
16 ఏళ్ల తర్వాత తమ కూతురిని తమకు అప్పగించేందుకు కృషి చేసిన పోలీసులకు
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్ల కింద తప్పిపోయిన ఓ బాలిక రాష్ట్ర పోలీసుల సాయంతో తన తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో 16 ఏళ్ల కింద ఓ బాలిక తప్పిపోయింది. అప్పట్లో ఆ బాలికను కొందరు చేరదీసి మియాపూర్ అనాథాశ్రమానికి పంపారు. ఆపరేషన్ స్మైల్–7లో భాగంగా అనాథాశ్రమంలోని చిన్నారుల వివరాలపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం పోలీసులు ఆరా తీశారు. హుస్సేనీ ఆలంలో మిస్సైన బాలికను గుర్తించారు. గతంలో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారు ప్రస్తుతం ఎక్కడున్నారో గాలించారు. కర్నూలులో ఉన్న బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గురువారం అనాథాశ్రమానికి వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలిక వారి కూతురేనని నిర్ధారించారు. 16 ఏళ్ల తర్వాత తమ కూతురిని తమకు అప్పగించేందుకు కృషి చేసిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.