బుమ్రా ఔట్‌.. డైలమాలో టీమిండియా | Bumrah Ruled Out Of Brisbane Test Due To Abdominal Strain | Sakshi
Sakshi News home page

బుమ్రా ఔట్‌.. డైలమాలో టీమిండియా

Jan 12 2021 11:36 AM | Updated on Jan 13 2021 1:17 AM

Bumrah Ruled Out Of Brisbane Test Due To Abdominal Strain - Sakshi

బ్రిస్బేన్‌:  ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు ఒకదాని వెంట మరొకటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు సిరీస్‌ నుంచి నిష్క్రమించగా, తాజాగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వైదొలిగాడు. పొత్తి కడుపు నొప్పి కారణంగా బుమ్రా సిరీస్‌లో మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో భారత క్రికెట్‌ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతుంది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై బుమ్రా ఆడకపోవడం జట్టును కలవరపరుస్తోంది. ఒకవైపు టీమిండియా డైలమాలో ఉన్నా సైనీ, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌లు కూడా పేస్‌ బౌలింగ్‌లో ఇప్పటికే నిరూపించుకోవడంతో కాస్త ధైర్యంగా ఉంది. జడేజా స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా స్థానంలో నటరాజన్‌లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. (అశ్విన్‌కే సాధ్యమైంది...)

‘సిడ్నీ టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు బుమ్రా పొత్తి కడుపులో నొప్పితో సతమతమయ్యాడు. బ్రిస్బేన్‌  టెస్టుకు బుమ్రాను రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయాలనుకుంటున్నాం. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. బుమ్రా వైదొలగడంతో మహ్మద్‌ సిరాజ్‌ టీమిండియా పేస్‌ బౌలింగ్‌కు ప్రధాన బౌలర్‌గా వ్యవహరించనున్నాడు. నవదీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌, టి నటరాజన్‌లు జట్టుతో కలవనున్నారు. జనవరి 15వ తేదీ నుంచి చివరిదైన నాల్గో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను దక్కించుకుంటుంది. ఇప్పటివరకూ మూడు టెస్టులు జరగ్గా, చెరొక దాంట్లో ఇరు జట్లు గెలిచాయి. మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 

తొడ కండరాల గాయంతో భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్, ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి ఆస్ట్రేలియాతో ఈనెల 15 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే చివరిదైన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. సిడ్నీలో సోమవారం టెస్టు ముగిశాక విహారికి స్కానింగ్‌ చేశారు. దీని రిపోర్టును బట్టి విహారి కేవలం ఒక టెస్టుకా లేదంటే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కూ దూరమయ్యే అవకాశముందో తెలుస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా చేతి వేలు విరిగిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.అంతకుముం‍దు కేఎల్‌ రాహుల్‌, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్, మయాంక్‌, మహ్మద్‌ షమీ‌లు ఇలానే గాయాల కారణంగా సిరీస్‌ నుంచి అర్థాంతరంగా వైదొలిగారు.(‘భారత్‌కు వచ్చినప్పుడు చూపిస్తా’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement