
నేడు హైదరాబాద్లో ‘కులగణన’ సదస్సుకు హాజరు
బీసీ సంఘాల నేతలతో కాంగ్రెస్ అగ్రనేత సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ మంగళవారం హైదరాబాద్కు రానున్నారు. సుమారు రెండు గంటల పాటు నగరంలో గడపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన కార్యక్రమంపై ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపడంతో పాటు వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరగనున్న సమావేశంలో ఆయన పాల్గొంటారు.
టీపీసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. సాయంత్రం 4:45కు ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర నుంచి రాహుల్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా బోయిన్పల్లి సమావేశానికి వెళ్తా రు. దాదాపు 200 మంది ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలు, మరో 200 మంది కాంగ్రెస్ నాయకులతో జరిగే సదస్సులో పాల్గొంటారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. కులగణన ప్రాధాన్యతను ఆయన వివరించనున్నారు.
6:30 గంటల సమయంలో అక్కడి నుంచి బేగంపేట చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. కాగా టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ నేతృత్వంలో కులగణన సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సోమవారం హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. బోయిన్పల్లిలో ఏర్పాట్లను సమీ క్షించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు సదస్సులో పాల్గొంటారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.

Comments
Please login to add a commentAdd a comment