
ధాన్యం.. చిత్తశుద్ధి శూన్యం
గోతాలకూ కటకటే
సిబ్బంది కొరతా సమస్యే
ధాన్యం కొనుగోళ్లలో అధికారులకు చిత్తశుద్ధి కరువవడం.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం రైతుల పాలిట శాపంలా పరిణమించింది. ధరల్లేక.. కొనేవారు కానరాక అన్నదాతలకు ఇబ్బంది తప్పడంలేదు. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు.. నిల్వ చేసేందుకూ సౌకర్యాల్లేవంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కోసిన అనంతరం కల్లాల్లోనే విక్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని ధరలను మిల్లర్లు తగ్గించి వారిని దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా, కర్షకులకు మద్దతు ధర లభించడం గగనమవుతోంది.
నెల్లూరు (పొగతోట): అనాలోచిత చర్యలు.. ముందస్తు ప్రణాళికల్లేకపోవడం.. పక్క జిల్లాల మిల్లర్లను రప్పించడంలో అధికార యంత్రాంగం విఫలం కావడం రైతుల పాలిట శాపంలా మారింది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల మధ్య పోటీతత్వం లేకపోవడం.. ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం.. నిల్వ చేసేందుకు రైతులకు సౌకర్యాల్లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీ పర్వానికి తెరలేపారు. గతేడాదితో పోలిస్తే పుట్టికి రూ.పది వేలు తగ్గించి కొంటున్నా చేష్టలుడిగి చూడటం అధికారుల వంతవుతోంది. మద్దతు ధరకు విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని ప్రచారం చేస్తున్నారే తప్ప, మిల్లర్లను కట్టడి చేసి ధరలు పెరిగేలా చూడటంలో విఫలమవుతున్నారు.
బ్యాంక్ గ్యారెంటీల సేకరణలో వైఫల్యం
వాస్తవానికి జిల్లాలో 120 రైస్మిల్లులుండగా, నెల్లూరులోనే 80 ఉన్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను ఆడించేందుకు 103 మిల్లులను గుర్తించారు. వీటికి ధాన్యాన్ని సరఫరా చేయాలంటే బ్యాంక్ గ్యారెంటీలను తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటి సేకరణలోనూ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎంపిక చేసిన వాటిలో కేవలం 50 నుంచి 60 మిల్లులే రూ.30 కోట్లకు గ్యారెంటీలను సమర్పించడం విశేషం. వాస్తవానికి వరికోతలు ప్రారంభం కాక ముందే రైస్ మిల్లర్లతో ఆయా ప్రాంతాల సీఎస్డీటీలు సమన్వయం చేసుకొని.. సమావేశాలను నిర్వహించి వీటిని సేకరించాల్సి ఉంది. అయితే ఇవేవీ జరగకపోవడం రైతులకు అశనిపాతంలా పరిణమించాయి.
ఒకే అధికారి.. మూడు విధులు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించే డీఎస్ఓ పోస్ట్ ఖాళీగా ఉంది. నెల్లూరు ఏఎస్ఓ, ఆఫీస్ ఏఎస్ఓ, డీఎస్ఓ.. ఇలా మూడు పోస్ట్లను ప్రస్తుత ఇన్చార్జి డీఎస్ఓ అంకయ్య నిర్వహిస్తున్నారు. డీఎస్ఓ లేని సమయాల్లో డిప్యూటీ కలెక్టర్ హోదా స్థాయి అధికారులను ఇన్చార్జిగా నియమించాల్సి ఉన్నా, ఆ యత్నాన్నే చేయకపోవడం గమనార్హం.
ప్రతి అంశంలోనూ ఇంతే..
గోతాల్లేక.. బ్యాంక్ గ్యారెంటీలు అందక.. రవాణాకు లారీలు సక్రమంగా పంపక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వీటిని సహాయ పౌరసరఫరాల అధికారులు, సీఎస్డీటీలు పర్యవేక్షించేవారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితే లేదు. ధాన్యం బస్తాలను దించుకుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. కొద్దో గొప్పో సేకరించిన లారీల నుంచి సకాలంలో అన్లోడ్ కావడంలేదు. పుట్టి ధరలు ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకే ఉన్నాయి. కోతలు ముమ్మరం కావడంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్లను పిలిపించి వారితో జేసీ కార్తీక్ సమావేశమై.. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.
బ్యాంక్
గ్యారెంటీలిచ్చేందుకు
ముందుకు
రాని మిల్లర్లు
కొనుగోళ్లలో
అధికారుల తీరిదీ..
జిల్లాలో
103
సీఎమ్మార్
మిల్లులు
అన్నదాతల అగచాట్లు
సకాలంలో జరగని
సమన్వయ
సమావేశాలు
మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు
రైతులు నష్టపోకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రకాశంతో పాటు సమీప జిల్లాల రైస్ మిల్లర్లను సంప్రదించాం. వీరితో ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టాం. రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించేలా చూస్తున్నాం.
– అంకయ్య, ఇన్చార్జి డీఎస్ఓ
జిల్లా వ్యాప్తంగా సీఎస్డీటీ పోస్టులు 11 ఉండగా, అందులో ఆరు ఖాళీగా ఉన్నాయి. కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, ఇందుకూరుపేట, రాపూరు, నెల్లూరు రూరల్, అర్బన్లో ఈ పరిస్థితి నెలకొంది. నెల్లూరు రూరల్, అర్బన్లో ఎలక్షన్ డీటీలను ఇన్చార్జి సీఎస్డీటీలను నియమించారు. ఇందుకూరుపేట జీపీఏ, సీఎస్డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో వరిని అధికంగా పండిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడి సీఎస్డీటీలను ఆయా ప్రాంతాల ఎమ్మెల్ఎస్ పాయింట్లకు ఇన్చార్జిలుగా నియమించారు.

ధాన్యం.. చిత్తశుద్ధి శూన్యం
Comments
Please login to add a commentAdd a comment