● వైఎస్సార్సీపీ ‘యువత పోరు’కు పోటెత్తిన విద్యార్థులు
అడుగు అడుగు కదలి..
యువత పోరు కార్యక్రమానికి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. భూమన కరుణాకరరెడ్డితోపాటు మేయర్ శిరీష, పార్టీ తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, చెవిరెడ్డి మోహిత్రెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, యువత విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు దినేష్రాయల్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు గీతాయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షులు మాధవిరెడ్డి, నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్కు చేరుకున్నారు. మరోవైపు భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కలెక్టరేట్కు చేరుకుని వైఎస్సార్సీపీ ఆందోళనకు సంఘీభావం తెలిపారు.
కూటమి ప్రభుత్వం కరుణిస్తుందేమో అని పేద విద్యార్థులు ఆశపడ్డారు.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేరుస్తారేమో అని పడిగాపులు కాశారు.. చదువుకు ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారేమో అని గత 9 నెలలుగా ఎదురుచూశారు.. సర్కారు నిర్లక్ష్య వైఖరితో విసిగి వేశారిపోయారు.. ఆవేదనతో నలిగిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు.. ఈ క్రమంలో తల్లడిల్లిన నిరుపేద విద్యార్థుల గుండె మండింది. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన యువత పోరుశ్రీకు పోటెత్తింది. జగనన్న పాలనలో సజావుగా అందిన విద్యాదీవెనను గుర్తుచేసుకుంది. భూమన నేతృత్వంలో కదంతొక్కింది. కలెక్టరేట్ను ముట్టడించి ఆందోళనకు దిగింది. ప్రజా విద్రోహ పాలనకు వ్యతిరేకంగా నినదించింది.
తిరుపతి అర్బన్/తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం తిరుపతి కలెక్టరేట్ వద్ద చేపట్టిన యువత పోరు విజయవంతమైంది. పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల ఓవర్యాక్షన్పై మండిపడ్డారు. నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా నెట్టేయడంపై ఆవేదన చెందారు. ఉద్రిక్త వాతావరణంలోనే భూమన నేతృత్వంలో పలువురు నేతలు కలెక్టరేట్లోకి వెళ్లి కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రం అందించారు. పేద విద్యార్థుల ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం దగా చేస్తోందని, ఇప్పటికై నా ఫీజు బకాయిలు జమ చేయాలని పేర్కొన్నారు.
అన్నివర్గాలకు అన్యాయం
భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పేద ప్రజలను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దురాలోచనతో నోటికి వచ్చిన అబద్దాలు చెప్పారన్నారు. సూపర్సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టి ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. చివరకు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ సైతం చెల్లించని ప్రజాద్రోహి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలకు ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులను ఆయా యాజమాన్యాలు బయటకు పంపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ బిడ్డల భవిష్యత్పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే ఇస్తానన్న రూ. 3వేలు నిరుద్యోగ భృతి, 20లక్షల ఉద్యోగాల సంగతి ఏమైందని ప్రశ్నించారు. జగనన్న ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి పేదల బతుకుల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను అందించిన దేవుడని వెల్లడించారు. సకాలంలో ఫీజురీయింబర్స్మెంట్ అందిస్తూ విద్యార్థుల ఉన్నత భవితకు కృషి చేశారని వివరించారు. పేద పిల్లలు సైతం వైద్యులుగా ఎదగాలని రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిన దార్శనికుడు జగనన్న అని కొనియాడారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా కేవలం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించేందుకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందుకే ప్రజల్లో సైతం ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు.
● వైఎస్సార్సీపీ ‘యువత పోరు’కు పోటెత్తిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment