వాళ్లు తప్పు చేసి.. మాపైనే కేసులు | YSR Congress Parliamentary Party leader Mithun Reddy fires on TDP | Sakshi
Sakshi News home page

వాళ్లు తప్పు చేసి.. మాపైనే కేసులు

Published Sun, Jul 21 2024 6:38 AM | Last Updated on Sun, Jul 21 2024 9:11 AM

YSR Congress Parliamentary Party leader Mithun Reddy fires on TDP

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్‌రెడ్డి ఆగ్రహం

దాడులు చేయడానికే వాళ్లకు లైసెన్స్‌ ఇచ్చినట్లుంది

రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు

75 ఏళ్ల మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై దాడి చేసి, ఆయనపైనే హత్యా నేరం

సాక్షి, అమరావతి: ‘అన్ని తప్పులు వాళ్లే చేసి.. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దౌర్జన్యాలు, దాడు లు, విధ్వంసాలకు లెక్కే లేదు. ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గుర య్యారు. హత్యలు, దాడులు చేయడానికే టీడీపీ వాళ్లకు లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉంది’ అని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌.. టీడీపీ కార్యకర్తలపై ఎన్ని కేసులు ఉంటే అంత బాగా పని చేసినట్లు అని ప్రచారం చేశారు. ఎ న్నికల తర్వాత టీడీపీ గెలిస్తే రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసిన రెడ్‌ బుక్‌ ఫొటోలతో కూడిన హో ర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ కార్యకర్త లపైకి, ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారు’ అని ఆగ్ర హం వ్యక్తం చేశారు.

 ‘పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లో ఉండగా నా పైనే దాడి చేసి, నాపైనే హత్యా నేరం మోపడం దారుణం. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను సమకూ ర్చుకొని ఇంట్లో ఉన్న నా పై దాడి చేశారు. పుంగనూరు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోనిదే. పుంగనూరు నియోజకవర్గానికి మా నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్‌ చేసి మరీ దాడులు చేశారు. 75 ఏళ్ల వయసున్న మాజీ ఎంపీ రెడ్డె్డప్ప ఒక న్యాయవాది.

ఆయన ఇంటిపైనే రాళ్లతో దాడి చేసి, వాహనాలు ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డె్డప్పకు చెందిన వాహ నాన్ని దగ్ధం చేశారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. తిరిగి ఆయనపైనే హత్య నేరం కేసు పెట్టడం దారుణం’ అని మండిపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీలో విధ్వంసకాండ, ఆటవిక పాలన గురించి గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నేతలందరినీ ఒకే విధంగా, సమానంగా చూడాలని ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు చెప్పారన్నారు.

వినుకొండలో ‘రషీద్‌ హంతకుడైన జిలానీ.. లోకేశ్‌ పుట్టిన రోజున స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్‌ తినిపించిన ఫొటోలు, ఎమ్మెల్యేతో ఉన్న ఫొటోలను.. రషీద్‌ తల్లిదండ్రులు చూపారు. అయినా వినుకొండ ఎమ్మెల్యే ప్రెస్‌మీట్‌ పెట్టి జిలానీ గురించి అబద్ధాలు చెబుతున్నారు. ఫొటోల్లో స్పష్టంగా కన్పిస్తుంటే చంద్రబాబు, పవన్‌లు మాట్లాడక పోవటం, ఖండించక పోవటం ఆశ్చర్యకరం అన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆకృత్యాలు ఒక రాజకీయ పార్టీపై జరుగుతున్న దాడిగా కాకుండా, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా దేశ ప్రజలు చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పార్టీ ఎంపీలతో సమావేశం అనంతరం.. ఆ వివరాలను అయోధ్య రామిరెడ్డి మీడియాకు వివరించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై చేస్తున్న భౌతిక దాడులు, ప్రజల్లో నెలకొన్న భయాందోళల గురించి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. వాటన్నింటినీ పార్లమెంట్‌లోనూ ప్రస్తావించాలని నిర్ణయించామన్నారు. ‘రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండపై ఢిల్లీలో బుధవారం జరిగే ధర్నాలో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్‌మెంట్‌ అడిగాం. లోక్‌సభ, రాజ్యసభలో పెద్ద ఎత్తున మా వాణి వినిపిస్తాం’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement