు రాజ్యాధికారంవచ్చిందన్నారు. మయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల బహుజనుల రెండు, మూడు తరాలు బాగుపడ్డాయని తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిసి వారి ఆలోచనలు చెప్పుకునే అవకాశం తెలంగాణలో ఏ బ్యూరోక్రాట్కు లేదన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కానిస్టేబుల్ ఆపితే ప్రగతిభవన్ గేటు వద్ద నుంచే వెనక్కు వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. బీఎస్పీ మేనిఫెస్టోలో పెట్టిన 10 లక్షల ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాల అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇవేకాక మరిన్ని విషయాలను ప్రవీణ్కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
ఖాకి చొక్కా విడిచి ఖద్దరుతో బహుజన రాజ్యాధికారం సాధ్యమేనా ?
-
ప్రగతిభవన్లో ఎంట్రీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమరవీరుల త్యాగాలను కళ్లారా చూశాను. తెలంగాణలో బాన్చన్ కల్చర్ సజీవంగా ఉందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నన్ను హిందూ వ్యతిరేకి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. కాగా, ఆర్ఎస్పీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రగతి భవన్లోకి సీఎస్లకు ఎంట్రీ నిరాకరించిన సందర్భాలున్నాయి. అపాయిమెంట్ ఉంటేనే లోపలికి అనుమతించేవారు. చాలా మంది గంటలు గంటలు బయట వేచి చూడటం నాకు తెలుసు. ఏ విధంగా అభివృద్ధి చేయాలో అని అధికారులను ఏనాడూ అడగలేదు. అధికారులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణలో అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ బ్యూరోక్రాట్స్కు లేదు. ఎంతమంది తెలంగాణ బిడ్డలకు కేటీఆర్ ఉద్యోగాలు ఇచ్చారు?. కుట్రలతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాయావతి ఏడు లక్షల ఎకరాల భూమిని పంచారు. బడుగు, బలహీన, వెనుకబడిన అనే పదాలను నిషేధించాలి. మేం బీఫాంలు ఎప్పుడూ అమ్ముకోలేదు. మేము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. అసత్యాన్ని అతికేలా చెప్పడే బీజేపీ సిద్ధాంతం. బీసీలకు అడుగడుగునా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. స్వేరోస్ అంటే ఆకాశమే హద్దుగా అని అర్థం. అంకితభావంతో పనిచేసే వాళ్లను ఎప్పుడూ పార్టీ వదులుకోదు. పేద పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే ఉండాలా?. బీఎస్పీ పార్టీకి డబుల్ డిజిట్లో సీట్లు వస్తాయి. పెద్ద కంపెనీల్లో ఒక్క పేదవాడైనా పెద్ద హోదాలో ఉన్నాడా?. ఈసారి 80 శాతం టికెట్లు మా పార్టీ వారికే ఇచ్చాం. ఏపీలో ఇంగ్లీష్ మీడియం బోధన నిర్ణయాన్ని సమర్థిస్తాను. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ బోధనను ప్రమోట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం మంచి పనిచేసింది. జీవితంలో ఎదగాలంటే ప్రతీ ఒక్కరికీ చదువు అవసరం. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలు
వేములవాడ: బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యో గాలిచ్చి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. ఇందులో మహిళలకే 5 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ ప్రకృతి ఆగ్రహించి టెంట్లను కూల్చి వేసినట్లుగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ఏనాడూ రాని దొరలు ఇప్పుడు ఓటుకు రూ.2 వేలు ఇస్తామంటూ మన ఇంటికి వస్తున్నారన్నారు. ఒక్కసారి ఓటు అమ్ముకుంటే మన బిడ్డల భవిష్యత్ను బొంద పెట్టుకున్నట్లేనని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం రాగానే భూమిలేని ప్రతీ నిరుపేదకు ఎకరం భూమి ఇస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ మూడెకరాలు ఇస్తామని నమ్మబలికి దళితులకు చెందిన 35 వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్ వాగ్దానం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితులకోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కులాలవారీగా కాంట్రాక్టులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమంగా రూ.100 కోట్లు ఢిల్లీకి పంపిందని, ఆమె రూ.20 లక్షల ఖరీదైన వాచ్ ధరిస్తుందని ఆరోపించారు. పార్టీ వేములవాడ అభ్యర్థి, విద్యావంతుడైన డాక్టర్ గోలి మోహన్కు కాకుండా ఎవరికి ఓటు వేసినా మీ జీవితాలు నాశనమేనన్నారు. కూలిన టెంట్లు.. పలువురికి గాయాలు సభ ప్రారంభంలో వేములవాడ అభ్యర్థి గోలి మోహన్ మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలితో టెంట్లు కూలిపోయాయి. అనుకోని ఈ ఘటనతో పలువురు మహిళలు, జర్నలిస్టులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి పరామర్శించారు. -
అధికార మార్పిడి జరగాలి! : ప్రవీణ్కుమార్
మహబూబ్నగర్: పొలాల్లో పంట మార్పిడి ఎలా చేస్తారో.. అలాగే రాజకీయాల్లోనూ అధికార మార్పిడి జరగాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా అయిజలో మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థులు ఎవరూ శ్రీమంతులు కారని, కష్టార్జితాన్ని నమ్ముకొనే మీ ముందుకు వచ్చారన్నారు. వాళ్ల వలే ఓటుకు వెయ్యి ఇచ్చి, 90 ఎంఎల్ బాటిల్, ఇంటి వద్ద ఉచితంగా భోజనాలు పెట్టే వాళ్లు కాదన్నారు. కానీ, ఐదేళ్లు రోజుకు మూడు పూటల తిండిపెట్టే విధంగా మీ అందరినీ తయారు చేయడానికి వచ్చిన వారన్నారు. వాల్మీకులు, కుర్వ సోదరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎంత మందికి టికెట్ ఇచ్చిందని ప్రశ్నించారు. బీఎస్పీ మహబూబ్నగర్, వనపర్తిలో వాల్మీకులకు టికెట్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ పెంచి వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. ఈ అలంపూర్ గడ్డలో పుట్టిన.. ఇదే తుంగభద్ర నీళ్లు తాగిన.. ఇదే నడిగడ్డ గాలి పీల్చిన.. ఇదే నడిగడ్డలో మొలకెత్తిన విత్తనాలు తిని పెరిగి ఈ స్థాయికి వచ్చానన్నారు. అలంపూర్, సిర్పూర్ బీఎస్పీకి రెండు కళ్లలాంటివని, తప్పకుండా రెండు చోట్ల గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి చదవండి: జీఓ 69ను బొందపెట్టి.. కొడంగల్ను ఎండపెట్టిండు.. : రేవంత్రెడ్డి -
కోనప్ప Vs ఆర్ఎస్ ప్రవీణ్ గా మారిన సిర్పూర్ రాజకీయం
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్ బరిలో నిలిచిన బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులు ‘నువ్వా– నేనా’ అన్నట్లు సిగపట్లకు దిగుతుండటంతో నియోజకవర్గంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగుతుండటం ఘర్షణకు దారితీస్తోంది. అభ్యర్థులు ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు రాష్ట్రంలోనే వరుస పరంగా నంబర్– 1 నియోజకవర్గమైన సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప నాలుగోసారి బరిలో ఉన్నారు. రావి శ్రీనివాస్, పాల్వాయి హరీశ్బాబు, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాగా.. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కోనేరు కోనప్ప బీఎస్పీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే బీఎస్పీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) కోనప్పకు పోటీగా నిలబడ్డారు. కోనప్పను కచ్చితంగా ఓడించి తీరుతానని ఆర్ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాపకింద నీరులా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఎస్పీ దూసుకెళ్లేలా ప్రణాళికలు రచించారు. గ్రామం, మండలం, పట్టణం.. ఇలా ఇంటింటా తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక దశలో ‘కోనేరు కోనప్ప.. కలప దొంగ’ అంటూ మీడియా ముందు తీవ్ర ఆరోపణలు చేయడం.. అందుకు కౌంటర్గా కోనప్ప ‘మర్డర్లు చేసిన ఘనత మాకే ఉంది. ఎన్కౌంటర్లు కూడా మేమే చేపించాం. పరిటాల రవిని మేమే చంపించాం. బెల్లంపల్లి, కరీంనగర్లో హత్యలు మేమే చేపించాం. ప్రవీణ్కుమార్ ఒక పొలిటికల్ టూరిస్ట్’ అంటూ ఆర్ఎస్పీపై ప్రత్యారోపణలు చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఘర్షణ వాతావరణం.. నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్పీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వర్గాలుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రేణుల ప్రచారం తారస్థాయికి చేరడమే కాకుండా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 11న కాగజ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో బీఎస్పీ కార్యకర్త షేక్ ఆసిఫ్ను బీఆర్ఎస్ నాయకుడు కోనేరు ఫణితోపాటు పలువురు ఆకారణంగా దాడిచేయడమే కాకుండా చంపుతామని బెదిరించినట్లు ఆరోపిస్తూ బాధితుడు ఆసిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పోలీసులు ఫణితోపాటు పలువురిపై కేసు సైతం నమోదు చేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు అభ్యర్థులు గాలం వేస్తుండటం.. భారీ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి తమవైపు తిప్పుకోవడం పరిపాటిగా మారింది. పార్టీ ఫిరాయింపులు గెలుపోటములపై ప్రభావం చూపుతుండటంతో అభ్యర్థులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫలితంగా ప్రచారంలో ప్రత్యర్థులపై దాడులకు దిగడానికి సైతం వెనుకాడకపోవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదివారం రాత్రి కాగజ్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయబస్తీలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ ప్రచార రథం డైవర్పై దాడి చేశారంటూ ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తమ ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా కేసు పెట్టారని నిరసన తెలుపుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ కాగజ్నగర్ పోలీసు స్టేషన్లో బైఠాయించారు. పోలీసులు చివరకు ఇరువర్గాల అభ్యర్థులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే ఇలాంటివి పునరావృతమైతే మాత్రం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారనుంది. -
కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయం
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగిన సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబసభ్యులను జైలు కు పంపడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోతోందని, అందుకు కల్వకుంట్ల కుటుంబసభ్యులే కారకులని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నిరుద్యోగ యువతశక్తిని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏంచేయాలో తెలియక విద్యావంతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రతి ఏటా రంజాన్ పండుగకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుడే తప్ప మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేనిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇఫ్తార్ విందులు కావు.. న్యాయం కావాలని మైనారిటీలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు ఈర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సీఎం అభ్యర్థి బయోపిక్.. టీజర్ రిలీజ్
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఓ వైపు అన్ని పార్టీల నాయకులు, ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే టైంలో ఆయా పార్టీలు.. సినిమాలతోనూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే 'కేసీఆర్' సినిమా రానుండగా, ఇప్పుడు మరో పార్టీ తరఫున పోటీలో ఉన్న ముఖ్యమంత్రి అభర్థి బయోపిక్ విడుదలకు సిద్ధమైంది. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'ప్రవీణ్ ఐపీఎస్'. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరులో ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి, ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఐపీఎస్ మాజీ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో.. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎలివేషన్ ఇచ్చేలా డైలాగ్ పెట్టారు. తప్పితే క్యారెక్టర్స్ని పెద్దగా చూపించలేదు. అయితే ఈ సినిమాలో నందకిషోర్, రోజా హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. దుర్గా దేవ్ నాయుడు దర్శకుడు. నవంబరు చివర్లో ఎన్నికల జరగడానికి ముందే ఈ సినిమా రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ను సాగనంపాలి
మెట్పల్లి(కోరుట్ల)/జగిత్యాలటౌన్: తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతిభవన్ నుంచి సాగనంపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బహుజన రాజ్యాధికార గర్జన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో ఒక్కశాతం ఉన్న వర్గానికి అధికారం అప్పగిస్తే బహుజనులకు న్యాయం జరగదన్నారు.టీఎస్పీఎస్సీని మంత్రి కేటీఆర్ తన దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని, ఒక్కో పరీక్ష పేపర్ను ఆయన రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. పరీక్షలు వాయిదా పడటం వల్ల మనస్తాపం చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే, కేటీఆర్ దానిని వక్రీకరిస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే రూ.5 వేల కోట్లతో గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బహుజనులు ఎక్కువగా ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా దొరలు గెలవడం సమంజసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న పూదరి నిషాంత్ కార్తికేయను గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ పూదరి అరుణ, జిల్లా ఇన్చార్జి పుప్పాల లింబాద్రి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ రద్దుకు తొలి సంతకం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తూ తొలి సంతకం చేయడంతో పాటు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్కుమార్ హామీ ఇచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ఏక్ నంబర్ అయితే బేటా కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అంబులెన్సుల్లో డబ్బులు పంపిణీ చేస్తారని అనుమానంగా ఉందని అన్నారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కాంగ్రెస్లోకి ఆత్మారాంనాయక్
రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు
ఎన్నికలకు పటిష్ట భద్రత
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
న్యూస్రీల్
నకిలీ విత్తు.. ఎంచుకుంటే ముప్పు!
‘మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి’
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement