కేరళ నాయర్లూ...రాజస్తాన్‌ గుజ్జర్లూ చుట్టాలే! | Kerala Nairs and Rajasthan Gujjars Relatives | Sakshi
Sakshi News home page

కేరళ నాయర్లూ...రాజస్తాన్‌ గుజ్జర్లూ చుట్టాలే!

Jan 2 2024 3:23 AM | Updated on Jan 2 2024 5:51 AM

Kerala Nairs and Rajasthan Gujjars Relatives - Sakshi

దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని నాయర్లు... వాయవ్య దిశలో ఉన్న రాజస్తాన్, దాని పొరు గునే ఉన్న పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలేనట! ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. నాయర్లతోపాటు కేరళకే చెందిన థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయవ్య ప్రాంతానికి చెందిన వారని జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించింది.     – సాక్షి, హైదరాబాద్‌

వలసలపై భిన్న వాదనలు... 
భారతదేశ నైరుతి ప్రాంతం.. అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవవైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులు చెబుతుంటారు. యూదు లు, పార్సీలు, రోమన్‌ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వారంతా గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఈ వాదనతో మరికొందరు విభేదించేవారు. వారంతా ఇండో–సిథియన్‌ వర్గం వారని, దేశ వాయవ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొనేవారు. 

డీఎన్‌ఏ సేకరణతో... 
ఈ నేపథ్యంలో నాయర్లు సహా ఇతరుల వలస ఎలా సాగింది? వారు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్‌ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వంటి భూస్వామ్య, యుద్ధవీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించింది.

అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్‌ గుర్తులను (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్‌ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) విశ్లేషించింది.

వాటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో తంగరాజ్‌ బృందం పోల్చిచూసింది. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్‌ (ఐశ్వర్యరాయ్‌ బంట్‌ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయవ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు జినోమ్‌ బయాలజీ అండ్‌ ఎవల్యూషన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

వారి మధ్య ఎక్కువ జన్యుసంబంధాలు.. 
నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయవ్య ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్‌ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వారిలో ఇరాన్‌ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది. తల్లివైపు నుంచి అందిన జన్యు సమా చారాన్ని విశ్లేషిస్తే పశ్చిమ యూరేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోంది. దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వారు భాగమై ఉంటారని చెప్పవచ్చు. – డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్, శాస్త్రవేత్త  

గోదావరి తీరం మీదుగా... 
భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయవ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు నాయర్లు, ఇతర వర్గాల ప్రజలు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తేలింది. – సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement