
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామన్నారని, కానీ అలా చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత గురువారం(మార్చి 16) మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈనెల 11న ఈడీ అధికారులు ఆమెను 9 గంటలపాటు విచారించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలన్నారు. ఈనేపథ్యంలోనే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా.. నిరాశ ఎదురైంది.
మరోవైపు మహిళా రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హజరుకానున్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేసేవరకు తన పోరాటం ఆగదని కవిత బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
చదవండి: అదానీకి దోచిపెట్టడమే విదేశాంగ విధానమా? మోదీ తొమ్మిదేళ్లుగా దేశాన్ని భ్రమల్లోనే ఉంచుతున్నారు..
Comments
Please login to add a commentAdd a comment