
అంతా మోసం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
‘చంద్రబాబు సహా టీడీపీ నాయకులది మాటల మాయాజాలం. బడ్జెట్లో అంకెల గారడీ. అరచేతిలో వైకుంఠం చూపించి తీరా అమలు దగ్గరకొచ్చేసరికి సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టడం అలవాటే. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్తో అది మరోసారి రుజువైంది’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు నెక్కల నాయుడుబాబు, కె.వి.సూర్యనారాయణరాజు, నరసింహమూర్తితో కలిసి శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్పై అభిప్రాయం ఆయన మాటల్లోనే...
‘‘టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అవసరమైన నిధులేవీ అందులో పొందుపర్చలేదు. సూపర్ సిక్స్ హామీలకూ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. కేవలం ఒక మోసపూరితమైన బడ్జెట్ను అంకెల గారడీ చేసి ప్రవేశపెట్టారు. గత ఏడాది జూన్లో అధికారం చేపట్టిన తర్వాత ఓటాన్ బడ్జెట్తో కాలం నడిపించింది. కేవలం ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టాలనే ప్రయత్నాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. ఏ ఒక్క ఎన్నికల హామీనీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినా, క్యాపిటల్ వ్యయంతో అభివృద్ధి పథకాలు అమలుచేయకపోయినా సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెచ్చారు.
● సాగునీటి వనరులపైనా చిన్నచూపే
సుమారు తోటపల్లి బ్యారేజ్ మిగులు పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో రూ.140 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రభుత్వం మారేటప్పటికే 20 శాతం వరకు పనులు పూర్తి అయ్యాయి. ఇంకా 80 శాతం పనులున్నా ఈ బడ్జెట్లో కేవలం రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారు. తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు పూర్తిచేస్తే భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన నీరే కాదు విజయనగరం పట్టణానికి పూర్తిస్థాయిలో తాగునీరు అందించవచ్చు. కానీ అరకొరగా నిధులు కేటాయించారు. ఈ ఏడాది అది పూర్తయ్యే పరిస్థితి లేదు. మరి 2026 నాటికల్లా నీరు రాకుండా ఎయిర్పోర్టును ఎలా ప్రారంభిస్తారు? ఎందుకు ప్రజలను మభ్యపెడతారు? జంఝావతి ప్రాజెక్టు, వెంగళరాయ సాగర్ పూర్తి చేస్తామని టీడీపీ మంత్రులు గొప్పలు చెప్పారు. కానీ బడ్జెట్లో అరకొరగా నిధులే విదిల్చారు. ఇక ఆండ్ర రిజర్వాయర్, తాటిపూడి రిజర్వాయర్లను పూర్తిగా విస్మరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావాలని గత ప్రభుత్వంలోనే టెండర్లను పిలిచారు. భూసేకరణకు సర్వే కూడా జరిగింది. కానీ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించలేదు. విజయనగరం ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ, విశాఖ శివారలో ఐఏఎం శాశ్వత భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఎస్.కోట ప్రాంతంలోని జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు పెట్టడానికి గత ప్రభుత్వంలోనే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని అనుమతులు ఇచ్చారు. కానీ ఇప్పుడు బడ్జెట్లో కూడా వాటి ప్రస్తావన లేదు. చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచారు. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. పార్వతీపురంలో మెడికల్ కాలేజీ ప్రస్తావన లేదంటే దానికీ మంగళం పాడేస్తున్నారని అర్థమవుతోంది.’’
రైతులకు మొండిచేయి
రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి సరైన దృక్కోణమే లేదు. ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు చొప్పున అన్నదాత సుఖీభవ పథకంలో ఇస్తామని ఊదరగొట్టిన టీడీపీ నాయకులు... ఇప్పుడు ఎక్కడ ఏ రైతులను ఆదుకున్నారో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న సుమారు 1.20 కోట్ల మంది ౖరైతులకు ఈ బడ్జెట్లో అరకొర నిధులతోనే సరిపెట్టారు.
ఎందుకీ
గొప్పలు
యువతకు
ఉద్యోగాలేవీ...
కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికొదిలేసింది
రాష్ట్ర బడ్జెట్లో సూపర్ సిక్స్కూ నిధులు కొరవడ్డాయి
యువతకు నిరుద్యోగ భృతి లేదు... ఉద్యోగాలు రావు
సాగునీటి ప్రాజెక్టులకూ అరకొరగానే నిధుల కేటాయింపు
ఎనిమిది నెలల్లోనే లక్షా 10 వేల కోట్లకు పైగా అప్పులు
మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
రాష్ట్రానికి ఆదాయ వనరులేమిటో బడ్జెట్లో చూపించలేదు. కేవలం అప్పులతోనే నెట్టుకొచ్చే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ వ్యయం గురించి ఆర్థిక మంత్రి గొప్పగా చెప్పారు. ప్రభుత్వం అప్పు తెచ్చినా లేదా కొత్త ఆదాయ మార్గాల నుంచి పెట్టుబడులు రప్పించి తద్వారా ఆదాయ వనరులు సమకూర్చేది క్యాపిటల్ వ్యయం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్యాపిటల్ వ్యయంతోనే రామాయపట్నం పోర్టు, మూలపేట పోర్టు, కృష్ణపట్నం పోర్టు సాకారం చేశాం. తీర ప్రాంతంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మత్స్యకారుల కోసం ఫ్లోటింగ్ జెట్టీలు పెట్టాం. అలాంటి అభివృద్ధి పనుల్లో ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకూ పెట్టలేదు. మరి ఎలా ఆదాయం వస్తుంది? మరోవైపు ప్రభుత్వ ఆస్తుల పరాధీనం లేదా లీజుకు ఇచ్చే కార్యక్రమాన్ని శరవేగంగా తీసుకెళ్తున్నారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాలని హామీలిచ్చినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దావోస్ వెళ్లి తిరిగొచ్చినా ఒక లక్ష రూపాయల పెట్టుబడి కూడా వచ్చిన దాఖలాల్లేవు. శుక్రవారం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్ హామీల నెరవేర్చడానికి అవసరమైన నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపించారు. ఆడబిడ్డ నిధి ప్రస్తావన లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తావనా ఎక్కడా కనబడలేదు. యువతకు ఉద్యోగాలూ లేవు. నిరుద్యోగ భృతి గురించి మరచిపోయినట్లు నటిస్తున్నారు. ఇక బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి ఇప్పుడు ఉన్నవాటిలోనే తొలగించే పనిలో ఉన్నారు. అమలుచేసింది ఏమైనా ఉందంటే రెండు నెలల నుంచి అమలుచేస్తున్న ఒకే ఒక్క పథకం భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్. కానీ అనేకమంది వితంతువులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం ప్రస్తావనే లేదు. వారిని కూటమి నాయకులు నిలువునా మోసం చేశారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమీ ఉండదు. ఒకపక్క డీఎస్సీ అన్నారు... జాబ్ క్యాలెండర్ తెస్తామన్నారు...
కానీ ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా ఇచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడం శోచనీయం.

అంతా మోసం
Comments
Please login to add a commentAdd a comment