
కార్యకర్తలకు నమస్కారం చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు
వాజేడు: టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడంపై మాజీ మంత్రి, ఖమ్మం సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం అభిమానులతో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు సమ్మేళనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ వెంటే ఉంటానని, టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ’నా అనుచరులు నా వెంట ఉంటే కొండలను కూడా పిండిచేస్తా’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని అభిమానులకు సూచించారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, ఎవరూ అధైర్య పడొద్దని, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. మన అభివృద్ధికి పాటుపడే నాయకుడు కేసీఆరే అని స్పష్టం చేశారు..
తుమ్మలను కలిసిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు.. దూరంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు
వాజేడుకు వచ్చిన తుమ్మలను టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కలిశారు. కేవలం మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు. కాగా.. టీఆర్ఎస్ ప్రధాన నాయకులు మాత్రం ఈ ఆత్మీయ సమ్మేళనానికి దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment