
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో కరోనా కారణంగా వాయిదాపడిన అన్ని కోర్సుల పరీక్షలను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం నుంచి ఓయూ పరీక్షలు ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. కరోనా కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిబంధనల ప్రకారం వారి కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, బీఈడీ, బీపీఈడీ, బీసీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు 17వ తేదీ నుంచి వచ్చేనెల 14 వరకు జరుగుతాయి.
ఎంబీఏ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 12 వరకు, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ ఇతర డిగ్రీ కోర్సుల పరీక్షలు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 13 వరకు జరుగుతాయని కంట్రోలర్ వివరించారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు పరీక్షలకు రెండు రోజుల ముందు నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షల టైంటేబుల్, ఇతర వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవడంతో రాబోయే మూడు నెలలు వరుసగా పరీక్షలు నిర్వహిస్తున్నామని కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు.