
అర్షదీప్ సింగ్(ఫోటో కర్టసీ: ట్వీటర్)
ముంబై: వాంఖడే వేదికగా సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీ పోరులో పంజాబ్ కింగ్స్ గెలిచి ఊపిరి పీల్చుకోగా. రాజస్థాన్ పోరాడి ఓడింది. ఇరుజట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 4 పరుగులు తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల టార్గెట్లో రాయల్స్ 217 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. సంజూ సామ్పన్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. 63 బంతుల్లో 119 పరుగులు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 221 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించి పంజాబ్ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు.
కాగా, మ్యాచ్ చివరి వరకూ రావడంతో అటు ఆటగాళ్లలోనూ ఇటు చూసే వాళ్లలోనూ టెన్షన్ పెరిగిపోయింది. ఆఖరి ఓవర్ను అర్షదీప్ సింగ్ చేతికి ఇవ్వగా అతను అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అప్పటికే క్రీజ్లో సెంచరీ సాధించిన సంజూ సామ్సన్ ఉన్నాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి కావాల్సింది 13 పరుగులే. సంజూ ఉండటంతో రాజస్తాన్దే గెలుపని అంతా అనుకున్నారు. కానీ ఆ ఓవర్లో అర్షదీప్ 8 పరుగులు ఇవ్వడమే కాకుండా ఆఖరి బంతికి సంజూ వికెట్ను తీయడంతో పంజాబ్ 4 పరుగులతో గెలిచి శుభారంభం చేసింది. అర్షదీప్ మాత్రం తన అవుట్ సైడ్ యార్కర్ బంతులతో సామ్సన్ను బోల్తా కొట్టించి.. పంజాబ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి బంతికి సిక్సర్ బాదుదామనుకున్న సామ్సన్ను ఔట్ చేయడంతో అర్షదీప్ హీరో అయ్యాడు.
మ్యాచ్ అనంతరం అర్షదీప్ సింగ్ మాట్లాడుతూ... ఆఖరి ఓవర్ను నా చేతికి ఇచ్చారు. ఆ ఓవర్ను కచ్చితంగా నేనే వేయాల్సిన పరిస్థితి. నాకు ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయింది. నేను వేసిన బంతులకు పిచ్కు సహకరించడంతో సంజూను ఆపగలిగాను. చివరి ఓవర్ ఆరు బంతుల్ని ఆఫ్సైడ్ దూరంగా యార్కర్లు విసరాలన్నది మా ప్రణాళిక. ఫీల్డ్ సెట్ కూడా దానికి అనుగుణంగా చేయబడింది. సంజు శాంసన్కు యార్కర్లు వేసేందుకు ప్రయత్నించా. అలాంటప్పుడు అతడు బౌండరీలు మాత్రమే కొట్టగలడు. అదే సమయంలో ఔట్ కూడా కావొచ్చు. ఆ ప్లాన్ కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యా’ అని అర్షదీప్ పేర్కొన్నాడు.
ఇక తమ కోచింగ్ బృందం, కెప్టెన్ తనకు అండగా నిలిచారని, నేను ఎలాంటి పాత్ర పోషించాలో సన్నాహక మ్యాచ్ల్లో నాకు స్పష్టంగా చెప్పారు. దాంతో తనలో కాన్ఫడెన్స్ పెరిగిందన్నాడు. కెప్టెన్ ఎలా కోరుకుంటాడో అలా బౌలింగ్ చేయడమే తన పని అని, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో చాలా హోరాహోరీ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. అది ఇక్కడ ఉపయోగపడింది’అని అన్నాడు.
ఇక్కడ చదవండి: ఇంత బాగా రాణిస్తాడని అస్సలు ఊహించలేదు: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment