పాలన చేతకాకే ధర్నాలు  | Telangana: YSR Telangana Party Chief YS Sharmila Comments On CM KCR | Sakshi
Sakshi News home page

పాలన చేతకాకే ధర్నాలు 

Dec 21 2021 3:04 AM | Updated on Dec 21 2021 3:04 AM

Telangana: YSR Telangana Party Chief YS Sharmila Comments On CM KCR - Sakshi

కుమ్మరి రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్‌ షర్మిల   

సాక్షి, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతగాకే ధర్నాలంటూ కొత్త నాటకానికి తెరలేపారని, చావుడప్పు కొట్టాల్సింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికేనని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. రైతుల చావులకు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమ ని ఆరోపించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆమె సోమవారం కామారెడ్డి జిల్లాకు వచ్చారు. ఇటీవల సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో వడ్ల కొ నుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో చనిపోయిన రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

లింగంపేట మండలం ఐలాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో చనిపోయిన బీరయ్య కుటుంబాన్ని, నాగిరెడ్డిపేట మండలం వదల్‌పర్తిలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నూరి యాదయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్న సీఎం కేసీఆర్‌ రైతుల ఉసురు పోసుకున్నారని షర్మిల మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వానలో నానుతూ, చలిలో వణుకుతూ పలువురు రైతులు పడిగాపులుగాసి చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. బాధిత రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు పండించిన పంటలను కొనడం లేదు, పింఛన్ల కోసం ఏళ్ల తరబడిగా వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

యాసంగి వడ్లు కొనకుంటే ఆమరణ దీక్ష చేస్తా.. 
యాసంగిలో వడ్లను కొనకుంటే ఆమరణ దీక్షకు కూర్చుంటానని షర్మిల వెల్లడించారు. యాసంగి వడ్లు కొనబోమని కేసీఆర్‌ చెబుతున్నారని కొందరు రైతులు షర్మిల దృష్టికి తీసుకురాగా, మీరు వరి పండిస్తే కొనుగోలు కోసం తాను పోరాడుతానని, ఆమరణ దీక్ష చేపట్టయినా ధాన్యం కొనుగోలు చేయిస్తానని భరోసా ఇచ్చారు.

కార్యక్రమాల్లో వైఎస్సార్‌టీపీ నాయకులు ఏపూరి సోమన్న, నీలం ర మేశ్, రాజగోపాల్, చంద్రహాస్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, చైతన్యరెడ్డి, రాంరెడ్డి, పొ ట్కూరి తిరుపతిరెడ్డి, గౌతం ప్రసాద్, సత్యవతి, తాహెర్, సుధాకర్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement