
పనాజీ: కరోనా మహమ్మారి మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణపై తన ప్రభావం చూపనుంది. భారత్ వేదికగా జరుగనున్న ‘ఫిఫా’ అండర్–17 మహిళల వరల్డ్ కప్ టోర్నీ మరోసారి వాయిదా పడే అవకాశాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్లో జరగాల్సిన ఈ టోర్నీ కోవిడ్–19 కారణంగా వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. అయితే ఇది మరోసారి వాయిదా పడే అవకాశముందని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరు వరకు దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. చాలా దేశాల్లో వరల్డ్కప్ అర్హత టోర్నీలు కూడా ఇంకా ముగియలేదని, ఈ పరిస్థితుల్లో అంతా సవ్యంగా జరగడం కష్టమని వ్యాఖ్యానించారు. ‘ఫిఫా’ వర్గాలు కూడా ఇదే ఆలోచిస్తున్నట్లుగా తాజా వ్యాఖ్యలతో తెలుస్తోంది. ఆట కన్నా దానితో ముడిపడి ఉన్న వారి ఆరోగ్య భద్రతే తమకు ప్రధానమని ‘ఫిఫా’ అధికార ప్రతినిధి అన్నారు.