
మహిళల ఆసియా కప్లో పాకిస్తాన్ తొలి విజయం సాధించింది. నేపాల్తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. పసికూన నేపాల్పై విరుచుకుపడింది. నేపాల్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని పాక్ 11.5 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా గ్రూప్-ఏలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మైదానంలో పాదరసంలా కదిలారు. పాక్ ఆటగాళ్లు ముగ్గురు నేపాల్ బ్యాటర్లను రనౌట్ చేశారు. సైదా ఇక్బాల్ 2, ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్లో కబిత జోషి (31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. సీతా రనా మగర్ 26, పూజా మహతో 25, కబిత కన్వర్ 13 పరుగులు చేశారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా (35 బంతుల్లో 57; 10 ఫోర్లు), మునీబా అలీ (34 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) నేపాల్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఇవాళ (జులై 22) శ్రీలంక, మలేసియా.. బంగ్లాదేశ్, థాయ్లాండ్ మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్లో (జులై 23) నేపాల్తో తలపనుంది.
Comments
Please login to add a commentAdd a comment