
రావల్పిండి: పాకిస్తాన్కు జింబాబ్వే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనుకున్న పాకిస్తాన్కు ఊహించని పంచ్ ఇచ్చింది. సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన మ్యాచ్లో జింబాబ్వే విజయం సాధించింది. సూపర్ ఓవర్లో పాకిస్తాన్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో మూడు పరుగుల టార్గెట్నే నిర్దేశించింది. ఈ టార్గెట్ను జింబాబ్వే బ్యాట్స్మన్ రాజా ఫోర్ కొట్టి మూడో బంతికే ముగించాడు. అంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ అద్భుతంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
అయితే 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే.. అసాధారణ ప్రదర్శనతో అదగొట్టింది. 50 ఓవర్లపాటు క్రీజ్లో ఉండి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మరో మూడు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేయడం ఇక్కడ విశేషం. అది కూడా పాకిస్తాన్ గడ్డపై జింబాబ్వే ఈ తరహా ప్రదర్శన చేయడం చర్చనీయాంశమైంది. జింబాబ్వే ఆటగాళ్లలో సీన్ విలియమ్స్(118), బ్రెండన్ టేలర్(56), రాజా(45), మద్వెరె(33)లు రాణించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ సరిగ్గా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. బాబర్ అజామ్(125), వహాబ్ రియాజ్(52), ఖుష్దీ షా(33)లు ఆకట్టుకున్నారు. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు కావాల్సిన తరుణంలో 12 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్లో జింబాబ్వే గెలవడం గమనార్హం. ఇందులో జింబాబ్వే 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సందర్భం నంచి కోలుకోవడం ఒకటైతే, పాకిస్తాన్ను టై వరకూ తీసుకురావడం మరొకటి. ఇక సూపర్ ఓవర్లో పాక్ను ఓడించడంతో ఈ మ్యాచ్ హైలైట్గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment