
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అలాగే, పోలీసుల సమక్షంలో నిన్న తమపై టీడీపీ నేతలు దాడులు చేశారని చెప్పుకొచ్చారు.
కాగా, రాజంపేటలో ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అనంతరం, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై రాళ్ల దాడులు చేశారు. అంతటితో ఆగకుండా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఎపిసోడ్ అంతా జరిగింది. మళ్లీ అదే పోలీసులు మాపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టారు. నిన్న నాపై దాడి జరిగింది. ఈరోజు నా భద్రతను తగ్గించారు.
ఈరోజు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీరు అధైర్యపడవద్దు. కార్యకర్తలకు, పార్టీ నాయకులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను. విద్యార్థి దశ నుంచే మా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదిసార్లు ఎన్నికలు చూశారు. చంద్రబాబు చేసే దుర్మార్గపు రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్స్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment