
చెన్నై: తమిళనాడులోని మదురై ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులు ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు చరకుడు పేరు మీద ప్రమాణం చేయడం వివాదానికి దారి తీసింది. మెడికల్ కాలేజీలో చేరేటప్పుడు విద్యార్థులు వైద్య శాస్త్ర పితామహునిగా చెప్పుకునే హిపోక్రేట్స్ పేరిట ప్రమాణం చేస్తారు.
కానీ, మదురై మెడికల్ కాలేజీ డీన్ రత్నవేల్ కొత్త విద్యార్థులతో శనివారం ‘మహర్షి చరక శపథం’ చేయించడం కలకలం రేపింది. దాంతో ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తొలగించింది. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ఇలా నిబంధనలు అతిక్రమించడం సరికాదని ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ అన్నారు. నిబంధనల మేరకే విద్యార్థులతో ప్రమాణం చేయించాలని మెడికల్ కాలేజీలను ఆదేశించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుడు నారాయణన్ తిరుపతి స్పందిస్తూ, డీన్ తొలగింపు నిర్ణయం రాజకీయ ఎత్తుగడ అని పేర్కొన్నారు.