అఫ్గాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌ | India Squad Announcement For Test And ODIs Against Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

May 19 2026 4:34 PM | Updated on May 19 2026 5:35 PM

India Squad Announcement For Test And ODIs Against Afghanistan

జూన్‌ 6 నుంచి అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు

బుమ్రా, జడేజాలకు విశ్రాంతి

లక్నో బౌలర్‌ ప్రిన్స్‌ యాదవ్‌కు పిలుపు

రోహిత్‌, హార్దిక్‌లకు ఫిట్‌నెస్‌ నిబంధన 

టెస్టు జట్టులో చోటు నిలుపుకున్న తెలుగు క్రికెటర్‌ నితీశ్‌ రెడ్డి

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వేర్వేరు జట్ల‌లో ఆడుతున్న టీమిండియా ఆట‌గాళ్లు మ‌ళ్లీ ఒక్క‌టిగా క‌లిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంట‌నే టీమిండియా స్వ‌దేశంలో అప్గానిస్తాన్‌తో ఒక టెస్టు స‌హా మూడు వ‌న్డేల సిరీస్ ఆడనుంది. ఈ  నేప‌థ్యంలో బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ మంగళవారం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జూన్‌ 6 నుంచి ముల్లన్‌పూర్‌ వేదికగా భారత్‌, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

ఏకైక టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్‌ గిల్‌కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. మ‌రోవైపు వ‌న్డేల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నున్నాడు. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌ఫున నిల‌క‌డ‌గా రాణిస్తున్న ప్రిన్స్ యాద‌వ్‌కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.

ఇక టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్‌ జస్ప్రీ‌త్‌ బుమ్రాలకు అఫ్గాన్‌తో సిరీస్‌కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్‌తో ఒకే టెస్టు మ్యాచ్‌ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్‌ నుంచి బిజీగా క్రికెట్‌ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. 

ఇక సీనియర్‌ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. 

ఐపీఎల్‌లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్‌ షమీ విషయంలో సెలెక్షన్‌ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్‌ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.

అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్‌ పడిక్కల్, వాషింగ్ట‌న్‌ సుందర్, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, కుల్దీప్‌ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్‌ జురెల్, ప్రసిధ్‌ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌, హ‌ర్ష్ దూబే.

అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు: శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్‌ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్ట‌న్ సుందర్, కుల్దీప్‌ యాదవ్, ప్రసిధ్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్, గుర్నూర్‌ బ్రార్‌, హ‌ర్ష్‌ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.

మ్యాచ్‌ల షెడ్యూల్‌..

  • జూన్‌ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్‌ పూర్‌, ఛండీగఢ్‌)

  • తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)

  • రెండో వన్డే : జూన్‌ 17 (లక్నో)

  • మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)

చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!

Advertisement
 
Advertisement
Advertisement