Aus vs Ind 2018-19: దటీజ్‌ విరాట్‌ కోహ్లి.. 71 ఏళ్ల నిరీక్షణకు తెర | Historic win for Virat Kohli And Co, 71 years in the making | Sakshi
Sakshi News home page

Aus vs Ind 2018-19: దటీజ్‌ విరాట్‌ కోహ్లి.. 71 ఏళ్ల నిరీక్షణకు తెర

Oct 13 2024 8:18 AM | Updated on Oct 13 2024 2:26 PM

 Historic win for Virat Kohli And Co, 71 years in the making

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు అంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది కపిల్ దేవ్‌, ఎంస్ ధోని, గంగూలీ మాత్రమే. మరి కొంతమంది రోహిత్ శర్మ పేరు కూడా చెబుతారు. కానీ దాదాపు మూడేళ్ల పాటు భారత జట్టుకు సారథ్యం వహించిన విరాట్ కోహ్లి పేరు ఎవరూ చెప్పరు. ఎందుకుంటే పైన పేర్కొన్న నలుగురు కెప్టెన్లు కూడా కనీసం ఒక్క ఐసీసీ టైటిల్‌నైనా భారత్‌కు అందించారు.

విరాట్ 140 మ్యాచ్‌ల్లో భార‌త జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించిన‌ప్ప‌ట‌కి.. క‌నీసం ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా త‌న ఖాతాలో వేసుకోలేక‌పోయాడు. కానీ ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కానీ ఓ ఘనతను మాత్రం విరాట్ కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. ఈ విరాటుడు ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై సరికొత్త చ‌రిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లి నాయకత్వంలోనే భారత్‌ తొలిసారి ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంది.

71 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌2019 జనవరి 7... ఈ తేదికి భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ ప్ర‌త్యేక‌త ఉంది. స‌రిగ్గా అదే రోజున విరాట్ కోహ్లి సార‌థ్యంలోని భార‌త క్రికెట్ జ‌ట్టు అద్భుతం చేసింది. 71 ఏళ్లగా ఆసీస్ గ‌డ్డ‌పై ఊరిస్తున్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని సొంతం చేసుకుని త‌మ సుదీర్ఘ‌ నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది. 2018 డిసెంబ‌ర్‌లో బోర్డర్ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో త‌ల‌ప‌డేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.

మొద‌ట భార‌త జ‌ట్టుపై ఎటువంటి అంచ‌నాలు లేవు. ఈ క్ర‌మంలో డిసెంబ‌ర్ 6 నుంచి 10 వ‌ర‌కు ఆడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో 32 ప‌రుగుల తేడాతో భార‌త్ సంచ‌ల‌న విజయం సాధించింది. దీంతో టీమిండియా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఆ త‌ర్వాత పెర్త్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో ఆసీస్‌ అద్బుత‌మైన క‌మ్ బ్యాక్ ఇచ్చి భార‌త్‌ను 146 ప‌రుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో సిరీస్ 1-1 స‌మ‌మైంది. అనంత‌రం మెల్‌బోర్న్‌లో జ‌రిగిన మూడో టెస్టులో విరాట్ సేన పంజా విసిరింది. 137 ప‌రుగుల తేడాతో కంగూరులను భార‌త్ ఓడించింది. దీంతో భార‌త్ మ‌ళ్లీ 2-1 ఆధిక్యంలోకి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో 2019 జనవరి 7 నుంచి 11 వ‌ర‌కు సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టును డ్రా ముగించిన టీమిండియా.. 2-1 తేడాతో ఆసీస్ గ‌డ్డ‌పై తొలి టెస్టు సిరీస్‌ను త‌మ ఖాతాలో వేసుకుంది. కంగారూ గడ్డపై ట్రోఫీ గెలిచిన తొలి ఆసియా దేశంగా రికార్డుల‌కెక్కింది. "2011 ప్రపంచకప్​ కన్నా ఈ గెలుపు ఎక్కవ ఆనందం ఇచ్చింది".. ఇవి సిరీస్ గెలిచిన అనంత‌రం అప్ప‌టి భార‌త‌ సార‌థి కోహ్లి చెప్పిన మాట‌. 

కాగా ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట‌ర్ ఛ‌తేశ్వ‌ర్ పుజారా(521) నిలిచాడు. అదేవిధంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా జస్ప్రీత్‌ బుమ్రా(21), ఆసీస్ స్టార్ స్పిన్న‌ర్ నాథ‌న్ లియోన్‌తో క‌లిసి సమంగా నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement