
హోం గార్డ్తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన ఇల్లందు పట్టణంలో చోటు చేసుకుంది.
సాక్షి, ఖమ్మం: హోం గార్డ్తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన ఇల్లందు పట్టణంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఎల్బీఎస్ నగర్లో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ స్థానికంగా ఉన్న కిరాణా షాపులో పనిచేస్తుంది. ఇల్లందు పోలీస్ స్టేషన్లో హోం గార్డ్గా పనిచేస్తున్న నరేష్ ఇక్కడి ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో నరేష్ ఆదివారం మధ్యాహ్నం సదరు మహిళ ఇంట్లో.. ఆమెతో మాట్లాడుతుండగా నరేష్ తల్లితోపాటు అతడి బంధువులు ఆ మహిళ ఇంటిపై దాడి చేశారు.
ఆమెను విచాక్షణారహితంగా కొట్టి బయట కిటికికీ తాడుతో చేతులు కట్టేశారు. అయితే బాధితురాలు మాత్రం నరేష్ తన వద్ద నుంచి కొందరికి డబ్బులు ఇప్పిస్తాడని.. ఈ క్రమంలో ఆదివారం డబ్బుల కోసం వచ్చాడని చెపుతుంది. గత కొన్ని రోజులుగా నరేష్ ఇంటికి సరిగా రాకపోవడం.. తరచుగా ఆ మహిళ ఇంటికి వెళ్లడం తదితర కారణాల వలన ఆ మహిళకు, నరేష్కు మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోందని దృఢంగా నమ్మిన ఆయన బంధువులు ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల జోక్యంతో ఈ గొడవ సద్దుమణిగింది.