విశాఖలో బడుగుల విజయవిహారం | YSRCP Samajika Sadhikara Bus Yatra In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో బడుగుల విజయవిహారం

Published Sun, Jan 7 2024 5:51 AM | Last Updated on Wed, Jan 31 2024 3:14 PM

YSRCP Samajika Sadhikara Bus Yatra In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం విశాఖ తీరంలో విజయ విహారం చేశారు. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం జగన్‌ అందించిన పథకాలతో తాము సాధించిన విజయాలను, సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ముందుకు సాగారు.

నెడ్‌క్యాప్‌ చైర్మన్, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో మాధవధార నుంచి కైలాసపురంలో ఇనార్బిట్‌ మాల్‌ వరకూ వందలాది బైకులు, కార్ల ర్యాలీతో యాత్ర సాగింది. జై జగన్‌.. జై జై జగన్‌ అంటూ వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కైలాసపురం వద్ద జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం జనసంద్రమే అయింది. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తించారు.

పేదల అభ్యున్నతి జగన్‌తోనే సాధ్యం:  డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
పేద ప్రజల అభ్యున్నతి సీఎం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారిని సాధికారత దిశగా నడిపించిన సీఎం జగన్‌ ఒక్కరేనని తెలిపారు. ఈ వర్గాలను చంద్రబాబు ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే భావించారని, అధికారంలోకి వచ్చాక అవహేళన చేశారని అన్నారు.

ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు మరో మారు మాయల పకీరులా మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేసిన  వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అదే రైతులు, అక్కచెల్లెమ్మలను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదుకొని, వారి కుటుంబాలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి దేశ చరిత్రలో రికార్డు నెలకొల్పారన్నారు.

అసమానతలు రూపుమాపుతున్నసీఎం జగన్‌ : మంత్రి మేరుగు
సీఎం వైఎస్‌ జగన్‌ సమాజంలో అసమానతలను రూపుమాపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అందరూ సమానంగా ఉండాలనేది సీఎం జగన్‌ ఆలోచనైతే.. దళితులపై దాడులు, బీసీలను తోకలు కత్తిరిస్తానని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆర్ధి కంగా బలోపేతమయ్యాడని చెప్పారు. చంద్రబాబు పాలనలో 12 శాతం ఉన్న పేదరికం సీఎం జగన్‌ పాలనలో 6 శాతానికి తగ్గిందన్నారు.

అంబేడ్కర్‌ కలలు నిజమవుతున్నాయి:  మేయర్‌ హరి వెంకట కుమారి
పేదలు అభ్యున్నతి చెందాలన్న అంబేడ్కర్, జ్యోతిరావు పూలే వంటి మహానుభావులు కన్న కలలను సీఎం వైఎస్‌ జగన్‌ నిజం చేస్తున్నారని గ్రేటర్‌ విశాఖ మేయర్‌ హరి వెంకటకుమారి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అభివృద్ధి చెందిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ వర్గాలకు చట్టసభల్లో, నామినేటెడ్‌ పదవుల్లో రాజకీయంగా సముచిత స్థానం కల్పించారన్నారు.  

నియోజకవర్గంలో రూ.3467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: కె.కె.రాజు
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రూ.3,467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు తెలిపారు. విశాఖను పారిశ్రామిక, పర్యాటక, విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే అగ్ర నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 17 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఇనార్బిట్‌మాల్, ఐటీ టవర్, మెగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం ప్రారంభమవుతున్నాయని తెలిపారు.

ఇది పూర్తయితే 2 వేల మందికి ఉద్యోగావకాశాలు, కంచరపాలెం ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ ప్రాంతంలో ఎఎస్‌ఎన్‌ మెఘా మాల్‌ ద్వారా 1500 మందికి పైగా ఉపాధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,  ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, కంబాల జోగులు, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర గణేష్,  ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంభా రవిబాబు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎ. రెహా్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement