ఫాంహౌస్‌ సీఎంను కాను.. | CM Revanth Reddy unfurls national flag on Telangana Praja Palana Dinotsavam | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌ సీఎంను కాను..

Published Wed, Sep 18 2024 1:05 AM | Last Updated on Wed, Sep 18 2024 1:04 AM

CM Revanth Reddy unfurls national flag on Telangana Praja Palana Dinotsavam

నేను పనిచేసే ముఖ్యమంత్రిని: రేవంత్‌రెడ్డి

పన్నుల రూపంలో వేలకోట్లు కేంద్రానికి కడుతున్నాం 

రాష్ట్రం హక్కుగా రావాల్సిన వాటా కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తా 

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘నా ఢిల్లీ పర్యటనల మీద విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేమీ ఫాంహౌస్‌ సీఎంను కాదు. పని చేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్లడం లేదు. ఢిల్లీ ఏ పాకిస్తాన్‌లోనో, బంగ్లాదేశ్‌లోనో లేదు. అది మన దేశ రాజధాని. ఇది ఫెడరల్‌ వ్యవస్థ. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలుంటాయి. రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కడుతున్నాం.

 అందులో హక్కుగా రావాల్సిన మన వాటాను తిరిగి తెచ్చుకోవడం కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతా..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ‘ఓ నిజాము పిశాచమా... కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని..’అంటూ దాశరథి కృష్ణమాచార్య రాసిన కవితతో సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఐక్యతను దెబ్బతియడానికే వివాదం  
‘తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను, సమైక్యతను దెబ్బతీసే విధంగా సెపె్టంబర్‌ 17ను కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరాని విషయం. నిరంకుశ నిజాం రాజు, ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగానే పోరాటం జరిగింది కాని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా కాదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం. విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదు.

అందుకే ఈ శుభదినానికి ప్రజా పాలన దినోత్సవంగా నామకరణం చేశాం. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి. తెలంగాణ అస్తిత్వం అంటే తమ కుటుంబ అస్తిత్వం, సంస్కృతి అని గత పాలకులు భావించారు. తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా నేను అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికా..’అని రేవంత్‌ చెప్పారు.  

ఎన్ని అడ్డంకులొచి్చనా హైడ్రా ఆగదు 
‘గత పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు. ప్రతి నెలా అసలు, వడ్డీ కలిపి రూ.6 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేం బాధ్యతలు స్వీకరించాం. కేంద్రం నుంచి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులందరినీ కలిసి, వినతిపత్రాలు ఇస్తున్నా. లేక్‌ సిటీగా పేరొందిన హైదరాబాద్‌ గత పాలకుల పాపంతో ఫ్లడ్స్‌ సిటీగా దిగజారింది. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచి్చనా హైడ్రా ఆగదు..’అని సీఎం స్పష్టం చేశారు. 

సంక్షేమంలో మా రికార్డులు మేమే తిరగరాస్తున్నాం..
‘మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేశాం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. సంక్షేమంలో మా పార్టీ రికార్డులను మేమే తిరగ రాస్తున్నాం. మేం అధికారంలోకి వచి్చన 6 నెలల్లో ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశాం. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ కోసం రూ.282 కోట్ల సబ్సిడీని, 49 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌కు రూ.965 కోట్ల సబ్సిడీని చెల్లించాం.

87 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణాలు చేసి రూ.2,958 కోట్లు ఆదా చేసుకున్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సహాయం అందించి ఈ ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించబోతున్నాం. స్థలం లేని వారికి స్థలం ఇవ్వబోతున్నాం. విద్యా రంగంలో సమూల మార్పులకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. గల్ఫ్‌ కారి్మకులు విదేశాల్లో మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వారి సమస్యల అధ్యయనానికి ఒక కమిటీని వేశాం..’అని రేవంత్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement