
అనుకోకుండానే కార్యక్రమానికి హాజరై చరిత్ర సృష్టించిన ఈ కోటీశ్వరుడు సోమవారం రాత్రి 8ç:30 గంటలకు టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో చెక్కు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మిగతా సగం మంగళవారం ప్రసారం కానుంది. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు.
2000 – 2004 మధ్య హైదరాబాద్లోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఇదివరకు సాఫ్ట్వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున ఒలింపిక్స్లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించారు. హైదరాబాద్లోని సీఐడీ సైబర్ క్రైంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర పిస్టల్, ఎయిర్ రైఫిలింగ్లోనూ దిట్ట. ఈ సందర్భంగా రవీంద్రను ‘సాక్షి’ ఫోన్లో పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే..
సివిల్స్ ప్రిపరేషన్ సహకరించింది..
గతంలో సివిల్స్కు సిద్ధమై ఉండటం నా గెలుపునకు తోడ్పడింది. ఒలింపిక్ క్రీడల్లో ఇండియా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించడం నా కల. ఇప్పటికే జాతీయ స్థాయి పోలీసు క్రీడాపోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని రెండుసార్లు బంగారు, రజతం, ఒకసారి కాంస్య పతకాలు సాధించాను. 2017 తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో, అదే ఏడాది గుహవాటిలో జరిగిన జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నా. 2019లో జరిగిన ఆలిండియా పోలీస్ పిస్టల్ విభాగం పోటీల్లో రజతం సాధించా. వచ్చిన రూ.కోటితో నాణ్యమైన శిక్షణ పొందుతా. నాలాగా అవసరం ఉన్నవారికీ సహకరిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment