
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment