
తెలుగు సినిమాల్లో ఒకప్పుడు హీరో అంటే..రాముడు మంచి బాలుడిలా ఉండేవాడు. ఎటువంటి బ్యాడ్ హ్యబిట్స్ లేకుండా నుదిట బొట్టు పెట్టుకొని చాలా క్లాస్గా,నీట్గా ఉండేవాడు.ఆ తర్వాత వచ్చిన కొంత మంది మాస్ డైరెక్టర్స్ హీరోని కాస్త రఫ్గా చూపించడం మొదలుపెట్టారు. అంటే ఫుల్గా హెయిర్, గడ్డం పెంచి, టీషర్ట్ కొంచెం మడతెట్టి కంప్లీట్ రఫ్ లుక్లో కనించారు. ప్రేక్షకులు కూడా అదే ట్రెండ్ని ఫాలో అయ్యారు. అలా కొంతకాలం నడించింది.కానీ ఇప్పుడు మళ్లీ మన హీరోలు మారిపోయారు. తమ ఇమేజ్ని పక్కన పెట్టి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హీరోలు ఎక్కువగా లోపం ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. దర్శకులు కూడా హీరోలకి ఏదో ఒక జుబ్బు అంటకట్టి ప్రేక్షకుల్లో ఆ పాత్రపై సింపతి పెంచి సినిమాను హిట్ చేసుకుంటున్నారు. లోపంతో వచ్చి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినా చిత్రాలపై ఓ లుక్కేద్దాం
‘పుష్ప’భారం అంతా భుజంపైనే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్పం. ఇందులో బన్నీ గుబురు గడ్డం, రింగులు తిరిగిన జుట్టు, కమిలిని చర్మంతో డీ–గ్లామరస్ పాత్రలో కనిపించాడు. అలాగే ఎడమ భుజం పైకి(షోల్డర్ ఇన్బ్యాలెన్స్)ఉన్న వ్యక్తిగా కనిపించి, నటనపరంగా ‘తగ్గేదే లే’అని నిరూపించారు. ఎర్ర చందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 17న విడుదలై, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా రాబట్టి.. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. మూవీలో అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్ ‘తగ్గేదే లే’ను సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రెటీల, రాజకీయ నాయకులకు వరకు వాడేస్తున్నారు.
సౌండ్ ఇంజనీర్గా చించేసిన చెర్రీ
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొట్టింది.అంతేకాదు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.ఇక ఈసినిమాకు మెయిన్ పిల్లర్ ఎవరంటే రామ్ చరణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్.. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు(సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు) త్రలో నటించి అదరగొట్టేవాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటించింది.
‘బ్లైండ్’గా దూసుకెళ్లిన రవితేజ
మాస్ మహారాజ రవితేజ, యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రాజా ది గ్రేట్’. 2017లో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇందులో రవితేజని అంధుడిగా చూపించి మెప్పించాడు అనిల్ రావిపూడి.ఐమామ్ ది బ్లైండ్.. బట్ ఐయామ్ ది ట్రైన్డ్ అంటూ రవితేజ చెప్పే డైలాగ్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఓసీడీతో నవ్వించిన‘మహానుభావుడు’
మారుతి దర్శకత్వంలో శర్వానంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘మహానుభావుడు’(2017). ఈ సినిమాలో హీరో ఓసీడితో బాధపడుతుంటాడు. క్లీన్గా ఉండకపోతే అతనికి అస్సల్ నచ్చదు. హీరోకి ఉన్న ఈ బలహీనతే.. సినిమాని సూపర్ హిట్ చేసింది.
నత్తితో మెప్పించిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ – బాబీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘జై లవ కుశ’. తొలిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో తారక్ జై, లవ, కుశ పాత్రల్లో నటించాడు. అయితే వాటిలో లవ, కుశ పాత్రలు సాధరణంగానే ఉన్నప్పటికీ.. జై పాత్రకు మాత్రం లోపం ఉన్నట్లు చూపించాడు దర్శకుడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో ఎన్టీఆర్కు నత్తి ఉంటుంది. ఈ సినిమాలో ఈ పాత్రే కీలకం అని చెప్పాలి. నత్తితో ఎన్టీఆర్ చేసిన విలనిజం అందరిని మెప్పించింది.
ప్రయోగానికి ‘ఊపిరి’అందించిన నాగ్
ప్రయోగాలు చేయడంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. తన కెరీర్ని ఒక్కసారి పరిశీలిస్తే.. ప్రయోగాలు చేసిన చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన చేసిన ప్రయోగాల్లో ‘ఊపిరి’ చిత్రం ఒకటి. 2016లో విడుదలైన ఈ చిత్రంలో నాగార్జున అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా నటించాడు. సినిమా మొతం వీల్ చైర్లోనే ఉండి, తనదైన నటనతో మెప్పించాడు. కార్తి, తమన్నా ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలై ఘన విజయం సాధించింది. సినిమాలో కంటెంట్ ఉంటే హీరో ఎలా ఉన్న ప్రేక్షకులు సినిమా చూస్తారని ఈ చిత్రం నిరూపించింది. అంతేకాదు యంగ్ హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ధైర్యం ఇచ్చిదీ చిత్రం.
మతిమరుపుతో.. మనసు దోచేసిన నాని
మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా భలే భలే మగాడివోయ్. 2015లో వచ్చిన ఈ సినిమాలో నాని మతిమరుపు వ్యాధితో బాధపడుతాడు. ప్రేమించిన అమ్మాయికి తన వ్యాధి తెలియకుండా.. ఆయన పడిన కష్టాలు థియేటర్స్లో నవ్వులు పూయించాయి. అప్పటికే వరుస ప్లాపులతో సతమతమవుతున్న నానికి ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది. మహేశ్ నటించిన వన్ చిత్రం కూడా కొంచెం అటు ఇటుగా మతిమరుపు ఉన్న క్యారెక్టర్గానే ఉంటుంది.
ఈ చిత్రాలే కాదు అంధగాడులో అంధుడిగా రాజ్ తరుణ్,, అర్జున్ రెడ్డిలో షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తిగా విజయ్దేవరకొండ, అతిథి దేవో భవలో మోనో ఫోబియా ఉన్న వక్తిగా ఆది సాయికుమార్ తమ నటనతో మెప్పించారు.