
పారా అథ్లెట్ వినోద్కుమార్(PC: PCI)
టోక్యో పారాలింపిక్స్-2020లో డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచినట్టే గెలిచి పతకాన్ని చేజార్చుకున్న భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్కు మరో భారీ షాక్ తగిలింది. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా ది బోర్డ్ ఆఫ్ అప్పీల్ ఆఫ్ క్లాసిఫికేషన్(బీఏసీ) నిషేధం విధించింది. పారాలింపిక్స్లో డిస్కస్ త్రో ఈవెంట్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2023 వరకు వినోద్ కుమార్పై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.
ఈ మేరకు.. ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి.. పారా అథ్లెట్గా క్లాసిఫికేషన్లో పొందుపరిచిన వివరాలకు భిన్నంగా కుమార్ వ్యవహరించాడని తన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ క్లాసిఫికేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రమశిక్షణా రాహిత్యం కింద అతడిపై చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
కాగా పారాలింపిక్స్లో కుమార్ ప్రవర్తనను గమనించిన తోటి పోటీదారులు అతడిపై ఫిర్యాదు చేయగా.. క్లాసిఫికేషన్కు విరుద్ధంగా అతడు వ్యవహరించినట్లు తేలింది. దీంతో ఎఫ్52 డిస్కస్ విభాగంలో మూడో స్థానంలో నిలిచినప్పటికీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందున కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
అసలేం జరిగింది?
పారా అథ్లెట్ల వైకల్యం రకం, తీవ్రతను బట్టి వర్గీకరణ చేస్తారు. అదే స్థాయిలో వైకల్యం ఉన్న ఇతర పారా అథ్లెట్లతో పోటీ పడేందుకు అనుమతినిస్తారు. డిస్కస్ త్రోలో ఎఫ్52 క్లాస్లో .. కండరాల శక్తి, వాటి కదలికల్లో అడ్డంకులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా కొంతమందికి వీల్చైర్లో కూర్చుని ఆడేందుకు అవకాశం ఇస్తారు. అయితే, ఈ విషయంలో వినోద్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పారాలింపిక్స్లో అతడిని అనర్హుడిగా పేర్కొన్నారు. ఇప్పుడు రెండేళ్ల పాటు నిషేధం విధించారు.
చదవండి: Who Is Teja Nidamanuru: అరంగేట్రంలోనే అర్థ శతకంతో మెరిసి.. ఎవరీ తేజ నిడమనూరు?