అందుకే ఓడిపోయాం.. ఆ ఇద్దరు మాత్రం అద్బుతం: పాక్‌ కెప్టెన్‌ | CT 2025 PAK Vs NZ: Rizwan Comments On Pakistan Defeat Against New Zealand, We Didnt Expect That They Put 320 Runs | Sakshi
Sakshi News home page

Rizwan On Pakistan Defeat: అస్సలు ఊహించలేదు.. ఆ ఇద్దరికీ అదెలా సాధ్యమైందో..

Published Thu, Feb 20 2025 9:24 AM | Last Updated on Thu, Feb 20 2025 10:39 AM

CT 2025 Pak vs NZ We Didnt Expect That: Rizwan Comments After Loss

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఆరంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంతగడ్డపై డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాక్‌.. న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(Mohammed Rizwan) జట్టు పరాజయంపై స్పందించాడు. కివీస్‌ జట్టు భారీ స్కోరు సాధిస్తుందని తాము అస్సలు ఊహించలేదన్నాడు.

తాము అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశామని.. అయితే, న్యూజిలాండ్‌ తమ కంటే గొప్పగా ఆడిందని రిజ్వాన్‌ ఓటమిని అంగీకరించాడు. ఏదేమైనా తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం తీవ్రంగా నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ తాజా ఎడిషన్‌కు పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

శతకాలతో చెలరేగిన విల్‌ యంగ్‌, లాథమ్‌
ఈ క్రమంలో కరాచీ వేదికగా ఈ టోర్నమెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ న్యూజిలాండ్‌తో తలపడింది. నేషనల్‌ స్టేడియంలో బుధవారం జరిగిన పోరులో టాస్‌ గెలిచిన రిజ్వాన్‌ బృందం తొలుత బౌలింగ్‌ చేసింది. ఓపెనర్‌ డెవన్‌ కాన్వే(10)తో పాటు వన్‌డౌన్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌(1), డారిల్‌ మిచెల్‌(10) త్వరగా పెవిలియన్‌కు పంపి శుభారంభం అందుకుంది.

కానీ ఆ తర్వాత మరో ఓపెనర్‌ విల్‌ యంగ్‌(Will Young- 107), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌(118 నాటౌట్‌) పాక్‌ బౌలర్లపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ ఇద్దరు అద్భుత శతకాలతో రాణించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌(39 బంతుల్లో 61) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్‌ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు స్కోరు చేసింది.

 

పాక్‌ బ్యాటర్ల వైఫల్యం
ఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ కివీస్‌ బౌలర్ల ధాటికి తాళలేక 47.2 ఓవర్లకు కుప్పకూలింది. బాబర్‌ ఆజం(64), కుష్దిల్‌ షా(69) అర్ధ శతకాలు సాధించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.  ఈ క్రమంలో 260 పరుగులకే ఆలౌట్‌ అయి.. అరవై పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమిని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు ఈ మేరు భారీ స్కోరు సాధిస్తామని మేము అస్సలు ఊహించలేదు. 260 పరుగుల వరకే కివీస్‌ను కట్టడి చేయగలమని భావించాం. మా పరిధి మేర అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేశాం. అయితే, వాళ్లు మాకంటే గొప్పగా ఆడి భారీ టార్గెట్‌ ఇచ్చారు.

ఆ ఇద్దరికీ అదెలా సాధ్యమైందో!
నిజానికి ఆరంభంలో పిచ్‌ బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించలేదు. కానీ విల్‌ యంగ్‌, లాథమ్‌ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి.. సులువుగా పరుగులు రాబట్టేశారు. అయితే, ఆఖరి ఓవర్లలో మేము మళ్లీ పాత తప్పులనే పునరావృతం చేశాం. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాం.

ఇక బ్యాట్‌తోనూ మేము శుభారంభం అందుకోలేకపోయాము. ఫఖర్‌ జమాన్‌ గాయంపై కూడా పూర్తి సమాచారం ఇంకా లభించలేదు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లే, డెత్‌ ఓవర్లలో మా ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫలితం ఏదైనా దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. మిగతా మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా ఆడే ప్రయత్నం చేస్తాం’’ అని పేర్కొన్నాడు. 

కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రి​జ్వాన్‌ 14 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి విలియం రూర్కీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీలో పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌తో నాలుగుసార్లు తలపడగా.. అన్నిసార్లూ కివీస్‌ జట్టే విజయం సాధించడం విశేషం. ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో సెంచరీ వీరుడు టామ్‌ లాథమ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చదవండి: మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్‌ శర్మ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement