
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నిల్వ సామర్థ్యం 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తే రాష్ట్రంలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ పునరుద్ఘాటించింది. పోలవరం బ్యాక్వాటర్తో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు గోదావరికి ఇరువైపులా తెలంగాణ పరిధిలో 892 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టుగా తమ ఇంజనీర్లు తేల్చారని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేను.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు పరిమితం చేయకుండా 892 ఎకరాల్లో చేపట్టాలని డిమాండ్ చేసింది. బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) భేటీలో పోలవరం ముంపు ప్రభావంపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్కుమార్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.
వాగుల ప్రవాహానికి బ్యాక్వాటర్ అడ్డంకి
పోలవరంతో తెలంగాణలో 300ఎకరాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని, దీనిపై అధ్యయనం జరిపి నివా రణ చర్యలు తీసుకుంటామని 2020 జనవరిలో జరిగిన 11వ పీపీఏ భేటీలో ఏపీ కూడా ఒప్పుకుందని మురళీధర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే కోసం ఇటీవల క్షేత్రస్థాయి పర్య టనకు వచ్చిన ఏపీ అధికారులు.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఉండనున్న ప్రభావంపైనే అధ్యయనం చేస్తామ న్నారని తెలిపారు. 892 ఎకరాల ముంపుపై అధ్యయనం చేయాలని తాము కోరగా, ఏపీ ప్రభుత్వ అనుమతి తీసు కుని మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారని వివరించారు. తెలంగాణలోని 35 వాగుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్వాటర్ అడ్డంకిగా మారడంతో పరిసర ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం జరిగిందన్నారు. గత జూలైలో వచ్చిన వరదలతో 103 గ్రామాలు ప్రభావితం కాగా, 40,446 ఎకరాలు ముంపునకు గుర య్యాయని చెప్పారు. పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మరో 46 గ్రామాల పరిధిలోని 9,389 ఎకరాలు ముంపునకు గురి అవుతాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం అధ్యయనం చేయించాలని కోరారు. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని వరద జలాలను గోదావరిలోకి పంపింగ్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు
తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదని, దీనికి ఎవరూ అంగీకరించలేదని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర, తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అన్ని రాష్ట్రాల తో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని మాత్రమే సూ చించిందని చెప్పారు. అయితే రెండు సమావేశాల్లో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని, ఇందుకోసం త్వరలోనే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ సీఎంలతో సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం పేర్కొందని తెలిపారు. తెలంగాణకు నచ్చినట్టుగా నివేదికలు వచ్చేవరకు అధ్యయనం చేయాలా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం.. తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం
Comments
Please login to add a commentAdd a comment