
ప్రతీకాత్మక చిత్రం
పరీక్షలంటేనే భయం. కరోనా ఆ భయాన్ని మరింత పెంచింది. ఆ భయాన్ని పోగొట్టేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ముందడుగు వేసింది.
సాక్షి, హైదరాబాద్: పరీక్షలంటేనే భయం. కరోనా ఆ భయాన్ని మరింత పెంచింది. ఆ భయాన్ని పోగొట్టేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ముందడుగు వేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ నేపథ్యంలో... మానసిక ఒత్తిడి, పరీక్షల భయం ఉన్న విద్యార్థులకు క్లినికల్ సైకాలజిస్టుల సహాయాన్ని అందించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆందోళనకు గురయ్యే విద్యార్థులు సైకాలజిస్టులకు ఫోన్ చేసి సహాయం పొందాలని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చే సైకాలజిస్టుల ప్యానల్లో వైద్యులు అనిత ఆరే (9154951704,), మేజర్ అలీ (9154951977), రజనీ తెనాలి (91549 51695), పి జవహర్లాల్ నెహ్రూ (91549 51699), యస్ శ్రీలత (9154951703), శైలజ పిశాపాటి (9154951706), అనుపమ (9154951687) ఉన్నారు. (చదవండి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం.. హైకోర్టు గ్రీన్సిగ్నల్)
పరీక్షలకు సహకరిస్తాం: టీపీజేఎంఏ
ఈ నెల 25 నుంచి జరిగే ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలకు అన్ని విధా ల సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షుడు గౌరీ సతీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్తో చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు. పెండింగ్లో ఉన్న కాలేజీల ఉపకారవేతనాలకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారని సతీశ్ తెలిపారు. (చదవండి: చలో సర్కారు బడి.. అదే సమస్య మరి!)