
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్కు గుండె పగిలే వార్త. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టా స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టి అభిమానులను కలవరపెట్టాడు. స్కై పరోక్షంగా తాను ఐపీఎల్ 2024 ఆడలేనన్న సంకేతాలిచ్చాడు.
స్కై పోస్ట్ పెట్టిన సందర్భాన్ని బట్టి చూస్తే ఇదే నిజమని తెలుస్తుంది. గతకొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న స్కై ఇటీవలే పలు సర్జరీలు చేయించుకుని ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.
తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఎన్సీఏ సూర్యకుమార్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించినట్లుంది. అందుకే అతను సోషల్ మీడియా వేదికగా తన బాధను బహిర్గతం చేసి ఉండవచ్చు.
Suryakumar Yadav's Instagram story. pic.twitter.com/2M7ZGBhTDN
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024
ఇటీవలే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్కు ఎన్ఓసీ ఇచ్చిన ఎన్సీఏ.. స్కై విషయంలో అధికారికంగా ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో స్కై క్రిప్టిక్ పోస్ట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న సూర్యకుమార్ చీలిమండ, స్పోర్ట్స్ హెర్నియాలకు సర్జరీలు చేయించుకున్నాడు. సూర్యకుమార్ తాజా పోస్ట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఒకవేళ ఎన్సీఏ స్కైకు ఎన్ఓసీ ఇవ్వకపోతే అతను సీజన్ మొత్తానికి దూరంగా ఉంటాడా లేక తొలి దశ మ్యాచ్లకు మాత్రమే దూరమవుతాడా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్లో జరిగే ఆ మ్యాచ్లో ముంబై.. గుజరాత్ టైటాన్స్ను ఢీకొంటుంది.