
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు.
ఖమ్మం జిల్లాలో జన్మించినా తుంగతుర్తిలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే చదువుకున్న ఆయన, ఆ తరువాత హైసూ్కల్ విద్యను హైదరాబాద్లో పూర్తి చేశారు. డిగ్రీ వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. తుంగతుర్తికి చెందిన వరూధినీ దేవిని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. 1985లో రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. 2008లో నియోజకవర్గాల పునరి్వభజన జరిగే వరకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1985, 1989, 2004లో మూడుసార్లు గెలుపొందారు.
1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆయన 1992లో నేదురుమల్లి జనార్దన్రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకట్రెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కాంగ్రెస్లో దామన్నది ప్రత్యేక స్థానం
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ జిల్లా రాజకీయాల్లో దామోదర్రెడ్డిది ప్రత్యేక స్థానం. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో దామోదర్రెడ్డి రాజకీయ ప్రవేశంతో తుంగతుర్తిలో రాజకీయం మారిపోయింది. కమ్యూనిస్టులు, టీడీపీ ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో దామన్న, ఆయన సతీమణి ‘వరూధినీదేవిని వెంటబెట్టుకుని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో ’టైగర్ దామన్న’గా గుర్తింపు పొందారు.
రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.
దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ద్రిగ్బాంతి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి అని ఆయనను తామంతా దామన్న అని పిలుచుకునే వాళ్లమని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు.
దామోదర్ రెడ్డి మృతి పట్ల ప్రగడ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలు ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని , ఒక నిజాయితీ గల నాయకుడిగా, ప్రజాసేవలో ఆయన చూపిన తపన ఎప్పటికీ మరువలేమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు దుఃఖ సమయంలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన గడ్డం ప్రసాద్ కుమార్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.
ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు తుంగతూర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుండి అయిదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
దామోదర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. దామన్న లేడు అనేది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేదు, పార్టీ పటిష్ఠతకు దివంగత దామోదర్ రెడ్డి వేసిన పునాది బలమైనది. కాంగ్రెస్ తో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది.
కమ్యూనిస్టుల్బకంచుకోటలను ఛేదించిన ధీశాలి, అటువంటి మహానేత మననుండి నిష్క్రమించడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం కీలకమైనది.
పార్టీ కోసం,పార్టీ ఆశయాల కోసం,పార్టీ క్యాడర్ కోసం నిరంతరం పరితపించిన నేత దామోదర్ రెడ్డి. చివరి వరకు కాంగ్రెస్ పార్టీని ఊపిరిగా భావించిన యోధుడు దామన్న. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు.
దామోదర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి
ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. దామోదర్ రెడ్డి మరణం.కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు. దామోదర రెడ్డి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు, క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నాయకులు, దామోదర రెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసింది.
5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసిన దామోదర్ రెడ్డి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై మంత్రి కొండా సురేఖ ద్రిగ్బాంతి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబంలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన నాయకుడు దామోదర రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ మహనీయుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి సురేఖ ప్రార్థించారు.
1985, 89, 94, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపు
అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి
దామోదర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాల
తల్లిదండ్రులు: నారాయణ రెడ్డి, కమలమ్మ
నలుగురు సోదరులు, సోదరీమణులు
ప్రైమరీ స్కూల్ కామేపల్లి, హైదరాబాద్ వివేక వర్ధిణి, వరంగల్ లో బీఎస్సీ, బీజెడ్సీ
జననం: 1952, 14 సెప్టెంబర్
ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి
1985, 89, 94, 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలుపు
1992 నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, 2007 లో వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా చేసిన దామన్న
నాలుగుసార్లు తుంగతుర్తి, ఒకసారి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
1994లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్(ప్రజా కాంగ్రెస్) గా పోటీ చేసి గెలుపు
1999 లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు చేతిలో ఓటమి
2004 లో తుంగతుర్తి నుంచే సంకినేనిపై దామన్న గెలుపు
1985 లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే
1989 లో నల్లగొండ జిల్లాలో గెలిచిన ముగ్గురిలో దామన్న ఒకరు
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మూడు ఎన్నికలు 2014, 2018, 2023 లో వరుసగా మూడుసార్లు ఓటమి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమి
ఎన్నికల పూర్తయ్యాక అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయిన దామోదర్ రెడ్డి