వరంగల్: ఇంటర్ మూల్యాంకనంలో బోర్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇంటర్ బోర్డు పరిశీలకుడు యాదగిరి సూచించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, వరంగల్ క్యాంపు అధికారి డాక్టర్ శ్రీధర్సుమన్తో కలిసి శుక్రవారం వరంగల్ ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సబ్జెక్టుల మూల్యాంకన సిబ్బందితో మాట్లాడారు. మూల్యాంకనంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని, బయోమెట్రిక్ హాజరు ఉన్నందున సకాలంలో హాజరుకావాలని సూచించారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ఈఏడాది నుంచి రీ వెరిఫికేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. వరంగల్తోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చి మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. మూల్యాంకనంలో టోటలింగ్, బబ్లింగ్ తదితర లోపాలు తలెత్తకుండా ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మూల్యాంకనాన్ని బోర్డు అధికారులు, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పరిశీలిస్తున్నారని, సకాలంలో పూర్తిచేయడానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సహాయక క్యాంపు అధికారులు మాధవరావు, విజయనిర్మల, కార్యాలయ సిబ్బంది రఫీ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ బోర్డు పరిశీలకుడు యాదగిరి