
''అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్లోనే ఉన్నా.. ఐపీఎల్ ఆడడానికి వస్తున్నా''.. పంత్ చేసిన వ్యాఖ్యలివి. పంత్ మాటలు వినగానే ఒక్క నిమిషం పాటు అభిమానులు ఆనందపడిపోయారు. కానీ అది ప్రమోషనల్ వీడియో అని తెలియగానే చల్లబడ్డారు.
విషయంలోకి వెళితే.. పంత్ లేని లోటు తెలుస్తుందని.. దీంతో అతనితో ప్రమోషనల్ వీడియో చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించింది. అనుకుందే తడవుగా బుధవారం అతనితో వీడియో చేసి ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం పంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే వీడియో చూసిన అభిమానులు.. ''ఐపీఎల్కు నువ్వు వస్తున్నావని తెగ సంతోష పడిపోయాం.. ఇంత మోసం చేస్తావా పంత్''.. ''తొందరగా కోలుకో పంత్'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ప్రమోషనల్ వీడియోలో పంత్ మాట్లాడుతూ.. ''క్రికెట్, ఫుడ్.. ఈ రెండింటిని వదిలి నేను బతకలేను. యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోయాను.. ఇష్టమైన ఫుడ్ తినలేకపోయాను. అయితే కాస్త కోలుకున్నాకా డాక్టర్ మంచిగా తింటే తొందరగా రికవరీ అవుతావన్నారు. అందుకే ఆరోగ్యానికి మంచిదైన ఇంటిఫుడ్ను ఎక్కువగా తీసుకున్నా. క్రికెట్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎందుకు క్రికెట్ ఆడకూడదు అనిపించింది. అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. ఇంకా గేమ్లోనే ఉన్నా.. మ్యాచ్లు ఆడడానికి వస్తున్నా అంటూ పేర్కొన్నాడు.
గతేడాది డిసెంబర్లో రిషబ్ పంత్కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం పంత్ కోలుకుంటున్నాడు. ఫలితంగా దాదాపు తొమ్మిది నెలలు క్రికెట్కు దూరమయ్యాడు. అయితే వేగంగానే కోలుకుంటుండడంతో అనుకున్నదాని కంటే ముందుగానే మైదానంలో అడుగుపెడతానని పంత్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇక యాక్సిడెంట్తో ఐపీఎల్తో పాటు వన్డే వరల్డ్కప్కు కూడా దూరమయ్యే చాన్స్ ఉంది. ఇప్పటికే ఐపీఎల్కు దూరం కావడంతో పంత్ సేవలను ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్లో కెప్టెన్గా వార్నర్కు అనుభవంతో పాటు మంచి పేరు ఉంది. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్ను ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఏప్రిల్ ఒకటిన లక్నో సూపర్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యా్చ్ను ఆడనుంది.
Rishabh Pant is back! pic.twitter.com/3uu51Nz0AO
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2023
Comments
Please login to add a commentAdd a comment